Sunday, 4 April 2021

 No photo description available.

సీతాపతీ పద్య కావ్యము
రచన మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

భూదేవి కలలన్ని  - భర్తగా తీర్చియు
మృత్యువు సహితము -  మాపు మూర్తి
జీవులనుభవించు - జాగ్రుత సాక్షియై
స్వప్న సుషుప్త్యము - సాక్షి మూర్తి
సృష్టి ననుసరించి - సేవ లందించియు
సృష్టి ధర్మ మనకు - సాక్షి మూర్తి
వేదాన్ని నమ్మిన - వేదవిదు డుగాను
విశ్వమంతా ఉన్న - విశ్వ మూర్తి

తేటగీతి
స్నేహ ధర్మము నిలిపిన  -స్నేహశీలి
ప్రేమ తత్వము బతికించు - భాగ్య శీలి
మాయ మాటలు ఛేధించు  -మౌన శీలి
దుష్ట శిక్షణ చేసేటి - ధర్మశీలి

__(())--

 

 స్థిరచిత్తం
 

అవమానమనేది మోయలేని భారం. మనసును దహించి వేస్తుంది. అన్నపానీయాలను ముట్టనీయదు. నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది మనసు. ఆ మహోష్ణతానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది. సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను

మరచిపోతారేమోగానీ- అవమానాలను మరచిపోలేరు ఇది మానవ సహజ గుణం. వీటిని అధిగమిస్తేనే ప్రగతి! .రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది

పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు. అవమానించాడు ద్రుపదుడు తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికి కాని శాంతించలేదు ద్రోణుడి హృదయం

అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలించాడు.

పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తాయి ఇటువంటి ఉదాహరణలు. అవమానానికి పగలు ప్రతీకారాలు జ్వలింపజేసుకుంటూపోతే సహన గుణానికున్న ఔన్నత్యం ఉనికిని కోల్పోతుంది. మనలోని సహన గుణం ఎదుటివారిలోనూ పరివర్తన తెస్తుంది.
కారణాలేవైనా అవమానాలను కూడా భరిస్తూ, సహిస్తూ సాగిపోవడమే ఉత్తమమైన విధానం

ప్రకృతి అందచందాలకు నిలయం. కార్చిచ్చు దహిస్తుంది జలవిలయం తుడిచిపెడుతుంది. కానీ తిరిగి చిగురేయడం, పచ్చదనంతో కళకళలాడటం వృక్ష నైజం. బంగారాన్ని అందించే పుడమితల్లి కంపనాలకు గురవుతూనే ఉంటుంది

గౌరవ మర్యాదలకు ఆనందించే మనసు అవమానాల్ని తట్టుకోగలగాలి. తిరిగి స్వీయ వైభవాన్ని పొందాలి. అదే సమస్థితి

కొండమీది చిన్న గుడిలో ధ్యానం చేసుకుంటూ శిష్యుడితోపాటు నివసిస్తున్నాడు ఓ సాధువు. కొండ దిగువున పల్లెవాసులందరికీ ఆయనంటే గురి. నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదో ఒక ఆకో, ఫలమో ఇవ్వమనేవారు. వైద్యుడి దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినేవారు కాదు

అగ్నిగుండం నుంచి ఓ చిటికెడు బూడిద ఇచ్చేవాడు. కాలగమనంలో వ్యాధులు తగ్గిపోయేవి. క్రమంగా జనంతాకిడి పెరిగింది. ఆ సాధువును భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన అనుగ్రహ భాషణం చాలు, సకలమూ చక్కబడుతుందన్న నమ్మకం పెరిగిపోయింది

ఇలా ఉండగా ఓసారి తీవ్రమైన కరవు ఏర్పడింది పొలాలన్నీ బీళ్ళుగా మారాయి. చుక్క నీరు లేదు. పసిపిల్లలకు పాలు కూడా కరవయ్యాయి. పశువులు బక్కచిక్కాయి. పల్లెవాసులకు వలస మార్గమే దిక్కైంది ఈ కరవుకు కొండపై ఉన్న సాధువే కారణమన్న వదంతులు వ్యాపించాయి. రోజులు గడిచేకొద్దీ ఈ భావం ప్రజల్లో బలంగా నాటుకొంది.
సాధువును అనరాని మాటలంటూ, ఛీత్కరిస్తూ, రాళ్ళతో కొడుతూ తరిమేశారు. సాధువు కాషాయంబరాలు పిలికలయ్యాయి. రాళ్ళదెబ్బలకు రక్తం కారసాగింది దుర్భర స్థితి

దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళి తిరిగి ధ్యానం చేసుకోసాగాడు. సాధువు వెంటే ఉన్న శిష్యుడు- 'స్వామీ ఏమిటీ దారుణం? ఇంత అవమానం పొంది కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు

సాధువు నవ్వి- 'చూడు నాయనా! పల్లెవాసులు నన్ను మహాపురుషుడిలా గౌరవించినప్పుడు పొంగిపోనూ లేదు. ఛీత్కరిస్తూ తరిమేసినప్పుడు బాధపడనూ లేదు రెండింటినీ ఒకే చిత్తంతో స్వీకరించాను. కాలమే వారికి జ్ఞానోదయం గావిస్తుంది. ఏదో జరిగిందని వ్యాకుల చిత్తంతో నేను బాధపడాల్సిన అవసరమే లేదు... అంటూ ధ్యానముద్ర వహించాడు- నిశ్చలచిత్తంతో

ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని, దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే

నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నత స్థితికి చేరినవారే.

స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు. వారే జీవితంలో విజేతలు

--(())--


కృష్ణుడి చివరి సందేశం.

శ్రీ కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన సందేశం గీతరూపంలో అందరికీ తెలిసిందే. అయితే కృష్ణుడు చివరిసారిగా బోధించిన సందేశం మరొకటి ఉంది. అదే ఉద్దవ గీత. ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు. కృష్ణుడికి రథసారధి కూడా. అయితే ద్వాపరయుగంలో కృష్ణుడు తన అవతారం చాలించే ముందు ఉద్ధవుడిని పిలిచి. “ఉద్దవా, నా నుంచి ఎంతోమంది ఎన్నో వరాలు పొందారు.కానీ, నువ్వు నన్ను ఎప్పుడూ ఏదీ కోరలేదు.నీ స్నేహానికి బహుమతిగా ఏదైనా ఇవ్వాలని ఉంది, ఏమికావాలో కోరుకో"మంటాడు. అప్పుడు ఉద్దవుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానమే ఈ ఉద్ధవ గీత.కృష్ణుడి మాటలకు ఉద్దవుడు.. “కృష్ణా, నీ లీలలను అర్థం చేసుకోవటం ఎవ్వరివల్లా కాదు. నాకు నీ నుంచి ఏ వరమూ వద్దు.కానీ నేను నిన్ను కొన్ని సందేహాలు అడుగుదామనుకుంటున్నాను. అడగమంటావా" అని అంటాడు. కృష్ణుడు ““నువ్వు ఏది అడిగినా చెప్తాను. అడుగు ఉద్దవా" అంటాడు. అప్పుడు ఉద్దవుడు. నువ్వు వారి వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడివి. అలాంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? అసలు అలాంటి వ్యసనాలను ఎందుకు ప్రోత్సహించావు? ఒకవేళ జూదం ఆడనిచ్చినా. కనీసం వారిని గెలిపించి, కౌరవులకి బుద్ధి చెప్పి ఉండాల్సింది కదా? అది కూడా చెయ్యలేదు. యుధిష్టరుడు అంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నువ్వు వాళ్లని కాపాడి ఉండొచ్చు కదా? కౌరవులు దుర్బుద్ధితో జూదంలో మోసం చేసి, ద్రౌపదిని గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించి ఉండాల్సింది. ఆమె గౌరవానికి భంగం కలిగేవరకూ నువ్వు స్పందించలేదు.... సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కానీ ముందే నువ్వు కలుగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో అవమానం తప్పేది కదా? ఇలా చేయడం వెనుక కారణమేంటి కృష్ణా..."అని ఉద్దవుడు కృష్ణుడ్ని అడుగుతాడు.ఎంతో తెలివిగా తన మామ చేత పందెంను వేయించాడు. కానీ యుధిష్టరుడు మాత్రం.. పందాలను నా చేత వేయిం చాలి అని అనుకోలేదు. నా సాయమును కోరనే లేదు. శకునితో నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెంను శకుని వేయగలిగేవాడా? లేదా అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? ఈ ఒక్కవిషయమే కాదు, 

