. వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి శుభాకాంక్షలు, Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Good Wishes to All
మాత్రే నమః.. నమః శివాయ..8
సీస పద్యము
మధుర స్వప్నమ్మేను మనసు విజయమేను
ప్రభవించిన నవ లావణ్యమౌను
మదన గీతంలోన మనసు పంచే దిగా
పల్లవించిన రాగ పాద మౌను
తారల మది చీర తత్త్వమ్ము గానులే
జాబిలమ్మ దిగొచ్చె జాతరౌను
నెలవంక చూపులు నేల వంక యగుటే
పుట్టి మెట్టినచోటు దోచునౌను
పట్టు కుచ్చిళ్ళ పారాణి పాద మగుట
కట్టుబొట్టుల్లో కమనీయ కావ్య మగుట
శివుని సిరిపంచు పార్వతి స్థితి గతి యగు
చక్కనమ్మ చక్కన్నయ్య చలువ శోభ 37
***
3.3.4-3.4-3.4.4(యతి, ప్రాసయతులతో - )
కలువ పూవు మెరుపులు. కలలొ కనబడు. కనులు కళకళ మిళ మిళ
పలుకు మాట మనసున. పరుగు విధిగను. పగలు సెగలగు కదులుట
తలపు లన్ని కదులుట తహతహ లగుట తరము కదలిక కథలగు
మలుపు లన్ని జరుగుట మనసు తకధిమ మనుగడ జయమగు పిలుపు 38
చెలువమలరు వదనము - చెలియకదనము - జిలుఁగు నిండిన వసనము
తెలుఁగు పదపు మధురిమ - దెలుపు కవితల - దెలుపు వెన్నెల హసనము
లలియె కలల కలిమియొ - లలన చేసెడు - లలిత లాస్యపు చలనము
చిలికి సుధల నొసఁగును - చెలిమి హృది యను - శిలకు ప్రాణపు జ్వలనము 39
...
ఉ. మా. ఒక్కొక చుక్క చక్కనిది కొల్చెడి బుద్దిగ నెత్తు రవ్వగన్
జొక్కపు సిగ్గు నిగ్గులగుచున్ సొగసున్ రస లక్ష్యమేయగన్
జక్కని రూప ధైర్యమగు సంకలనంబు గుణాత్మ దేహమున్
నిక్కపు విద్యనంతయును నిర్మల మే యగు పార్వతీ పతీ 40
తే. గీ.నగ సదన ఘనతరయశ నగరదమున
నవ ధవళకర ధర తత భవభయహర
ప్రమదవర యనవరత సదమ వరద
హర గరళ గళ భవకనద సమనయన! 41
టీక:--నగసదన =పర్వతమే గృహముగా గలవాడా, ఘనతర యశ =అధికతరమైన కీర్తి గలవాడా, నగర దమన =త్రిపురములను అణచినవాడా, నవ=నూతనమైన
ధవళకర=చంద్రుడిని ధర=తాల్చినవాడా, తత =విస్తృత మైన, భవభయహర =సంసార
భీతి నడిగించువాడా, ప్రమదవర=ప్రమదులకు అధీశుడైన వాడా, అనవరత=నిరంతరము, సత్= శ్రేష్టమైన, అమరవరద =దేవతలకు కాపాడువాడా,
హర=హరనామము గలవాడా, గరళ గళ =విషమును కంఠమునందు గలవాడా
భవ=భావనామము గలవాడా,కనద =ప్రకాశమాన మైన, అసమ=బేసిసంఖ్య యన
నయన=నేత్రములు గల శంకరా.
*****
*🌹. వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి శుభాకాంక్షలు, Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Good Wishes to All
*🍀. వైకుంఠ ఏకాదశి విశిష్టత 🍀*
*మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.*
*వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పద్మ పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించబడింది . ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతను బ్రహ్మ నుండి పొందిన వరం కారణంగా దేవతలకు పీడకలగా తయారయ్యాడు . వారు ఆ అసురునితో పోరాడటానికి విష్ణువు సహాయం కోరారు, కానీ అతనిని ఓడించ లేకపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్టువు బదరీకాశ్రమ పరిసరాల్లోని సింహవతి అనే గుహకు ప్రయాణించాడు. మురాసురుడు అతనిని వెంబడించాడు. అక్కడ, విష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవతను పిలిచాడు , ఆమె ఆ అసురుడిని చంపుతుంది. సంతోషించిన విష్ణువు, ఆ దేవతకు 'ఏకాదశి' అనే నామకరణం చేసి, ఆమె భూలోక ప్రజలందరి పాపాలను పోగొట్టగలదని ప్రకటించాడు. వైష్ణవ సంప్రదాయంలో, ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఆ విధంగా ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశి అయిన మొదటి ఏకాదశి వచ్చింది.*
*మరొక పురాణం ప్రకారం, విష్ణువు తన కోసం తపస్సును చేసిన ఇద్దరు అసురుల (రాక్షసులు) కోసం వరంగా తన నివాస ద్వారమైన వైకుంఠ ద్వారం తెరిచాడు. వైకుంఠ ద్వారం అని పిలువబడే ద్వారం నుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తిని చూసిన వారు కూడా ఆయనతో పాటు వైకుంఠానికి చేరుకుంటారు. ఈ విధంగా వైష్ణవులు ( విష్ణు భక్తులు ) ఈ రోజున 'వైకుంఠ ద్వారం' (వైకుంఠానికి ద్వారం) తెరవబడిందని నమ్ముతారు. చంద్ర క్యాలెండర్లో మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని 'మోక్షద ఏకాదశి' అంటారు.*
*భారతదేశంలోని అన్ని దేవాలయాలు ఈ రోజున భక్తులు నడవడానికి ఒక రకమైన నిర్మాణాన్ని తయారు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా వేదాల నుండి ప్రత్యేక ప్రార్థనలు , నాళాయిర దివ్య ప్రబంధం , శ్రీ వైకుంఠ గధ్యం, అలాగే వైకుంఠ ద్వార పూజ, ప్రకారోత్సవం (శ్రీ వెలి), ఊంజల్ సేవ (ఊయల పూజ), ఊంజల్ ప్రబంధం, యజ్ఞాలు , ఉపన్యాసాలు మరియు ప్రసంగాలు అనేక విష్ణు దేవాలయాలలో ఏర్పాటు చేయబడతాయి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాస వ్రతం మరియు దాని పూజలో భాగం. ధనుర్మాసం మొత్తం మాసం ఉపవాసం అనేక వైష్ణవులు ఆచరిస్తారు.*
*విష్ణు పురాణం ప్రకారం , వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం సంవత్సరంలో మిగిలిన 23 ఏకాదశుల ఉపవాసంతో సమానం. అయితే, వైష్ణవ సంప్రదాయం ప్రకారం , శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం రెండింటిలోని అన్ని ఏకాదశిలలో ఉపవాసం తప్పనిసరి . ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది. పక్షంలోని 11వ రోజు ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. ఈ రోజు భక్తులు విష్ణువుకు ప్రత్యేక ప్రార్థనలు, జపములు, నామస్మరణ మరియు ధ్యానం చేస్తారు. తెల్లవారుజామున విష్ణు దేవాలయాన్ని సందర్శిస్తారు. ద్వాదశి నాడు మధ్యాహ్నం తరువాత భోజనం చేస్తారు.*
