Thursday, 27 May 2021

 🕉️ *వైశాఖ పురాణం 17వ అధ్యాయము* 🕉️



*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*



🌻 *యమదుఃఖ నిరూపణము* 🌻



💫🌹నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.


💫🌹వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.


💫🌹స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. 


💫🌹అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. 


💫🌹ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. 


💫🌹ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాతించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. 


💫🌹కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. 


💫🌹వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. 


💫🌹దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. 


💫🌹వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. 


💫🌹ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. 


💫🌹వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


💫🌹సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. 


💫🌹పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.


💫🌹కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.



*వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయము సంపూర్ణము*



 🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

సేకరణ

👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


*భగవదాశ్రయం*

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

 

“ఆసక్తి,ఆశ్రయం రెండింటినీ  దేవునియందు లగ్నం చేసేవాడే  భక్తి యోగి” అన్నాయి గ్రంథాలు. అంతర్యామిని సవివరంగా తెలుసుకునే ప్రయత్నమే భక్తి.  


​  పురాణ పురుషులెందరో  పరమాత్ముని ఆశ్రయించి  ప్రయోజనం పొందారు.’ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండన్న’ ప్రహ్లాదుడి ప్రార్ధన విని స్థంభంలోనే ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించినట్టు, మకరి నోట చిక్కి విలపిస్తూ ‘కలడందురు దీనులయెడ, గలఁడందురు పరమయోగి యని’ ఆర్తిగా పిలిచిన గజేంద్రుణ్ణి  రక్షించినట్టు భాగవతం తెలిపింది.  


 ‘భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు నిరంతరం తననే ఆశ్రయించి ఉండాలని’ గీతాచార్యుడు బోధించినట్టు ఋజువు చేసిన వారున్నారు. నిరంతరం శ్రీకృష్ణుని ఆశ్రయించిన  పాండవులు జూదంలో సర్వస్వము కోల్పోయినా,    అరణ్య, అజ్ఞాతవాసాలు చేసినా  దైవానుగ్రహం తోడు వలన వారిని విజయం వరించినట్టు, పాండవ ధర్మపత్ని ద్రౌపది నిండు మనసుతో  కృష్ణుని ఆశ్రయించినందునే కురుసభలో వస్త్రాపహరణ సందర్భంలో మాన రక్షణ చేసి ఆదుకున్నట్టు భారతం  తెలిపింది.   


భగవంతుని మీద ఆసక్తిని ఇతరత్రా  మళ్లించి పరాజయం పొందిన భక్తులున్నారు. మహాభక్తుడైన రావణుడు దైవాన్ని ప్రసన్నం చేసుకుని వరాలెన్నో పొందాడు. వెయ్యేండ్ల తపస్సుకి ఒక్కో  శిరస్సు  ఖండిస్తూ తొమ్మిది శిరస్సులను అర్పించి, బ్రహ్మ అనుగ్రహంతో పొందిన వరగర్వంతో విర్రవీగి దైవం మీది   ఆసక్తిని ప్రకృతి మీదకు మళ్లించి సీతాపహరణం చేసాడు. కడకు శ్రీరాముని చేతిలో మరణించినట్టు రామాయణం తెలిపింది.

   

బ్రహ్మదేవుని కులంలో జన్మించి, సంపదకు అధిపతి కుబేరుని సోదరుడై, బలశాలి కుంభకర్ణుని అగ్రజుడై, మహావీరుడు ఇంద్రజిత్తుకు తండ్రి అయినప్పటికీ మనసుని నిగ్రహించుకోలేక దైవం మీద దృష్టిని భోగాల మీదకు మరల్చి పరాజితుడయ్యాడు రావణుడు. అతని  సోదరుడు విభీషణుడు ధర్మం పక్షాన నిలిచి శ్రీరాముని అనుగ్రహంతో లంకాధిపతి అయ్యాడు.


భక్తులు చూపించే భక్తి, ఆసక్తులకు భగవంతుడు మురిసిపోతాడు. తనని చూసిన ఆనందంలో ఎంగిలి పండ్లను తినిపించిన శబరి భక్తికి మెచ్చి   మోక్షమిచ్చిన శ్రీరాముని, అరటి పండ్ల గుజ్జుకు బదులు తొక్కలను తినిపించిన విదురుని భార్యను కరుణించిన  కృష్ణుని గురించి  పురాణాలు వివరించాయి. 


భగవదాశ్రయ ఫలితంగా త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు , కబీరు, తులసీదాసులు భక్త శిఖామణులయ్యారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందులు దైవకృపకు పాత్రులయ్యారు.  


