Friday, 18 December 2020

20--12--2020

 
Image may contain: 1 person
 

*తిరుప్పావై ఐదవ పాశురం*


🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*5 వ పాశురం*

~~~~~~


*మాయనై మన్ను వడమదురై మైందనై*

*తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై*

*ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై*

*తాయై క్కుడల్ విళక్కం  శెయ్ద దామోదరనై*

*తూయోమాయ్ వందు* *నాం తూమలర్ తూవి త్తొళుదు*

*వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క*

*పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం*

*తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్*


*తాత్పర్యము*

~~~~~~~~~~~

        ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.

       మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి. 


1 అహింస ,

 2 ఇంద్రియ నిగ్రహము ,

౩ సర్వభూతదయ , 

4 క్షమా , 

5 జ్ఞానము , 

6 తపస్సు , 

7 సత్యము , 

8 ధ్యానము.


      ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.

*ॐ అవతారిక ॐ*


కర్మసందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కద! అనేక జన్మలను పొందుటకీ కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లన భగవద్ధ్యానము, భగవత్సేవ, భగవస్సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతరమార్గములని గోదాదేవి సూచించుచున్నది.

        *(హిందోళ రాగము - ఆదితాళము)*

ప.    నామములను పాడుడు - తిరు

    నామములను పాడుడు - ఓ! సఖులార!


అ.ప.     నామము హరియించు నఘముల నెల్లను

    ఏమరక పాడుడు తిరునామములను


1 చ.    మధురానాథుని మాయాధీశుని

    మధుజల యమునా తీర విహారిని

    యదువంశోజ్జ్వల దీప్త దీపికను

    హృది దామోదరు యశోగీతికల


2. చ.    శుచిని హరిని సుమముల నర్చించుచు

    కాచెడి విభునకు అంజలి ఘటించి

    వాచాస్తుతించి మదిని ధ్యానించి

    సంచిత కర్మలు జారిపోవగా

    నామములను పాడుడు


*ॐॐॐॐॐॐॐॐॐ*

_*తిరుప్పావై ప్రవచనం‎ - ‎05 వ రోజు*_

 *భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం*


*5వ పాశురము*

*ॐॐॐॐॐॐॐॐॐ*

*మాయనై మన్ను వడమదురై మైందనై*

*తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై*

*ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై*

*తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై*

*తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు*

*వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క*

*పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం*

*తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్*


*భావం:-*

~~~~~~~~

మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు, చేష్టలు కలవాడు కృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించెను. భవత్సంభంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునానది తీరమందున్న గొల్లకులమున జన్మించి, ఆ గొల్లకులమును ప్రకాశింపచేసినవాడు. తల్లి యశోద గర్భమును కాంతివంతమొనర్చిన దామోదరుడు. గొల్లకుల మాణిక్య దీపము. వ్రతకారణముగా కృష్ణునిచేరి మనము ఇతరములైన కోరికలు ఏమీ కోరక, పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలను అర్పించి, నమస్కరించి, నోరార అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -- సంచిత పాపములను .. ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనము చేయుటవలన పాపములన్నీ అగ్నిలోపడిన దూదివలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము. 

*తిరుప్పావై 5వ పాశురము తెలుగు అనువాద పద్యము*

~~~~~~~~~~~~~

.సీసమాలిక 


చెప్పరే చెప్పరే శ్రీరామ మహిమల

         ఒప్పుల కుప్పలై తప్పకుండ

ఎప్పుడో చేసిన తప్పులు నశియింప

      అగ్గిలో పడవేయ బుగ్గియగును

కళ్యాణ గుణుడైన కమల గర్భుని చేత

          వ్రజ వంశముకెల్ల బందువితడు

మాతృ గర్భము కెల్ల మలినలుగా వచ్చి

         ధ్యానించి సుమములు తపన పడుచు

 పిల్లన గ్రోవితో యెల్లవేళల యందు

        గోవుల పిలుచును కూర్మి చేత

తే.గీ.మాయవానిని ఉత్తర మధురపురికి

నందవంశపు రాజగు నళిననాభు

అర్చనలు చేసి పుష్పాల నందజేసి

సేవ చేసి వత్తమనుచు చెలులపిలిచె

శ్రద్ధ భక్తిని కల్గించు బుద్ధినిమ్ము

శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!