*శైవ శాఖ వారు ఈ రోజును త్రికోటి ఏకాదశిగా పాటిస్తారు. ఈ మతశాఖా పరమైన ఆచారాన్ని అనుసరించేవారు హిందూ దేవతలలోని దేవతలందరూ, ఈ రోజును శివునికి నమస్కరించే తేదీగా భావిస్తారు.*
*తిరుమల గర్భగుడికి వైకుంఠ ద్వారం అనే ప్రత్యేక ప్రవేశం ఉంది . ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరవ బడుతుంది. ఈ ప్రత్యేక రోజున ఈ 'వైకుంఠ ద్వారం' గుండా వెళ్ళే ఎవరైనా వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు.*
*శ్రీరంగంలో, శ్రీ రంగనాథస్వామి ఆలయంలో, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 20 రోజుల పాటు జరుగుతాయి, వీటిని రెండు భాగాలుగా విభజించారు: పాగల్ పాతు (ఉదయం 10 రోజులు) మరియు ఇరా పాతు (రాత్రి భాగం 10 రోజులు). విష్ణువు, రంగనాథుని మధ్య ఆలయ విగ్రహం వలె , తన ముత్తంగిలో , ముత్యాల కవచంతో, మొత్తం 20 రోజులు భక్తులను ఆశీర్వదిస్తాడు . పాగల్ పాతు (వైకుంఠ ఏకాదశి మునుపటి రోజు) 10వ రోజున, నంపెరుమాళ్ అనే ఉత్సవంలో మోహిని రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడని నమ్ముతారు.*
*వైకుంఠ ఏకాదశి నాడు, తెల్లవారుజామున, నంపెరుమాళ్ లో, వజ్రాలు మరియు రత్నాల కవచాలను ధరించి, గర్భగుడి నుండి వైకుంఠ ద్వారం అయిన పరమపద వాసల్ అని పిలువబడే ఉత్తర ద్వారం గుండా వేయి స్తంభాల మందిరానికి తీసుకురాబడతారు . ఈ ద్వారం సంవత్సరానికి ఒకసారి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే తెరవబడుతుంది. ఎవరైతే పరమపద వాసంలో వెళతారో వారు వైకుంఠాన్ని పొందుతారని అంటారు. ఈ కారణంగా, దీనిని స్వర్గ వాసల్ అని కూడా పిలుస్తారు.*
*****
మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు అలా ఒక రోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు.
ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు.
హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలినుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.
అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.
తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు.
కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలునిదగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు.
“ఎవరు నువ్వు? ఈ వాన,చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు?” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువుననుసరించాడు.
గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు.
గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు.
ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.
కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి.
అసలు కారణం వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది?
తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు?
ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.
ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు.
ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి.
అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు.
ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలోనుండి అనంతుడిని గమనించసాగాడు.
ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు. కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు.
అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు.
వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.
అనంతుడు మందిరం మధ్యలో వున్న
శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..
"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు..
నాకు చదువురాదు.. పూజలు రావు..
స్తోత్రాలు రావు.... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నున్ని చేసుకోవాలని వచ్చాను. రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి
నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో..
"కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి...
"మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.
"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు.
బయటనుండి ఈ దృశ్యం చూసి… శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు.
తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భాగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...
జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు
భార్య ఇలా ప్రశ్నించిందినన్ను వదిలి వెళ్లారు పరవాలేదు కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు
భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా అనినిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లేదు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడుఅందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??
లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు,ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు
పెద్ద వయసేమి కాలేదు అందంగా ఉంది ఇంత రాజ్యము ఆవిడ సొంతమే తనకు నచ్చినట్టు ఉండొచ్చులే అని నిందలేసింది పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కానీ అతనికి ఏమని చెప్పి సముదాయించిందో ఎంత పోరాడిందో ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర
ఏది కఠినం ఏది కష్టం ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి....
***
*1. శ్రీమాతా*
-----------------
లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
ఈ లోకంలో ఏ ప్రాణి అయినాసరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా ! అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం. జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నింటిలోకి దుర్లభమైనది మానవజన్మ. ఎన్నో వేల జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవజన్మ వస్తుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలుంటాయి.
ఆహార నిద్రా మైధునాలు అన్నిటికీ సమానమే. కాని మానవులకు మనస్సు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు. అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. పాపపుణ్యాల యోచన ఉంటుంది. ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నోవేలసార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది. ఈ లోగా కొన్ని లక్షల సార్లు పుట్టటం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు. కాని తల్లిలేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతివారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు ? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా ? తాపత్రయాలు పొగొట్టగలుగుతుందా ?
తాపత్రయాలు మూడురకాలు అవి.
1. ఆధి భౌతికము : తనకన్న ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట.
2. ఆధి దైవికము : ప్రకృతి సిద్ధమైన వాటివలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదము, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి.
3. ఆధ్యాత్మికము : తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట. అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి.
బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ తల్లి అంటే ఎవరు ?
అమ్మల గన్నయమ్మ ముగు రమ్మల మూలపుటమ్మ తల్లులకే తల్లియైనటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది. ఆవిడే పరమేశ్వరి. జగన్మాత రాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి. దయాసముద్రురాలు. అందుకే అమ్మా ! అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి ? శ్రీ అనేది గౌరవ వాచకము. విశేషణము. గొప్పదయిన అని అర్ధం. శ్రీయనలక్ష్మి, శ్రీయనగారి, శ్రీయనసరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్ధం కాబట్టి ఈ ముగ్గురికీ మూలస్వరూపురాలయినది.
ఆమెయే సదాశివుని అర్థాంగి పరాశక్తి. దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరతారు.
అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు “తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మవా ? నీ తత్త్వాన్ని మాకు వివరించవలసింది” అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది. “నీటిలోని చల్లదానాన్ని నేనే. అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును, చంద్రునిలోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీలేదు. అంతదాకా ఎందుకు ? మీ ముగ్గురూ కూడా నేను లేకుండా ఏ పనీ చెయ్యలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు లోకాలను రక్షిస్తాడు. రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీలేదు. చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను” అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా ఏ పనీ జరగదు. అందుకే శంకరభగవత్సాదులవారు సౌందర్యలహరిలోని
మొదటి శ్లోకంలో
శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
నచేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి
అత స్త్వా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి ?
ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడగు శివుడు జగన్పిర్మాణశక్తివైన నీతో కూడిననే ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడౌతాడు. అలాకాకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. కాబట్టి హరిహర ట్రహ్మాదులచే పూజించుటకుగాని నీకు నమస్కరించటానికిగాని పూర్వపుణ్యము ఉండాలి కదా ?
అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారిచేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది.
మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీభాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ “ఉపాధి భేదంవల్ల రెండు విధాలయినట్లుగా, అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియాసమయంలో భిన్నంగా కనిపించినా పరమావస్థ యందు బ్రహ్మపదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టిసమయంలోగాని, లయసమయంలోగాని నాకు
స్త్రీపురుష నపుంసక బేధాలు లేవు.” అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు.
శ్రీ అంటే విషము. మాతి అంటే కంఠము నందుంచుకొనినది. గరళమును కంఠము నందుంచు కొన్నవాడు. గరళకంఠుడు అన్బప్పుడు పుంలింగము అవుతుంది. మాతా - తల్లి అనే అర్ధంలో స్త్రీలింగమవుతుంది.
ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికిముందు శ్రీ అనే గౌరవవాచకము ఉంచటం జరిగింది. మాత అనే శబ్దము త్రిపురసుందరినే తెలుపుతుంది. హ సక లర డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ మూడు మాత అని చెప్పబడతాయి. ఇక్కడ హసకలరడైం, హసకలరడీం, హసకలరడౌఃలో చివర అచ్చులు ఐ ఈ జౌ బాలామంత్రం ఐం క్లీం సౌః ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని
గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన వపంచస్తవాలలో ఒకటయిన “లఘుస్తవం”లోని 18వ శ్లోక వివరణలో చెప్పారు. ఆ శ్లోకం.
మాయా కుండలినీ క్రియా మధుమతీ కాళీ కలామాలినీ
మాతంగో విజయా జయా భగవతీ దేవీ శివా శాంభవీ
శక్తి శృంకరవల్లభా త్రినయనా వాగ్యాదినీ భైరవీ
ట్రీంకారీ త్రిపురా పరాపరమయీ మాతా కుమారీ త్యపి!॥
స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరివల్ల జన్మిస్తున్నాయో ఆవిడ మాత
ఎవ్వనిచే జనించుజగము ? ఎవ్వనిలోపల నుండు లీనమై ?
ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూలకారణంబెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానె అయినా వాడెవ్వడు ?
జగత్తులోని లోకాలన్నీ ఎవరియందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో, అంటే సృష్టిస్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర హితుడెవరో, సర్వమూ తానే అయిన వాడెవరో అతడే మాత. సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు, భోగభాగ్యాలే కాదు. శ్రీ రూపమయిన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది.
యోబ్రహ్మాణి విధాతిపూర్వం సృష్టికాలంలో బ్రహ్మదేవుడికి త్రయీవిద్యనుపదేశించింది. త్రయీవిద్య అంటే
వేదవిద్య. అవి బుగ్ యజుర్ సామవేదాలు. అంతేకాదు జీవికి ముూక్తిని ప్రసాదిస్తుంది.అందుకే శ్రీమాత అని పిలువబడుతోంది. ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృ జ్షేయము అనే మూడు ఉండాలి. అంటే 1. తెలుసుకొనేవాడు. £. తెలుసుకొను శక్తి 8. తెలుసుకొను విషయము. ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, థ్రిభుజానికి అధిదేవత, వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన బాలాత్రిపురసుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనే బిందు వుంటుంది. ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆదేవి
బిందుమండలవాసిని అని పిలవబడుతోంది. ఆవిడే శ్రీమాత, పరమేశ్వరి నిరాకార, నిర్లుణస్వరూప. ఆమెకు రూపంలేదు. కాని జగత్తంతా ఆమె స్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామజాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగు పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెబుతాను. “ నాలుగుదిక్కులూ ఆ పరబ్రహ్మ స్వరూపమే” అంటుంది. రెండవపాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ” భూమి, ఆకాశము, సముద్రాలు, నదులు,
పర్వతాలు అన్ని బ్రహ్మపదార్థంలోని అంతర్భాగాలే” అంటాడు.
మూడవపాదాన్ని ఒక హంస చెబుతూ “ అన్నీ పరబ్రహ్మలోని భాగాలే” అంటుంది.
నాల్లవపాదాన్ని ఒక నీటిపక్షి చెబుతూ “ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ” అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వరస్వరూపమే. అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు. 'జగత్తులోని
'అగ్న్ని సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు దేవీ భాగవతంలోని సప్తమస్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి, శుక్రవారం వేదసమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయింది. ఆ రూపం ఎలా ఉందంటే
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ ॥
విద్యుత్కోటిసమానాభ మరుణం తత్సరం మహః
నైవ చోర్ధ్వం న తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్ ॥
ఆద్యంతరహితం తత్తు న హస్తా ద్యంగ సంయుతమ్
నచ స్రీ రూప మథవా నపుంరూప మధోభయమ్ ॥
కొన్నివేల కోట్ల సూర్యులయొక్క కాంతులతో, కోట్లకొలది చంద్రుల చల్లదనముతో,
కొన్నికోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తళుక్కున మెరిసింది. అది కోటి పాగసాగగా అది అరుణారుణకాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవి ఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు అన్నిరూపులు నీ రూపమైనవాడ !
ఆది మధ్యాంతములు లేక అలరువాడ ! అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ. బిడ్డల కోరికలు తీర్చేది. వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే
దుర్వాసుడు తన “శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లో శ్రీమాత స్తిపురే ! పరాత్సరతరే దేవి ! త్రిలోకీ అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ పరమేశ్వరి సర్వులకు మాత లోకాలన్నింటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది.
ఈ నామంలో దేవి సృష్టి రూపిణి.
--000--
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 13/1
చిలిపి ప్రేమతో చిరుగాలి చంప నిమిరి
గుండె శబ్దము చెలికోరె గుర్తు గమన
నవ్వు పువ్వుల పిలుపుగా నరుని కలలు
రసమయం విశ్వ చరితమ్ము రవ్వ వెలుగు
ప్రేమలో ప్రేమతో ఘర్షనే, మదీయ
శాంతమే సౌఖ్యమే కోరు సమయ శక్తి
కోరికలసంద్రము తెలిసి పోరు జరుగు
జ్ఞానమే దారిగా గంగ పారు తీరు
కాంతి రావద్దనే రాత్రి స్పర్ధ వేద
రాత్రి రావద్దని కాంతి స్పర్ధ వేద
మంచి చెడ్డల స్వార్ధము మనసు వేద
లాభ నష్టాల స్వార్ధము లహరి వేద
రచన కుసుమాల తో నీడ రంగు తీరు
జ్ఞాన చక్షువులు కలసి జ్ఞాన వృద్ధి
జనుల మనసుబట్టి కలము జాగృతి గను
అక్షరాంజలి ప్రాంజలి ప్రభల వెలుగు
నరులు ఆశ్రమంలోబాల యవ్వనమ్ము
వృద్ధ సేవ తత్పర బోధ కృషియు సల్పు
వారి హృత్కమలము నీదు వ్యాధి భక్తి
మనసు నీయందు శంకరా మార్గ మదియె
మానవం, దేవతం, కొండ, మన్యమేను,
మృగము గాగాని,దోమగా,ముఖ్య మగుట
పశువుగా,అరణ్యము, పక్షి, ప్రాణ పలుకు
చరణ కమల ధ్యానము శివా చరిత మనసు
****
భాగవతము
ఓం శ్రీగురుభ్యోనమః
భగవంతుడే మనయందు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా దిగివచ్చి ఉన్నాడు. దానిని 'హంసధ్వని' అంటారు. అక్కడ 'సోహం' శబ్దము వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దము ఆధారంగా ఆ భావనలో లీనమై ఉంటే 'అతడే నేను' అను భావన స్థిరపడుతుంది.