ధర్మరాజు అజ్ఞానంతో మరొక తప్పు కూడా చేశాడు. నేను చేసుకున్న కర్మల వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు, ఇటువైపు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. యుధిష్టరుడు మాత్రమే కాదు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ నా సాయం కోరలేదు. చివరికి ద్రౌపది కూడా దుశ్సాసనుడు సభలోకి ఈడ్చుకెళ్లినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.

తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యే వరకూ నన్ను స్మరించలేదు. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడుకోగానే.. నేను మెటనే ప్రత్యక్షమయ్యి ద్రౌపదిని రక్షించలేదా?" అని కృష్ణుడు ఉద్ధవుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఉద్ధవుడు, కృష్ణుడితో... “అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతేంటి? మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారానే సాగుతుంది. వాటిలో నేను కలుగజేసుకోను. కేవలం సాక్షిలాగా గమనిస్తుంటాను. అదే భగవంతుని ధర్మం" అని అంటాడు.




*మన దినచర్యలో భాగంగా మనతో బతికే శ్రీమతి ని మనం గౌరవించాలి ఎందుకనగా మన మనస్సును అర్ధం చేసుకొని ప్రవర్తించేది ఒక్క స్త్రీనే అదియే "శ్రీమతి"
శ్రీమతి మాటలు కొన్ని పరిస్థితిలో ఉద్రేకం తెప్పించ వచ్చు, మరో పరిస్థితిలో శాంతింపచేయవచ్చు అయినా మానముమాత్రం తక్కవేమతినలేదు, వారినిఉడికిసాం ఏఏడిపిస్తాం, నవ్విస్తాం అన్నీ  చేస్తాం శ్రీ మతి మాత్రం భర్తే దైవం అని తనపని తాను చేసు కుంటుంది।  
 
అయినా ఉదయానికే ఉషదయ అరుణ కిరణాలు లేపినట్లు లేపి మొఖం కడుక్కోండి కాఫీ త్రాగుదాం అంటుంది, చూచేటప్పుడు ఆమె సౌందర్యం నయన సుందరిని మించినట్లు కనిపిస్తుంది, ఏమైనా మాటలు మాట్లాడె డప్పుడు శ్రీవాణి గా ప్రవర్తిస్తుంది, సహనములో పుడమి తల్లిని మించి పొయ్యేది, ఆహారపదార్ధాలు తయారీలో, వడ్డనలో, అన్నపూర్ణను గుర్తు చేస్తుంది।     

ఆమె నడుస్తున్నప్పుడు ఒక హంస నడిచినట్లే ఉంటుంది, నవ్వుచున్నప్పుడు ప్రసన్న లక్ష్మి వచ్చినట్లు, మన మనస్సు అర్ధం చేసుకొని నవ్వించే హాసిని ఆమె।

చేసేపనికి ఎప్పుడూ స్పూర్తి దాయకమైన స్థితిలో ఉంటుంది, ఏ పని చేయడానికి అయినా ముందు స్పందన చేస్తూ, హెచ్చరిస్తూ, మంచి చెడులు తెలియ పరిచేది, మంచి పనిలో  పవిత్రతగా,  ఇష్టంగా చేసే పనికి ప్రీతిగా, నిజాలు బోధించేటప్పుడు సత్యవతిగా, మనస్సు శాంత పరిచేటప్పుడు నిర్మల గా, అబద్ధాలు మాట్లాడినపుడు కల్పనగా, పిల్లలకు చదువు నేర్పేటప్పుడు సరస్వతి గా,  వ్యాపారంలో చేరి ప్రతిభగా అభివృద్ధి పరచి దేశ ప్రగతికి సహకరించి ఒక మాములు గృహిణిగా, అద్దంలో చూసైనా ప్రత్యక్షంగా చూసినా మొగవాని మనసుకు సుందరి శ్రీమతి।     