*అవతారిక:-*

~~~~~~~~~~

గోపికలందరూ ఆండాళ్ గోపిక పిలుపుననుసరించి ఒకచోట చేరిరి. వారిలో కొందరు వేదాంతము తెలిసినవారు. కొందరు ధర్మశాస్త్రమును తెలిసినవారు. వారిలో కొందరు ఈవిధంగా శంకించిరి. మనము కేవలము జ్ఞానము లేనివారముకదా ? తెలిసియు తెలియకయు ఎన్నో పాపములను చేసినవారముకదా, ఈ జన్మలోనేకాక అనాదికాలము నుండి ఆర్జించిన పాపములెన్నియో మనకున్నవికదా, మనకు కృష్ణభగవానుని సంశ్లేషము ఈ పాపములు తొలగినదే ఎట్లు లభించును?    

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం.  ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు.  కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో.  అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే.  ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు.

 అందుకే *"నివృత్తరాగస్య గృహం తపోవనం"* నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి.  ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు.  అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు.  ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం.  అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో. 

 రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- *"సమ్షయాత్మా వినష్యతి".* ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల

కథగా అందించింది. 

ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది.

 మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది.  ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. 

ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించు కుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది. 

ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో.

 మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. 

ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు.  ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే.  ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు.  భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది.  మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు.  ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు.  మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. 

 భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు.  ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది  వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. 

*"మాయనై మన్ను వడమదురై మైందనై"* - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు.  అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. *"తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై"* మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో.  పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. 

మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. *"ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై"* గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. *"తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై"* మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు.  దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.

అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర  ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం. 

 ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. *"తూయోమాయ్ వందు "* దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది.

