సర్వేజనా సుఖినోభవంతు
ఇంద్రజిత్ - మాయా యుద్ధం వాల్మీకి రామాయణం 38వ దినము, యుద్ధకాండ
యుద్ధం ప్రారంభమయ్యింది
వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.
అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు " యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి " అని చెప్పాడు.
ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జెరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితొ బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.
అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.
తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు " అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ' ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ' అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి " మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను " అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.
అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.
రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి " నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి " అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.
కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి " నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని " అని బాధపడ్డాడు.
విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి " ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది " అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు " మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము " అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.
ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో " తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి " అన్నాడు.
--(())_-
-
👍నిజాయితి(1)
కొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను, షాపులోని సేల్స్ మేన్ నాకు రక, రకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు, అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు, అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడు,
ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసారు, ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి
తన పనిలో నిమగ్నం అయ్యారు.
మీ యజమానా?
అని సేల్స్ మేన్ ను అడిగాను,
అవును సార్,
ఆయన మా యజమాని ,
ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి,
చాలా మంచి మనిషి అండి అని ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడు,
ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది, కానీ సైజే కాస్త అటు,ఇటు గా ఉన్నట్టుంది, చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు , ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడు, కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, అబ్బే అదేం లేదు సార్, మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచివచ్చి నాముందు క్రింద కూర్చుని సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు,,
నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద , హోదాలో కూడా) నా పాదం ముట్టుకుని
చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించింది, పరవాలేదులెండి సర్ నేను తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా అతను వినకుండా రెండు కాళ్ళకు తన చేతులతో నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి ఓసారి నడిచి చూడండి సర్, మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదో, లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, కానీ ఆ జత సరిగ్గా సరిపోయాయి.
నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను,
సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,
ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్!
ఇది నా వృత్తి, నాకు దైవం తో సమానం,
"షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా నేను మీ పాదాలు ముట్టుకోను,
అదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ పాదాలు వదలను "
అన్నారు..
నాకు ఆశ్చర్యమేసింది, ఎంత గొప్ప వ్యక్తిత్వం!
Dignity of labour
******************
తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన గురువు లా కనిపించారు,
మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య,
న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.
ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగంను కానీ తిట్టరాదు,
అదికూడ లేక రోడ్ల మీద వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ.
🌻🌷🌻
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
నేటి సమాచారం - ఏకాగ్రత (5 )
దయచేసి జాగ్రత్తగా చదవండి _ కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు _
కరోనా తరువాత ఇప్పుడు అన్నీ చోట్ల జ్వరాలు పెరిగినట్లు తెలుస్తున్నది
2 సంవత్సరాల విదేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేయండి, 1 సంవత్సరం బయట ఆహారం తినవద్దు, అనవసరమైన వివాహం లేదా ఎలాంటి ఇతర వేడుకలకు వెళ్లవద్దు, అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు, కనీసం 1 సంవత్సరం రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లవద్దు, సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి
దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి, ఫేస్ మాస్క్ను ఉంచండి, ప్రస్తుత ఒక వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ ఉన్న గందరగోళాన్నిఅనుమతించవద్దు, శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి, ఇప్పుడు 6 నెలలు సినిమా, మాల్, క్రౌడ్ మార్కెట్కు వెళ్లవద్దు. వీలైతే పార్క్,
పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి
రోగనిరోధక శక్తిని పెంచండి, బార్బర్ షాపులో లేదా బ్యూటీ సలోన్ పార్లర్లోఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి,సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, CORONA యొక్క ముప్పు త్వరలో ముగియదు
మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు వాచ్ అవసరం లేదు. మీ మొబైల్కు సమయం వచ్చింది., చేతి కెర్చీఫ్ లేదు. అవసరమైతే శానిటైజర్ & టిష్యూ తీసుకోండి, మీ ఇంటికి బూట్లు తీసుకురావద్దు వాటిని బయట వదిలివేయండి, మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి.
మీరు అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా స్నానం చేయండి, నమ్మిన దైవాన్ని పూజించండి
వచ్చే 6 నెలల నుండి 12 నెలల వరకు ఈ జాగ్రత్తలు పాటించండి దీన్ని మీ కుటుంబం & స్నేహితులతో పంచుకోండి.అప్పుడే మీ ఏకాగ్రతకు అసలయిన గుర్తింపు.
ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు..తెలుపుకుంటున్నాను .
రోగమును తగ్గించ వచ్చు - కాలాన్ని మార్చలేము
ఏకాగ్రతగా ఉండవచ్చు - నిముషములో ఉన్న మార్పును గమనించలేము
--(())--
ఒక్క రెండురూపాయలు,!!
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది . కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేం...
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.
🌷🌷🌷
ఒఖ్ఖ రెండు రూపాయలు,
"నేనేం వందలడిగేనా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
"ఆ!.. ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే. పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒఖ్ఖ రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?"
సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.
"ఆ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేసాను. ఇంక నాదగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచిపోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.
నిజమే, అమ్మకు డబ్బులెందుకు?
టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది.
"ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒఖ్ఖ రెండు రూపాయలడిగితే..."
"అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయిపోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”
అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేసాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.
నెలలో మొదటి వారం, షాప్ రష్గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి మధ్యమధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది.
రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు.
ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.
"మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేసారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,
"నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ, ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం. అల్లాగే చూసాం. కాని మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏంచేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేసారు.
రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడూ మాకు తినడానికి టైముండేది కాదు, ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు. ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.
"ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.
"ఆ! ఏముందోయ్, అన్నట్లు మీ పిల్లలెలా చదువు తున్నారు?" కుశల ప్రశ్నలు వేసారు రామ్మూర్తిగారు.
"ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటు తున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్ మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.
"ఊ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.
"ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ, వాళ్లకి అనిపిస్తుంది కదా, మళ్లీ చిన్న పుచ్చుకుంటారనీ." సమర్థించుకున్నాడు నూకరాజు.
"నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు. చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని, ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన. నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?' ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.
"నూకరాజూ"
రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.
"ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా." నసుగుతూ అన్నాడాయన.
ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా... కొత్తరకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా, ఎలా వుంటాయో రుచి చూద్దామనీ, అంతే, ఒఖ్ఖ రెండు రూపాయలే."
వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు.
🌷🌷🌷
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ.
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (3 )
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి" లెక్కన అనుభవించటం జరుగుతుంది.
మన ఆలోచనలు ప్రతివిషయం లో తేలికభావం అనుకోకండి కష్టము కాదు, అయ్యిందేదో మంచికే., అవుతున్నదేదో అది మంచికే .అవ్వపోయేది కూడా మంచికే అనుకోవాలి . ఈనాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు..
అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు. జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.
కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు.. అనవసరంగా ఆందోళన పడకు
ఆందోళన అనారోగ్యానికి మూలం.. 'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు..మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు..దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..
"అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు" వీటన్నింటిని ఏకకాలంలో అనుభవించగలిగే ఏకైక వస్తువు మనిషి. పుట్టుటకు గిట్టుటకు మనిషే మూలం . మనోధైర్యం తో ఉండగలిగి ఏకాగ్రతతో పలికే పలుకు లు సత్యాలు.
--(())-- .
No comments:
Post a Comment