Friday, 5 February 2021

07-02-2021



 

ప్రాంజలి ప్రభ - " వాహిక  "
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

1. ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

జ్ఞానేంద్రియాలు నీవెంట ఉంటాయి
ద్వంద స్థితిలో బ్రతుకుట ఎందుకోయి
ఆశాపాశానికి చిక్కి దురాశకు పోకోయి
శరీర సుఖము కోసం పతనము కాకోయి

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

స్వార్ధ భావముతో బ్రతుకుట ఎందుకోయి
కోరికలో నిజమెంతో తెలుసుకొని మెలగాలోయి
కోరిక ఆనే విత్తు చెడకుండా జాగర్త పడాలోయి
ప్రతి వ్యక్తి ఒక్క నిముషము గమనించాలోయి

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

వయసు మార్పు బట్టి మనిషిగా ఎదగాలోయి
కోరికలనే గొలుసును తెంచి దగ్ధము చేయాలోయి  
మనకు వచ్చే మంచి చెడులు బ్రహ్మాసృష్టియేనోయి
ప్రకృతి ననుసరించి శరీర సౌష్టము  పెంచాలోయి   
      
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

బ్రహ్మాన్ని తెలుసుకొని అహాన్ని తొలగించుకోయి
నీవు స్వార్ధ పురితమైన పనుల జోలికి పోకోయి
ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలోయి
అంధకారాన్ని తొలగించే సూర్యుడిలా ఉండాలోయి

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

ప్రతి వ్యక్తి ప్రతి క్షణం వ్యర్ధము కాకుండా ఉండాలోయి
బంధనాలు, దు:ఖాలు శాశ్వతము కాదని తెలుసుకోవాలోయి
బుద్ధి వక్రమార్గాన్ని బట్టి తల్లి, తండ్రి, గురువులను దూషించకోయి
కష్టార్జితమే మనసుకు శాంతి సౌభాగ్యము అందునని గమనించవోయి
       
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
--((*))_-


 మానవ ముంగింట్లో వెల్గు లెన్నో
జీవిత కాలాల్లో కూర్పు లెన్నో  
తామర తూడుల్లో నీళ్లు ఎన్నో  
ఆకలి మంటల్లో  ఆట లెన్నో  

పూసిన పువ్వుల్లో ఊసులెన్నో
వాలిన కన్నుల్లో  కాంతులెన్నో
కారిన నూనెల్లో  జారులెన్నో
తేలిన నీళ్లల్లో   పుర్గు లెన్నో

ఆకుల ఊఫుల్లో శ్వాసలెన్నో  
పక్షుల రెక్కల్లో  తల్పులెన్నో
తాగిన మైకంల్లో మాటలెన్నో  
వాడిన చూపుల్లో కోర్కలెన్నో

మొనపు నవ్వుల్లో ఆశలెన్నో
గాళము  గొల్లాల్లో లింకులెన్నో
కథలు రాతల్లో మల్పులులెన్నో  
చేదల బావుల్లో బిందలెన్నో  

మానస గీతాల్లో ఒప్పులెన్నో
నిత్యము పాఠాల్లో తప్పులెన్నో
సత్యపు మాటల్లో తీర్పులెన్నో
ధైర్యపు చూపుల్లో మార్పులెన్నో
 
నల్లని నీళ్లల్లో నల్క లెన్నో
తెల్లని పాలల్లో పొంగులెన్నో
బెల్లపు తాండ్రల్లో తీపి లెన్నో   
అల్లము తాండ్రల్లో ఘాటులెన్నో   

--(())--

 విశ్వములో జీవితం -8
ప్రాంజలి ప్రభ. కల్పన కాని కథ
 

ఎవరనుకోవాలి, ఏమనుకోవాలి నా మనసును దోచిన వారెవరో, ఆకర్షించిన వారెవరో, ద్వేషించిన వారెవరో తెలుసుకోలేని వయసు నాది, అయినా ఎక్కడో నా మనసు లాగుతున్నది, అది ఎందుకో తెలియుట  లేదు. ఎందరినో ఆకర్షించు తున్నది, ఎన్నో ఎన్నెన్నో మాటలు నేర్చుకోవాలని ఉన్నది, మృదు మధురంగా పలకాలని ఉన్నది. అందానికి  దాసోహం అవ్వాలా, ప్రేమ చూపులకు లొంగి పోవాలా, వయసు ఎదుగు దలకు అవసరమా, అనే ఆలోచనలు యవ్వన వంతులను వెంబడి స్థాయి.
కధలో కావ్య సుందరి వర్ణనలకు లొంగి పోతామా, ఆవే ఆలోచనలతో నిద్రలో కూడా కలలుగా మారుతాయా ?
ఊహల్లో చిక్కి వాస్తవాన్ని గమనించ లేక పోవుటకు నాకు వయసే కారణమా?
 

స్వశ్చముగా పరిమళించే మల్లికను చూసినా
  ఆకు పై చలిస్తున్న ఆని ముత్యము చూసినా,
చెంత చేరి సేద తీర్చే స్వాతి ముత్యమును చూసినా,
తీయని ఓదార్పు తో కనుల చూపులు చూసినా
 

మది గదిలో కల్లోలం ఏర్పడుటకు కారణము ఏది, ప్రకృతి పరవసాన్ని ఆస్వాదించి అనుభవించుటకే కదా ఈ వయసు ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఎందుకు ?     
తీయని ఓదార్పు వెచ్చని కన్నీటి బొట్టు, మనసును తొలచి వేస్తుంది.  నా ఆలోచనలు ప్రేమగా మారుతున్నాయి, ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడే తెలుస్తున్నది.  
 