సద్భావంతో  దైవాన్ని ఆశ్రయించి ఆయన కరుణా కటాక్ష వీక్షణ భాగ్యం కోసం నిరంతరం తపించే భక్తులు ఉన్నారు. హృదయ పీఠంపై దేవుని ప్రతిష్టించి  ఆధ్యాత్మిక భావనా జగత్తులో తేలియాడడం ఒక అద్భుతమైన అనుభూతి. అలాంటి అనుభూతిని పొందే భక్తులు అవనిలో అదృష్టవంతులు.  

----***------

*బ్రహ్మముడి*

శుభదినాన, ప్రథమంగా వరునివైపువారు వధువు ఇంటికివెళ్ళి వారికి ఆహ్వానం పలుకుతారు. అప్పుడు వధువుకు ముత్తైదువులచే మంగళస్నానాలుచేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది పాదాలకు పారాణిపెట్టి చక్కగా అలంకరించి పెండ్లికుమార్తెను చేయాలి. ఆ తర్వాత వరుడికి కూడా మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణతిలకం దిద్ది, పాదాలకు పారాణితో అలంకరించి పెండ్లికుమారుణ్ణి చేయాలి. తర్వాత వరునిచేత ‘గృహస్థాశ్రమ ధర్మాచరణ కొరకు, సత్సంతానం కొరకు, నరకవిమోచనం కొరకు’ వివాహమాడుతున్నానని సంకల్పం చెప్పించి, గణపతి పూజ, పుణ్యహవాచనాలు చేయించి రక్షాబంధనం చేయించాలి. విడి గృహంలో ఒక కొత్త గంపలో కొద్దిగా ధాన్యం లేక అక్షింతలను వుంచి, వధువును ఆ గంపలో కూర్చుండబెట్టి, ఆమె చేత మంగళ గౌరీపూజ చేయించాలి.

మన పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు కనుక, సౌభాగ్య ప్రదాయిని గౌరీదేవిగనుక, వధువుచేత మంగళగౌరీపూజ చేయించుట ఆచారం. ఆ తర్వాత, గౌరీ పూజలో వుంచిన కంకణాన్ని వధువుకు రక్షగా ధరింపజేస్తారు. తదుపరి, వరునితరపువారు, వధువు తండ్రితో వరుని గోత్రప్రవరలను చెప్పి కన్యాదానంచేయమని అర్థించుట ఆచారం. అప్పుడు వధువు తండ్రికూడా తమ గోత్రప్రవరలు చెప్పి అంగీకారం తెలియజేస్తాడు. తదుపరి కన్యాదాన సమయాన, కన్యాదాత ఆచమనంచేసి మహా సంకల్పం చెప్తాడు. ఇందులో త్వష్ట, విష్ణు, శివ, సూర్య, ఇంద్రాది సమస్త దేవతల ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది.  ఆ తరువాత కన్యాదాత సువర్ణదాన, గోదాన, భూదానాది దశమహాదానాలను చేయవలసివుంటుంది.

వధువు తల్లిదండ్రులు వరుణ్ణి విష్ణుస్వరూపంగా భావించాలి. అప్పుడు వారు ఆ వరుని కాళ్ళు కడిగి తమ శిరస్సుపై చల్లుకుని, వరునికి యథా శక్తి నూతన వస్త్రాలు, ఆభరణాదులను ఇచ్చి పూజిస్తారు. కన్యాదాతకు దక్షిణతాంబూలాదులను వుంచి, జలధారతో ఆ దోసిలిని, వరుని దోసిలిలో వుంచుతారు. వధువు తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసినప్పుడు, ‘సంప్రదదే నమమ’ అని అనడు. అంటే, ఈమెను నీకు సంపూర్ణంగా దానం చేసి ఈమెపై నా హక్కును వదులుకుంటున్నాను, ఇక పై ఈమె నాది కాదు, సంపూర్ణంగా నీదే అని అనడు. అలా సంపూర్ణ హక్కును విడువకుండా ఆ కన్యాదాత దానంచేస్తాడు. ఎందుకంటే ఉత్తరోత్తరా ఏదైనా సమస్యలవల్ల ఆమెను తన భర్త విడిచినచో తనను పోషించాల్సిన బాధ్యతను తండ్రి వదులుకోడు. అందుకనే, కన్యను గ్రహించినప్పుడు వరుడిచేత ‘పరిగృహ్ణామి‘ అని అనిపించరు. కేవలం ‘స్వస్తి‘ అని మాత్రమే అనిపిస్తారు. ఆ సమయంలో, కన్యాదాత వరునిచేత కొన్ని వాగ్దానాలు చేయించుకుంటాడు. అవి ‘ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా‘ అని. అనగా, వారిరువురూ దంపతులైనతర్వాత, భార్య అనుమతి లేకుండా భర్త, ఎటువంటి ధర్మ, అర్థ, కామ సంబంధమైన కార్యాలు చేయరాదు అని. అందుకు వరుడు ‘నాతిచరామి‘, అనగా ధర్మ అర్థ కామసంబంధ విషయాలలో ఆమెను అతిక్రమించను అని అంగీకారం తెలియజేస్తాడు.

