*బ్రహ్మచారులకు సద్యశ్శౌచం :-* బ్రహ్మచారి అంటే
ఎవరు? ఈ ధర్మశాస్త్రమందు బ్రహ్మచారిని గూర్చి *ఆదిష్టి* పదం వాడబడింది.
అదిష్టి అంటే బ్ర
పాటిస్తూ ఆచార్యులు ఉపనయన మందుఉపదేశించిన *బ్రహ్మచార్యసి, ఆపోశాన, కర్మకురు, మాదివాస్వాప్సీః, భిక్షాచర్యంచర*
ఇట్లాంటి నియమాలనాచరిస్తూ, గురుకులవాసం చేసేవాడు బ్రహ్మచారి. ఇట్లాంటి వానికి ఆశౌచమందు సద్యశ్శాచం అంటే స్నానంతో శుద్ధి. ఇట్టివాడు
ఆచార్యం స్వముపాధ్యాయం పితరం మాతరం గురుం!
నిర్భృత్యతువ్రతీప్రేతం సమ్రతేన నయుజ్యతే!
మాతామహ మాతులం తత్పత్నా చానపత్యకే!
ప్రతీ సంస్కురుతేయస్తు ప్రతలోపో జాతస్యహి”!!
ఆచార్యులకు,
తనకు విద్యాదాతయైన ఉపాధ్యాయునకు, తల్లిదండ్రి గురువు వీరికి ప్రేతకార్యం
చేస్తే వ్రతభంగం లేదు. తల్లి యొక్క తండ్రికి, మేనమామకు ఆయన భార్యకు సంతానం
లేనిచో వారికిన్ని దహనం సంస్కారం చేస్తే వ్రత లోపం రాదు. పైన తెల్పిన
వారందరికీ దహన సంస్కారాలు చేసిన తన యింట భోజనం చేయకూడదు. ఎందుకంటే మరణం
వల్ల వ్యక్తులకే కాదు ఆ యింటికిన్ని ఆశౌచముంటుంది కనుక భోజనం కూడదు.
*పతతియత్తస్మాత్ ప్రేతాన్నం నాత్ర భక్షయేత్* ప్రేతాన్నం తింటే తాను
పతితుడౌతాడు. *అన్యత్రభోజనం కుర్యాత్ న చతైస్సహ సంవిశేత్* వేరే ఇంట్లో
భుజించవచ్చు. కాని ఆశౌచం కలవారితో కలిసి నిద్రించకూడదు. కలిసి కూడా
తిరుగొద్దు
*ఏకాహమశుచిర్ భూత్వా
ద్వితీయేహాని శుద్ధ్యతి* ఆ ఒక్కరోజు అశుచిగ ఉండి రెండవరోజు శుద్ధి
పొందుతాడు. ఇదంతా మను, భృగు, యాజ్ఞవల్క్యుడు తెల్పిన విషయాలు. ఇక తన
తండ్రికి- *బ్రహ్మచారీ యదాకుర్యాత్ పిండ నిర్వాపణం పితుః |
తావత్కాలంతదాశౌచం తతస్సాత్వావిశుద్ధ్యతి* తల్లికిగాని తండ్రికిగాని ఉదకదాన
పిండప్రదానాదులు చేసినపుడే ఆశౌచము. తర్వాత స్నానం చేస్తే శుద్ధుడౌతాడు
*పాలివారు
మరణిస్తే ఆశౌచవిధానమెట్టిది* అనగా తన బ్రహ్మచర్య వ్రతం నియమంలో ఉంటే
బ్రహ్మచర్య వ్రతం పూర్తయిన తర్వాత సమావర్తనం అనగా స్నాతకం చేసుకున్న తర్వాత
సపిండులకు ఉదకదానాదులిచ్చి త్రిరాత్ర శౌచం పట్టాలి.
*శతకం
టీక*:- కృచ్చ, చాంద్రాయణ, వేదపారాయణ, బ్రహ్మచర్య, వివాహ, యజ్ఞాది సమాప్తి
పర్యదా ఆశౌచకాలమధ్యేస్యాత్ తదాశేషమాశౌచ మనుష్టేయం | యస్యాశౌచకాలాదూర్ధ్వ
పరిసమాప్తి స్యాత్ తదా మరణవిషయే అతిక్రాంతమాశౌచమనుష్ఠేయం,!!
మను:-“అతి క్రాంతే దశా హేచత్రిరాత్ర మశుచిర్భవేత్ | అతోప్రతినాంజ్ఞాతి
మరణే సతి సంవత్సరాదూర్ంవ్రత సమాప్తిశ్చేత్ సద్యశాచమేతి"
మనుః!!
కృచ్ఛ
చాంద్రాయణ వ్రతం నున్నవారు, వేదపారాయణ, బ్రహ్మచర్య వ్రతంలో నున్నవారు,
వివాహవిధిలో నున్నవారు, యజ్ఞయాగాది క్రతువుల్లో నున్నవారు ఆశౌచమధ్యలో
ఉన్నట్లైతే ఇది పూర్తియైన తర్వాత మిగిలిన రోజులాశౌచము పట్టవలెను. ఒకవేళ
ఆశౌచము పూర్తి (10 రోజులు దాటినచో) అయ్యేవరకు దీక్ష ముగియనిచో
అతిక్రాంతాశౌచము పట్టవలెను. అనగా మూడురోజుల శౌచము. పైన నాల్గవరోజు
శుద్ధియగుదురు. దీక్ష పరిసమాప్తి
అయ్యేవరకు పాలివాడు మరణించి సంవత్సరము దాటినచో అప్పుడు దీక్ష పూర్తి అయినట్లైతే సద్యశ్శాచమే! స్నానంతో శుద్ధి.
*సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
శుభోదయం 🙏🏻🙏🏻🙏🏻
పరిపూర్ణ సంతోషం
ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.
"చీమలను చంపకుండా ఎలా?"
అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస
చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే
వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం
మొదలుపెట్టాయి.
సమస్య కొలిక్కి వచ్చింది.
ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.
"మనుషులూ
ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు
తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే
దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని
విడిచిపెడతారు...." అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.
తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻
సర్వే జనా సుఖినోభవంతు🙏🏻🙏🏻🙏🏻
మంత్ర ద్రష్ట
ఒకటవ తరంగము
శ్రీః
ఆదిత్య
భగవానుడు ఉషాదేవి చేతిని అందుకుని , జగముల లోని సమస్త జీవ రాశులకూ ,
చైతన్యమును కలిగించుతూ తూర్పు సింహాసనమును ఎక్కి వస్తున్నాడు. .
నక్షత్రాలు దూరంగా పడమట , దిక్కులు అంతమయ్యే చోట , అక్కడొకటి , ఇక్కడొకటి
నిలచి , కొత్త రాజు అధికారము నకు వచ్చినపుడు మిగిలిన గత వైభవపు గుర్తుల
వలె , కాంతి తగ్గి పోతున్నాయి . మహానుభావుల కీర్తి వలె ఆశ్రమములలో హోమపు
పొగ , సూక్ష్మముగా ఉన్నా కూడా, సుగంధముతో కూడి ఆకాశ దారులలోకి ఎగసి తేలి
పోతున్నది. సర్వాత్మకుడు అయిన సవితృ దేవుని కీర్తించే భట్రాజుల్లాగా , సామ
గానము చేయు బ్రాహ్మణులను అనుకరించు తున్నాయా అన్నట్టు నానా విధాల పక్షులు
పాడుతున్నాయి. ఆకాశము ప్రాతః కాలపు మనోహరమైన చల్లటి గాలిలో నిముష
నిముషమునకూ మారిపోతున్న రంగు రంగులతో ప్రకృతి సుందరి లాగా మనసుకు హాయిని
కలిగిస్తూ కనిపిస్తున్నది.
వశిష్ఠ మహర్షి అప్పుడే ఉపాసన ముగించి , మూడు అగ్నులతో పాటూ మండుచున్న
నాలుగవ అగ్ని వలె వెలిగి పోతూ అగ్ని గృహము లో కూర్చొని యున్నారు. అరుంధతీ
మాత తన దైవ కార్యమును ముగించుకుని , లేచి నిలబడి , తన పతిదేవుడు రోజూ లాగే
లేచి వస్తాడని కాచుకొని యున్నది. ఆయన పైకి లేవలేదు. మహర్షి కన్నులు ,
దిక్కులకు అవతల కనిపించుతున్న దానిని పరిశీలిస్తున్నట్టు సూటిగా
చూస్తున్నాయి. కనుబొమలు కొంచముగా వంగి , ఆ కనిపించుతున్న దాని తీవ్రతను
తెలుపు తున్నాయి. ముఖము కూడా గంభీరముగా మారి , ఆ కనిపించు తున్నది
సంతోషించు విషయము కాదని చెప్పకనే చెబుతున్నది. అలాగే కొంతసేపు వుండి , ఆయన
ముఖము ప్రసన్నమైంది. అది చూచి అరుంధతీ దేవికి కూడా మనసు నెమ్మదించింది.
దూర దూరాలలో తిరిగిన మనస్సు వెనుకకు వచ్చినదా అనిపిస్తూ , మహర్షుల ముఖము
నుండి ఒక నిట్టూర్పు వచ్చెను . దాని వెనకే , ’ ఇంతే కదా !! ’ అను తేలికైన
భావముతో ఒక చిరునవ్వు కూడా , ప్రశాంత సరస్సులో సహజముగా వచ్చే అల లాగా
కనిపించింది.
దేవి అక్కడే నిలబడి చూస్తున్నది. ఆమెకు , ’ ఇదేమిటి ? ’ అని అడగాలని
కుతూహలము. కానీ , పతి దేవుని సన్నిధిలో తనంతట తానే మాట్లాడునది ఎప్పుడూ
లేదు. అందుచేత మౌనముగానే ఉన్నది. బహుశః , ఆ మౌనమే ఆమె యొక్క కుతూహలమును
తెలిపినదా అన్నట్టు , వశిష్ఠులు మాట్లాడినారు , ’ ఏమేమి అవుతుందో కానిలే ’
అన్నారు. ఆమెకు , ఆ సూత్ర వాక్యము మీద వ్యాఖ్యానము చేయాలనిపించలేదు ,
అయినా , ఆమె తనను తాను నిగ్రహించు కోవలెననుకొను లోపల, స్త్రీ సహజమైన
కుతూహలమే , ’ అంటే ఏమిటి ? ’ అని ఆమె నోటి నుండీ బయటికి వచ్చెను.
వశిష్ఠులు నవ్వి , అన్నారు , ’ న్యాయమే , నీవడగకముందే నేనే అంతా
చెప్పవలసినది. ఆశ్రమపు అధి రాజ్ఞివి నీవు , ఆశ్రమపు విషయములు తెలిసియుండాలి
కదా ? ఒక నూతన సృష్టి జరుగబోతున్నది. ఆ నాటకానికి ఆరంభము మన ఆశ్రమములోనే
జరుగబోతున్నది. ఓ దేవి , నీ ఆశ్రమములో రక్తపాతము జరుగబోతున్నది , అది కూడా ,
అంతా ఇంతా కాదు , ఆశ్రమపు భూమికి దాహము తీరునంత రక్తపాతము." అంతటి బలి
అవసరమా ? అని మరలా ఒక నిట్టూర్పు వచ్చెను . ’ బలి లేకున్న ఫలమెక్కడుంది ?
ప్రకృతి చేసే రుద్ర భయంకర నాట్యపు ఫలముగా , జరగబోతున్న ఆ నూతన సృష్టి వలన
మంచి ఫలమును కూడా చూశాను. , తనంతట తానే కనిపించింది. అందుకే సంతోషమై నవ్వు
వచ్చింది "
అరుంధతి నిర్ఘాంత పోయింది. పాలిపోయిన ముఖముతో , " ఏమిటి ? రక్త పాతమే ? ఆశ్రమములో ? అదీ , మన ఆశ్రమములో ? " అన్నది.
ఆమె మనో భావమును తెలుసుకున్న వశిష్ఠులకు ఇంకా నవ్వు వచ్చినది. ఆమె
మనసుకు ఎలా నచ్చుతుందో అలా ఒకసారి నవ్వి , " ఏమంటారు దేవి గారు ? ప్రకృతి
తన ముఖాన్ని గంటు పెట్టుకొని , ఉరుములు , మెరుపులతో ఆర్భాటము చేసి , గొప్ప
వృష్టిని వర్షించినపుడు , మీ ఆశ్రమపు భూమిలో మట్టి బురదగా మారదా ? అలాగని
, ఉరుములు మెరుపులతో గొప్ప వృష్టి ని వద్దంటారా ? ఇది కూడా అలాగే. .
అవును , మీ ఆశ్రమములో రక్తపాతము అవుతుంది , అంతే కాదు , రక్తము యేరులై
పారుతుంది . ఏం , ఎందుకు కాకూడదు ? సత్వము , రజస్సు , తమో గుణములతో కూడిన
ఈ పంచ భూతముల లోను , మరియు , ఆ పంచభూతముల నుండీ సృష్టించ బడిన ఈ
జగత్తులోనూ , ఆ మూడు గుణములూ ఉండనే ఉన్నాయి. ఒక్కొక్క కారణము చేత ఒక్కొక్క
గుణము మాత్రమే బలముగా కనిపించినా , ఇతర గుణములు కూడా అక్కడ ఉండనే ఉంటాయి
కదా ? అయితే , అవి అణగి కూర్చొని ఉంటాయి.