ప్రేమ ఊహ అయితే, ఆ  ఊహకు సాక్షం నీవు
ప్రేమ తలపు నీవే అయితే,  నా ఊపిరి తలపులు నీవు
ప్రేమ మధుర భావము అయితే, నా భావానికి భాష నీవు
ప్రేమ కమ్మని కల  అయితే, నా కలకు కల్పన నీవు  
ప్రేమ రాగం అయితే, ఆ రాగాన్ని మీటే స్పందన నీవు  
 

నీ ఆలోచనలో అంతరంగంలో పెనవేసి, మదికి చల్లని చందన లేపనం అద్దుతున్న ఎవరు నీవు,
పారిజాతల పరిమళంలా నను చుట్టేసి చిత్రంగా నవ్వుతున్న ఎవరు నువ్వు, చూపులకు చిక్కక, నవ్వులు కురిపిస్తూ గాజులు శబ్దం వినిపిస్తూ ముఖం కనబడక ముసుగులో నన్ను ఊరడించి, ఉడికించి, హెచ్చరించి, నన్ను వదిలి పోలేవులే, వయసు ఉడుకు చూపు దామనుకున్నా ఆ సమయము రాలేదని తెలుసుకొని చూసి చూడనట్లుగా పోతున్నావు నీవు,  నన్ను కూడ కదులు అనే భావపు చూపులు చూపావు.          
 

అప్పుడనుకున్నా దివి నుండి భువికి నాకోసం జాలువారిన చంద్రోదయానివా,నా చేయి వీడని అమృత బంధానివా..నాకల సుందరివా అనుకోవటం తప్ప ఏమి చేయలేను నేను.
ఆకాశములో పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, పురుషునకు విషయ జ్ఞానము, ఓర్పు అంత కన్నా ఎక్కువ అవసరము.      
 

ప్రేమ అంటే మనసు యొక్క మౌలిక గుణం. అది ఈ సృష్టి క్రమణికలో అత్యంత సహజమైన,  అత్యావశ్యకమైన అంశం.  అది కేవలం మానవ నిర్మితమైన  దేవాలయాల్లోనూ, ప్రార్థనా మందిరాల్లోనూ మాత్రమే నిలిచి ఉండేది కాదు. వేటితో పని లేకుండానే సృష్టిలోని మనుష్యులు  జంతుజాలాలు, పశుపక్ష్యాది వృక్షాలు సైతం సహజమైన ధర్మం అనుసరిస్తూ ఉన్నాయి. ఆచరిస్తున్నాయి. గణితంలో లెక్కలు ఒక సూత్రం ప్రకారం చేస్తూవెళ్తే సమాధానం వస్తుంది. అలాగే సృష్టిసూత్రం ప్రేమమ్మే . దాన్ని అనుసరించి ఆచరిస్తేనే సత్ఫలాలు సాధ్యం అవుతాయి !
ప్రేమించు ప్రేమనుపొందు అదే లోకధర్మం ప్రేమ మాత్రం కల్పనా కాదు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

 +91 94414 08564: 🙏 *తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు* 🙏

🍃🌺1. పాండవ తీర్థం : 

కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.

🍃🌺2.    సనకసనందన తీర్థము : 

సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.

🍃🌺3.    కుమారధారా తీర్థము : 

మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

🍃🌺4.    తుంబుర తీర్థము : ఈ 

తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.

🍃🌺5.  నాగతీర్థం : 

ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

🍃🌺6. చక్ర తీర్థం : 

భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

🍃🌺 7.   జాబాలి తీర్థము : 

ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.

🍃🌺 8.    బాల తీర్థము : 

నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.

🍃🌺9.    వైకుంఠ తీర్థము : 

ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

🍃🌺10. శేష తీర్థము : 

ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.

🍃🌺11.  సీతమ్మ తీర్థము : 

ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.

🍃🌺12. యుద్ధగళ తీర్థము : 

ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

🍃🌺13. విరజానది : 

ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

🍃🌺14. పద్మసరోవరము : 

ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.

🍃🌺ఇవే కాక కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం.


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*-దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*- కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

*- నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*-సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

*-బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*-బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*-గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన 

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*- కాళ్ళకూరి నారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*- దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*-నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*- తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*- గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*- గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*- శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*- పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*- గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*- శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *- వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*- కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*- అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*- చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*- త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*- ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

*- బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*- వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*- కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*- సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*- ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*- వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*- త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*- బాలాంత్రపు రజనీకాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*- అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*- కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*- గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*- అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*- సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*- ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*- బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*- అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*- ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*- పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*- చెలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*- విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*-డూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*- అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*- చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*- కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*- నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*- మిట్టపల్లి సురేందర్*



"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)....

 *బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే....* 🌻

🍃🌺ముక్తి సాధనకు నిజమైన భక్తి మార్గం ఏది? సాకార విగ్రహారాధనా? నిరాకార నిర్గుణ ఉపాసనా? 

🍃🌺నిజానికి నిరీశ్వర, నిరాకార, నిర్గుణ, నిర్వికార, సచ్చిదానంద స్వరూపమైన పర బ్రహ్మతత్వం ఒక్కటే. దాన్నే.. పరమ భక్తాగ్రగణ్యుడైన అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే’’ అని సులభమైన మాటలలో గానం చేశాడు. 

🍃🌺అటువంటి పరబ్రహ్మ సంకల్పానుసారం.. ఆయన నుండి విడివడిన శక్తే జీవాత్మ, పరమాత్మలుగా వ్యవహరింపబడుతోంది.

🍃🌺ప్రకృతి ధర్మాన్ననుసరించి.. జీవాత్మ తనను పరమాత్మ నుంచి వేరుగా భావించడం వల్లనే ద్వంద్వం ఏర్పడింది. పంచభూతాలు, త్రిగుణాలు, అరిషడ్వర్గాలు, మనోబుధ్యహంకార చిత్తాల సృష్టి కూడా పరబ్రహ్మ లీలా వినోదంలో భాగమే. 