 *"నాం తూమలర్ తూవి త్తొళుదు"* పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. *"వాయినాల్ పాడి"* నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. *"మనత్తినాల్ శిదిక్క"* మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం.


 *"పోయ పిళైయుం "* మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి *"పుగుదురువాన్ రిన్ఱనవుమ్"* ఇక రాబోయే ఆగామి *"తీయనిల్ తూశగుం "* మనకు అంటకుండా ఉంటుంది *"శేప్ప్"* ఆయన నామాల్ని చెప్పు.  ఈపాటలో ఆండాళ్  మాయానై, మన్నువడ మదురై,  దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది. 

*ఆగమములు చెప్పినదేమిటి?*

*పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|*

*పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||*

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది.  పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా  పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది.

 *"పూర్ణమిదమ్"-* ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. *"పూర్ణ మద:"-* అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. 

*"పూర్ణాత్ పూర్ణముదచ్యతే"-* ఆ పూర్ణమే  ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది.  అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా.

 *"పూర్ణస్య పూర్ణమాదాయ"* ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా?  "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి. 

ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.

--(())--



33 mins  ·
నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (6)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా -
ఉన్నది పలుకేనురా - అన్నిట్లొ శక్తిరా
అన్నది మనసెనురా -- కాదన్న యుక్తిరా
కాలము మనదేనురా - కాలాన్ని నమ్మురా
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
లోకులను గమనించారా -  కోరిక తీరునురా
కాకులను గమనించారా  - ఓపిక వచ్చునురా
చీమలను గమనించారా -- ఓర్పును చూపుమురా
సర్వమును గమనించారా - సాధన కల్గునురా
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా
సలపరింపు వద్దులె  - సహజమ్ముగ ఉండెగా
మమత పొందు ఇప్పుడె - వినయమ్ముగ ఉంటినే
మనసు నీకు పంచుట - తపన అంత తగ్గునే
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
కనువిందు చేస్తుండగా -  పలకరింపు చూపరా
ఇనసొంపు ఉండేనుగా  - సమయమంత మేలురా
తనువంత నీదేనురా -  కనులచూపు పాందురా
వయసంత మీదేనురా - సుఖముపొందు శోభరా
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా
చుక్కను వదలకురా - సుమహాయే నీదేరా
మక్కువ కలుగునురా - విరజాజి పొందాలీ
తక్కువ అనకుమురా - సిరిపెంచి నీకేరా
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా
--(())--
 

 

ప్రాంజలి ప్రభ .. లోక సూక్తులు (ఛందస్సు)
UUII - UIUI - UIIU - IIUU
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా కలవా లని సత్యం

సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ     ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే   

దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష

సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ  కాదా

--((*))--


 ప్రాంజలి ప్రభకు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు తెలుగువెలుగు

అజాతశత్రువు
మనిషికి తోటి మనిషే శత్రువు కావడం ఆశ్చర్యమనిపిస్తుంది. సాధారణంగా పశుపక్ష్యాదుల్లో ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వైరం ఉండదు. మనిషి తీరే వేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వానికి ఆర్థిక వ్యవహారాలు, అన్య స్త్రీ సంపర్కం, భూ తగాదాలు, కులాలు, మతాలు వంటి అనేక విషయాలు కారణమవుతాయి. వ్యక్తుల మధ్య శత్రుత్వమే కొన్ని సందర్భాల్లో వర్గ సమస్యగా పరిణమిస్తుంది. వర్గాలుగా చీలిన ప్రజలతో ఊరికి ఊరే శత్రుశిబిరమవుతుంది. పగలు పెరిగి కొట్లాటలు ముదిరి ప్రజల ప్రాణాలకు ముప్పు ముంచుకొస్తుంది. చిన్న సమస్య ఒక్కొక్కసారి ఊహించని ఉత్పాతమవుతుంది.