అపుడు దైవమే మన యందు ఆవేశించి తనను తాను ప్రకటించుకుంటాడు. తానుగా అతడే ఉన్నాడని తెలుస్తుంది. ఎప్పుడూ స్పందనగా పనిచేస్తున్నటువంటి దైవముతో సూటిగా ముడిపడడము భాగవత మార్గము. హంస స్వరూపుడైన భగవంతునితో తాను యోగము చెంది, అతడే తానుగా నుండు స్థితి కలిగినటువంటి వానిద్వారా భాగవత కథలు రసవత్తరంగా బయటకు వస్తాయి.
విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు* 📍
శ్రీకృష్ణుడి అంత్యక్రియలు:
రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి.
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా.
ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం.
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి.
వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
ఎక్కడో ద్వారక.
దానికి చాలా దూరంలో తపోవనం.
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు.
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు.
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు.
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి (ఇప్పటి కరోనాలాగనే అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది--అది వేరే కథ..ఆ కథంతా ఇక్కడ చెప్పట్లేదు).
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.
అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.
అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక. 🙏
--(())--
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻
తన ఆవశ్యకములకై ఇతరులపై ఎట్లును ఆధారపడక తప్పదు. అది తప్పనిసరిగా గాక, తోటి వారి యెడల తమ వృత్తికర్మను నిండయిన ప్రేమతో నిర్వర్తించినచో తన అవసరములవియే తీరుటయే గాక, అతిలోకమయిన ఆనందము నిలుచును.
ప్రేమ విస్తారమగు కొలది, ఆనందము అఖండమగును. ఆ రుచి యందు, దారాపుత్రాదుల యెడ ప్రత్యేక మమకారము తెలియకుండును.
తనను ఎంత ప్రేమగా తాను ఆదరించునో, అట్టి ప్రేమ ఒరుల యెడ చూపి వర్తించుటే ధర్మము. ధర్మాచరణలో నిలిచే ఆనందమే మోక్షము. అనుషంగికముగ లభించు నట్టివే అర్థకామములు.
మోక్షము ఎప్పుడో కలిగే స్థితి కాదు. లోకములోని జీవులతో తనకు తాదాత్మ్యము ఏర్పడి, తనను తాను మరచేంతగా ఎదలో ప్రేమ నిండుతుందో, ఆ క్షణమే పూర్వకర్మల అలవాటుల వలన ఏర్పడిన కామ క్రోధాదులు, సుఖదుఃఖాది బంధములు తొలగును.
తేలినదేమంటే ప్రేమయే మోక్షము. ఇట్టి అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును.
కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి.
మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించుకుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.
చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా...... ?
*************
శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.
ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వేలుతూవుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.స్వామి వారు ఈ సమయంలో ఒక చిక్కుపరిస్థితిలో పడతారు.
అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం.తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా ముందుకి వేళ్ళను.
తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది.అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.
అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.
3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది.
ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందువేళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూవుంటుంది.ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.
గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువువుండి క్రమంగా పెంచుకుంటూ పోయే సరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు.
ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది. మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.
ఆదిశేషుడు - తన కంకణంగా
కర్కోటకుడు - తాను ధరించే పూలదండగా
పద్మనాభుడు - తన కుడిచెవి ఆభరణంగా
మహా పద్ముడు - ఎడమచేతి ఆభరణంగా
శంఖపాలుడు - తన కిరీటం ఆభరణంగా
గుళికుడు - కుడి చేయి గాజులాగా
తక్షకుడు - వడ్డాణంగా
వాసుకి - జంధ్యంగా
ఇక 9వ సర్పం ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.
* ఎలా వెళ్ళాలి?
హైదరాబాద్ నుండి కావలి, నెల్లూరు, మహాబలిపురం, చెన్నై మీదుగా నాచ్చియార్ కోయిల్ చూడవచ్చును. మధ్యలో మహాబలిపురం కూడా దర్శించుకోవచ్చును. కారులో 15గంల టైం పడుతుంది.
హైదరాబాద్ నుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గం ల సమయం పడుతుంది.
***
శ్రీ ఆదిశంకరాచార్య విరచితము శ్రీ శివ మానస పూజా స్తోత్రం!
1) రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం ఛ దివ్యామ్బరం నానా రత్న విభూషితం మృగమదా మోదాన్కితం| చందనం జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ, ధూపం తథా దీపం దేవ! దయానిధే! పశుపతే!హృత్కల్పితం గృహ్యాతాం ||
ఈశ్వరా ! రత్నములతో కూడిన అమర్చిన సింహాసనం అమర్చాను, వచ్చి కూచో! చక్కని, చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను,దాన్నీ స్వీకరించు. దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను ,దాన్నీ స్వీకరించు. మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు, కస్తూరి, చందనం ... వీటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను! జాజి, సంపెంగలతో పాటుగా నీకు అమిత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను సమర్పిస్తున్నాను ! సువాసన గల అగరు ధూపాలను స్వీకరించు స్వామీ! దీపం కూడా వెలిగించాను. ఇదంతా హృత్కల్పితం, అంటే, “మనసులో నేను కల్పించుకొన్నది. ” నేను మానస పూజను మాత్రమే చేయగలను, ప్రత్యక్షంగా పైన చెప్పినవన్నీ సమకూర్చి నీకు పూజచేయలేను!స్వామీ! కరుణా సింధూ!! దయతో నా ఈ పూజని గ్రహింఛి నన్ను కనికరించు!
2) సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే, ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం, పయోదధియుతం, రంభాఫలం, పానకం| శాకానామయుతం, జలం, రుచికరం, కర్పూర ఖండోజ్జ్వలం తాంబూలం మనసా మయా విరచితం, భక్త్యా ప్రభో స్వీకురు ||
గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో అయిదు రకాల ఉపచారా లున్నాయి .అవి కూడా చేసినట్లే భావించు స్వామీ! తదుపరి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను ,అదీ స్వీకరించి నన్ను కరుణించు దేవా! మణులు పొదిగిన బంగారు గిన్నెలో నెయ్యి, పాయసం, పంచభక్ష్యములూ (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) ఎన్నో కూరలూ , అమర్చాను. పాలు, పెరుగూ, అరటి పండూ, మధ్య మధ్య రుచికరమైన పానకమూ, అన్నిటినీ ఆరగించు స్వామీ! మంచి నీటిని తాగు. కర్పూరముంచిన తాంబూలాన్ని మనసుతో చేసాను , స్వీకరించు దేవా! (ఇది కూడా హృత్కల్పితమే, మనసులో అనుకుంటున్న పూజే,ప్రత్యక్ష పూజ కాదు)
3) ఛత్రం చామర యోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా | సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||
భుక్తాయాసంగా ఉందేమో, భోజనానంతరం కాసేపు విశ్రాంతిని తీసుకో స్వామీ! ఎండ తగలకుండా ఛత్రం(గొడుగు) పడతాను! మధ్య మధ్య చామరం(విసనకర్ర లాంటిది,చెమట పోయకుండా --గాలి వీయటానికి వాడుతారు) వీస్తాను, లీలా విహారంలో అందం చెడకుండా అద్దం కూడా చూసుకోవటానికి అమర్చాను! నీ మనసును రంజింప చేయటానికి వీణావాదన వినిపిస్తున్నాను!దానికి ధీటుగా భేరీ నినాదాలూ, మృదంగ తాళాలు , గానమూ నాట్యమూ నీ కోసమే అమర్చాను! నిజానికి ఈ కళలన్నిటికీ నీవే అధిపతివి!నీవి నీకే సమర్పిస్తున్నాను!! అన్ని కళారూపాలు నీకు సర్వ సమర్పణం చేస్తూ నాకు తెలిసిన కళారూపాలతో చేసే ఈశ్వరార్చన ఇదే! సాష్టాంగదండప్రణామం చేస్తున్నాను మనసులో. (ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)
4) ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోప భోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||
నేను నీకు బాహ్యపూజలు చేయలేని అజ్ఞానిని,పేదవాడిని . నీవే నా ఆత్మ! నా బుద్ధి పార్వతీ దేవి! నా విషయ వాంఛలు, నా అనుభూతులూ నీకు ప్రేమతో చేసే పూజలనుకో!నేను ఆదమరచి నిదురించినప్పుడు కూడా, నీ ధ్యాన నిష్టలో సమాధి స్థితిలోనే ఉన్నాననుకో !నా వృధా పరుగులాటలు, నీకు చేసే ప్రదక్షిణలుగా, నా పిచ్చిప్రేలాపనలు నీ స్తోత్రరత్నాలుగా, నా కర్మఫలితాలన్నీ నీ సేవగా భావించి నన్ను కృతార్ధుడిని చేయి స్వామీ!(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)
5) కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |విహితమవిహితం వా సర్వమేతత్- క్షమస్వజయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే నీ కరుణ కూడా అంతే ! సముద్రం పదే పదే అలలతో ఎలా నన్ను తాకుతుంటుందో , అదే విధంగా నీ కరుణ కూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది. నా కరచరణాదికములతో, వాక్కుతో, దృక్ శ్రవణేంద్రియములతో, మనస్సులో, తెలిసీ తెలియక చేసిన మహాపరాధాలనన్నింటినీ, పెద్ద మనసుతో క్షమించమని కరుణాసముద్రుడవైన నిన్ను వేడుకుంటున్నాను.(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)
***
[22/12, 4:32 pm] Malapragadasridevi: 🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 40 🌹
ఆధ్యాయము : ఆత్మలోకం
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. స్వర్గం, నరకం ఉన్నాయా? 🌴
A:-- మనం వెలుగునుండి దూరంగా వెళ్ళినప్పుడు మన స్పందనలతో ఒక వ్యతిరేక ప్రదేశం ఏర్పడింది.
మన స్పందనలను బట్టి మనం 7 ఆవరణలను సృష్టించుకున్నాము.
తక్కువ స్పందనలు అనగా చెడు ఆలోచనలు, చెడు మాటలు, ద్వారా తక్కువ frequency ఉన్న లోకాలు ఏర్పడ్డాయి. వీటిని నరకం లేదా నిమ్న ఆవరణ అంటారు.
ఎక్కువ స్పందనలతో ఎక్కువ frequency ఉన్న ఉన్నత లోకాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా 7 ఆవరణలు మనమే సృష్టించుకున్నాము.