🍃🌺అజ్ఞానం చేత, అహంకార, మమకారాల చేత, రాగద్వేషాల చేత... చెడుగా ప్రవర్తించే వారి నుంచిమంచి వారిని కాపాడటానికి భగవంతుని అవతార ఆవశ్యకత ఏర్పడింది.

🍃🌺అందుకే గీతాచార్యుడు.. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’’ అని ప్రవచించాడు.

🍃🌺అంతే కాకుండా ‘‘యే యథామాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం’’ ఎవరు నన్ను ఏవిధముగ పొందాలని కోరుకుంటారో నేను వారిని ఆ విధముగా సేవించగలను. అని గీతాచార్యుడు చెప్పినట్లుభక్తుల కోరికల మేరకు భగవంతుడు అవతారములెత్తడం జరిగినది.

🍃🌺రావణాసురుని కోరిక మేరకు మానవరూపంలో రామావతారం, వైరభక్తిని కలిగియున్న హిరణ్యకశ్యపుని నియమాలకు లోబడి నరసింహస్వామి అవతారం ఈ కోవకు చెందినవే.

🍃🌺ఈ విధముగ అవతారములెత్తుటకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భక్తుల కోరికే కారణం. గుణాతీతుడైన పరమాత్మ.. సత్వరజస్తమో గుణాలనాశ్రయించి విష్ణు, బ్రహ్మ, శంకరులుగా విడిపోయి మరికొన్ని సగుణ రూపాలకు కారణమయ్యాడు. వైష్ణవం, శైవం, శాక్తేయం.. ఇలా అనేక సగుణ రూపాలేర్పడినా అదంతా ఆ భగవంతుని లీలలో భాగమే. 

🍃🌺ఒక బంగారపు ముద్ద నుంచి రకరకాల ఆభరణాలు తయారైనా.. అన్నింటిలో బంగారం ఒక్కటే అయినట్లు, ఒక జ్యోతి నుంచి వేరువేరుగా వెలిగింపబడిన అన్ని జ్యోతులలోని తేజోస్వరూపం ఒక్కటే అయినట్లు.. అన్ని దేవతామూర్తులలోని భగవత్తత్వం ఒక్కటే.

🍃🌺చంచలమైన మనసుకు నిలకడ శక్తిని చేకూర్చి నిరాకార నిర్గుణ, సచ్చిదానంద స్వరూపమైన భగవంతుని చేరుకోవడానికి, మాయామయమైన ప్రాపంచిక విషయ వాంఛల నుంచిభగవత్తత్వం నందు మనసు నిలపడానికి సాకారపూజ ప్రాథమిక విద్యలాంటిది. సాకారపూజ ద్వారా నిర్గుణోపాసనకు అవసరమైన మానసిక స్థైర్యము చేకూరుతుంది.

🍃🌺సాకార పూజ మూడు విధాలు. ధ్వని రూప సేవ, లిపి రూప సేవ, విగ్రహారాధన. నారద, తుంబురుల వంటివారి గానం.. వ్యాస, వాల్మీకి మహర్షుల జపం, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వంటివారి నాదోపాసన.. ఇవన్నీ ధ్వని రూప ఆరాధన కిందికివస్తాయి. శివకోటి, రామకోటి లాంటివి రాయడం, పుస్తకరచన, పురాణ రచన లాంటి వాటితో తరించడం లిపి రూప ఆరాధన.

🍃🌺ఇక విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మను ఆరాధించడం మనందరికీ తెలిసిందే. భగవంతుని నామాన్ని నోటితో పలుకక, అక్షరరూపంలో రాయక, విగ్రహరూపంలో పూజించక దైవానుగ్రహాన్ని పొందలేం. 

🍃🌺ఈ మూడు మార్గాలూ సాకార సేవకే చెందగలవు. నిశ్చల సమాధి స్థితిలో ఉండి భగవంతుని నిరాకారంగా సేవించడం కొందరికే సాధ్యం. అది సాధించేవరకు సామాన్యులందరికీ విగ్రహారాధనయే తరుణోపాయం. సాకార సేవయే దిక్కు.

ఆంధ్రజ్యోతి సౌజన్యం తో.....

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 85* 🕉

*రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి*

*ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్*

*సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు* *గాకున్న దుర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు - దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట - రాజులందు కనబడుట లేదు. 

🌹రాజు కాగానే మానవతాలక్షణములైన పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు.

🙏 *ఓం నమఃశివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

సీసా పద్యము


ఉదయాన వేడిగా ఉత్సాహ కాఫీను

భార్యతో ముచ్చట బాధ తీర్చు

కమ్మని మద్దులా కమనీయ పల్కులా

కలిసొచ్చు సహనము కాచి ఉండు

స్నానము చేసియు అల్ప ఆహారము

అందించి సేవతో ఆత్మ తెలిపె

చిరునవ్వు చూపించి చెమ్మగిళ్ళుకనులు

హృదయము కదిలించి హాయి చెప్పె


తేటగీతి

పగటి ప్రేమను చూపియే పాద పూజ

రాత్రి పూటయు మనసును రంగరించు

పనులు అన్నియు చేసియు ప్రేమ చూపి

విద్య బోధ ఉద్యోగిగా వినయ ముంచె


,,,,,,,,,,,,,,,,,,,,,


భోజనం తిన్నను భాధయు తగ్గును

ఆకలి తీర్చును ఆదరమ్ము

పుత్తడి ఉన్నను పుడమిలో సంపదే

ఆశలు తీర్చును అలక మార్చు

ఆనందపు పలుకు ఆట తీర్చు

అహముయే పెరిగిన అరుపు మారు

ఒకరికి తోడుగా ఒకరు ఉండు


కాలమాయబట్టి కాపురం మారేను

ప్రేమ శాంతి నుంచి పెదవి పంచె

ఆదమరచి ఉన్న ఆకలికే తోడుగా

సహనముంచి సేవ చేయు చుండు


,.................