పుట్టుకతో అందరూ సమానులే. బాల్యంలో విరోధులుండరు. చిన్నపిల్లల మనసులు ద్వేషరహితం. ఎటువంటి కల్మషం ఉండదు. మనిషి ఎదుగుతూ తనతోపాటే కామ, క్రోధ, లోభ, మోద, మద,  మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను పెంచి పోషిస్తాడు. ఈ అంతశ్శత్రువుల ప్రభావమే శత్రుత్వాన్ని పెంచుతుంది. కొందరి మధ్య శత్రుత్వం వారితో అనుబంధమున్న వారినీ బలి తీసుకుంటుంది.
సీతాదేవిని అపహరించిన రావణుడికి శ్రీరాముడు శత్రువ య్యాడు. మంచి మాటలు తలకెక్కించుకోని రావణుడు రాము డితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రావణుడితోపాటు అతడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు ప్రాణాలు కోల్పోయారు. రావణుడి అకృత్యాలకు మద్దతు తెలిపినవారూ నిహతులయ్యారు.
 

దాయాదులపై శత్రుత్వం పెంచుకుని వారికి సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్న దుర్యోధనుడి అహంకారం కౌరవ వంశ నాశనానికి కారణమైంది.
 

హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతడి మనసులో రోషం చెలరేగి తామసగుణం విజృంభించింది. తన ఎదుట విష్ణువును స్తుతించిన కుమారుడినే చంపాలని ప్రయత్నిస్తాడు. చివరికి విష్ణుమూర్తి నరసింహ దేవుడిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుడి గుండెలు చీలుస్తాడు. హిరణ్యకశిపుడి మూర్ఖత్వమే అతడి పతనానికి దారి తీసింది.
 

అనుబంధాలు ధనబంధాలుగా మారిన ఆధునిక కాలంలో ఆస్తి తగాదాలు ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల మధ్యా శత్రుత్వానికి కారణమవుతున్నాయి. అనుమానం పెనుభూతమై కుటుంబాలను విడదీస్తోంది. అసూయాద్వేషాలు బంధువుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పదవీ లాలస, అధికార దాహం ఎవరినీ దరికి రానీయవు. అహంకారం, కోపంతో రగిలేవారికి అందరూ శత్రువులుగానే కనిపిస్తారు.
శత్రువులోని మంచి గుణాలను గుర్తించగలగడం మంచివారి లక్షణం. కాస్త సంయమనం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి... శత్రువులను మిత్రులుగా మారుస్తాయి. విభేదించినవారిని మంచిమాటలతో ఒప్పించగలగడం విజ్ఞుల లక్షణం. కోపాన్ని శాంతంతో జయించి మనసును భగవంతుడి వైపు మళ్ళించగలిగినవారికి శత్రువులుండరు. ధ్యానంతో అహంకారం పటాపంచలవుతుంది.
 

మానసిక ప్రశాంతత, శాంత స్వభావం, భగవత్‌ చింతన, మనో నిగ్రహం, అంతఃకరణ శుద్ధి- ఇవి  మానసిక తపస్సులని భగవద్గీత బోధిస్తోంది. అంతఃకరణలో ఈర్ష్యాద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, హింస ప్రతిహింసలు వంటి దుర్భావనలను తొలగించుకుని- ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, దానగుణాలతో వికసితం చేసుకున్న ఉత్తములు అజాతశత్రువులై మనశ్శాంతితో మనగలుగుతారు. భగవంతుడి దయకు పాత్రులు కాగలుగుతారు!

--(())--

భార్యదే అసలైన చదువు..!
***

అవును..
భార్యదే నిజమైన చదువు.
చిన్నప్పుడు తల్లిదండ్రులను, చదువుకున్నప్పుడు స్నేహితులను, కలిసి మెలిసి తిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని - చదువుకుంది..

పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది, పిల్లలను చదువుతుంది, తన కుటుంబ సభ్యులను చదువుతుంది, పరిసరాలను - చదువుతుంది..

అందుకే...
భర్తకు... తన గురించి తనకు తెలియని విషయాలెన్నో భార్యకు తెలుసు!
తల్లికి... ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు.పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు.
అందుకు ...
ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ!
.....................

సంసారం ఒక గడియారమనుకుంటే...
చిన్న ముల్లు భర్త, పెద్ద ముల్లు భార్య గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం!
నిమిషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావధానం!
వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట..కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట..!
పోనీ .. భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కంట నీరు తిప్పుతుంది. ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది. ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీషు చదవడం నేర్పుదామంటే నువ్వుండగా నాకేం లోటని.. అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి.

ఇంకా.. లెక్కల్లో కూడా నేనే ఫష్ట్ అంటుంది.. పేపరుమీద రూపాయల లెక్కలు మీరు చెబితే .. ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది.ఎందుకంటే..
పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త.భర్తను సైతం చదివేది భార్య కదా.
.....................

ఇంటిల్లిపాదిని తన హస్తరేఖలుగా మలచుకొన్న తన నేర్పంతా ..
తన సంస్కారం ముందు తల వంచుతునేఉంటుంది!
అందుకే ఆమె చదువే గొప్పది.ఆమె సంస్కారమే ఎనలేనిది. ఓడి గెలుస్తుంటుంది భార్య!
గెలిచి ఓడేది భర్త.. !!
అందుకే తనే ఓ సిద్ధాంతమైంది.పెసలు నలిగి పిండి కాలాలంటే తిరగలి పాప ఒకటి తిరగుతుండాలి.. ఇంకొకటి కదలకుండా ఉండాలి .. అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది. పనిమనిషినైనా పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!

ఎలా చూసినా ..
అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!
అందుకే..
శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి
ఆమే ప్రతి ఇంటా చదువుల సరస్వతి
--(())--

 శివారాధన story

ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే శివభక్తి అబ్బుతుందని స్వయంగా శివుడే తన గీతా బోధలో శ్రీరాముడికి చెబుతాడు. భవభయహరుడు, సులభసాధ్యుడు, పేరుకు రుద్రుడే అయినా- పరమ దయాళువు. రావణ అభీష్టసిద్ధి కోసం ఆత్మలింగాన్ని, గజాసురుడి కోరిక తీర్చేందుకు స్వయంగా తానే అతడి గర్భంలో నివసించడాన్ని ఆయన భక్తపరాధీనతకు ఉదాహరణలుగా చెబుతుంటారు.
ప్రయాణంలో సులభమార్గాన్ని ఎంచుకున్నట్లు, రాక్షసులు సులభసాధ్యుడైన శివుణ్నే ఆరాధించేవారు. అమోఘ వరాల కోసం అఘోరుడైన మహాదేవుడి గురించే తపస్సు చేసేవారు. రాక్షసులది జన్మతః తమోగుణం. త్రిగుణాలు త్రిమూర్తులను ఆశ్రయించి ఉంటాయంటారు. వాటిలో సత్త్వం విష్ణువును, రజోగుణం బ్రహ్మను, తమోగుణం శివుణ్ని సేవిస్తుంటాయి. అందువల్ల తమోగుణ ప్రధానులైన రాక్షసులు అదే గుణ సేవితుడైన శివుణ్ని ఆరాధించడం సహజ లక్షణం.
శివుడు విశ్వప్రభువు. సమస్త లోకాల్లో దేవ, రుషి తదితర గణాలన్నీ ఆయనను ఆరాధిస్తాయి. నిమీలిత నేత్రుడిగా కనిపిస్తాడు గాని, ఎల్లలోకాల్లోని భక్తుల హృదయాల్లో ప్రతి క్షణం ప్రచోదితుడై ఉంటాడు. కణకణం శివమయమని, క్షణక్షణం శివాధీనమని చెబుతారు. శివాజ్ఞ లేనిదే చీమ కూడా హాని చెయ్యదనడంలో అర్థం ఇదే. ఆయన్ను మహాకాలుడంటారు.
వీరభద్రుడు, కాలభైరవుడు, ఆంజనేయుడు,  అంగారకుడు, దుర్వాసుడు... వీరంతా శివాంశ సంభూతులే. శివపూజలో ప్రత్యేకత కటిక పేదవాడి నుంచి మహాధనికుడి వరకు తమ భక్త్యానుసారం, శక్త్యానుసారం పూజించగల సౌలభ్యత.
బీదవారు మట్టిలింగంతోనే పూజచేయగలరు గనుక, ఆ పార్థివలింగ ఆరాధనకు అమోఘ ఫలితాలను శివుడు నిర్ణయించాడని చెబుతారు.
‘అధికులని, అధములని, నరుడి దృష్టిలోనే భేదాలు... శివుడి దృష్టిలో అంతా సమానులే’- అన్న వాక్కు అక్షరసత్యం. దీనికి రుజువుగా ఎందరో శివభక్తుల కథలున్నాయి.
ఎవడు శాశ్వతుడో వాడే పరమాత్మ. అవ్యయత్వం అంటే శాశ్వతత్వం. శివుడు అవ్యయుడు. దేవతల్లో ప్రథముడు. భవరోగాలను పరిహరించే వైద్యుడు. అందుకే రుద్రం ‘ప్రథమో దైవ్యో, భిషక్‌’ అని కీర్తిస్తుంది.
శివారాధనకు కొన్ని ప్రత్యేక దినాలు, సమయాలు ఉన్నాయి. ప్రతి అమావాస్యకు ముందువచ్చే చతుర్దశిని మాసశివరాత్రి అంటారు. మాఘమాస కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి. ఆ రోజునే అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ (దీనినే లింగోద్భవ కాలమంటారు) అగ్నిలింగం బ్రహ్మవిష్ణువుల సమక్షంలో ఆవిర్భవించినట్లు శివపురాణం చెబుతోంది.