ఆ తర్వాత, వరుడు అగ్నిప్రతిష్ఠాపన చేస్తాడు. తదుపరి మధుపర్కం అనగా, కొద్దిగా తేనె, పెరుగులను కలిపి తనకు తినిపిస్తారు. తరువాత వధూవరులు ఇరువురు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరసుపై మరొకరు వుంచుతారు. తదుపరి వధువు నడుముకు యోక్త్రమనే తాడును కడతారు. పిమ్మట, స్వర్ణశిల్పాచార్యునిచేత నిర్మించి పూజించబడిన రెండు మంగళసూ త్రాలను, వారికి తగు దక్షిణాఫల తాంబూల స్వయంపాకాదులనిచ్చి వారి ఆశీర్వచనం తీసుకుని మేళతాళాలతో కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి, రెండు తలంబ్రాల పళ్ళెరాలలో వుంచి, ముత్తైదువుల చేత తాకించి, అందరి ఆశీర్వాదాలను తీసుకుంటారు.

పిమ్మట వరుడు మంగళసూత్రాలను తీసుకుని, వధువుకు ఎదురుగా నిల్చి ‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం‘ అను మంత్రాన్ని చదువుతూ మూడుముళ్ళు వేస్తాడు. తర్వాత, వధూవరుల దోసిళ్ళను పాలతో శుభ్రం చేసి, వానిని తలంబ్రాలతో నింపి, మొదటగా వరుడు వధువు శిరమున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన వృద్ధి జరుగును గాక’ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పాడిపంటలు వృద్ధియగునుగాక’ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగును గాక’ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళ తో పోస్తారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంథి అంటారు. తర్వాత వరుడు, తమ బంధం నిలవాలని, వారికి సత్సంతానం కలగాలనే సంకల్పంతో దేవతలను ప్రార్థిస్తూ తన కుడిచేతిని బోర్లించి, వధువు కుడిచేతిని గ్రహిస్తాడు. దీనినే పాణిగ్రహణం అంటారు.  

సేకరణ. విట్సాప్

–ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు--(())


వైశాఖ పురాణం పదిహేనువ అధ్యాయము 🕉️


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


🌻 వైశాఖవ్రత మహిమ 🌻


💫🌹నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి.

💫🌹కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.

💫🌹శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు.

💫🌹ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి.

💫🌹దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.

💫🌹వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.

💫🌹అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి.

💫🌹చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను.

💫🌹మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.

💫🌹అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి.

💫🌹ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.

💫🌹వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు.

💫🌹వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము.

💫🌹వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును.

💫🌹భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము.

💫🌹నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.

💫🌹ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను.

💫🌹అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహికరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును.

💫🌹చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను.

💫🌹ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.

💫🌹ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను.

💫🌹ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దే
వలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.


వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయము సంపూర్ణము

   🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏


*భగవంతుని పై నమ్మకం*

 

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట  నివసిస్తూ ఉండేది. అక్కడ  ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. 


ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను  చూసి చాలా జాలి పడ్డాడు.  ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే  ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు?  నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు. 


ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది.  కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి.  ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ,  వేడిని కొంచము తట్టుకుని  హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది . 


“ఇటువంటి  ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి  నీ కోరిక  నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు. 


శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన  "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను.  కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి  పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి  కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను  చెప్పానని చెప్పు"  అన్నారు పరమాత్మ.  


నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న  పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి  భగవానుని పై ఎంతో నమ్మకము.   ఈ ఉపాయం విని చాలా సంతోషించింది.   నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి  మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి  వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది.  


మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ  దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ  ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య  కూర్చుని ఉంది.  పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి  ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే  విషయం బోధ పడలేదు.  మళ్ళీ  దేవుడి దగ్గరకి వెళ్ళి  ఆయనతో  ఈ  పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు. 


అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది.  పక్షి తల రాతలో  చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి  నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది.  అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన  భగవత్ప్రసాదమును  స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది.  ఆ పక్షి  చూపించిన ఈ భక్తి  శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు.  


                                                                                                                                                                                       *మనం నేర్చుకోవలసినది ఏమిటి?*


*అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన  దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.


ఓం నమః శివాయ🙏

No comments:

Post a Comment