ఆ ఇల్లాలు దైవపూజ చేసి కొలువు చేరె


ధర్మము తెల్పియు దారిద్ర మాపిన

ధన్యోస్మి ధన్యోస్మి  దేవదేవ

దాశ్యము తొలగించి దాతగా మార్చిన

ధన్యొస్మి ధన్యోస్మి దేవదేవ

ధ్యానశీలుడుగాను ద్రవ్యమ్ము ఇచ్చిన

ధన్యోస్మి ధన్యోస్మి దేవదేవ

ధృతరాష్ట్ర కాకుండ దరిగాను ఉండియు

ధన్యోస్మి ధన్యోస్మి దేవరాజ


ऊँ! 

----

"  పరంజ్యోతిస్స్వరూపాయ శ్రీ శ్రీ నివాసమూర్తయే

ధర్మజ్యోతిస్స్వరూపాయ శ్రీ వేంకటేశ్వరా ర్తయే

దివ్య జ్యోతి స్స్వరూపాయ శ్రీ పద్మనాభ మూర్తయే

సత్యజ్యోతి స్స్వరూపాయ శ్రీ నిత్యం వైభవార్తయే

   

నమోనమః.. శ్రీ వేంకటేశాయ నమోనమః

,,,,,,,,

*🌹. వివేక చూడామణి - 14 🌹*

✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు

📚. ప్రసాద్ భరద్వాజ 


*🍀. బ్రహ్మ జ్ఞానము - 2 🍀*


63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదాత్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. 


ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేము కదా!


64. ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు.


65. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయాలంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగారము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. 


అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

ఆభ్యాసం

అభ్యాసమంటే ఉద్దేశపూర్వకంగా, నియమబద్ధంగా పదేపదే చేసే ప్రయత్నం. మనిషి జీవితం సంస్కృతి, నాగరికతలతో నిర్మితమయ్యేది కాబట్టి, మారే వ్యావహారిక విలువలను, సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అలవరచుకొని సమర్థ జీవనం గడపవలసి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఈ మార్పుల వేగం పెరుగుతుండటం వల్ల వాటికి అనుగుణంగా మనిషి తన అభ్యాస నేర్పునూ పెంచుకోవలసి వుంటుంది. ప్రాతఃకాలంలో చేసే అభ్యాసం అనతికాలంలో సత్ఫలితాన్నిస్తుందన్నది అనుభవజ్ఞుల మాట. ఇతర జీవులలో సహజాతాల పాత్ర ఎక్కువకానీ, మనిషి జీవనంలో అభ్యాసానిదే ప్రధానపాత్ర. 


అది ఐహిక విషయమైనా, ఆముష్మిక విషయమైనా. సాధారణంగా ఐహిక విషయాలలో ఒకటి నేర్చుకొనడానికి చేసే చక్రీయకృషిని ‘అభ్యాసం’ అంటాం. ఆముష్మికాంశాలలో ఒక దిశలో స్వభావగతంగా ఎదగడానికి చక్రీయంగాగానీ, నిరంతరంగాగానీ చేసే కృషిని ‘సాధన’ అంటాం. ఏదేని విషయాన్ని నేర్చుకొనడంలో, నేర్చుకొన్నది దోషాలు తొలగి బలపడటంలో, బలపడింది అవగాహనలో వికసించడంలో, అట్లా వికసించింది మన స్వభావంగా మారడంలో ‘అభ్యాసమే’ కీలక ఊతమై నిలుస్తుంది. అప్పుడు మనం నేర్చుకొన్నది సందర్భోచితంగా, సహజంగా, సమర్థంగా, అప్రయత్న ప్రవర్తనగా ప్రకటితమవుతుంది. ‘అభ్యాసం కూసు విద్య’ అన్న నానుడికి అసలు అర్థం ఇదే. ఇంగ్లిషులో దీన్నే ‘సెకండ నేచర్‌' అంటారు.

అభ్యాసానికి ముందు నిర్ధారిత విషయ పరిజ్ఞానం, ప్రయోగ మార్గదర్శనం అనుభవజ్ఞులైన గురువుల నుండి తప్పనిసరిగా పొందవలసిందే. లేకుంటే కృషి సరైన దిశలో సాగక సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే అంటారు మనవాళ్ళు, ‘గురువు లేని విద్య గుడ్డివిద్య’ అని. సాధారణంగా అభ్యాస స్థాయి వ్యక్తి వయసు, మానసిక పరిణతి, పట్టుదలపైన ఆధారపడి ఉంటుంది. మనకు అందే, మనం పొందే ప్రేరణాబలం వాటి పరిమితులను కొంతవరకు చెరుపగలుగుతుంది. అభ్యాసం కుంటుబడకుండా సవ్యంగా, సబలంగా సాగడానికి తదనుకూలమైన ఆహార అలవాట్లు, పరిసరాలు, సాంగత్యం వంటివీ అత్యవసరం. ఈ విషయంలో జాగ్రత్తపడకుంటే తగు స్థాయి ఫలితాలు సంప్రాప్తించకపోగా, వైఫల్యమూ ఎదురవవచ్చు. అభ్యాస నాణ్యతను, ఉన్నతిని నిర్ణయించే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ‘అభ్యాసకుడి వైఖరి’ (ఆటిట్యూడ్‌). ఇది స్వార్థపూరితమైతే అభ్యాసం తీవ్ర ఏకాగ్రతతో సాగినా, ఆశించిన ఫలం సంపూర్ణంగా లభించినా, ఆ ఫల వినియోగం పరహితాన్ని మరచి అహంకారంతో, అత్యాశతో, భయక్రోధాదులతో సాగి పాపాన్ని మూటకడుతుంది. పర్యవసానంగా అది సాధకుని వినాశనానికే దారితీస్తుంది. ఒకవేళ ఈ వైఖరి పరహితార్థమైందైతే ఆ ఫల వినియోగం సకల సజ్జన సుఖాపేక్షతో, ప్రేమ, సంతోషం, తృప్తి వంటివాటితో సాగి పుణ్యాన్ని మోసుకొస్తుంది. ఈ నిస్వార్థ వైఖరే నిరంతరం అంతఃప్రేరణగా ప్రజ్వలిస్తూ అభ్యాసాన్ని పవిత్రనిష్ఠగా, నిరవధికంగా కొనసాగింపజేస్తుంది. 