‘ఈశ్వర’ అంటే సర్వశక్తి సంపన్నుడు. సిద్ధుల్లో ఈశ్వర సిద్ది ఒకటి. దాన్ని సాధించడానికి సాధకులు కఠోర కృషి చేయాల్సి ఉంటుంది.
శీలాన్ని ఆశ్రయించి సిరిసంపదలు, సమస్త వైౖభవాలు ఉన్నట్లే, పరమశివుణ్ని ఆశ్రయించే సర్వదేవతలు, గ్రహాలు, లోకపాలకులు విధేయులై ఉంటారు. కాని, ఆయన విరాగి. సత్య భూమి  అయిన శ్మశాన సంచారి. ప్రతి జీవికీ అంతిమ విశ్రాంతి గృహం మృత్యుమందిరమే.
శివుడు లేని యాగం, శివపూజ లేని గృహం, శివ ధ్యానం చెయ్యని దేహం- అశుభాలకు నిలయం. ఎందుకంటే శివుడే శుభకరుడు. దక్షయాగ ధ్వంసానికి శివరహితమే కారణం.
అందరికీ ఇష్టదేవతలుంటారు. ఆ ఇష్టదేవతలకు పరమ ఇష్టదైవం మహాదేవుడు. శివారాధన అంటే, మన ప్రతి చర్యనీ శివాంకితం చెయ్యడమే!
✍ rachyata  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

--(())--

👂చెవి యొక్క ఆత్మ కథ👂

  నేను చెవిని. ....
  హేయ్ మేము  ఇద్దరము.  ఇద్దరమూ కవలలము 👂👂
  కానీ  మా దురదృష్టమేమిటంటే,  
  ఇప్పటి వరకు మేము - ఒకరినొకరు చూసుకోలేదు .
 
ఏ శాపమో ఏమో తెలియదు.  
మేము వ్యతిరేక దిశలో అంటుకుని పంపించబడ్డాము.
   మా బాధ ఇంత మాత్రమే  ,
   మా బాధ్యత కేవలము వినడము మాత్రమే.
   తిట్లు గానీ లేదా చప్పట్లు, మంచి లేదా చెడు.
   అన్నీ - మేము వినాలి ఏంచేస్తాం.
   
క్రమ క్రమంగా మమ్మల్ని ఒక ఆధారం(మేకు)గా భావించారు.
   కళ్ళ జోడు బరువు ను మాపై  పెడుతున్నారు.
   ఫ్రేమ్ యొక్క కాడలను మా పై మోపుతారు.
   ఈ నొప్పిని మేము భరించాలా?  
   ఎందుకు భరించాలి?
   కళ్ళ జోడు సంబంధము నేత్రాలకు చెందినది.
   మరి మమ్మల్ని మధ్యలోకి లాగడంలో - సంగతేమిటి?
   
   మేము మాట్లాడము, అయితే ఏమైంది, వినగలము కదా!
   ప్రతిచోట మాట్లాడే నోరే ఎందుకు ముందుంటుంది ?
 
   బాల్యంలో చదువుకునేటప్పుడు
   ఎవరికైనా మెదడు పని చేయకపోతే
   మాస్టరు గారు మమ్మల్నే మెలేస్తారు.
 
  యవనంలో పురుషులు, మహిళలు - అందరూ
  అందమైన జూకాలు, కమ్మలు, లోలకులు మొదలైనవి చేయించుకొని  
   మాపైననే వేలాడదీస్తారు.
   రంద్రాలు చేయడం మాకైతే, పొగడ్తలు మాత్రము - ముఖానికి.

   ఇంకా అలంకరణ చూడండి. !
   కండ్లకు కాటుక, ముఖానికి క్రీములు, పెదవులకు లిపిస్టిక్, మరి, ఇప్పటి వరకు మేము ఏమైనా అడిగామా చెప్పండి?

  ఎప్పుడైనా ఏ కవి అయినా కూడా ఏ సారైనా అయినా  చెవుల గురించి - ప్రశంసిస్తే ...  పొగిడితే ...  చెప్పండి.
వారి దృష్టిలో కళ్ళు, పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము.

 మేము, నలిగిపోయిన రెండు పూరీల మాదిరిగా లేపి ముఖానికి - ప్రక్కల అతికించబడినాము. ఏదో మృత్యుభారము లాగా
కొన్ని సార్లు వెంట్రుకలు కత్తిరింపులో మాపై కూడా గాట్లు పడతాయి.  
డెటాల్ పూసి మంట పుట్టిస్తారు.
 
  విషయాలు చాలా ఉన్నాయి.
  ఎవరితో చెప్పుకోవాలి ???
  బాధలు పంచుకుంటే మనసు తేలిక అవుతుందని అంటారు.
   కళ్ళతో చెప్పుకుంటే అవి కన్నీరు కారుస్తాయి,
   ముక్కుతో చెప్పుకుంటే అది చీదరిస్తుంది.  
   నోటితో చెప్పుకుంటే మమ్మల్నే తిడుతుంది.
మేము, కుయ్యో మొర్రో అంటే, అయ్యో పాపం అంటూ జాలి పడుతుంది.  

ఇంకా చెప్పాలంటే
  పండితుల వారి జంధ్యము,
  టేలర్ మాస్టర్ యొక్క పెన్సిల్,
  మేస్త్రీ యొక్క మిగిలిపోయిన గుట్కా పొట్లము,
  మొబైల్ ఫోన్, దాని ఇయర్ ఫోన్స్, వీటన్నింటిని మేమే భరించాలి.
   
  ఇంకా
  ప్రస్తుత పరిస్థితి లో ఈ క్రొత్త క్రొత్త మాస్కుల జంజాటము కూడా
  మేమే భరించవలసి వస్తుంది.
  చెవులు కాదు. మేము - పక్కా మేకులు లాగా ఉన్నాము. ఇంకా
  ఏమైనా తగిలించాల్నా,....వ్రేలాడదీయాల్నా.... అనుకుంటే తీసుక రండి.  
  మేము కవల సోదరుల లాగా సిద్ధంగా ఉన్నాము.

  😃😃😃😃😃

   హరిఓమ్, జై శ్రీరామ్ అంబజ్ఞ నాథ సంవిధ్.

    (చిన్న,చిన్న ఎడిటింగ్ మార్పులతో; రచయితకు క్షమాపణలతో ప్రాంజలి ప్రభ)
.

3 comments: