Sunday, 24 December 2023

 


****

ప్రతిఫలం

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. 

మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. "బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?" అన్నాడు మిత్రుడు. "నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి" అని సమాధానం చెప్పాడు వ్యాపారి. 

ఇంతలో ఒక గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. 

కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. 

ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో "రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది

హృదయ మాలిన్యం
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
 సృష్టిలో  వివేకం ఉన్న జీవియైన  మానవుడు హృదయ స్పందన, మేధస్సుల కలయికతో  శ్రేష్ఠుడై విరాజిల్లుతున్నాడు.   జీవిత పయనంలో ఎదురయ్యే శుభకరమైన, సుఖప్రదమైన రెండు మార్గాలలో  ఆధ్యాత్మిక మార్గాన్ని బుద్ధిమంతులు ఎంచుకుని తరిస్తుండగా, క్షణిక సుఖాల కోసం వెంపర్లాడతారు బుద్ధిహీనులు.  

‘నీటిలో చరించే చేపని కడిగినా వాసన దూరం కానట్టే,     సుగంధాలు పులుముకుని, జలస్నానాలతో దేహాన్ని శుద్ధి చేసినా  మనసులోని మాలిన్యాన్ని మానవులు  తొలగించుకోరని’   కబీరుదాసు  బోధించినట్టే ప్రవర్తిస్తున్న మానవులు లోకంలో దర్శనమిస్తారు.
 
 ‘మోక్షసాధనకు మార్గం తెలుపమని ’  వశిష్ఠుడిని   శ్రీరాముడు  ప్రశ్నించగా  ‘మనసును నిర్మలంగా ఉంచుకోవడమేనని’  బదులిచ్చినట్టు యోగవాశిష్టం తెలిపింది.   ‘మనసులోని అంధకారాన్ని తొలగించుకొని వెలుగును నింపుకోగలిగితే  దైవాన్ని దర్శించుకోగలరని’  రమణ మహర్షి బోధించినట్టే హృదయ  మాలిన్యం  కలిగిన గృహస్థులో  పరివర్తన కలిగించాడు   బుద్ధుడు.  

ఒక గృహస్థు ఇంటికి భిక్ష  కోసం వెళ్లేవాడు బుద్ధుడు. ఉపదేశ దీక్ష ప్రసాదించమని కోరేవాడు  గృహస్థు .    మౌనంగా భిక్ష తీసుకొని వెళ్ళిపోయేవాడు  బుద్ధుడు.    బుద్ధుడు వెళ్లిన ప్రతిసారీ దీక్ష అడిగేవాడు గృహస్థు.
గృహస్థు  ప్రవర్తనకు  విసిగిపోయిన బుద్ధుడు  ఒక రోజు భిక్షా పాత్రలో కొంత మట్టిని  నింపి  భిక్షను అభ్యర్ధించాడు.  
‘మలినమైన  పాత్రలో భిక్ష వెయ్యలేనని”  చెప్పాడు  గృహస్థు.   ‘తనకు అభ్యంతరం లేదని, భిక్ష వెయ్యమని’ బుద్ధుడు కోరినప్పటికీ ‘మలినమైన  పాత్రలోని భిక్ష అపరిశుభ్రం అవుతుందని, ప్రయోజనం లేదని ’  తిరస్కరించాడు గృహస్థు .  
 
   బుద్ధుడు చిరునవ్వుతో  ‘మీరడుగుతున్న దీక్షకు ఇదే నా సమాధానం.  జ్ఞానబోధ చేయమంటున్న హృదయం కూడా  పాత్రవలె మలినమై  ఉంది.  విషయవాంఛలు,  సుఖాలపై వ్యామోహం,  కోరికలు, భోగాలపై ఆసక్తితో నిండి ఉంది.  అలాంటి  హృదయంలో దీక్షాభిక్ష వెయ్యలేనని”  బుద్ధుడు చెప్పగానే   తప్పు తెలుసుకున్నాడు గృహస్థు .

   ‘అద్దం మీద ధూళి ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనబడనట్లే,  హృదయంలో భౌతిక ఆకర్షణల పట్ల వ్యామోహం  ఉంటే  భగవంతుని  దర్శించలేమని’   బుద్ధుడు బోధించాడు.

  ‘  భగద్భక్తికి  శరీరం శుచిగా ఉంటే సరిపోదని,  మానసిక మాలిన్యం ఉంటే భగవద్భక్తి  అంటదని, నిర్మలమైన అలోచనలకు చోటివ్వమని”   ఆత్మ పరిశుభ్రతను ప్రబోధించాడు గాంధీ మహాత్ముడు.

“మనసులో  మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు కలుగుతాయని, సదాలోచనల  ఫలితంగా సత్కర్మలు ఆచరిస్తూ మానవుడు   దైవత్వానికి చేరువవుతాడని,  దైవానుగ్రహాన్ని పొందుతాడని”  భగవద్గీత బోధించినట్టు ఆచరించినప్పుడే మానవులు  ప్రయోజనం పొందగలరు

.___(())___



సమాజాన్ని, నిత్యం ఎదురయ్యే అనుభవాలను మనిషి దర్శించే విధానమే దృక్పథం. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి ఆనకట్ట మీదుగా రైలు ప్రయాణిస్తోంది. ఓ మహిళ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమల్ని భక్తితో- పవిత్రమైన ఆ నీళ్ళలోకి జారవిడిచింది. పక్కనే కూర్చున్న యువకుడికి ఆమె చర్య హాస్యాస్పదంగా అనిపించింది. అతడు అల్పాహారం తిన్న తరవాత పొట్లం కట్టిన కాగితాన్ని నలిపి అదే నీళ్ళలోకి విసిరేశాడు. ఆ చర్యలు సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో వాళ్ళ దృక్పథాన్ని తెలియజేస్తాయి.
జరిగే సంఘటనలను సామాన్యులు యథాతథంగా గ్రహిస్తారు. సత్పురుషుల వ్యక్తిత్వం అందుకు విభిన్నం. శ్రీరాముడు అనేక సందర్భాల్లో సంఘటన అంతర్లీనతను గ్రహించి ఉత్తమ దృక్పథాన్ని ప్రదర్శించడం గమనించవచ్చు.
సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యాలకెళ్ళాడు. భరతుడికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. పితృ సంస్కారాలను భారంగా పూర్తిచేశాడు. అన్న లేని అయోధ్యలో ఇక ఏమాత్రం ఉండలేక, ఆయనను అయోధ్యకు తీసుకువస్తానంటూ బయలుదేరాడు. సైన్యం, ప్రజలు భరతుడితో కలిసి ముందుకు నడిచారు. కొంత ప్రయాణం తరవాత వారు గుహుడి నివాసాన్ని సమీపించారు. భరతుడు సైన్య సమేతుడై రావడాన్ని గుహుడు దూరంనుంచే చూశాడు. రాముడికేదైనా    అపకారం చెయ్యబోతున్నాడేమో అని అతడి మనసు కీడును శంకించింది. భరతుణ్ని సమీపించి తన అనుమానాన్ని వ్యక్తపరచాడు.
గుహుడి మాటలు భరతుణ్ని తీవ్రంగా బాధించాయి. తనకు తండ్రిలాంటి వాడైన శ్రీరాముడిని అరణ్యం నుంచి అయోధ్యకు తీసుకెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. అతడి మాటలు విని గుహుడు సంతోషించాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిన మార్గాన్ని చూపించాడు. భరతుడు గుహుణ్ని కలుపుకొని ముందుకు సాగిపోయాడు.
కొంత ప్రయాణం తరవాత భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆ రుషి భరతుడికి అతడి పరివారానికి మంచి ఆతిథ్యం అందించాడు. కుశలప్రశ్నలడిగిన పిమ్మట భరద్వాజుడు అతడి రాకలోని ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూ రామలక్ష్మణులకేదైనా అన్యాయం తలబెట్టబోతున్నావా అంటూ నిర్భయంగా, నిర్మొహమాటంగా అడిగాడు. ఆ ప్రశ్న వినడంతోనే భరతుడు దుఃఖితుడయ్యాడు. మహర్షిని సమీపించి తనకే పాపం తెలియదని విన్నవించుకున్నాడు. భరతుడి నిజాయతీని అర్థం చేసుకున్న భరద్వాజుడు అతన్ని… ఓదార్చాడు. రాముడి ఔన్నత్యాన్ని మరోమారు   భరతుడికి తెలియజెప్పాడు. రామలక్ష్మణుల్ని చేరుకోవడానికి దారిని చూపించాడు.
మరికొంత దూరం ప్రయాణం చేసిన భరతుడు సీతారామలక్ష్మణులు నివసిస్తున్న చిత్రకూట పర్వతాన్ని సమీపించాడు. భరతుడు సపరివారంగా రావడంవల్ల ఆ ప్రాంతమంతా ధూళి వ్యాపించింది. లక్ష్మణుడు అందుకు కారణాన్ని అన్వేషిస్తూ చెట్టు పైకెక్కి చూశాడు. భరతుడు సైన్యసమేతుడై రావడం కనిపించింది. భరతుడి రాక లక్ష్మణుడికి అపోహను కలిగించింది. పరుషోక్తులతో భరతుణ్ని నిందించడం ప్రారంభించాడు.
శ్రీరాముడు ఆ సందర్భంలో భరతుడి పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాడు. లక్ష్మణుడిని వారిస్తూ భరతుడి రాక సమయోచితంగా ఉందంటూ కొనియాడాడు. అతడు వచ్చిన పిమ్మట పరుష వచనాలను ఉపయోగించ వద్దని ఆ విధంగా మాట్లాడితే అది తనను గురించి మాట్లాడినట్లే కాగలదని అన్నాడు. రాజ్యం కోసం ఆశతో ఈ విధంగా భరతుణ్ని నిందిస్తున్నావన్న భావన తనకు కలగగలదని చెప్పాడు.
ఈ విధంగా గుహుడు, భరద్వాజుడు, లక్ష్మణుడు వంటివారు శంకించిన భరతుడి వ్యక్తిత్వాన్ని శ్రీరాముడు తన దృక్పథంతో సరైన కోణంలో దర్శించాడు. అన్నదమ్ముల బంధాన్ని కలకాలం నిలుపుకోగలిగాడు.
మనందరం నకారాత్మకతను విడిచిపెట్టాలి. తోటి మనుషులపట్ల, జరిగే సంఘటనల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. జీవితాన్ని ఆదర్శమయంగా తీర్చిదిద్దుకోవాలి.
ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి.        ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నెలవంక లాగా అందంగా కనిపిస్తారు. కాగితం   నలిపేటపుడు   చెత్తగా   చూస్తాం.   డబ్బయినపుడు   దేవుడిగా   చూస్తాం.        మనమూ  కాగితమే, చెత్తవడం దేవుడవడం మన  స్థాయిని బట్టే ఉంటుంది

*🌹. మనలో సంతోషము ఎందుకు మాయమవుతుంది? 🌹*

*భగవంతుని స్తృతి అనగా యోగము వలన సంతోషము కలుగునట్లు మనం చేసిన పొరపాట్ల వలన సంతోషం మాయమవుతుంది.*

*ఎప్పుడైనా పనికిరాని ఆలోచనలు మనసులోకి వస్తే వెంటనే వాటిని పెద్దల ముందుగానీ, సర్వశక్తిమంతుడైన శివ పరమాత్మ ముందుగానీ ఉంచి వారి నుండి అవసరమైన సూచనలు పొంది మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని హృదయ భారాన్ని తగ్గించుకోవాలి.*

*గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే, గడిచిన దాని గురించే ఆలోచిస్తూ, బాధ పడుతూ, దురదృష్టవశాత్తూ నేను ఇలా చేసాను. నా ఆధ్యాత్మిక స్థితి బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు.*

*గడిచిన దాని గురించి ఒక గుణపాఠం నేర్చుకుని, ఇక మీదట మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అపచారం చేసాను అన్న మనోభారంలో నిరంతరం ఉండుట వలననే మన సహజత్వాన్ని కోల్పోతుంటాము.*

*ఒక లోటును సరిదిద్దుకోవడానికి దాని గురించే ఆలోచించడం కాకుండా స్వయం యొక్క ఉన్నత స్థితి గురించిన ఆలోచన అవసరం. బుద్ధిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటూ, కలవరంలో కొట్టుకుపోకుండా , ఏ వికారీ ఆలోచన ఆటంకంగా రాకుండా చూసుకోవాలి.*

*ఇటువంటి అనిశ్చితమైన సంఘటనల నుండి జాగ్రత్తగా ఉండాలంటే దివ్య స్పృతి అనే జ్యోతికి ఎప్పుడూ దివ్య జ్ఞానము అనే నూనెను అందిస్తూ ఉండాలి.*
🌹 🌹 🌹 🌹 🌹

***

రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం..!*

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైంది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు.

“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”

మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించే వారు అప్పటి కాలంలో… భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనేలేదు.

దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధం ఉంది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు. మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు. అందుకే తొలుతగా కుజ దోషం ఉన్నదా లేదా అని చూస్తారు .ప్రతి స్త్రీ జీవితంలో పైన చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే అని భావన

......

------  మొదటిసారి భోజుని ఆస్థానానికి కాళిదాసు రాక  --------------

మొదటిసారి కాళిదాసు భోజరాజు ఆస్థానం లో ప్రవేశించినప్పుడు రాజు కొలువులో లేడు.మిగతా కవి,పండితులు కూర్చుని వున్నారు.

కాళిదాసు రాజసభలోకి ప్రవేశించాడు.ధగధగ లాడే మణి కుండలాలు ధరించి,తళ తళ

మెరిసే దివ్య వస్త్రాల తోరాజపుత్రుడిలా వున్నాడు.కస్తూరి సువాసనలు విరజిమ్ముతూ,పూలమాలలు ఆభరణాలు గా ధరించి,మూర్తీభవించిన కవిత్వం లాగ,శృంగార రసప్రవాహం లాగ,దివినుండి భువి దిగి వచ్చిన దేవేంద్రుడిలా వున్నాడు.

సభికులందరూ ఆయన తేజస్సు చూచి అచ్చెరువొంది ఆయనెవరో తెలియకుండానే లేచి నిలబడి అభివాదం చేశారు.ఆయన ప్రతి నమస్కారం చేసి ఆసీనుడయ్యాడు.

అంతలో భోజరాజు వచ్చాడు.వస్తూనే కొత్తవ్యక్తిని చూసి తమ పేరేమిటి కవీశ్వరా?

అని అడిగాడు.కాళిదాసు రాజు చేతిని తన చేతి లోకి తీసుకొని ఆయన అరచేతిలో 'కాళిదాసు' అని వ్రాశాడు.అది చదివి రాజు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.

ఘనంగా సత్కరించాడు.

కవీశ్వరా! సాయంకాలమైంది సంధ్యావర్ణనం వినిపించండి. అని కోరాడు.

కాళిదాసు నాలుగు చక్కటి ఉపమలతో ఓ చక్కటి శ్లోకం చెప్పాడు.

వ్యసనిన ఇవ విద్యా క్షీయతే పంకజశ్రీ:

గుణిన ఇవ విదేశే దైన్య మాయాంతి భృ౦గా:

కు నృపతి రివలోకం పీడయత్యంధ కారో

ధన మివ కృపణస్య వ్యర్థ తామేతి చక్షు:

తా:--వ్యసనపరుడి విద్యలాగా తామరల కాంతి దిగజారిపొతున్నది.(సాయంకాలం తామరలు ముడుచుకుంటాయి.)తుమ్మెదలు పరదేశంచేరిన గుణవంతునిలాగా దైన్యాన్ని పొందుతున్నాయి. (.చీకటి పడుతుంటే తుమ్మెదలు చెట్లపైకి చేరుతాయి) చీకటి

దుర్మార్గు డయిన రాజులాగా లోకాలను బాధిస్తున్నది. పిసినారివాడి ధనం లాగా

కంటిచూపు నిష్ప్రయోజనమవుతున్నది.(చీకటిలో కళ్ళు కనపడటం లేదు)ఆ తర్వాత

భోజరాజు కీర్తిని ఈ క్రింది శ్లోకాలలో స్తుతించాడు.

మహారాజ!శ్రీమాన్!జగతి యశసా తే ధవళితే

పయః పారావారం పరమపురుషోయం మృగయతే

కపర్దీ కైలాసం, కరివర మభౌమం కులిశ భృత్

కళా నాథం రాహు: కమలభవనో కంస మధునా

తా:--శ్రీమాన్ రాజా! ఈ జగత్తంతా నీ కీర్తి చేత తెల్లనై పోగా నారాయణుడు తన పాలసముద్రం ఎక్కడ ఉందా?

అని వెతుక్కుంటున్నాడు.శివుడు వెండి కొండ అయిన తన కైలాసం ఎక్కడా?అని వెతుకుతున్నాడు.

వజ్రాయుదు డైన ఇంద్రుడు తన తెల్లనైన ఐరావతం కోసం వెతుకు తున్నాడు.రాహువు

కళా నాథుడైన చంద్రుడినీ,బ్రహ్మ తన వాహనమైన హంసనూ వెతుకుతున్నారు.

పాలసముద్రమూ, ఐరావతమూ హంసా తెల్లనివి కాబట్టి విశ్వమంతా వ్యాపించిన నీ కీర్తి తెలుపులో కలిసి పోయి కనపడటం లేదు,

మరో చమత్కారమైన శ్లోకం చెప్పాడు కాళిదాసు.

నీర క్షీరే గృహీత్వా నిఖిల ఖగపతీ ర్యాతి నాళీకజన్మా

తక్రం,ధృత్వాతు సర్వా నటతి జలనిధీంశ్చక్ర పాణి ర్ముకుందః

సర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతి: ఫాల నేత్రేణ పశ్యన్

వ్యాప్తా త్వత్కీర్తి కాంతా త్రిజగతి నృపతే!భోజరాజ క్షితీంద్ర!

తా:--నాళీక జన్మా=తామరపూవులో పుట్టిన బ్రహ్మ, నీరేక్షీరే గృహీత్వా=పాలూ నీళ్ళు కలిపి తెసుకొని

నిఖిల ఖగపతీ: యాతి=అన్ని పక్షుల దగ్గరకూ వెళుతున్నాడు.ఏ పక్షి నీటినీ పాలను వేరుచేయగలదో అదే తన వాహన మైన హంస అని గుర్తించేందుకు. చక్రపాణి అయిన నారాయణుడు తక్రం ధృత్వా= మజ్జిగ

తీసుకొని అన్ని సముద్రాలలో వేస్తున్నాడు.ఏ సముద్రం లో తోడుకొని పెరుగు అయితే అదే తన పాలసముద్రము అని గుర్తు పట్టడానికి పశుపతి:ఫాల నేత్య్రేణ పశ్యన్=శివుడు తన మూడో కంటి తో అగ్నిని

సృష్టించి అన్ని కొండలనూ చూస్తున్నాడు.ఏ కొండ కరిగితే అదే తన కైలాసం అని గుర్తించేందుకు నీ కీర్తి

మూడు జగాలకూ వ్యాపించి వాటిని తెల్లరంగు తో కప్పేసింది అందుకే త్రిమూర్తులు తమ నివాసాలను కనుక్కో లేక వెతుకుతున్నారు.