ఒక ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తి నిమ్న ఆవరణ లేదా నరకానికి వెళ్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఉన్నత ఆవరణకు చేరతాడు.
1 నుండి 3 ఆవరణలు నిమ్న ఆవరణగా పరిగణించబడింది. 4 నుండి 7 దాకా ఉన్నత ఆవరణలుగా పరిగణించబడింది.
ఈ విధంగా 7 ఆవరణలు, 7 విశ్వాలు సృష్టించబడ్డాయి. ప్రతి ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని ఒక్కో విశ్వానికి పయనమవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹
------------ మోచెర్ల వెంకన్నకవి -------------
మోచెర్లవారు నియోగి బ్రాహ్మణులు. వీరి నివాసము నెల్లూరుమండలము 'తెట్టు' అను గ్రామము. వెంకన్నకు దత్తప్ప యను సోదరుడు కలడు. ఇద్దరూ ఆశుకవనమున గట్టివారు. వెంకన్న కవిత్వముతో బాటు గడుసుదనము గలవాడు.
ఒకనాడు ఒక బ్రాహ్మణుడు, అభ్యాగతుడుగా వీరి యింటికి వచ్చి, భోజనము చేసి,
ప్రస్తావవశమున తన స్థితిని యిలా చెప్పుకున్నాడు. అయ్యా! నేను గోదావరీ తీరవాసిని,
వ్యాకరణశాస్త్రమును సమగ్రముగా కాశీలో అభ్యసించినాను. సంచారము చేయుచూ
ఈ ప్రాంతానికి వచ్చి, వేంకటగిరి రాజును దర్శింపబోగా ఆయనగారు తెనుగులో పద్యములు చెప్పగలవా? యని ప్రశ్నించారు. అప్పుడు నేను రాజా!నేను సంస్కృత పండితుడను. శ్లోకములు చెప్పగలను కానీ తెలుగు పద్యములు చెప్పలేను అని
అన్నాను. అప్పుడు ఆ ప్రభువు తన సభలోని కవులతో ' తెనుగెరుగడు సంస్కృతంపు తెన్నేమెరుగున్ 'అని ఎగతాళి చేసి నన్ను నిరసించాడు.
ఆ అవమానము తో ఖిన్నుడనై తిరిగి వెళ్ళిపోతూ ఎండకు తాళలేక మీ యింటికి అభ్యాగతుడనై వచ్చినాను. ఈ
కాలమున సంస్కృత కవుల గతి యిట్లున్నది చూడండి. అని బాధపడడ్డాడు.
ఈ సంగతి విని వెంకన్నకు ప్రభువుపైన కోపము వచ్చింది. వెంటనే ప్రయాణము కట్టి
పదండి స్వామీ మీకారాజు చేతనే సన్మానము చేయించెదను అని అతన్ని తోడ్కొని
వేంకటగిరి ప్రభువు ఆస్థానమునకు పోయి తెలుగు కవులు వచ్చినారని కబురు పంపించెను. రాజు వారిని ఆహ్వానించి 'మీదే యూరండీ? అని అడిగెను. అప్పుడు
వెంకన్న మాది 'తెట్టు'గ్రామము ప్రభూ అని చెప్పెను. రాజు ఎగతాళిగా 'తెట్టెనా?' అన్నాడు. వెంకన్నకు ఆ ఎగతాళికి ఒళ్ళు మండింది. మహారాజా! 'తెట్టు ' మహా పట్టణము
గాకపోయిన నేమి?అంత చులకనగా చూడదగినది కాదు. అని హెచ్చరించి
తెట్టు కుమార కృష్ణ జగతీవర నందన, రాజ్యలక్ష్మికి౦
బట్టు; ధరాంగనామణికి బాపటబొట్టు; రిపు రగాళి వా
కట్టు; సముజ్వల ద్దృతికి గట్టు; బుధాళికి వేల్పుజెట్టు వా
గ్డిట్టల కునికి పటును మదీయ నివాసము యాచభూపతీ!
మా తెట్టు కృష్ణకుమారుడను రాజు యొక్క రాజ్యమునకు పట్టు కొమ్మ, భూదేవికి పాపిటబొట్టులాంటిది,శత్రువుల ఆటలు కట్టేది, చాలామంది పండితులకు అది గట్టు వంటిది,పండితులకు కల్పవృక్షము, కవిత్వములో దిట్టలైనవారికి ఉనికిపట్టు నా నివాసమైన తెట్టు యాచభూపతీ!
అని అంత్యానుప్రాస నియమముతో,అత్యాశువుగా పద్యము చెప్పెను.
అప్పుడు రాజు ఆశ్చర్యానందములతో అయ్యా! తమపేరేమి? అని అడిగెను.
వెనువెంటనే వెంకన్న
నా పేరు వెంక నందురు
భూపాల మకుట నీలపుంజ మిళి౦దో
ద్దీపిత పాదాంబుజ! కరు
ణాపర ! వెలుగోటి యాచనరేంద్రా!
అని పద్యముతోనే బదులు చెప్పెను.
అప్పుడు రాజు కవిరాజా! గంట కెన్ని పద్యములు చెప్పగలరు? అని అడిగెను అప్పుడు వెంకన్న ఊరక పద్యములు చెప్పుట కాదు ఆశువుగా సమస్యలనే పూరింపగలను, కావలెనన్నచో పరీక్షింపుడని పలికెను. అప్పుడు జరిగిన పరీక్షలో వెంకన్న పూరించిన పద్యములు.