అలాంటి అభ్యాసమే జీవన కౌశలాలను పదునుపరచి, మూల్యాలను మెరుగుపరచి, సమర్థతతో సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలిపి, అనుభూతిలో సంతృప్తిని నింపి, సంస్కారాలకు పుణ్యబలాన్నిచ్చి జన్మను సార్థకం చేస్తుంది. మన జీవన విధానంలోకానీ, పలు రకాల అభ్యాసాలలోకానీ ఆధ్యాత్మిక ప్రభను అంటే ప్రకృతిపట్ల, సమాజం పట్ల, వాటి శాసనసూత్రమైన ఈశ్వర శక్తిపట్ల ఆర్ద్ర, అభేద, ఆత్మీయ, అనన్య భావనను ప్రతిష్ఠింపజేయాలి. దీంతో దక్కే ఏ ఫలాన్నైనా ‘ఈశ్వర ప్రసాదం’గా స్వీకరించినప్పుడు జీవితమే కర్మయోగమవుతుంది. ఏ కర్మాసక్తులూ కట్లు బిగించవు. అప్పుడు జీవితం ‘మోక్ష పథగామి’గానూ సాగుతుంది. అభ్యాస జీవనాన్ని ఇలా ఆధ్యాత్మిక పరిమళంతో నింపుకోవడం ద్వారా భౌతిక జీవనాన్ని ధర్మబద్ధంగా సంపన్నమయం చేసుకోగలం. ఫలితంగా పుణ్యగంధాల ఆత్మానందంతో మానవజన్మ ధన్యమవుతుంది.

,,,,,

*అన్నమయ్య కృష్ణతత్వం*

-కర్లపాలెం హనుమంతరావు


 అన్నమయ్య అనగానే కళ్ల ముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూపం.  వేంకటాద్రిరాయడి కొలువు కూటమికి అంతకు ముందు నుండే కొండలు నెలవై  ఉండినా, కలియుగ అవతార పురుషునిగా  భక్తజన సందోహం గుండెల మీదకు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగులవాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభా ప్రాగల్భ్యం  అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. అయ్యతో పాటూ అమ్మకూ  స్వరార్చనాసేవలు సరిసమానంరగా అందడం అయ్యవారి ఆనాటి అభ్యుదయ భావాలకు అద్దంపడుతుంది.  ఆచార్యులవారి కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే  ఇక్కడ ముఖ్యోద్దేశం. 

తాళ్లపాకవారి రాగిరేకులు తడవని రసరహస్యం లేదనడం అతిశయోక్తి కాబోదు. అయ్యవారి కృష్ణతత్వం గురించి చేసిన గానప్రస్తావనాలను గాని గాఢంగా పరిశీలిస్తే భజగోవింద కర్త  శ్రీశంకర భగవత్పాదులు భావించిన ఆ 'ఏదో తెలియని నీలిరూప తత్వం' అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి వేధించి మరీ తన్మయత్వ అగాధంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి.  జయదేవుని అష్టపదులకు దీటైన పాదపంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుత్వంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవాలి. 

కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది  ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దుమురిపాలను  అన్నమయ్య మథించి  మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి వట్టొట్టి మాటలతో మనసుకు పట్టించడం ఒక్క నాలుక వల్ల శక్యమయే పని కానేకాదు. 'భావయామి గోపాలబాలం మన/స్సేవితం తత్పదం చింతయేహం సదా' అంటూ  చిన్నికృష్ణుని ముద్దు పాదాలను తాను తలుచుకుంటూనే తప్ప తతిమ్మా దేవుళ్ల సంకీర్తనల పర్వం సవ్యంగా సాగించలేన’ని  స్వయంగా ఆ  చెంగల్వరాయని స్వరసేవకుడే సెలవిచ్చుకున్న సందర్భం గమనీయం.

'కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘంటికా'-బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతాడును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపోతాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు. 'నిరతరకర కలితనవనీతం  బ్రహ్మాది/ సురనికర భావనా శోభిత పదం' -వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చిన్ని చేతులుండే ఆ బాలగోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని..  మిగతా దేవతలకు ప్ర్రార్థనలు.. అవీ సవ్యంగా సాగే పని కాదు!'అని అన్నమయ్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!  

'చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి' అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేలల మీద కనిపించడం చాలా అరుదు  నిన్న మొన్నటి దాక. ఆ తరహా వెన్నముద్ద వంటి  కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆలపిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జికృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం! బ్రహ్మానంద పారవశ్యం కలిగించే పదబంధాలతో వేలాది సంకీర్తనలు సృజించిపోయిన అన్నమయ్యను ఒక్క నోటితో మాత్రమే పొగిడితే చాలునా? అదే శ్లోకంలో చిట్టచివరన 'పరమపురుషం గోపాలబాలం' అని కృష్ణతత్వాన్ని పరమ క్లుప్తంగా, ఆప్తంగా  ముక్తాయించడం వెనక, స్వరూపానికి స్వల్పుడే అయినప్పటికీ  పరమపురుష తత్వం శ్రీకృష్ణపరంధామునిది    అన్న కృష్ణతత్వం వెలయించడమే అన్నమయ్యవారి పరమార్థం! ఆ వాగ్గేయకారుని ఎన్ని వేల జిహ్వలతో స్తుతిస్తే న్యాయం జరిగినట్లు?  