దేవీ , ఇది జగత్తు. ఘడియ ఘడియకూ మారుటే దీని గుణము. మానవుని మనస్సు ఆ
మార్పును సహించలేక , ఒకే స్థితిలో ఉండాలని కోరును. కానీ , సృష్టి కర్త
నియమము అలాగ కాదు. పాతది వెళ్ళిపోవలెను. కొత్తది వస్తూ ఉండవలెను.
అందువల్లనే , అప్పుడప్పుడు , వున్న స్థితి హఠాత్తుగా మారిపోవుట
కనిపిస్తుంది ! అణగి ఉన్న గుణములు రేగి పైపైకి వచ్చేది అందుకే ! నదిలో
ఉధృతంగా నీటి ప్రవాహము వచ్చి అంతటినీ పగులగొట్టి పోవునట్లు , తమో గుణము
రేగి అంతటినీ నాశనము చేస్తుంది. దానిని చూచి మనము బాధ పడుట అవసరమా ?
తమోగుణము వచ్చి అంతటినీ ఊడ్చుకొని పోకుంటే , రజో గుణము వచ్చి కొత్త ఆటను
ఎలాగ ఆడగలదు ? మృత్యువు యొక్క రుద్ర నర్తనమే కదా , నూతన సృష్టి కి
ప్రారంభము ? ఈ తమస్సు , ఈ రజస్సు ఇట్టి సంభ్రమముతో విజృంభించక పోతే ,
సత్త్వ గుణము ఎక్కడి నుండి రావలెనూ ? రసము నిండిన పండు కావాలనువాడు ,
పీచుకాయల వగరు , పులుపు వద్దన్న యెలాగ ? అన్నిటినీ జరిపించునది కాలము. ఆ
కాలపు ఒక కొన - కరాళమయితే , ఇంకొక కొన , శాంతమవుతుంది . సుఖమవుతుంది. .
అదే ప్రకృతి ధర్మము. నిజానికి , రెండూ ఒకటే ! అయినా కూడా , మొదలు , చివర
లలో ఒకే భావము ఉండడము చాలా అరుదు. . అంతే కాక , సుఖ, దుఃఖములు రెండూ కూడా
వికారములే. ఒకటి స్వర్ణ కంకణమయితే , ఇంకొకటి లోహ కంకణము. స్వర్ణము కావాలి
, లోహము వద్దు అని మన మనస్సుకు ఒకటి నచ్చింది , ఇంకొకటి నచ్చలేదు.
" నచ్చింది , ఇంకొంత కాలము ఉండాలి , నచ్చనిది వేగముగా ముగిసిపోవాలి "
అని తలుస్తాము. అది ఎందుకు అలాగ కావాలి ? కావలసినదంతా వేగముగా ముగిసి ,
వద్దన్నది ఇంకొంత కాలము ఎందుకు ఉండరాదు ? మనకు కావలసిందంతా ఇస్తున్న గోమాత ,
మన నందిని , ఒక్కొక్కసారి కొమ్ములు ఎగురవేస్తుంది కదా ? దివ్య ధేనువు
లోకూడా ఒక్కొక్కసారి నచ్చని చేష్టలు కనిపిస్తాయి కదా ? కాబట్టి , రానిలే ,
ఏమేమి రావాలో , అదంతా రానిలే. కాలగర్భములో అణగి యున్నదంతా ఇవతలికి రానీ
!. అదికూడా దేవుడి లీల అంటే సరిపోతుంది కదా ? లీల అనుకున్నపుడు , దాని కరాళ
రూపము కనిపించదు , దాని ఉల్లాస కరమైన రూపమే కనిపిస్తుంది . అంటే ,
కాలానికి మనము దాసులము , కాదా ? "
పతిదేవుని మాటవిని అరుంధతికి ఆశ్చర్యము కలిగినది. " ఒకటి రెండు మాటలలో
ముక్తసరిగా మాట్లాడి అంతా ముగించే వారు , ఈ రోజు , ఇంత దీర్ఘముగా
మాట్లాడారు , ఎందుకని ? ఏదో భయంకరమైన విషయమై ఉండాలి. ఆశ్రమములో రక్తపాతమా ,
అదీ , బ్రహ్మర్షుల ఆశ్రమములో..!! ఎక్కడ చూసినా శాంతి నిండిన ఈ బ్రహ్మ
భూమిలో రక్తపాతమా ? ఎగిరే పక్షులు , ఈదే చేపలు కూడా ఎన్నడూ పోట్లాడుకోని ఈ
భూమిపై రక్తపాతమా ? కానీలే , నాకెందుకు ? ఈ దేవుడు అంత వివరముగా
చెప్పింది , ’ నువ్వు సిద్ధముగా ఉండు.’ .. అని తెలుపడానికే !! వారి నోట
వచ్చిందంటే , అది నిజమే అవుతుంది. జరిగే తీరుతుంది. మనస్సులో
గుర్తుపెట్టుకోవాలి. మనో వికారపు ఒక ముఖము సుఖమైతే , ఇంకొక ముఖము దుఃఖము.
కానిలే , ఇష్టము లేని ఒక ముఖము కనిపించి నప్పుడు , కొంచము కష్టపడి , ఈ
ముఖాన్ని ఇటువైపుకు తిప్పుకుంటే సరి! " అని తనకుతానే ధైర్యము చెప్పుకొంది.
అయినా , రక్తపాతము... నేల , తాగి కక్కుకున్నట్టు రక్తపాతము....అనుకోగానే
ఆమె గుండె బరువెక్కింది. అక్కడే కూర్చొని అంతా సవిస్తరముగా అడగాలి
అనిపించినది. కానీ , ఎప్పటినుంచో అలవాటైన దానిని జవదాటేదెలా ? పతి అనుమతి
లేనిదే అగ్ని గృహములో కూర్చొనుటెలా ? కాబట్టి , ఏమి అడుగవలెనన్నా , ఇక్కడ
కాదు , ఇప్పుడు కాదు.
ఇలాగ తీర్మానించుకునే లోపలే , గడచిన రాత్రి తాను చూచిన స్వప్నము
గుర్తుకొచ్చింది . అది అప్రయత్నము గానే నోటినుండి బయటికొచ్చింది , ’ నిన్న
రాత్రి ఏదో ఒక కల. అంత సంతోష కరమైనది కాదు , అది గుర్తు కొచ్చినపుడు ఏదో
చేదు మింగినట్లుగా ఉంది..." అంది.
వశిష్ఠులు దరహాసం చేసి , " అవునవును , నాలుక మీద ఆధార పడినపుడు , చేదు
చేదుగా , తీపి తీపిగా ఉంటాయి. అదే మన అధికారానికి చిక్కితే , అప్పుడు
చేదు చేదే , తీపి తీపే..."
అరుంధతికి దాని తర్వాత మాట్లాడుటకు నోరు పెగలలేదు. " నిజము , నిజము
...వారు చెప్పినట్టు , ఇష్టమైనది తీపి గాను , కష్టమైనది చేదు గాను ఉంటాయి
. అంతా మంగళ కరమైన వెలుగే ... అర్థము కానంతవరకూ అమంగళము... అయిన తర్వాత
మంగళము " అనుకుని , ప్రసాద పుష్పము తీసుకొని , రక్ష ధరించి , పళ్ళెము దైవ
సన్నిధిలో నుంచి , ఆమె వెళ్ళిపోయెను.
భవిష్యత్తు ఘోరముగా ఉంటుందని , ఒకరికి ప్రత్యక్షముగాను , ఇంకొకరికి
పరోక్షముగాను తెలుసు. అయినా , ఎవరూ దానిని తప్పించేందుకు ప్రయత్నము
చేయలేదు.
సశేషం
జనార్ధన శర్మ
🌻 Q 55:--సృష్టి ఎప్పటి వరకు కొనసాగుతుంది? 🌻
Ans :--
సృష్టి అనంతకాలం నుండి ప్రారంభమైంది. ఆనంతకాలం వరకు కొనసాగుతుంది.
ఉదాహరణకు spring ని తీసుకుందాం. ఇది వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుంది
కానీ spring అక్కడే ఉంటుంది.
అలాగే
మూలచైతన్యం కోటానుకోట్ల రూపాలను తీసుకుంటుంది. వాటిని నాశనం చేసి మరల
పునర్జన్మ ద్వారా ఇతర రూపాలను తీసుకుని పరిణామం చెందుతుంటుంది.
2)
ఆత్మశకలం ఏ రూపాన్నైనా ధరించవచ్చు. ఒక నక్షత్రం గా, ఒక గ్రహం గా, ఒక
మనిషిగా, ఒక జంతువుగా, ఒక చెట్టుగా, ఒక చేప గా, ఒక క్రిమిగా, ఒక
ఎలెక్ట్రాన్ గా, ఒక పరమాణువు గా ఇలా ఏ రూపాన్నైనా తీసుకుంటుంది. ఇది human
ఇంటెలిజెన్స్ కి అందదు.
ఇతర dimensions లో తీసుకునే రూపాలు మనకు అర్థం కావు. మన అంతర్ ప్రపంచానికి మాత్రమే అర్థం అవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹
2. " మంత్ర ద్రష్ట " రెండవ తరంగము
రెండవ తరంగం
కౌశిక మహారాజు , ఆశ్రమములో బ్రహ్మర్షి చేత సన్మానించబడి , సంతోషము ,
ఆశ్చర్యమూ , సంభ్రమము నిండిపోగా , తన శిబిరము లో కూర్చున్నాడు.
తాను పొందిన సత్కారము , తన ఊహ కందనంత గొప్పగా ఉంది. అటువంటి సత్కారము
చేయడం తనవంటి మహా రాజుకైనా సాధ్యమా అన్నట్లుంది. రాజు మొదలుకొని ,
సేవకుని వరకు , ఏనుగు మొదలు ఎలుక వరకూ , అందరికీ , అన్నిటికీ సత్కారము
లభించినది. నిజముగా ఇది సత్కారము అనడం కన్నా , సమారాధన అనుట సరైంది.
కౌశికుడు ఈ విధమైన ఆలోచనలోపడెను , " ఇతడు కులపతి అనునది నిజము , అయినా ,
ధర్మ పరాయణుడైన ఇతని వద్ద ఒక సంవత్సర కాలానికి సరిపడినన్ని సంభారములు ,
దినుసులు , సరకులు ఉండ వచ్చును. ఈ ఒక్క దినపు సత్కారాలకు ఖర్చు అయిన
ద్రవ్య సంభారాలను చూడగా , అవి యీ ఆశ్రమానికి కనీసము అయిదు సంవత్సరాలకు
సరిపోవు లాగున్నాయి. నేను సపరివార సమేతముగా వచ్చి ఇతనికి అదేమి అసౌకర్యము
కలిగించానో ? నావల్ల ఇబ్బంది కలిగిందో ఏమో ? ఈ వస్తు సామగ్రి అంతా
ఇప్పటికిప్పుడు ఎలా వచ్చెనో , ఘటికుడే . లేక , ఈ బ్రహ్మర్షి దేవలోకము నుండీ
యేదయిననూ తెప్పించుకొన్నాడా ? .... ఉన్నారులే , యీతనికి శిష్యులగు రాజులు
చాలా మందే ఉన్నారు. , ఇతని కోసము తమ సర్వస్వమునూ అర్పించు వారు
అనేకులున్నారు , అయినా , ఇంత వేగముగా ఇన్ని సంభారములను సంపాదించుట ఎలా ? "
యని దీర్ఘముగా ఆలోచనలో పడెను.
’ ఇదంతా ఏదయినా మాయా సృష్టి కావచ్చు , నేను చూచినదంతా ఒక స్వప్నము
కావచ్చు.." అని కూడా అనిపిస్తున్నది. తాను నిలచిన ఈ పర్ణ కుటీరము నిజముగా
రాజ యోగ్యమైనది. తాను సేవించిన అమృతాన్నము ఇంకా కడుపు లో బరువుగా ఉన్నది.
మరి ఇది కల ఎలా అవుతుంది ?
కౌశికుడు పంపిన దూత సమాచారముతో వచ్చాడని పరిచారకుడు వచ్చి తెలిపాడు.
దూతని రమ్మని సైగ చేసి , రాజు వినసాగెను , దూత ఇట్లు చెప్పెను , " మహా రాజా
, ఆశ్రమములో ’ నందిని ’ ధేనువు ఉంది. అది కామధేనువు ’ సురభి’ కూతురు. ఆ
ఆవుకు , తన తల్లికున్నట్టే , గొప్ప మహిమలున్నాయి . గురుదేవుల హోమధేనువు
అదే . ఈ రోజు అతిథిపూజ అంతా దాని మహిమవల్లనే నడచింది. ఇటువంటి సమారాధనలు
అప్పుడప్పుడు యీ ఆశ్రమములో నడచుట మామూలే ! . కానీ ఈసారి జరిగినంత వైభవముగా
ముందెప్పుడూ జరగలేదు..."