తెట్టు గ్రామవాసి వెంకన్న కు యాచమరాజు యిచ్చిన సమస్యలు, పూరణలు.
సమస్య :-- "కప్పకు సంపంగి నూనె కావలె వింటే" పూరణ
ఇప్పుర మేలెడు పార్థివు
డిప్పుడు నీ తావు కనిచె నిదిగో యార్యా!
తెప్పున నంగడి తలుపులు
కప్పకు; సంపంగి నూనె కావలె వింటే
ఈ పట్టాణాన్ని యేలే రాజు నీ అంగడికి సంపంగి నూనె కోసం
సేవకుడిని పంపించాడు.కనుక త్వరగా
అంగడి తలుపులు మూసి వేయవద్దు.
సమస్య:- "మార్తాన్డుండ పరాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్" పూరణ
కీర్తింపందగు రామ సాయక మహాగ్ని జ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణు గాంచి నారదుడు దేవాధ్యక్షుని తో బల్కె న
ట్లార్తిన్ జెందమిమున్ జయించు గద మున్నత్యుగ్రు డై దైత్య రా
ణ్మార్తాండుం డపరాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.
కీర్తింప దగిన రామబాణము మహాగ్ని జ్వాలలతో ఆ దైత్యరాజును దహించుట జూచి నారదుడు దేవేంద్రుడితో, పూర్వము నిన్నుఓడించిన రాక్షస రాజసూర్యుడు మధ్యాహ్న సమయములో అస్తమించినాడు.
తెట్టు గ్రామవాసి వెంకన్న పూరణలు.సమస్య :-"గుర్రానికి నైదు కాళ్ళు కోడికి వలెనే"
మఱ్ఱాకు బాన్పుగా గొని
బొఱ్ఱను బ్రహ్మాండ పంక్తి బూనిన ముద్డుం
గుఱ్ఱడ! విను,వన్నెలు గుహు
గుఱ్ఱానికి నైదు; కాళ్ళు కోడికి వలెనె
తా:--మఱ్ఱి ఆకు పాన్పుగా చేసుకొని,కడుపులో బ్రహ్మాండ మంతయు
పెట్టుకున్న ముద్దు కృష్ణా! (గుహుడు అంటే కుమారస్వామి)కుమారస్వామి వాహనమైన నెమలికి రంగులు ఐదు,కాళ్ళు కోడికి లాగే రెండు వుంటాయి.
ఇంక ఆయన సమస్య యివ్వటము,వెంకన్న పూరించటము అలాగ చాలా సేపు కొనసాగింది. ఒకే సమస్యను రామాయణ,భారత,భాగవత పరంగా చెప్పమన్నపద్యాలు.
"నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్నునిన్నునున్"
రామాయణార్థము వచ్చునట్లు పూరణ:--
అనిలజ!,జాంబవంత! కమలాప్త తనూభవ!వాయుపుత్రః యో
పనసః సుషేణః నీలః నలః భానుకులుండగు రాఘవేంద్రు డ
ద్దనుజ పురంబు వే గెలువ దైత్యుల జంపగ వేగ రమ్మనెన్
నిని నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
తా:-వానరులందరి పేర్లూ చెప్పి అందరినీ లంకాపురమునకు రాక్షసులను చంపుటకు యుద్ధానికి రాముడు నిన్నునిన్ను మరి నిన్ను అని అందర్నీ రమ్మన్నాడని కబురు పంపాడు.
ఇదే సమస్య భారతార్థము వచ్చేట్టుగా పూరించ మన్నాడు.
అనఘ సురాపగాతనయ!యర్కతనూజః విచిత్రవీర్యనం
దనః గురుపుత్రః ద్రోణః కృపః నాగపురీశ్వరః దుస్ససేనః ర
మ్మనుమనె రాజసూయము యమాత్మజు డిప్పుడు చేయబూని తా
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్నునిన్నునున్
, తా:-- గంగా పుత్రుడైన భీష్మాచార్యుని, కర్ణుని, ధృతరాష్ట్రుని, ఆశ్వత్థామను,ద్రోణుడిని
కృపాచార్యుని,శకునిని, దుశ్శాసనుని, ధర్మరాజు (యముని పుత్రుడు)రాజసూయ
యాగమునకు రమ్మని నిన్ను నిన్ను అలాగ అందరినీ రమ్మని ఆహ్వానించినాడు.
భాగవత పరంగా చెప్పమన్నాడు.
అనఘ సురేశ! వాయుసఖ,అర్యమ నందన రాక్షసేంద్ర యో
వననిధినాథ,గంధవహ,వైశ్రవణా, నిటలాక్ష తాను ర
మ్మనుమని చెప్పె మాధవుడు మారుని పెండ్లికి మిమ్మునందరిన్
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
ఓ ఇంద్రా!అగ్ని,యమధర్మరాజు,నిర్రుతి (రాక్షసేంద్ర =నైరుతిదిక్కునకు అధిపతి) వరుణ,వాయువు,కుబేరుడు,ఈశ్వరుడు (వీరందరూ అష్టదిక్పాలకులు)వీరినందరినీ
మన్మథుని పెండ్లికి రమ్మని నిను నిను, నిన్ను నిన్ను అని పేరుపేరునా పిలిచినాడు.
---------- శుభరాత్రి --------
No comments:
Post a Comment