అంతకంటే చమత్కారంగా ఈ శ్లోకం చెప్పాడు.

విద్వద్రాజ శిఖామణీ!తులయితుం ధాతా త్వదీయం యశః

కైలాసం చ నిరీక్ష్య, తత్ర లఘుతాం నిక్షిప్తవాన్ పూర్తయే

ఉక్షాణం,తదుపర్యుమా సహచరం,తన్మూర్ద్ని గంగా జలం

తస్యాగ్రే ఫణి పుంగవం,తదుపరి స్ఫారం సుధాదీధితీం

ఓ!విద్వద్రాజ శిఖామణీ! ఆ బ్రహ్మదేవుడు కైలాస పర్వతాన్ని నీ కీర్తితో సమానం చేసేందుకు ఆ వెండికొండ మీద తెల్లని నందీశ్వరుడిని (ఉక్షాణం =ఎద్దును)దాని పైన తెల్లని ఉమాపతి యైన శివుడినీ

(ఉమా సహచరం)ఆయన సిరసుమీద గంగా నదినీ,దానిమీదతెల్లని సర్పరాజునూ,దాని మీద స్వచ్చమైన వెంనేలరేడునూ వుంచాడు.

ఇంతకంటే చమత్కారంగా మరో శ్లోకం చెప్పాడు.యిది ప్రశ్నోత్తర మాలికా రూపంగా వుంది.

స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి?'సురమునే భూతలే కామధేనో:

వత్స స్యానేతు కామః -- త్రుణచయం!'ఆధునా,ముగ్ధ దుగ్ధం న తస్యా?

శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచురవితరణం వ్రీడ శుష్క స్తనీ సా

వ్యర్థో హి స్యాత్ ప్రయాసః తదపి తదరిభి: చర్వితం సర్వముర్వ్యాం

స్వర్గ లోకం లో కామదేనువును చూసుకునే పసుల కాపరికీ నారడుడికీ మధ్య సంభాషణ.

నారదుడు :-ఓ! గోపాలకా స్వర్గం నుంచి ఎక్కడికి వెళుతున్నావు?

గోపాలకుడు:-సురమునీ మా కామధేనువు దూడ కోసం గడ్డిమోపు తెచ్చేందుకు భూలోకానికి వెళుతున్నాను.

నారదుడు:-ఓరి అమాయకుడా!యిప్పుడు కామధేనువు దగ్గర పాలు లేవా?

గోపాలుడు:-శ్రీ భోజరాజు గారి మహత్తరమైన వితరణ గురించి విని సిగ్గుపడిన కామధేనువు ఎండి పోయి శుష్కస్తని అయిపొయింది.

నారదుడు:--అయితే నీ గడ్డి తెచ్చే ప్రయాసకూడా వ్యర్థమే కాబోతున్నది.భూమి మీద భోజరాజు పరాక్రమము వల్ల ఆయన శత్రువు లందరూ గడ్డి కరిచారు.(తిన్నారు)కాబట్టి నీకు ఆ గడ్డికూడా దొరకదు. అని భంగ్యంతరంగా చెప్పాడు. .. .

ఇన్ని ఉపమానాలతో వున్నఅద్భుత మైన శ్లోకాలు విని భోజరాజు ఆశ్చర్యముతో చూస్తూ

వుండి పోయాడు. తర్వాత తేరుకొని కాళిదాసును కౌగలించుకొని సత్కారాలతో ముంచెత్తాడు.


                           ------ శుభరాత్రి   -------

No comments:

Post a Comment