'చిన్ని శిశువు చిన్ని శిశువు /ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు' అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు.  అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి  మరో కవి ఇంకెవరైనా   పాలచారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జను గూర్చి కూడా భజించాలన్న బుద్ధిపుట్టిందా? ఏమో..  తెలియదు.  అదే అన్నమయ్యలోని విశిష్టత. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనంతం నుంచి చింతాకు చిగురు వరకు ఏదీ ఆ వాగ్గేయకారుని  సంకీర్తనల స్వర గాలాలకు తగలకుండా తప్పించుకోలేకపోయింది. 

ఇళ్లలోని పసిపిల్లలు తాగే తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు  చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తారు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కో మారు.  సంపూర్ణ సత్యస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని ముగ్ధమనోహరమైన ఆ బాల్యస్థాయికి దింపుకొచ్చి భగవంతుని మీది ముప్పిరిగొనే భక్తిభావాన్ని ముద్దుమురిపాల రూపంలో తీర్చుకునే అవకాశం భక్తలోకానికి అందించిన అన్నమయ్య అక్షరాలా ధన్యజీవి. 

దేవకీసుతుడు బాలకృష్ణుడి ఫాలభాగం మీద జారిపడే ముంగురులను పైకి నెట్టి మురిపెంగా సవరించే భాగ్యం యశోదమ్మ తల్లికి దక్కింది చివరకు. అదృష్టమంటే యశోదమ్మదే కదా అని కృష్ణయ్యను అమితంగా కామించే అన్నమయ్యలోని తల్లిహృదయం అసూయచెందే కీర్తనల పర్వం ఇది. 'పాయక యశోద వెంట పారాడు శిశువు' గా వేదోద్ధారకుణ్ణి భావించిన  వైరుధ్య వైదుష్యం తాళ్లపాక అన్నమయ్యలవారిది. ఆ మాటకొస్తే అండ పిండ బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు  కలగడం వాస్తవానికి తెలుగువారి వాగ్గేయసాహిత్య ప్రక్రియ చేసుకున్న అక్షరాల నోముఫలంగా చెప్పుకోవాలి. 

'ఝుమ్మని మడి శృతి గూడగను/ కమ్మని నేతులు కౌగగ చెలగే' ననే ఒకానొక కీర్తనలో 

'పాలు పితుకుచును బానల కేగుల/సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే' నేతులు కాగుతుంటే వెలికొచ్చే ధ్వనులు, గోవుల పొదుగుల కింద చేరి గోపాలురు పాలు పితికే సందర్భంలో పుట్టే సవ్వడులు.. ఇట్లా సర్వం ఝుమ్మనే నాదాల మాదిరి పొంగిపొరలుతున్నట్లు అన్నమయ్య సందు దొరికిన ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను  తాను విని ఇహలోకాలూ తన్మయమయేలా  వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేకంగా కలిసొచ్చిన  స్వరాలవిందు! 

'దది మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే/ నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః/ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్/కబళిత నవనీతః పాతు గోపాలబాలాః'- పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహేతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మంది భక్తిభావుకులు దానినో  ఓ తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా  అన్నమయ్య ఇప్పుడు! 

వాస్తవానికి లోకంలో దొంగతనం చేయని జీవి ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా మనిషి మౌలిక ప్రవృత్తే చోరబుద్ధి. తల్లి గర్భంలో చేరినప్పటి బట్టి అమ్మకు వంటబట్టిన తిండి సారాన్ని  తస్కరించడం  మరిగిన తండ్రి జీవకణమే కదా నవమాసాల అనంతరం భూమ్మీద మనిషిగా అవతరించడం! కన్నవారి ముద్దుమురిపాలను, రక్తమాంసాల ఫలసాయంతో సహా తోబుట్టువులతో కలసి మరీ దొంగిలించి తినే మనం, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అనుభవించే అన్నింటా అంతో ఇంతో ఏమిటి.. ఆసాంతం.. ప్రకృతి నుంచి, సాటి జీవజాతికి న్యాయంగా దక్కవలసిన  భాగాన్నుంచి  కాజేసి కదూ మరీ ముదురుతున్నది?  ఇదేమని  ఎదురడిగేవారిని మరేదో కట్టుకథలతో దారి మళ్లించే మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. వెన్న కాగుతుంటే తినేందుకని చెయ్యి పెట్టి చుర్రుమంటే చీమ కుట్టిందని చిన్నికృష్ణుడు బుడిబుడి రాగాలు తీసినా, తోడుదొంగలమైనందుకేనేమో మనకూ చీమ కుట్టినంతైనా  కోపం రానిది! కన్నయ్య చిన్ననాటి  కొంటె కథలన్నీ ఇట్లాగే ఉంటాయని అన్నమయ్యలోని భక్తిసాధకుని తన్మయత్వ  భావన. ఆ గోపాలుడి నిద్ర మెలుకువే పాలు చిలికే కవ్వం సవ్వళ్లతో మొదలవుతుంది. తరకలు కట్టే వెన్నముద్దలు దొంగిలించే ఆలోచనతోనే ఆ నల్లనయ్య కళ్లు నులుముకుని మరీ నిద్ర  లేచేదని లీలాశుకుని 'శ్రీకృష్ణకర్ణామృతం' కృష్ణతత్వాన్ని వర్ణించింది  గోపీజన మానస చోరుడుగా  కన్నయ్యకు మరో మనోహరమైన  బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహీనతలు అన్నిటిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా  భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య  భావనా వాగ్గేయమార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. 

'సా రోహిణి నేల మసూతరత్నం/కృతాస్పదం గోప వధూ కుచేషు' (రోహిణి కృష్ణుడనే నీలిరత్నాన్ని కన్నది. గోపికలు ఎప్పుడూ దానిని తమ వక్షస్థలంలొ ధరిస్తారు) అని లీలాశుకుడు చమత్కరిస్తే, అంతకు రెండాకులు ఎక్కువ చదివినట్లు కృష్ణతత్వం ఆసాంతం నవరత్నాలతో పోల్చదగ్గదని అన్నమయ్య  తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. 'ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు'సంకీర్తనలో అన్నమయ్య  ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం.  యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహిమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట  వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్నికృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి  పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య  గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖ చక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైడూర్యంలా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే  కమలాక్షుడు కాళింగుడనే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే   పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడలిలో మెరిసే ఇంద్రనీలం వంటి ఆ శ్రీవేంకటాద్రి పద్మనాభుడే ఆన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి  మన మధ్యనే  పారాడే  దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి పట్టిన  అపూర్వ వాగ్గేయ హారతి పళ్లెం.

,,,,,,,,

ఆకర్షణ ఆరాధన
ఆనంద మయపు అంచున
జీవతమంతా సగటున
ప్రేమలో పడ్డ జగతిన

నిన్ను కంటి పాపలోన
దాచిఉంచి వేచిఉన్న
మరచిపోలేను యుగాన
ఆశ వుంది కలసి ఉన్న

దైవ సన్ని ధానమ్మున
ప్రీతి మహిళ హృదయమ్మున
నల్లనయ్య మనసు లోన
శాంతి తరించు మార్గాన

చల్లని గాలులు వీచిన
హృదయమ్ము నందే తాకిన
పరవశమ్ముతో  నలిగిన
సహనముయే చుట్టమైన
 
పువ్వులు ఆకులు రాలిన
రస వత్తరంగ మారిన
మత్తుకోయిలలు కూసిన
తుమ్మెద మధువుని దోచిన

నదీ నాదములు చేసిన
మగువ లందరూ ఆడిన
చకోర పక్షులు కలసిన
అదె ఆనందం జగాన  

హృదయ స్పందన తెలిపిన
రాధామనసుయే తరించిన
సృష్టి ఆనందమయాన
కృష్ణ వేణు నాదమ్మున

--(())_-
సమ్మోహనాలు .. గోడకు చెవి (1181-1190)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

జాగర్తపడేటప్పుడు
అప్పుడు చెయు చప్పుడు
చప్పుడు గోప్యము గోడకిచెవులు ఈశ్వరా

రాత్రిపూట మాటలు
మాటలతో చేష్టలు
చేష్టలు శబ్దము నెమ్మది గాను ఈశ్వరా

వినేందుకే చెవులు
చెవులు విన్న పలుకులు
పలుకులు నే తెలిపు నోటిద్వార ఈశ్వరా

ఎవరికివారైనా
వారేను మరచినా
మరచి గుర్తులు తెల్పి కలుపునే ఈశ్వరా

చెవిన విన్న మాటలు
మాటలు నిద్ర కలలు
కలలు వల్ల కలవరింతలే ఈశ్వరా

తప్పొప్పులు వినినా
విని భయము తెలిపినా
తెలిపి గోడకు చెవులున్నాయనె ఈశ్వరా

మాటలతో గారడి
గారడి తో వినికిడి
వినికిడి శక్తి పెరిగిన కష్టము ఈశ్వరా

ఇవి చెప్పుడు మాటలు
మాటల తో వేటలు
వేటలు సల్పుదురు ధైర్యముతో ఈశ్వరా

విషయము నిజమైనను
అయి అబద్ధమైనను
అయినను గోడకుచెవులభయమే ఈశ్వరా

వాంఛ తీరు సమయము
సమయము తోన ధైర్యము
ధైర్యము ఉన్నా గోడకుచెవులె ఈశ్వరా

--(())-
మధురిమల - రాధ కృష్ణ భావ తరంగం  
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సమ్మోహనమ్ము కలుగు  
కాలియందియల శబ్దము
స్త్రీ మోము నందు కలుగు
మందహాసచూపుమయము
 
భంగిమగా వాలు చూపు
జెడకుచ్చులతోన ఊపు  
ఇక వక్షజాలా మెఱుపు   
చూసువాడి మనసు తడుపు

కంకణమ్ముల శబ్దాలు
రాగములొల్కే పల్కులు
విలాస విరాజ కరములు
చూసిన మనసు కితకితలు
 
ముక్కున ముక్కెర మెరుపులు
చెవుల దిద్దుల కదలికలు
గులాబీ రేకుల కురులు
మగవాడిని ముంచు తెరలు

లేత బుగ్గలే వాపులు
అధరాలు సిందూరాలు
కంటిచూపుతొ రెపరెపలు
కనుసైగతొ కవ్వింపులు

మూగగ నిల్చు కోకిలలు
మూతిముడిచియు పకపకలు
కవ్వింపు పెదవి విరుపులు  
మనసున దోచు మధురిమలు

ఇక పౌర్ణమిన మరిపించు
ఇక వెన్నలను కురిపించు
ఇక వసంతం జరిపించు
ఇక మనసంతా మధించు
 
ముచ్చట గొల్పే వాకిట
ఎప్పుడూ ఉండు కిటకిట
సందడితో పూటపూట
జాగరణతో ప్రతిపూట

శెలవిస్తే ఆపుతాను
బంగారాన్ని దాచుతాను
వికసించే పువ్వు నేను
సంతోషము కల్గిస్తాను
 

మ్రోగెడి  కాలియందియలు!భ్రూచలనమ్ములు!మందహాసముల్!
నాగువు భంగి వాల్జడలు‌!నాదము జేసెడి కంకణమ్ములున్!
రాగములొల్కు వేణువు!విలాస విరాజ కుసుంభహారముల్!
మూగగ నిల్చు కోకిలలు!ముచ్చట గొల్పె వనంబు పౌర్ణమిన్!
 