రాజు ఈ మాటలు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినెను. " ఒక్క గోవు. ఆ గోవు
ప్రభావము ఇంత గొప్పదా... ఆ గోవు , కామధేనువు కూతురు... మహిమలున్న ఆమె వలన
యింత అతిథిపూజ సాధ్యము...వశిష్ఠుని రహస్యము ఇదా ..! ఎవరెన్ని కానుకలు
తెచ్చి ఇచ్చినా , వశిష్ఠుడు వాటిపై ఆశ పడక వద్దనుటకు ఇదా కారణము..? "
మంచిది , సామ్రాట్టులకు కూడా సాధ్యము కాని కార్యము చేయగల సమర్థుడితడు.
ఈ ధేనువును ఇక్కడ ఉంచుకొని ఈ మహర్షి చేయగలిగినదేముంది ? ఇటువంటి రత్నము
సామ్రాజ్య అధిపతుల దగ్గర ఉండవలసినదే కానీ , దొరికిన దానితో పొట్ట పోసుకుని
తృప్తిచెందు వారితో నిండిన ఈ ఆశ్రమములో ఉండుటేమిటి ? కానీ అలాగని చెప్పి
దీనిని నేను తీసుకొనుట బాగుండదు కదా ...దీనిని తీసుకొనడము ఎలా ?
ధర్మ నిరతుడైన తపస్వి యొక్క ఆశ్రమము లోనిదంతా దేవతల కోసము. . రాజుకు
దేవతల సొమ్ము పై అధికారము ఉందా ? మరి , రాజ్యమంతా రాజుదే కదా , అప్పుడు
రాజ్యము లోనిదంతా రాజుదే అన్నప్పుడు , ఆ రాజ్యములోదే కొంత ఇవతలికి తీసి ,
ఇది దేవతల సొమ్ము అంటే ఏమైనా బాగుందా ? రాజు తనకు తానుగా దానిని
వద్దనుకుంటేనే కదా , అది ఆశ్రమమునకు చెందునది ? వద్దన్నవాడు , అవసరమైనపుడు
కావాలనుకుంటే తప్పేమున్నది ? "
" ఈ ధేనువు ఎప్పటికీ రాజు వద్ద ఉండవలసినదే. . ఇది కానుకగా గానీ , ధనము
ఇచ్చి గానీ , లేదా , బలవంతానైన గానీ రాజ భవనమునకు రావలసినదే. ...."
" అట్లని , దేవతల సొమ్మును లాక్కొన వచ్చునా ? అదీ , వశిష్ఠుల వంటి
బ్రహ్మర్షి అధీనములో ఉన్నదానిని ? ఇది ఎంతమాత్రమూ తగని పని. దేవతల
సొమ్మును తీసుకుంటే , అగ్నిని తీసుకొని ఒడిలో కట్టుకున్నట్లే...
జీర్ణమవడము అసాధ్యము. ఇది పథ్యమైనది కూడా కాదు...ఎంతమాత్రమూ వద్దు. "
" కానీ , అలా కాదు , దీనిలో లాక్కొనుట యేముంది ? లోకమంతా దైవాధీనములో
యున్నది. ఆ దేవతలదరూ రాజులోనే ఉన్నారు. రాజ దండనము వల్లనే కదా అంతా సరిగ్గా
నడచునది. సమాజములో పెద్ద చేప , చిన్న చేపను మింగకుండా కాపాడు రాజుకు
అందరూ ఋణగ్రస్తులే . బ్రాహ్మణుడైనా , బ్రహ్మజ్ఞుడైనా తన తపస్సులో ఒక
భాగమును రాజుకు కప్పము కట్టువాడే కదా ? మరి , ఆ శుల్కానికి బదులుగా యీ
ధేనువు వచ్చిన తప్పేమి ? అలా కాదన్న , తనకు ఇష్టము వచ్చిన మరి దేనినైననూ
తీసుకొని , యీ ధేనువు ఇవ్వవలెను. అదీ కాదంటే , రాజు దైవాంశ సంభూతుడు
కాబట్టి , యీ దేవ ధేనువు రాజుకు చెందాలి. ఏవిధముగా చూచినా ఇది లాగుకొనుట
కాబోదు. "
" నిజము , రాజైనవాడు భౌతిక సుఖమునిచ్చు దేనినీ వదల రాదు. రాజు యొక్క
లక్ష్యము సమృద్ధి ,అంతే కానీ త్యాగము కాదు. తనకున్న సర్వ సామర్థ్యమునూ
ఉపయోగించి సమృద్ధిని గడించాలి . పారుతున్న నీటికి ఆనకట్ట కట్టి ఉపయోగించు
కొన్నట్లే , పెరిగి నిలుచున్న అడవిని వంట చెరకు , సమిధలకై
ఉపయోగించుకొన్నట్లే , లోకములో ఉన్న పనికి వచ్చు అన్ని వస్తువులను సమృద్ధి
కోసము ఉపయోగించుకొనుట రాజ ధర్మము. దొరికిన దానిని ఏవో కుంటి సాకులు చెప్పి
వదలిన , అది దుర్బలత్వమే. "
" అవును , ఇదే నిజము. సంగ్రహించ వలసిన వస్తువును సంగ్రహించ కుండా వదలితే , లోకమును పాలించుట ఎలాగ ? కాబట్టి , ఇది నా కర్తవ్యము. "
రాజర్షికి తన సిద్ధాంతము సరైనదేనా అని ఇంకా అనుమానము. అయినా, రాజ
సహజమైన పౌరుషముతో , సిద్దాంతము సరియైనదే అని తీర్మానించుకున్నాడు. మనస్సు
ఒక పని చేసి తీరాలన్నపుడు , బుద్ధి ఎక్కడైనా మంచి చెడు విశ్లేషణ చేస్తుందా
? వివేకముతో ఆలోచించే అవకాశము ఎక్కడుంది ? లేడికి లేచిందే పరుగు కదా !
రాజదూతకు ఆజ్ఞ అయినది , " భగవానుల కెపుడు అనుకూలమో , తెలుసుకొని రా ! "
రాజదూత వాయువేగముతో పరుగెత్తి వెళ్ళి , సమాధానము తెచ్చాడు. " గురు
దేవుల అనుజ్ఞ అయినది , ఇప్పుడు సంధ్యాకాలము సమీపిస్తున్నది. తమోగుణ వేళ.
సంధ్య ముగిసిన తర్వాత అయితే మంచిది. కానీ , ఈ క్షణమే రావలసినదిగా రాజు
అభిప్రాయమైతే , వారి ఆజ్ఞ నేను ఎప్పుడూ గౌరవిస్తాను. . "
రాజు తల ఊపెను. " ఔను , పాలించు రాజు లేకుంటే , అందరూ పాలకులే. అందరూ
రాజుకు తల వంచవలసిన వారే.. అన్ని తేజస్సులూ రాజు తేజస్సు ముందు యొక ఘడియ
యైనా కళ తప్పవలసినదే. తమోగుణ వేళ అన్నారు కదా , చూద్దాము , అది మమ్మల్ని
ఏమి చేయగలదు ? ఆయనేమో , బ్రహ్మర్షియై , తపస్వులలో శ్రేష్ఠుడై , బ్రహ్మ
విద్య తెలిసిన వాడై గుణాతీతుడైన బ్రాహ్మణుడు. అంతటి వాడైననూ రాజును
తిరస్కరించు వాడు కాదు. ఇంతటి ఆతిథ్యము ఇచ్చి మమ్మల్ని గౌరవించినవాడు . ఇక
మేమా , అన్ని విధాలా , అతనిలో ఉన్న ఆశ్రమోచితమైన వినయమును వదలక ఎప్పుడూ
ఇలాగే నడచుకోవలెనన్న కోరిక గలవారము. ఒకరు సర్వతేజో మయుడైన రాజు , ఇంకొకరు
సర్వ దేవతా మయుడైన బ్రాహ్మణుడు. ఈ ఇద్దరి మధ్య కాలమునకు పనియేమి ? అని
నిర్ణయించుకుని ,
" మేము ఇప్పుడే వచ్చెదమని బ్రహ్మర్షి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయి "
. అని దూతను పంపించి , తాను ఆతని వెనకే కొద్ది పరివారముతో పాద చారియై ,
వశిష్ఠుల పర్ణశాలవైపు బయలుదేరెను.
రాజు కొంత దూరము పోవునంతలోనే , సమారాధనము లోని విశేష భోజనానికై వచ్చిన
గ్రద్ద ఒకటి , తన విశాలమైన రెక్కలు విప్పి , పైకి లేచి ఎగిరి పోయి , ఫల
భారముతో వంగిన ఒక చెట్టుకొమ్మ పై కూర్చుంది.. దాని బరువు తాళలేకో , మరి
యెందుకో , ఆ కొమ్మ విరిగి పడిపోయింది. . ఇదేమిటి ? నేను బయలుదేరడము ,
అప్పుడే గ్రద్ధ ఇలా వాలడము , కొమ్మ విరిగిపోవడము మంచిదేనా , శుభ సూచకమేనా
అని ఒక్క క్షణము ఆలోచించెను. కానీ వెంటనే ,కార్య సాధకులగు క్షత్రియులు
ఇటువంటి వాటిని లెక్క చేయరాదు అని ముందుకు సాగెను.
సశేషము
విభాతమిత్ర
" మంత్ర ద్రష్ట " నాలుగవ తరంగము --- 4 --- నాలుగవ తరంగం
ఆశ్రమములో ఎక్కడ చూసినా కోలాహలము. ఇంతవరకూ అతిథి పూజ సంభ్రమములో
కోలాహలము. ఇప్పుడు అతిథుల సంభ్రమపు కోలాహలం. రాజు వైపు వారంతా , నందినిని
తమ రాజధానికి పిలుచుకొని పోవుచున్నారని సంభ్రమములో మునిగియున్నారు. నయానో ,
భయానో నందినిని రాజధానికి తీసుకొనే వెళ్ళవలెనని రాజ పరివారము అన్ని
ప్రయత్నాలనూ చేస్తున్నది. ఆ వార్త తెలిసి ఆశ్రమ వాసులందరూ కలవర
పడుతున్నారు.
ఆశ్రమ వాసులంతా యథావిధిగా సంధ్యా కార్యములను ముగించుకున్నారు. ఎవరూ
రాత్రి భోజనము గురించి పట్టించుకొనుట లేదు , అందరికీ ఒకటే యోచన..." రాజుకా
ఇంతటి దుర్బుద్ధి ? " అని కొందరు , " ఇది సాధ్యమేనా ? " అని మరికొందరు , "
క్షత్ర -బ్రహ్మ యోగపు కాలము గడచి , క్షాత్రము బ్రాహ్మము ఒకదానినొకటి
వ్యతిరేకించు కాలము వచ్చినదా ? " అని ఇంకొందరు. ఒక్కొక్కరు తమకు తోచినట్లు
మాట్లాడు కొంటున్నారు.
అరుంధతీ దేవి సంధ్యా హోమమును ముగించుకొని బయటకు వచ్చినది. ఆశ్రమపు
కలవరము ఆమెనూ పట్టినది. ఆమెకు " మేమిచ్చిన సత్కారమును పొంది తృప్తి పడిన
యతిథి మా ఆశ్రమము లోనే ఇంతటి అత్యాచారమును చేస్తాడా ? ఆశ్రమపు ధేనువునే
తనకిమ్మని అడుగుతాడా ? ఆశ్రమపు బ్రహ్మ భూమిపై రాజుకు అధికారము ఉందా ? " అని
అనేక ప్రశ్నలు , సందేహాలు , శంకలు ఒకదానిపై నొకటి మనస్సును
వేధిస్తున్నాయి. ఆదినము ఉదయము పతిదేవులు చెప్పిన మాట జ్ఞాపకము వచ్చెను. "
ఆశ్రమములో రక్త పాతము కావలసి ఉన్నది , అగును " అన్న మాట చెవిలో మళ్ళీ
మ్రోగెను.
" అలాగైన , జరగవలసినది జరగవలసినదే . అయినా , యెందుకు దానిని
తప్పించకూడదు ? నేను ప్రయత్నము చేయనా... ?? " అనిపించెను. మనసు లో అదే
ఆలోచన.
అంతలో దూరము నుండి లీలగా వినిపించు గంటల మ్రోత , ఎక్కడో ఆలోచనలో
మునిగిన మనసుని తట్టి లేపెను. అరుంధతి తిరిగి చూసింది. నందిని వస్తున్నది.
శాంతి , సమృద్ధి మూర్తీభవించి నట్టు , సౌభాగ్య లక్ష్మి ప్రతిబింబమా
అనునట్లు మెడలో గంటలు మోగుచుండగా నెమ్మదిగా , హుందాగా నడచి వస్తున్నది. తల
అటు ఇటు ఊపుతూ , ఎవరికి యేమి కావలెను ? ఎవరికే వరము కావలెను ? అని
వెదకుతున్నట్టు వున్నది. కేసరి వర్ణపు ఎర్రావు. జగములోని సౌభాగ్యము నంతటినీ
రాశి పోసి , దానిపై ఒక తిలకము దిద్దినట్టు , ఆ గోవు ముఖముపై ఒక వెండి
వర్ణపు తిలకము. సౌభాగ్య దేవి మందిరపు గోపురము పైన అమర్చిన శిఖరముల వంటి
వెండి తొడుగులు తొడిగిన కొమ్ములు. కాలి గిట్టలకు ఘల్లు ఘల్లు మనే మువ్వలు .