*చిత్తశుద్ధి* 

 ✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

​ “ఆత్మశుద్ధిలేని ఆచారము, భాండ శుద్ధి లేని పాకము, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమని”  వేమన్న  చెప్పిన సత్యాన్ని గ్రహించాలి  జనులు.  భగవంతుని యందు మనసు లీనం చేసే ముందు చిత్తశుద్ధి అవసరమని విశ్వసించాలి. మనసంతా  మంచి ఆలోచనలు నిండి  ఉండడం చిత్తశుద్ధి కాదు. ఆలోచనలేవీ లేకుండా ఖాళీ చేయడాన్నే చిత్తశుద్ధిగా నిర్వచించారు  పెద్దలు.  ‘చిత్తశుద్ధి లేని పూజలు, సాధనల వల్ల  ఆత్మజ్ఞానం కలగదని,  ఆలోచనకు, మాటకు, చేతకు  సమన్వయం ఏర్పడదని’ గ్రంథాలు కూడా తెలిపాయి.

​“మహత్తరమైన సత్యాన్ని చూడాలంటే మనసు లోపలకు చూడాలని” శాస్త్రాలు చెప్పాయి. దుమ్ము ధూళి పట్టిన అద్దంలో  ప్రతిబింబాన్ని చూడలేనట్టే అజ్ఞానాన్ని తొలగించుకోనప్పుడు  పరమాత్మను దర్శించడం సాధ్యం కాదని గ్రహించాలి.  

​  “ మనస్సు మీద దృష్టి పెట్ట గలిగితే అనంతమైన రత్నాల వంటి సంపద అక్కడే ఉందన్న’ వివేకానందుని మాటల సారాన్ని గ్రహిస్తే ఆచరణా విధానం మార్చుకోగలుగుతారు.   ‘వసంత రుతువుకు ముందు వృక్షాలు పండుటాకులను రాల్చి  చిగురు తొడిగినట్టు, చిత్త వృక్షము నుండి  అవలక్షణములనే ఆకులను రాల్చివేసి, అఖండాత్మశక్తి సంపన్నులమనే  నూతనోత్సాహమును పెంపొందించుకోవాలని’ గ్రంథాలు తెలిపిన సత్యాన్ని మననం చేసుకుంటే ఆధ్యాత్మిక మార్గం పూలబాట అవుతుంది.  

    ​‘చిత్త శుద్ధి కొరకు కర్మలు, ఏకాగ్రత కొరకు ఉపాసన చేయాలని, మోక్షం కొరకు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని ‘వేదాంత డిండిమము’ బోధించినట్టు నిష్కామ కర్మలు చేస్తూనే భగవద్గీతలో చెప్పినట్టుగా    ప్రతిఫలాన్ని భగవదర్పితం చేసినప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.  ​ 

“చిత్తశుద్ధి, మంచి మనసు ఉంటే  తీర్థయాత్రలకు వెళ్లి స్నానాలు చెయ్యాల్సిన పని లేదన్న” భర్తృహరి సుభాషితాన్ని అవగతం చేసుకుంటే  ఆధ్యాత్మిక జీవన విధానమూ  బోధపడుతుంది.  

‘చిత్తశుద్ధితో చేసే పనులకు ప్రతిఫలం దక్కుతుందని’ ఇతిహాసాలు తెలిపినట్టు అమలిన చిత్తంతో శ్రద్ధగా ఎదురు చూసిన శబరి పెట్టిన ఎంగిలిని స్వీకరించి,  గంగానదిని దాటించిన గుహుణ్ణి  ఆలింగనంతోనూ  కరుణించాడు రాముడు.  నాలుగు రోజులుగా  పస్తులున్నప్పటికీ తన  ఆహారాన్ని అతిథికిచ్చిన  సక్తుప్రస్థుడు స్వర్గలోకం చేరినట్టు భారతం వివరించింది.

​ ‘ఇంద్రియాలెన్ని విధాలుగా బాధించినా ప్రయత్నంతో అదుపు చేసుకోవాలని, నీట మునిగినవాడు ఎదురీదుతూ  నదిని దాటినట్టే,  పాప చింతలను పరిశ్రమతో  తొలగించుకున్నపుడే చిత్తశుద్ధి కలుగుతుందని’   పానుగంటి వారు వ్రాసినట్టు, ‘ఏకాగ్ర చిత్తమును గురువుగా,   మనోవికాసమునకు తోడ్పడు సాంగత్య, గ్రంథ పఠనాభ్యాసులై,  వైరుధ్య భావాలను అధిగమించితే ఆత్మశాంతి కలుగుతుందని” శాస్త్రాలు బోధించినట్టుగా  నియమ నిష్టలు ఏర్పరచుకుని  దైవానుగ్రహానికి ప్రయత్నించేవారు సఫలీకృతులు కాగలరు.

,,,,,,,,

*సహనం*.


అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, 

తెల్లటి పూలతో అందంగా ఉండేది.. 

దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. 

ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న 

ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే 

ఆశ కలిగేది.


అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. 

ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి.

చెట్టు బోసిపోయింది.. 

అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు.

ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు.


అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు.

తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! 

అనే నమ్మకంతో బతుకుతుంది.


కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే చెట్టులో చలనం మొదలైంది.. 

కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , 

పువ్వులు వికసించాయి.. 

మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... 

ఆ చెట్టు...!

మనిషి జీవితము అంతే...

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...

అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. 

ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు 

నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది 

అని గట్టిగా నమ్ము...

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..

గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి.

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, 

సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు.గుర్తుంచుకో.నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడుముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి..మనకు సహనం ఉండాలి...!!

--(())--

No comments:

Post a Comment