నందినిని చూడగానే అరుంధతీ దేవికి అపారమైన ఆనందమైంది.. చిత్తములోని
ఆలోచనలన్నీ ఒక్క గడియ ఎక్కడికో మాయమయ్యాయి. అంతలోనే , ఆ గోమాత తమ
ఆశ్రమములోనే ఉండి , పరిసరముల నంతటినీ ఇదే విధమున పావనము చేయునో లేదో అన్న
శంక కూడా కలిగింది.. ఆ శంక కలిగించిన విషాదమును సహించలేక దానిని తరిమి
వేయుటకో అన్నట్టు దేవి పరుగెత్తి ఎదురు వెళ్ళి నందినిని హత్తుకొనెను. ఆ
ధేనువు కూడా ఆ కౌగిలి ఉపచారమును సంతోషముగా స్వీకరించి , తాను కూడా అంతే
ప్రీతిగా అరుంధతికి తన ముఖమును రాస్తూ ఉపచారము చేసెను.
.
" అమ్మా , నీవు వెళ్ళిపోతావా ? మా దగ్గర ఉండవా ? " అని అరుంధతి
అడిగింది. నందిని తల అటూ ఇటూ ఊపి , గంటల సవ్వడి మృదువుగా వినిపించు చుండగా
మనోహరమైన మనుష్య వాక్కుతో ఇలా పలికింది , " దేవీ , గురుదేవులకూ ,
కౌశికునికీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు. కౌశికుడు రాజు అన్న మాట
నిజము. అతనిలో దైవాంశ కూడా ఉన్నది. కానీ , కామధేనువు కూతురును తన ఇంటిలో
ఉంచుకోవాలంటే , ఎంతటి యోగ్యత ఉండాలో , అంతటి యోగ్యత ఇంకా అతనికి సిద్ధించ
లేదు. ఈ దినము ఈ సంగతి అతనికి బోధ పడును. తల్లీ , ఈ రోజు ఈ పుణ్యాశ్రమపు
పుణ్యభూమి , రక్తపానమును కోరి , ’ నందినీ , నాకు రక్త పానము చేయాలని ఉన్నది
, ప్రసాదించు ’ అంటున్నది. అది జరగవలసినదే. తప్పక జరుగును. కానీ , తల్లీ ,
నాపైన బల ప్రయోగము జరుగు వరకూ నేనేమీ చేయను. ఈ ఆశ్రమపు పుణ్య భూమిలో నాపైన
బల ప్రయోగము చేయుట కౌశికునికి ఎంతమాత్రమూ తగని పని. అయిననూ అది
కావలసినదే. అనివార్యము. అట్టి దుర్ముహూర్తము వస్తే , నేను ఆత్మ రక్షణ
చేసుకోవచ్చును , కదా తల్లీ ? " అనెను.
అరుంధతికి అంతా అర్థమైంది. . జ్ఞానమును పొందుటకు సాధకమైన ఆశ్రమపు
పుణ్యభూమిని , ప్రశాంత సరస్వతి వలె కాపాడుతున్న భూదేవి ఈనాడు , ఒక
దుర్గగా , చండిగా , కాళిగా రక్తపానమును కోరుతున్నది గదా యని కొంత సేపు
మనసులో విషాదము కలిగింది. వెంటనే , కావలసినది కాక మానదు , అను నిశ్చయముతో
పలికింది , " అమ్మా , నీవు పుట్టినదే మమ్ములను అనుగ్రహించుటకు. నీవు అలాగే
మాపై అనుగ్రహముతో ఉంటే చాలా సంతోషము. నీకు ఆగ్రహము వచ్చు సన్నివేశము
రాకుండా ఉంటే పరమ సంతోషము. కానీ , మీరు దేవతలు. లోకమును రక్షించుట ,
శిక్షించుట మీ చేతిలో ఉన్నది. మీరు ఏమి చేసినా సరే " అనెను.
నందిని కొంత నొచ్చుకుని , పలికెను , " తల్లీ , నీమాట నిజము ,
అనుగ్రహించుటకై పుట్టినవారు ఆగ్రహించుట కష్టము. అయితే మేము కూడా అయినంతలో
అనుగ్రహించుటకే ప్రయత్నిస్తాము. నీటి ప్రవాహము నిలుపుటకు కట్టిన ఆనకట్ట
కూడా , మన ప్రయత్నము లేకుండానే ఒక్కోసారి తెగిపోవును , అలాగే మేము
ఆగ్రహమును చూపవలసి వచ్చును. తల్లీ , నీవు శోకించవద్దు. అంతటి దుర్ముహూర్తము
వస్తే , నన్ను నేను రక్షించుకోగలను. ఏదేమయినా , మీరు మాత్రము నన్ను దూరము
చేయవద్దు. మీరు తల్లిదండ్రులు , నేను మీ కూతురును. " అనెను.
అరుంధతీ దేవికి కంట నీరు చిప్పిల్లెను. " నీ వలన మా ఆశ్రమము..."
ముందరి మాట చెప్పుటకు అరుంధతికి గొంతు పూడుకు పోయింది. మాట పెగల లేదు .
తల్లిని నాకెడు లేగ దూడ వలె నందిని , అరుంధతి ముఖమును ప్రేమతో నాకెను.
అరుంధతి చేసిన నమస్కారమును ఒప్పుకుని , ముందుకు వెళ్ళి పోయెను.
గోమాత వెళ్ళిన కొంచము సేపటి వరకు ఈమె అలాగే స్థాణువై కూర్చొని ఉంది.
వృద్ధ శిష్యుని ఒకరిని పిలచి , ’ అయ్యా , ఆశ్రమ వాసులందరికీ ఇది విన్నవించు
. బయటి నుండీ వచ్చిన వారు ఎట్టి దుర్మార్గము చేసినా , మనమెవ్వరమూ భయ
భ్రాంతులము కాకూడదు. అతిథి దేవో భవ అనుదానిని మరువరాదు. అతిథి సత్కారము
పొందిన వాడు చేసిన దౌష్ట్యమును లెక్క చెయ్యరాదు. అది సాధ్యము కాకపోతే ,
ఇప్పుడే దూరముగా వెళ్ళి నిలవండి. ఎంతదూరము వెళ్ళితే సాధు స్వభావమును
కాపాడుకోవచ్చునో , అంత దూరము వెళ్లండి. ఇది అందరికీ తెలియాలి. " అనెను.
శిష్యుడు , కన్నీరు నింపుతూ , " తల్లీ , అతిథి దుష్టుడాయెను. తపస్వులందరూ క్షోభించుతున్నారు " అని పలికెను.
అరుంధతీ దేవి , " అయిన దానికీ , కానిదానికీ క్షోభ పడునట్లయితే ,
ఆశ్రమమునకు ఎందుకు రావాలి ? ఆశ్రమము లో ఉన్నంతవరకైనా ఆశ్రమ ధర్మమును
పాటించాలి , అవునా ? " యని నవ్వెను.
వృద్ధ శిష్యుడు మారు పలుకలేదు. నమస్కారము చేసి , ఆజ్ఞ నెరవేర్చుటకు వెళ్ళిపోయెను.
కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి
తెలుగు అనువాదం : విభాత మిత్ర
6. " మంత్ర ద్రష్ట " ఆరవ తరంగము
ఆరవ తరంగం
మధ్యాహ్నము మూడవ ఝాము. సూర్య భగవానుడు పశ్చిమ దిగంతము వైపుకు
పరుగెత్తుట ఆరంభించెను. శ్రమజీవులందరూ విశ్రాంతి తీసుకొని , ఆ దినపు
కార్యము ముగిసినదా యని పూర్తి చేసిన పనిని సరి చూసుకొను కాలము. వశిష్ఠులు
తమ పర్ణ కుటీరములో ఒక కృష్ణాజినము పైన కూర్చుని , ఒక పీటను ఆనుకొని ఒరిగి
యున్నారు. ఏదో ఒక ఆలోచన వచ్చి తీవ్రముగా మనసును తొలచి వేస్తుండగా , దానిని
సులభముగా పక్కకు ఎత్తి పెట్టే ప్రయత్నములో ఉన్నట్టుంది. దేహభారమును
ఒరిగియున్న పీటపై వేసి , మనసును ఎదుటనున్న కార్యము పై
కేంద్రీకరించునట్లున్నది. అరుంధతీ దేవి ఎదురుగా కూర్చొని యున్నది. ఆమెకు
ఏదో శీతలమైనట్లు శ్వాస ఎగబీల్చునట్లున్నది. ఆశ్రమములో రక్తపాతమైనప్పటి
నుండీ ఆమెకు మనసు , శరీరము రెంటికీ నెమ్మది లేదు. ఏదో ప్రకోపము నకు లోనై ,
ముగుతాళ్ళను తెంచుకొని , బంధనమును విడిపించుకొనుటకు పెనగులాడే ఎద్దు వలె
ఆమె మనస్సూ , శరీరమూ ఆశ్రమపు శాంత జీవనము కోసము హఠము చేస్తున్నట్లున్నవి.
అయిననూ , మగనిపై కోపించి ననూ , అది చూపుటకు అవకాశము లేకుండా అతనికి వశమయిన
భార్య వలె , ఆమె మనసూ , శరీరమూ ఆమె స్వాధీనములోనే యున్నవి.
వశిష్ఠులు ఆమె వైపు చూచిరి. పరుగెత్తి వచ్చి , రెండు చినుకులను కురిసి ,
మరలా పరుగెత్తి పోవు మేఘము వలే , పట్టు తప్పిన అతని మనసు కూడా , ఒక చిరు
దరహాసమును అతని ముఖముపై చముక్కు మని మెరపించి , అంతలోనే ఎక్కడికో పరుగెత్తి
పోయినట్లాయెను. ప్రసన్నము గానున్నను , ఇటులే అన్యమనస్కము గానే ఆమెను చూచి
పలికెను. ’ దేవీ , నీకు ఆశ్రమముపై యున్న మమత వలన ఈ నాటి విషయమే ప్రబలముగ
ఆలోచిస్తున్నావు. ఆ కౌశికుని వైపు కూడా కొంచము ఆలోచించు , లోకములోని
రాజాధిరాజులనందరినీ గెలిచి వచ్చిన యట్టివాడు , ఇక్కడ , ఆశ్రమమున తన
శౌర్యమునంతా పణముగా పెట్టి , ఓడిపోయి పారిపోవలసి వచ్చెను. అట్లయినపుడు ,
అతనికి మన పైన విద్వేషము రగులుట లో ఆశ్చర్యము లేదు. బ్రహ్మ ద్వేషము
చేయవచ్చునా యనెడి లోకము , ఇంకొక అడుగు ముందుకు వేసి , ’ రాగ ద్వేషాలు రెండూ
మనో వికారములు . కావలెననుకొన్నది రాగము , వద్దనుకొన్నది ద్వేషము .
అభిముఖమైనపుడు రాగము , విముఖమైనపుడు ద్వేషము ’ యను దానిని ఎందుకు చూచుటలేదు
?
కౌశికునికి కామధేనువు కావలెనన్న కోరిక పుట్టినది. దానిని పొందుటకు మనము
అడ్డు యని అతనికి అనిపించినది. అతని అర్థకామమునకు మనము అనుకూలమైనచో ,
అప్పుడు అతను మనకు భక్తుడగును. కానీ ఇప్పుడు అతడు మనలను ’ నా కార్యమునకు
అడ్డముగా ఉన్నారు ’ అనుకొనిన, మనలను ద్వేషించుట సహజమే కదా ! కాబట్టి రాగ
ద్వేషములు రెండును వికారములు అనుకొన్నవారు , ఆ రెంటికీ వశులు కారాదు. దేవీ ,
అది అటులుండనిమ్ము , ఇప్పుడు కౌశికునికి పుట్టిన ఆక్రోశము అకారణమైనది
యనుకున్నావా ? కాదు . దానికి కారణము మనకిప్పుడు తెలియకున్ననూ , ఉండనే
ఉంది. ఆ ఆక్రోశము రాబోవు దానికి శుభ సూచన. అతని హృదయము నందు ఇంతటి
తీవ్రమైన భావన రాకున్నచో , తన సమృద్ధి యయిన రాజ్యమును వదలి , తపస్సుకై
మరలుట ఎట్లు జరుగును ? ’ నీకు కావలసినదానిని తపస్సు వలన సాధింపు ’ మని నేను
చెప్పినప్పుడు ఆ రాజు మనసు ఒప్పుకొనలేదు. దానిని కాల్చి , బూడిద
చేసేటందుకే ఈ నాశనము , ఈ ఆక్రోశము , ఈ క్రోధము కావలసివచ్చెను. నొచ్చుకొని
వేడెక్కినట్లు ఇప్పుడు తపస్సుకు సిద్ధమయినది. కౌశికుడు రాజ్యమును
కుమారునికి అప్పగించి , తాను తపస్సుకు పోవనున్నాడు. ఆ తపస్సులో నిష్ఠా
గరిష్ఠుడై , సాత్త్వికుడు కావలెను , దానికన్నా ముందే , తనలోపల నున్న
రజోగుణమును కడిగివేసుకొనుటకు లోకమున ఒక విప్లవమును తెచ్చును. పెరిగి
నిలుచున్న అడవిని కొట్టివేయవలెను , లేదా దహించవలెను ; లేకున్న , మరలా
అడవిని పెంచుటకు వీలుకాదు. ప్రకృతి కూడా , కొట్టివేయుట కన్న కాల్చుట
సులభమని కాల్చును. అది సహించలేని మానవుడు తన సొమ్మేదో పోయినట్లు బాధ పడును.
సరే , ఆ విషయము వదలి , ముందరి కార్యము చూడు. వామ దేవుడు వచ్చెనా ? ఈ
నాటకమున అతనికి ఒక పెద్ద పాత్ర యున్నది ’ యనెను.
వామ దేవుడు వచ్చెను. గురువుకు నమస్కారము చేసి , అనుజ్ఞ పొంది ,
కూర్చొనెను. వశిష్ఠులు , ముసిముసిగా నవ్వి , ’ వామ దేవులకు రాజ గురువువగు
యోగము వచ్చినట్లున్నది ’ యనిరి. వామదేవుడు ఒక గడియ పర్యాలోచన చేసి , ’
అర్థము కాలేదు ’ యని అతి వినయముగా పలికెను. వశిష్ఠులు నవ్వుచూ , ’ కొండపైని
సరోవరపు నీరు బయలుదేశమున నదిగా ప్రవహించవలసియున్నది. ఆయకట్టును చూచి ,
ఒక్క రాయిని సడలించిన , నీరు బయటికి వదలును. ఆ సమయము వచ్చినది . రాజా
కౌశికుడు , ’ తపస్వి కౌశికుడు ’ కాగలడు. తన బాహుబలము చేత అసాధ్యమైనదానిని
తపోబలముతో సాధించవలెనని రాజ్యమును వదలి , హిమాచలమును ఆశ్రయించును. అక్కడ
అతనికి ఈశ్వరానుగ్రహము సంపాదించు దారిచూపువారు ఒకరు కావలెను. దెబ్బ తిని
చెలరేగినమనసు తీవ్రమైన శ్రద్ధ వైపుకు తిరిగినది . ఆ శ్రద్ధను సరియైన
దారిలోకి మళ్ళించుటకు ఒక విసనకర్ర కావలెను. ఆ విసన కర్ర నువ్వు . ’ అని
పలికిరి.
వామదేవునికి ఇంకనూ ఏదో సందేహము ; అట్లయిన , ఈశ్వరానుగ్రహము పొంది కౌశికుడు మరల ఆశ్రమమునకు వచ్చి యుద్ధము చేయునా ? " యనెను
వశిష్ఠులు , శాంతులై , నిశ్చలులై , నెమ్మదిగా పలికిరి , ’ ఔను. అది
అట్లే కావలెను . రాయి కరిగి , అద్దము కావలెనన్న , అడవిలో ఒకమూల అంతా కాలి
బూడిద కావలెను , ఇది ప్రకృతి నియమము. మన ఆశ్రమములో ఇంకొకసారి
శస్త్రాస్త్రముల విజృంభణమయిన తర్వాత కొత్త సృష్టి ఆరంభమగును. అది మనకు
కావలసిన రీతిలో జరుగలేదని మనము కోపిస్తే , మనమే పిచ్చివారమవుతాము. వామ దేవా
, ప్రకృతి నియమములకు అడ్డుగా ఉన్న వాటిని తీసివేసి , కార్యములు
కొనసాగునట్లు సహాయము చేయుట బ్రాహ్మణ ధర్మము. అందువలన , ప్రకృతి రౌద్రరూపమున
వచ్చిననూ ఆహ్వానించవలెను. జగత్తుయొక్క హితము కోసము తపస్సు చేయు
బ్రాహ్మణుడు తన ప్రియాప్రియములను పట్టించుకొనరాదు. అవ్యక్తము గానున్నదానిని
వ్యక్తము చేయుటకు కావలసిన శక్తి ని కేంద్రీకరించుకొని , ఒక ముఖము నుండి
స్వీకరించి , ఇంకొక ముఖము నుండి వికేంద్రీకరించి , లోకానికి ఇచ్చు యంత్రము
తాను అని గుర్తెరిగిన బ్రాహ్మణుడు యంత్రము వలెనే , ప్రియ , అప్రియములకు
అతీతుడై యుండును. కౌశికుడు అంతటి యంత్రము కాగలడు, యంత్రమును జోడించు భారము
మనది. ఇప్పుడు విడి భాగములు వేరే వేరే యయినట్లు ఉన్నందున , అది ( కౌశికుడు )
విముఖమై మమ్ములను ఆరాధిస్తున్నది. అది అటులనే విముఖముగనే పెద్దది కావలెను.
అట్లు విముఖమై పెరిగి , చివరికి , తాను విముఖమై ద్వేషము చేత ఆరాధించినది ’
ఇది తానే , తనదే , వేరే కాదు ’ యని తెలుసుకొని దానితో తాదాత్మ్యము
చెందును. కాబట్టి , ఆ నమ్మకము మనకు ఉన్నందున , మన కర్తవ్యము మనము చేయవలెను
కదా ? " యనిరి.
వామదేవుడు , ’ గురు దేవుల యనుజ్ఞ సకలమునూ నెరవేర్చగల శక్తి నాకు
రానిమ్ము , ఈ యనుజ్ఞను , ఇట్లు ఎందుకు చేసిరి యని నేనెందుకు అడగవలెను ?
నేనొక ’ దర్వి ’ ని మాత్రమే ( యజ్ఞము నందు ఉపయోగించు చెక్క గరిట ) దర్వి
ఉన్నది యజమానుని ఉపయోగమునకు. యజమానుడు , ఆ దర్వితో తీసుకున్న ఆహుతి ని
ఎక్కడైననూ ఉపయోగించుకొననిమ్ము , అగ్ని లోనో , జలము లోనో , స్థలములోనో ,
ఎక్కడ ఉపయోగించిననూ దర్వికి దానివల్ల ఎట్టి హానియు లేదు. దానికి వలెనే ,
భగవానుల ఆజ్ఞ ను నెరవేర్చుటయే నా పని. కాబట్టి , ఇదిగో , బయలుదేరుతున్నాను "
అని యనెను.
వశిష్ఠులు ఆశ్రమపు పర్ణశాల గోడల మధ్య కూర్చున్ననూ , విశాల జగత్తులో
ముందు ముందు విచిత్ర కథనముతో జరుగవలసిన కథ కు బీజమును వెదకి తీస్తున్న
వారి వలె , అన్యమనస్కముగా , అనన్య దృష్టి తో పలికిరి , " నీవు హిమాలయము
నందు నిలువుము . కౌశికుడు అచటికి వచ్చును. అతడికి ఏమి చేయవలెనన్నది
తెలియదు. అతడు వచ్చినపుడు ,మాటలలో పెట్టి , అస్త్రములు సర్వమూ యున్నది
రుద్రుని యందు , యని చెప్పి , రుద్రారాధన క్రమమును బోధింపుము . " యనిరి.
వామదేవునికి ఎంత నిగ్రహించుకున్నను సాధ్యము కాక , కంట నీరు రాగా , ’ ఆ
అస్త్రములనన్నింటినీ సంగ్రహించుకొని వచ్చి , మన ఆశ్రమమును నిర్మూలించునో
ఏమో ? ’ అనెను. మనస్సు నందు నిండిన భారమైన దుఃఖము పుట్ట వలె పెరిగినది
యనుటను అతని గొంతు గాద్గదికమై సూచించెను.
"
వామదేవులు ఇప్పుడు విచారించవలసినది ఈ ఆశ్రమము యొక్క క్షోభ ను గురించి కాదు
, రాబోవు మహాకాలమున జరగ వలసిన దేవ కార్యము గురించి మాత్రమే. ఇప్పటి భయము
తో కూడిన ప్రణాళిక జరగబోవు మంగళ కార్యపు దారికి అడ్డు రాకూడదు. అంతగా
కావలెనన్న , భవిష్యత్తు తెరను తొలగించి చూడవలెనన్న , చూడు ’ అనిరి.
వామ
దేవుడు చూచెను. అతని మనస్సు , ఇంద్రియములు , కాలము లోగల అవలక్షణాలను
అవతలికి నెట్టివేసి , భవిష్యత్తు ను కరతలామలకము వలె చూచెను. అతడి
మనస్సులోని దుఃఖము సంపూర్ణముగా నాశనమై , దాని స్థానమున అంతే గొప్పగా
ఆనందము నిండెను. లేచి , గురువుకు వందనము చేసి , అనుమతి కోరి నిలిచెను.
అతని దుఃఖము నివారణ అయినట్లే అరుంధతి దుఃఖము కూడా నివారణ ఆయెను. ఆమె మనసు
ప్రసన్నమాయెను.
గురుదేవులు , ’ కృతకృత్యుడివి కమ్ము ’ అని ఆశీర్వదించిరి. శిష్యుడు
గురు దేవుని కీ , గురు పత్నికీ సాష్టాంగ నమస్కారము చేసి హిమాలయమునకు
బయలువెడలెను. (సశేషము)
కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి
7. " మంత్ర ద్రష్ట " ఏడవ తరంగము
ఏడవ తరంగం
అది హిమాలయ ప్రాంతము. దేవదారు వృక్షములు సభ చేసి నిలచినట్లు
పెరిగియున్నవి. అక్కడక్కడ బండలు , బండల పైన పూసిన రాతి పూలు , ఆ చలిలో ,ఆ
బండలు కప్పుకొన్న చిత్ర కంబళుల వలెనున్నవి. ప్రక్కనే ఒక చిన్న నది , బండల
నడుమ జలజలా ప్రవహించుచున్నది. అక్కడే , బండల మధ్య దైవ నిర్మితమైన ఒక
సరోవరము. పైనుంచీ నీరు వస్తున్నది , ఇంకొక మూల నుండి నీరు బయటికి
పారుతున్నది. నది ఈ కొన నుండి ఆ కొన వరకూ దేవదారులు ఉండి , నది , వాటి
పాదాలు కడుగుతూ పోవునటుల ఉన్నది. నదీ జలముయొక్క చలువ తోపాటు , దేవదారు
యొక్క లేత పరిమళము కలసి నిండి , గాలి సర్వవిధముల శ్రమనూ పరిహరించు సఖుడి
వలె వీస్తున్నది.
నది నుండి కొంచము దూరములో కొంచము ఎత్తైన చోట ఒక విశాలమైన మైదానము.
అక్కడ రెండు తులసి మొక్కలు. రెండు పూల మొక్కలు , వాటి వెనుక ఒక పర్ణశాల. ఆ
మొక్కల పక్కనే విశాలమైన ఒక బండ. మొరటుగా పైకి లేపిన పందిరి వలె , ఎత్తు
పల్లములు , హెచ్చుతగ్గులుగా నున్న ఆ బండ పైన ఒకవైపు వామదేవుడు కూర్చొని
యున్నాడు. ఇంకొక వైపు , అతనికి ఎదురుగా కౌశికుడు కూర్చొని యున్నాడు.
వామదేవుడు , బండ పక్కనే పెరిగియున్న చెట్టునానుకొని , దానిపై ఒరిగి ,
నిర్విణ్ణుడై , మనసు పరిపరి విధాలు పోవ , కూర్చొని , కౌశికుడు చెప్పునది
వినుచున్నాడు.. కౌశికుడు , ఏకాగ్రతతో స్పష్టం గా చెప్పుచున్నాడు.
" ఒక గోవును సంపాదించుటకు యోగ్యత లేనివానికి రాజ్యమెందులకు ? అని
ఇక్కడికి వచ్చితిని . ఇప్పుడు నాకున్నదొకటే కోరిక . . ఆ వశిష్ఠుని పై
ద్వేషము. వశిష్ఠులు గొప్ప మనసుతో ఆ గోవును నాకు ఇచ్చియుండవచ్చు. కాని
ఇష్టము లేక , ఆ గోవు నెపముతో , నన్ను నిరాకరించి , తన తపోబలము చేత నా
సైన్యమునంతటినీ ధ్వంసము చేసి , అవమానించిరి. క్షత్రియుడనై ఆ అవమానమును
తీర్చుకొనకుందునా ? "
" అయితే , ఏమి చేయవలెననియున్నావు ? "
" తపస్సు చేసెదను. దివ్యాస్త్రములనెల్లా సంపాదించెదను. వశిష్ఠులను బలి తీసుకొనెదను. "
" లేకున్న బలి యయ్యెదను అని చెప్పు "
" దివ్యాస్త్రములున్నపుడు బలియగుట అనగా నేమి ? "
" ఇక్కడే నువ్వు పొరపడుతున్నావు . కౌశికా , నీవే అంటున్నావు గదా , ఆ
వశిష్ఠులు తమ తపోబలముచేత నీ సైన్యమును ధ్వంసము చేసెనని ? ఇప్పుడు నువ్వు
తపస్సు చేసి సంపాదించు అస్త్రములు ఆ మహా తపస్వికి తెలియనివనుకొనుచున్నావా
? బహుశ , నువ్వు సంపాదించబోయే అస్త్రములతో పాటు , నీకు సంపాదించుటకు
సాధ్యము కాని అస్త్రములు కూడా అతనికి తెలిసియుండ వచ్చును. "
" అది కూడా సాధ్యమే..అట్లయిన నేనేమి చేయవలెను ? "
" అది నీ ప్రారబ్ధమును బట్టి యుండును. నువ్వు నా శిష్యుడివి కావు. ’
అన్య శిష్యం నబోధయేత్ ’ అని శాస్త్రము అంటున్నది . అయిననూ , నాకు దైవానుజ్ఞ
అయినది . నువ్వు అడిగిన ప్రశ్నలకు ఉత్తరము ఇవ్వగలను. నాకు , నీకు
జరగబోయే శ్రేయస్సులో గానీ , హానిలో గాని భాగము లేదు. "
కౌశికుడు కొంత సేపు ఆలోచించెను. " ఏమయినా కానిమ్ము , వామదేవా , నాకు
అస్త్రములను సంపాదించు మార్గము చెప్పు. మొదట అస్త్రములు దొరకనిమ్ము , ఆ
తరువాతనే వాటిని ఉపయోగించు విషయము. "
" అటులనే కానిమ్ము , ధనుర్విద్యకు ఆచార్యుడు రుద్రుడు. అతనిని మెప్పించిన , సర్వ శస్త్రములూ , అస్త్రములూ నీ వశమగును. "
" అతనిని మెప్పించుట యెట్లు ? "
" వేదములయందున్న రుద్ర సూక్తములతో జపము , హోమము , తర్పణములను ఆచరించు.
నీవు చేయు ఆ కర్మలయందు నీకు శ్రద్ధ పెరిగిన కొలదీ , జగత్తంతయూ
రుద్రమయమగును. అగ్నియందు పడిన కాష్ఠము తానుకూడా అగ్ని యగునట్లు నువ్వు
కూడా ఒక దినము రుద్రుడివి యగుదువు. అప్పుడు అతని అస్త్రములు నీవి యగును.
అయిననూ , కౌశికా , నువ్వు ద్వేషమును దిగమింగి , శాంతుడవై , గొప్ప
లక్ష్యమును ఆశించి తపస్సు చేయుట మంచిది . "
" వామదేవా , నేను కూడా యోచించితిని , కాని, నాకు అటుల చేయుటకు ఇప్పటిలో
సాధ్యము కాదు. ఇప్పుడు నా మనస్సుకు ధర్మాధర్మములు కనిపించుటయే లేదు. నాకు
తెలియదా , బ్రహ్మ క్షత్రములు రెండూ కలసిన లోకానికి వృద్ధి. అట్లు కాక ,
భిన్న మార్గముల పోయిన , లోకమునకే హాని. కానీ నేను ఓడిపోలేను. "
" నిజమే . ఈ లోకము నూతనమగుచున్నది . దానివలన , కాల ప్రేరితులై జనులు
బ్రహ్మ ద్వేషమునవలంబించి , తామూ చెడి , ఇతరులనూ చెరుపుదురు. చూడు , అప్పుడే
నా దృష్టికి గోచరమగుచున్నది , హైహయులు భృగువుల పైన దండెత్తినారు . రాజుల
ధనమంతటినీ భార్గవులు అపహరించినారని వారిపై ఆరోపణ చేసి , వారిని చిత్రహింసకు
గురి చేసి , వారి వంశమునే నిర్మూలము చేయవలెననియున్నారు . కానీ , పవిత్రమైన
భృగు వంశమును నాశనము చేయుట సాధ్యమా ? అంతలోపలనే , అతి క్షత్రియుడైన
వీరుడొక్కడు భార్గవులలో జన్మించినాడు. హైహయుల అపరాధమునకు కోపించి , భార్గవ
శాపము వలన , ముందే హతమయి యున్న క్షత్రియ కులమునే నిర్మూలించును.
ఇక్కడ చూడు , భృగువుల పత్నులు ఈ దుష్ట క్షత్రియులకు బెదరి ,
ఆశ్రమములందు నిలువలేక , పారిపోయి హిమాలయములలోని అరణ్యములందు చేరినారు .
వారిలో అనేకులకు గర్భపాతమయినది . గర్భస్థ శిశువులనూ వదలని ఆ హైహయుల
మృత్యుదేవతను ఒక పుణ్యవతి తన ఒడిలో ఉంచులొని ఆడించుచున్నది . ఆ శిశువుది
ఏమి తేజస్సు ? సాక్షాత్తూ అగ్నిదేవుని వలె ప్రకాశించుచున్నాడు. అదిగో ,
పుట్టిన వెంటనే సర్వ క్షత్రియుల వినాశనము కొరకు యజ్ఞము చేయుదు ననుచున్నాడు.
.. అతనిపితృ దేవతలు వచ్చి , " వలదు , ఇది మరియొకని కార్యము " అనుచున్నారు.
అంతలోపల అక్కడికి వచ్చిన క్షత్రియులు అతని తేజస్సు చూచి కంటి చూపు
పోగొట్టుకొని , అంధులగుచున్నారు . ఆ భృగు పితరులు ఆ బాలకుని సమాధాన పరచి ,
అతని కోపమును సముద్రములోకి పడవైచుచున్నారు . అక్కడ కూడా అది ప్రజ్వలిస్తూ ,
సముద్రమునే స్వాహా చేయుచున్నది . కౌశికా , నువ్వు కూడా ఇటులనే కాల
ప్రచోదితుడవై విద్వేషమును సాధిస్తున్నావు . నాదొక మాట గుర్తుంచుకో . నీ
ద్వేషము నిన్నే తినివేసి ,నువ్వు బలియైననూ , నువ్వు బ్రతికియుండ గల ఆలోచన
చెయ్యి . "
’ అది యెట్లు వామదేవా ? "
" నువ్వు వశిష్ఠుని ద్వేషించు . కానీ తిరస్కరించకు. ద్వేషముతో పాటు
వచ్చు తిరస్కారమును తరిమి వేసి , ద్వేషమును మాత్రము ఉంచుకో . బతక గలవు " .
ఇంకొంతసేపు ఇద్దరూ ఆ బండ పైననే కూర్చున్నారు . ఎవరూ మాట్లాడలేదు .
వామదేవుడు ఆర్ధ నిమీలిత నేత్రుడై , ముందరి భవిష్యత్తును చూచుటను కౌశికుడు
తలస్తూ , "అతడు భవిష్యత్తునెట్లు చూచెను ? నా భవిష్యత్తును కూడా చూచెనా ?
యనుచూ ఏమేమో చింతించుచుండెను . వామదేవుడు కూడా , తాను చూచిన భవిష్యత్తు
యొక్క అర్థమునెరిగి , ప్రకృతికి ఈ భయంకర రుద్రలీలయందు అదేమి సంతోషమో యని
ఒకసారి , సంహారము లేని సృష్ఠి ఎక్కడుండును యని ఇంకొకసారి .. ఇటులనే భావ
తరంగముల యందు ఆడుతున్నాడు.
కౌశికుడు కొంతసేపు అయిన తరువాత ," ఆర్యా , నా భవిష్యత్తు ఏమిటి ? " యనెను .
వామదేవునికి నవ్వు వచ్చెను . నవ్వి , " అది తెలిసినదే . నువ్వు
అస్త్రాలను సంపాదించి , వశిష్ఠుని పై పడెదవు . నువ్వు బలవంతుడవైన , అతను
భ్రంశము చెందును . అతని బలము హెచ్చయిన , నువ్వు మరల దెబ్బతిని వచ్చి , ఏదో
ఒక మూల ముక్కు పట్టుకుని కూర్చొనెదవు . "
" ఇక వేరే తరుణోపాయము లేదా ? "
" లేదు . తపస్సు ఒకటే యున్నది . తపస్సు వలన ఏమి కావలెనన్ననూ
సాధించవచ్చును అనునది మనసున ఒకసారి నాటుకున్న , మనిషి మనసు మిగిలిన వాటిని
పారద్రోలును . అతనికి తృప్తియగునది ఆ ఒక్కదాని వల్లనే . ఆ తపస్సు నీ తపస్సు
వలె రాజసమగునో , సాత్త్వికమగునో.... అదిమాత్రము , ప్రారబ్ధము
ననుసరించియుండును. "
కౌశికుడు ఇంకనూ అడగవలెనని అనుకొనునంతలో , వామ దేవుడు , " ముందరి మాటలు
తరువాత , ఇది తామస వేళ . ఇప్పుడు తపస్వులు బహిర్ముఖులై యుండరాదు " అని
లేచి వెళ్ళిపోయెను .
కౌశికుడు " ఆ దినము వశిష్ఠులూ అదే మాట పలికిరి . నేను దానిని లెక్క
చేయలేదు . ఇప్పుడు ఇతడు కూడా , కాల వశము వలననే నేను ద్వేషము
పెంచుకున్నాననెను . అట్లయిన , మానవుడు కాలము ఆడించునట్లు ఆడు కీలు బొమ్మ నా
? వానికి స్వాతంత్ర్యము లేదా ? నేను స్వతంత్రుడను అనుకొనునది , కేవలము
ఔపచారికము మాత్రమేనా ? " అనుకొనుచూ , తన ఆశ్రమము వైపు బయలు దేరెను. (సశేషం)
కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి
తెలుగు సేత : విభాత మిత్ర
తెలుగు సేత : విభాత మిత్ర
మడి - ఆచారాలు.
బ్రాహ్మణకులం
లో ఆచరించే మడి, ఆచారాలు రాను రాను బయటవారిలోనే కాదు, ఆ కులం లోని
యువతలోనూ, హాస్యాస్పదంగా, అర్థరహితంగా కనబడుతున్నవి. అందుకు కారణం
ఏమిటంటే, అందులో వున్న అంతరార్ధం విడమరచి చెప్పలేక పోవడం.
ఇప్పటికే,
గుడీ, దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో, దైవ కార్యాలు చేసే/చేయించే
బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించడం లేదు, చాలాచోట్ల. మనముందే వాళ్ళు
వేసుకున్న షర్టు విప్పేసి, మెడలో ఉత్తరీయం వేసుకుని ' ఓం ! ' అని పనులు
మొదలు పెట్టిస్తున్నారు.
అసలు, దీని కథా , కమామీషు యేమిటో చూద్దాం.
ఏదైనా
దైవ కార్యం నిర్వర్తించేటప్పుడు, ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్దతి మనకు
వున్నది. ప్రాణాయామం చెయ్య మనడానికి బదులు పురోహితుడు ' మీ ముక్కులు
పట్టుకోండి. ' అంటాడు. మనం పట్టుకుంటాం. ఆచమనం, ప్రాణాయామం అంత:
శుద్ధికని ఆయన చెప్పడు, మనకూ తెలీదు. ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే
వున్నారు, అందులో మార్పు ఏమీలేదు. అర్ధమైన వారికి అర్ధం అవుతుంది. అర్ధం
కాని వాళ్ళు పురోహితుడు ' చేతులను మీ వైపు తిప్పుకోండి ' అని చెప్పి ఆ
దేవతని ' ఆవాహయామి ' అని మన చేత చెప్పిస్తారు. అలాగే కార్యక్రమం అయిన
తరువాత, ' మంత్రహీనం, క్రియాహీనము.. ' చెప్పించి, ఆ దేవతకు ఉద్యాపన
చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు. ఇదంతా ' కార్యక్రమం మొదలు,తుది ' అని
తెలుసు కానీ, ఆ దేవతలు మనతో అప్పటిదాకా వున్నారన్న భావం మనకు రాదు.
ఇవన్నీకూడా
మనచేత చేయిస్తారు. అయినా మనకు అవేమీ పట్టవు. వచ్చిన బంధువులను చూస్తూ,'
కాఫీలు తాగారా, టిపినీలు తిన్నారా ' అని వాళ్ళను నవ్వుతూ పలుకరిస్తూ,
వచ్చిన వాళ్ళచేతనే, ' మీరు కార్యక్రమం చేసుకోండి. మేము మాకు కావలసినవి
చూసుకుంటాము, ' అని చెప్పించు కుంటాము. మీ తమ్ముళ్లతోనే,
కుటుంబసభ్యులతోనో వారు గడుపుతారు.
ఈలోపు ఇంకొక చుట్టమో,
స్నేహితుడో, మన ఆఫీసరో వస్తాడు. మళ్ళీ ఇదే తతంగం. ఇంతకుముందు రోజుల్లో,
పురోహితులు మధ్యలో కర్తను ఎవరైనా మాట్లాడిస్తే, అభ్యంతరం పెట్టేవాళ్ళు.
ఇప్పుడు ఆలా చేస్తే, ' మళ్ళీ పిలవరేమో ' అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్
లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ వుంటారు.
అదే విధంగా
సంధ్యావందనం సమయంలో ' ఆయాతు వరదా దేవీ... ' అని చెప్పినప్పటినుంచి,
గాయత్రీ, సావిత్రి, సరస్వతి మొదలైన దేవతలను మనమీదకు ఆహ్వానించుకుంటాము.
తిరిగి ' ఉత్తమే శిఖరే జాతే ' అనిచెబుతూ ' గచ్ఛదేవి యధా సుఖం ' అని
చెప్పేదాకా అమ్మలంతా మనతోనే వున్నారన్న మాట. ఇంత విశద౦గా ఏ బ్రాహ్మలూ
చెప్పరు. మనమూ తెలుసుకోవాలని అనుకోము.
అలాగే, పూర్వం రోజుల్లో,
ఇళ్లల్లో ఆడవారు కూడా, ఏటికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు, జలదేవతను
ఆరాధించి నీళ్లు బిందెలతో నింపుకునేవారు. ఆ దేవత వారితో వున్నదనే భావనతో
ఇంటికి వచ్చి, దానితో వంట కార్యక్రమాలు చేసేవారు. అలాగే అగ్ని. అగ్నిని
ఆవాహన చేసి, జలం తో వంటచేస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో,
బియ్యాన్ని వండుతూ, శాక0బరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ, మధ్య
మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ వుండేవారు.
ఇప్పుడు
చెప్పండి. అలాంటి వారికి, వారిని ఎవరైనా ముట్టుకున్నా, అపరిశుభ్రమైనవి
ఏమైనా కనబడినా, తగిలినా, ఏదో అపరాధనా భావము కలిగి, వాటిపై శుద్ధి నిమిత్తం
నీరు చల్లడము, విష్ణు,విష్ణు అనీ శివ శివా అనీ అనడమూ తిరిగి పనిలో
మునిగిపోవడం ఆనవాయితీ.
జలం మానవుడికీ, దేవతలకూ అనుసంధానమైన పంచ
భూతములలో ఒకటి. అందువలన నీటితో ఆ గిన్నెపైనో, బట్టపైనో సింబాలిక్ గా శుద్ధి
కార్యక్రమం చేసేవారు, వీలయితే తిరిగి స్నానం చేసేవారు. ఇక్కడ ' నీళ్లు
చల్లితే మైల, మడి అయిపోతుందా? ' అని ప్రశ్నలు యువతరం వేస్తారు.' నీళ్లు
గుమ్మరించుకుంటే, శుద్ధి అయిపోతారా ? ' అని వితండవాదం చేస్తారు. ఆజలం
ద్వారా, అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని వుండడం వలన, ఆ దేవతను
సంతృప్తి పరచే కార్యం శుద్ధి చేసుకోవడం.
ఇదంతా ఎవరూ చెప్పరు. ఎంత
సేపటికీ ' పసుపు వాడితే బ్యాక్తీరియా పోతుంది. ఇంకేదో చేస్తే క్రిమి
కీటకాలు పోతాయి ' అని చెబుతారు కానీ.' మనది కర్మభూమి. దైవభూమి. మనము
దేవతలను నమ్ముతాము. దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాము.' అని ఢంకా
బజాయించి యెవరూ చెప్పరు. ఇంకా హేళన చేస్తారేమో అని భయం. ఉన్న విషయం
చెప్పడానికి మనకూ తెలియాలి కదా !
పెద్దలు, పండితశ్రేష్ఠులు,
అనేకమంది మిత్ర సమూహం లో వున్నారు. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో
వ్రాసాను. దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాలమీద చులకన భావన
పోయేటట్లు చేయగలరని మనవి. ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్ధమైతే,
మిగిలిన వారికీ చెప్పగల పరిస్థితిలో మనం వుంటాము.
మనకే అర్ధంగాక,
దైవకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా, మడి కట్టుకున్నవాళ్లకు దూరంగా వుండమని
చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం. ' ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా, అరవైలు
దాటినాయి కదా ! చాదస్తం. ' అనే స్థితి మనకు రాకుండా మనలను మనం,
కాపాడుకుందాం.
సేకరణ
సిద్దార్ధ టికెట్ టికెట్ అంటూ ట్రైన్ లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక
పాత నలిగిపోయిన పర్సు కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో
కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు . ఎవరిదో
తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు . ఎలా తిరిగి ఇవ్వడం ?
.
" ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ
పర్స్ కేసీ చూశారు . తమ జేబులు తడుముకున్నారు . ఈ విషయం పక్క బే లో
కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు .
.
" మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనమాలు ఏమిటీ ? "
.
" అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ " అన్నాడాయన
.
" అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
.
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమె !
.
"
బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు . అప్పుడు నాకు మా
అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో
పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు
అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో
పెట్టుకున్నాను . "
.
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా
భార్య చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ అపుడు ఆమె ఫోటో నా పర్సులో
పెట్టుకునే వాడిని .
.
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు
పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం ఆఫీసు వదల గానే ఇంటికి
వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ
రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా
లోకం . అపుడు నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు ఇపుడు
అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు
నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా కృష్ణుడిని
పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు .
నా విచారానికి ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో
పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో
గడుపుతున్నాను . "
.
.
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు .
.
.
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
.
" దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో పెట్టుకోడానికి "
వాట్సప్ సేకరణ.
*శిక్ష*
ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు
15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు
ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు
అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు.
దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.
20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.
అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.
దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా...
ఒకరోజు దొరికిపోయాడు.
మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.
మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ రోజును చెప్పేసారు
చివరగా అతని కోరిక ఏమని అడగగా
తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు
అతని కోరిక మేరకు వారిని పిలిపించారు
కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు
పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు
అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు*
నా
పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు మండలించాడని చెప్పగానే
బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు. 14 ఏళ్ల వయసు
లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు
ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు
వచ్చారు.
అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.
అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం
ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు
చిన్నప్పుడు తప్పు చేయగానే ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు
చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..
పిల్లల్ని
చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక
తల్లిదండ్రులను కూడా వారి అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*యద్భావం తద్భవతి ...*
ఒక
ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు.
ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు.
ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు.
విష్ణుదూతలు
వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును
చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో
స్తోత్రాలతో స్తుతి చేశాడు,ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’
అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు.
దానికి అతడు
అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు. ‘‘నువ్వు
చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని
విష్ణుదూతలు చెప్పారు. ‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు
భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు. ‘‘అది నిజమే.
కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు.
ఒకటి..
నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం
వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును
ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు.
రెండో కారణం..
‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ
దేవదేవుని కోరేవాడివి అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా
జన్మించాలని కోరిక ఉంది.
ఇక మూడో కారణం.. రోజూ పూజ పూర్తవగానే
‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం
ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున
భూలోకానికి వెళ్తున్నావు’’ అని చెప్పారు. అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు
సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు.
వీడెలా
వచ్చాడిక్కడికి ? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణు దూతలను అడిగాడు.
దానికి వారు.. ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు.
దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ
చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను
ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగానైనా సరే.. నీకంటే ఎక్కువగా భగవంతుడి
గురించి ఆలోచించాడు.
మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప
అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని
పేరుపెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం
చేసింది.
వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా
పొలమారింది. విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని
పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన
ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి
వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు.
భక్తితో పాటు
భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే..
మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు.
మనసారా
విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా
పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో
నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే..
మరుజన్మలో స్వామిని
త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే
చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.
🙏 *ఓం నమో నారాయణాయ*🙏
*సేకరణ :*
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు (102)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
నా చిన్నప్పుడు నాకు చెప్పిన కథ..
-
🟣గురు శిష్యులు🟣
పూర్వ కాలంలో గురు శిష్యులు ఉండేవారు. కొన్ని
సంవత్సరాల పాటు గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని శిష్యుడు
జ్ఞానం సంపాదించాడు. తన దగ్గరి నుండి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి
సమయం ఆసన్నమైంది అని గురువు శిష్యుడిని పిలిచి ఆశ్రమం నుండి వెళ్లడానికి
అనుమతి ఇస్తాడు.
శిష్యుడు గురువు పై ఉన్న గౌరవంతో "గురువుగారూ..!
ఇన్నాళ్ళుగా మీ బోధనల వలన నేను అపారమైన జ్ఞానం సంపాదించాను. మీరు నాకందిచిన
ఈ జ్ఞానానికి గురు దక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ స్థాయికి
సరిపడేంత విలువైనది ఏదీ నాకు కనిపించడం లేదు.. కనుక మీరు ఏం కావాలో
కోరుకోండి.. దాన్ని మీ గురు దక్షిణ గా సమర్పించుకుంటాను." అని గురువుతో
పలికాడు.
ఆ మాటలు విన్న గురువు చిన్నగా నవ్వుతూ "నాపై నీకున్న
గౌరవానికి సంతోషిస్తున్నాను. నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు బాధ్యతగా, ధర్మ
బద్ధంగా జీవితం కొనసాగించు.. అదే గురుదక్షిణ" అని హితవు పలికాడు.
శిష్యుడు గురువు మాట వినకుండా " మీరు నన్ను అడిగి
తీరాల్సిందే.. మీరు అడిగింది ఎంత కష్టమైనా, ప్రపంచం అంతా గాలించి అయినా సరే
తెచ్చి ఇస్తాను. దయచేసి మీకు ఏం కావాలో విన్నవించండి" అని వేడుకున్నాడు.
గురువు ఎంత చెప్పినా అతడు వినాకపోయే సరికి గురువు గారు ఇలా
అడిగారు. "చూడు నాయనా..! ఈ సృష్టిలో ఎవరికీ, దేనికీ పనికిరానిది ఏదైనా ఉంటే
అది నాకోసం తీసుకురా.. నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో.. ఎప్పుడు నీకు
నేను అడిగింది దొరుకుతుందో అప్పుడు దాన్ని నాకు గురు దక్షిణగా సమర్పించు. "
అని చెప్పాడు గురువు.
గురువు మాటలు విన్న శిష్యుడు "ఏమిటి గురువు గారూ... !
పనికిరాని వస్తువా .. ! నేను ఎంతో కష్టతరమైన కోరిక కోరుతారు అనుకుంటే ఇంత
సులభంగా అడిగారేమిటి..? క్షణాల్లో తీసుకొస్తాను" అని శిష్యుడు అక్కడి నుండి
సెలవు తీసుకుని వెళ్ళాడు..
శిష్యుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఎండిపోయి రాలిన ఆకుల్ని చూసాడు. ఇవి
పనికి రానివే కదా అని గురువుకు ఇద్దాం అని తీసి సంచిలో వేశాడు. కాస్త దూరం
నడిచి ఆలోచించాడు.. ఎండిపోయిన ఆకుల వలన లాభం లేకపోలేదు.. వీటిని కాల్చి ఆ
మంటతో చలి కాచుకోవచ్చు. లేదా వంట కోసం పొయ్యిలో వేసి మంట వెలిగించ వచ్చు.
కనుక ఇవి గురువు గారికి ఇవ్వడం కుదరదు అని సంచిలో నుండి తీసి పారేశాడు.
మళ్లీ ఆలోచించి వీటిని కాల్చడం వలన బూడిద వస్తుంది. ఆ బూడిద గురువు గారికి
ఇస్తాను అనుకుని వాటిని తగళబెడతాడు. బూడిదను తీసుకెళుతు, దీనితో పాత్రలు
శుభ్రం చేయవచ్చు. కనుక ఇది కూడా గురువు గారికి ఇవ్వలేను అని బూడిద విడిచి
పెట్టి ముందుకు సాగుతాడు.
ఈసారి అతడికి ఒక బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర పాడుబడిన ఒక
చేంతాడు కనపడుతుంది. ఈ తాడు తెగిపోయి ఉంది. కనుక నీళ్ళు తెండడానికి ఇది
పనికి రాదు. కనుక అది ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆలోచించి కనీసం కట్టెలు
కట్టడానికైన తెగిన తాడు ఉపయోగపడుతుందని దాన్ని విడిచి పెడతాడు.
ఇంకాస్త ముందుకు పోతాడు. చిన్న రాళ్ళ గుట్ట కనపడుతుంది. రాయిని
తీసికెళ్ళి ఇద్దాం అని తీసుకుంటాడు. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న
రాయిని తీసుకుని ఆ రాళ్ళ గుట్టకు ఎదురుగా ఉన్న చింత చెట్టు చూసి చింత
కాయల్ని కొడతాడు. అది పనికి వచ్చేదే అని విడిచి పెడతాడు..
కొంత దూరం పోయాక విరిగా కుండని దారిలో చూస్తాడు.. పగిలిన కుండ అసలు
దేనికీ పనికిరాదు అని సంతోషంగా ఆ పెంకులు గురువుగారికి ఇవ్వడానికి
సిద్ధపడతాడు. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ పెంకు ముక్కల్ని తీసుకుని
వెళ్తుంటే వాళ్ళని పిలిచి అవెందుకు మీకు అని అడుగుతాడు. మేము ఈ
పెంకుముక్కళ్తో తొక్కుడు బిళ్ళ ఆట ఆదుకుంటాం అని జవాబు చెప్తారు. దానితో
అది కూడా పనికి వచ్చేదే అని నిరాశగా విడిచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అంతా
వెతికి ఎక్కడా ఏమీ దొరకక నిరాశగా గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని
అడుగుతాడు.
"గురువుగారూ మీ బోధనల ద్వారా నేను పూర్తి జ్ఞానం సంపాదించా
అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఈ సృష్టిలో పనికిరాని వస్తువు ఏదీ
ఉండదు. ప్రతి ఒక్కటీ ఏదో ఒక విధంగా ప్రతి జీవికీ అవసరమైనది. ఒకరికి
అనవసరమైన వస్తువు మరొకరికి అవసరమైన వస్తువు అవుతుంది. ఈ విషయాన్ని నేను
గ్రహించలేక అంతా తెల్సు అని గార్వపడ్డాను. నన్ను క్షమించండి అని గురువు
పాదాలపై పడ్డాడు.
బదులుగా గురువుగారు " చూడు నాయనా ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి
అయావు. నేను జ్ఞాన బోధన మాత్రమే చేశాను. దాని ద్వారా మీరు జీవితాన్ని
తీర్చి దిద్దుకోవాలి.. ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలా నిన్ను నువ్వు
తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో నీకంటూ ప్రత్యేక స్థానం నువ్వు కలిగి ఉంటే అదే
నాకు గురుదక్షిణ అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు.
గురువు మన నుండి ఏమీ ఆశించడు. మన విజయాన్ని తన విజయంలా భావించి మనకంటే
ఎక్కువ సంతోష పడతాడు. అటువంటి గురువులకు మనం ఇవ్వగలిగే నిజమైన గురు దక్షిణ
వాళ్ళు మనకు నేర్పిన విలువల్ని పాటించి సమాజంలో నిలబడటమే. అటువంటి గురువు
మనం ఏం ఇవ్వాలని అనుకున్నా అది తక్కువే.. కనుక మనకు విద్య నేర్పిన గురు
వులు ఎప్పుడు ఎక్కడ కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం.
(())
అంతర్జాల పత్రిక కధలు
*ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!*
*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..
```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్బెల్ కొడితే
వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ,
బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో
కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు
కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ
స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్గా
చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్. బాగా
తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే
వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి
రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్ ఛైర్మన్
కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే
పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు,
ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్మాస్టర్గా
పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా
చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో,
ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు
బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో
తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే
రిసెప్షన్. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ
ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను
మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు
చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం
చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను-
ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్కి వస్తాననీ చెప్పాను.
పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే
రిసెప్షన్కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు
పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్ గురించి గుర్తుచేసి,
బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన
బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం
జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా
పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు.
రిసెప్షన్ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం.
సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.
చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన
ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు
గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి
ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి
అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత
ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా
తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ
వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ
దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే,
నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో
నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న
బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు
డిన్నర్ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి
తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా
మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర
దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.
దైవసమానులైన మాస్టారుగారికి,
నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా
పెళ్ళి రిసెప్షన్లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం
చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో
అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత
చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా
భావిస్తాను. దీని గురించి చర్చించేముందు నాకు మీ గురించి ఉన్న అభిప్రాయాలని
తెలియజేయాలని అనుకుంటున్నాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్మోడల్. చిన్నప్పటి నుండీ
నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో
చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి
విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి.
మిమ్మల్ని మరీ విసిగించకుండా ఉదాహరణగా స్కూల్లో జరిగిన ఒకటి రెండు
సంఘటనల్ని మీకు గుర్తుచేస్తాను.
ఓరోజు మాకు సోషల్ స్టడీస్ క్లాసు జరుగుతుండగా మీరు రౌండ్సుకి వచ్చారు.
ఆ సమయంలో మేమంతా సోషల్ స్టడీస్ మాస్టారు వెంకట్రావుగారు పెట్టిన
స్లిప్టెస్ట్ రాస్తున్నాం. మీరు వచ్చిన సమయానికి వెంకట్రావు మాస్టారు
చిన్న కునుకు తీస్తున్నారు. పాపం అంతవరకూ ఆయన మాకు బోధిస్తూనే ఉన్నారు.
మీరు క్లాసులోకి వచ్చి మాస్టారుని ‘‘ఏమిటిది మాస్టారూ, క్లాసులో ఇలా
నిద్రపోతున్నారు?’’ అని గట్టిగా మందలించారు. పాపం ఆయన సంజాయిషీ
ఇవ్వబోతుంటే, ‘వద్దు, తర్వాత వచ్చి కలవమని’ కాస్త కటువుగా చెప్పారు.
వెంకట్రావు మాస్టారి ముఖం చిన్నబోయింది. మాకూ కొద్దిగా బాధ అనిపించింది.
ఆయన చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఏ మాస్టారుదైనా పుట్టినరోజైతే, ఆ ఉదయం అసెంబ్లీ సమయంలో మీరు
వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించి, వారి గురించి రెండు మంచిమాటలు
మాట్లాడేవారు. అది మన స్కూల్లో ఆనవాయితీ. పై సంఘటన జరిగిన మర్నాడు
వెంకట్రావు మాస్టారి జన్మదినం. ఆరోజు అసెంబ్లీ సమయంలో మీరు ఆయనకు
పుష్పగుచ్ఛం ఇచ్చిన తర్వాత చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
‘వెంకట్రావు మాస్టారు మనకున్న మంచి ఉపాధ్యాయుల్లో ఒకరు.
పూర్వవిద్యార్థులెవరైనా నాకు బయట ఎక్కడైనా కనిపిస్తే ముందుగా ఆయన కుశలాన్ని
గురించి తప్పక అడుగుతారు. ఇక్కడ నిన్న జరిగిన ఓ సంఘటన గురించి మీ అందరికీ
చెప్పాలి. నేను రౌండ్సులో భాగంగా ఆయన క్లాసుకి వెళ్ళాను. పిల్లలంతా
స్లిప్టెస్ట్ రాస్తున్నారు. మాస్టారు చిన్న కునుకులో ఉన్నారు. నేను ఆయనను
మందలించి తర్వాత వచ్చి కలవమన్నాను.
ఆయన నన్ను కలిశాక తెలిసిందేమిటంటే, మొన్న రాత్రి మాస్టారుగారి అమ్మాయికి
తీవ్ర అస్వస్థత చేసిందట. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
ఉదయం ఆరుగంటలకికానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మాస్టారికీ ఆయన భార్యకీ
రాత్రంతా నిద్రలేదు. ఆవిడని వాళ్ళమ్మాయికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి,
ఆయనమటుకు మామూలుగానే స్కూలుకి వచ్చేశారు. ఆయనకి సెలవులు చాలా ఉన్నాయి.
‘మాస్టారూ, సెలవు తీసుకోపోయారా’ అని నేనంటే, ఆయన ఏమన్నారో తెలుసా- ‘పిల్లల
ఫైనల్ పరీక్షలు దగ్గరబడ్డాయి. వాళ్ళని బాగా ప్రిపేర్ చేయాలిగదా సార్.
ఆసుపత్రిలో నేనుండి చేసేపని ఏదీలేదు. మా ఆవిడ చూసుకుంటుంది’ అని. ఎంతమందికి
ఇలా పనిమీద భక్తి ఉంటుంది చెప్పండి?
దురదృష్టంకొద్దీ ఆ నిద్రలేమి ప్రభావంఓ క్షణం ఆయన మీద పడింది. కాకతాళీయంగా
నేను అదే సమయంలో వెళ్ళాను. అనవసరమైన ఆవేశంతో ఆయన్ని పిల్లలముందు
మందలించినందుకు నేను ఆయన్ని మన్నించమని కోరుకుంటున్నాను’
అని ఆయనవైపు చేతులు జోడించారు. వెంకట్రావు మాస్టారు కళ్ళల్లో మెదిలిన చిన్న
కన్నీటితెర, మీ తప్పేమీలేదన్నట్లుగా మిమ్మల్ని వారిస్తూ మీకు చేసిన ప్రతి
నమస్కారం నేనెప్పటికీ మర్చిపోలేను.
ఆరోజు మీ మాటలు విన్నాక నాకు అర్థమైన విషయమేమిటంటే, మనం తెలిసిచేసినా
తెలియకచేసినా తప్పు చేస్తే, అది ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నలుగురిలో మీరు
మాస్టారుని మందలించారు కాబట్టి, పదిమందిలో క్షమాపణ కోరారు. ఆ విధంగా
చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఎవరైనా మంచిపని చేస్తే వెంటనే
మెచ్చుకోవాలి. అది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది అని అర్థమయింది. ఆరోజు
నేను నేర్చుకున్న ఆ పాఠాలు, ఇవాళ నా వృత్తిలో ఎదగడానికీ నా సహోద్యోగులతో
మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బహుమతి
స్కూల్లో ఆటలపోటీలు జరిగినప్పుడు గెలుపొందినవారికి కప్పులూ మెడల్సూ
ఇచ్చేవారు. అదే క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందినవారికి
మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.
ఆ పుస్తకాలు జనరల్నాలెడ్జికి సంబంధించినవో మహనీయుల జీవితచరిత్రలూ లేదా
ఆత్మకథలో అయి ఉండేవి. ఓ వారం, పదిరోజులయ్యాక మీరు ఆ బహుమతి పొందిన
విద్యార్థిని ఆ పుస్తకంలోని విషయాల గురించి అడిగేవారు. ఇచ్చిన పుస్తకం
చదివామా లేదా, అందులోని ఏ మంచి విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశాయో
తెలుసుకోవాలని మీ యోచన. మొదట్లో అది మాకు కొంత ఇబ్బందిగా ఉండేది. బహుమతి
ఎందుకు వచ్చిందా అనుకునేవాళ్ళం. కానీ రానురాను దానివల్ల మంచి పుస్తకాలు
చదవాలన్న ఆసక్తి మాలో కొంతమందికి కలిగింది. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలా
ప్రయాణాలు చేస్తూ ఉంటాను.
ఆ సమయాన్ని నేను మంచి పుస్తకాలు చదవడానికి వెచ్చిస్తాను - ఆ పుస్తకాల
ప్రేరణతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అవి నా ఉద్యోగంలోనూ నిత్య
జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న ఇంకో విషయం- సమయపాలన. మీరు స్కూలుకి
ఎప్పుడూ అందరికంటే ముందు వచ్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా
పని ఉండి స్కూలు వదిలిన తర్వాత కూడా ఉండి, పనిచేసుకుంటూ ఉంటే మీకు అవసరం
లేకపోయినా ఆయనకి తోడుగా ఉండేవారు. అది మీ సహోద్యోగులకి మీరిచ్చే ఓ భరోసాలా
ఉండేది. ఈ విషయంలో కూడా మిమ్మల్ని నేను అనుకరిస్తూనే ఉన్నాను.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని గమనించి ఎన్నో మంచి విషయాలు
నేర్చుకున్నాను అనేకంటే, మీరు మీ ప్రవర్తనతో మాటలతో మీకు తెలియకుండానే మాకు
ఎన్నో బోధించారు అనడం ఉత్తమం. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా.
బహుమతులు చాలామంది ఇస్తారు. కొద్దిమంది ఆ ఇచ్చిన బహుమతి అవతలివారికి
ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా
చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే.
కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు
నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను
అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి
అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న
రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత
సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు.
మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.
అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
pranjali prabhalu
sekarana mallapragda sridevi ramakrishna
సిద్దార్ధ టికెట్ టికెట్ అంటూ ట్రైన్ లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక
పాత నలిగిపోయిన పర్సు కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో
కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు . ఎవరిదో
తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు . ఎలా తిరిగి ఇవ్వడం ?
.
" ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ
పర్స్ కేసీ చూశారు . తమ జేబులు తడుముకున్నారు . ఈ విషయం పక్క బే లో
కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు .
.
" మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనమాలు ఏమిటీ ? "
.
" అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ " అన్నాడాయన
.
" అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
.
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమె !
.
"
బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు . అప్పుడు నాకు మా
అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో
పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు
అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో
పెట్టుకున్నాను . "
.
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా
భార్య చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ అపుడు ఆమె ఫోటో నా పర్సులో
పెట్టుకునే వాడిని .
.
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు
పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం ఆఫీసు వదల గానే ఇంటికి
వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ
రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా
లోకం . అపుడు నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు ఇపుడు
అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు
నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా కృష్ణుడిని
పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు .
నా విచారానికి ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో
పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో
గడుపుతున్నాను . "
.
.
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు .
.
.
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
.
" దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో పెట్టుకోడానికి "
వాట్సప్ సేకరణ.
No comments:
Post a Comment