సరిగమలు నేర్పునప్పుడు సంగీత లక్ష్మీగా, పాటలు పాడునపుడు శృతి కలిపి మధుర మనిపించే  కోకిలగా, తాళం వేయునపుడు లయగా, సాహిత్య గోష్టిలో  సాహిత్య దేవతగా, నగరాన్ని కాపాడుతూ, ప్రకృతి వనరులను అందించే స్త్రీ గా,

జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో పిల్లలకు విద్యావతిగా, సంపాద నప్పుడు సహాయ సహకారము అందించు లక్ష్మిగా, మనిషి విసుగురానియ్యకుండా, సంతోషము కల్పిస్తూ, ఇంద్రియాల కొరియాకును తీరుస్తూ, చేసేవృత్తిలో ప్రేరణ కల్పిస్తూ, పని చేసి వచ్చాక భర్తకు ఉపశమన శాంతి కల్పిస్తూ,  అన్ని వయసులలో లాలన, పాలన సాగిస్తూ, మధ్యవయస్సులో వయస్సుని ఉడికిస్తూ, ముసలితనంలో కరుణ, మమతను చూపిస్తూ జీవితాంతం మనతో ఉండే  స్త్రీ      
నీరు త్రాగునపుడు గంగ లా సహకరించేది, సాయింత్రం వేళలో సంధ్యా దేవిగా, చీకటైతే అందరికీ వెలుగుఅందెంచె జ్యోతిగా, రాత్రి మత్తును తాగించే నిషాగా, పడుకున్నాక స్వప్న సుందరి।
 
ఆలోచనలప్పుడు ఊహాగా ఆలోచనలు తీర్చేటపుడు భావనగా  సంతోషంలో సంతోషి గా।  
కోపంలో కనింపించే రుద్రకాళిగా, మనసులో ఉండే భైరవిగా, ఆటలాడునప్పుడు ఆనందినిగా ,
గెలుపు కోసం అహర్నిసాలు ప్రోచ్చాహం కల్పించి జయమును కల్పించే విజయ లక్ష్మీగా।
గెలిచిన తర్వాత కీర్తి ప్రతిష్టలు పెపుచేసేట్టు సహధర్మచారిణి ।  

   స్త్రీలో ఎన్ని లక్షణాలు ఉన్నా స్త్రీ మనస్సును తెల్సుకొన్నప్పుడు, ఆ మనస్సు అర్ధమైనప్పుడు మగవానికి సుఖము సంతోషము శాంతి ఉంటుంది అర్ధం కాకపొతే నరకం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అని ఆలోచించాలి।     
   స్త్రీ ఆత్మగౌరవం దెబ్బతీయకుండా మనిషిగా మన్నన పొందుతూ ఉండాలి।
 
   , ** సమ్మోహనాలు..
ప్రాంజలి ప్రభ స్నేహము

స్నహము బతికేందుకు
బతుకు బతికించుటకు
బతికించేందుకు శాశ్వతముగా ఈశ్వరా

ఒకరికొకరు నీడై
నీడ కళల తోడై
తోడై వుండును భర్తకు భార్య ఈశ్వరా

బాల్య మిత్రుల బలిమి
బలిమి శాశ్వత చెలిమి
చెలిమి కలిమి కలబోత స్నేహము ఈశ్వరా

బంధువు లేని బతుకు
బతుకు కొరకే మెతుకు
మెతుకే తోడు నీరు మిత్రుడే ఈశ్వరా

పిచ్చి మచ్చిక తనము
తనము సాహచర్యము
సహజ సామరస్యము మైత్రియే ఈశ్వరా

ఆదుకొను హస్తమిది
ఇది చెలిమి పెంచునది
పెంచి రక్త బంధముతొ  ప్రేమ ఈశ్వరా

హంగు ఆర్భాటమే
ఆర్భాట బేధమే
బేధమే ఎరుగక సఖ్యత యే ఈశ్వరా

మాటతో మాటలే
మాటలే బాసలే
బాసలే ప్రత్యుపకారము యే ఈశ్వరా

హృదయము నే పంచును
పొంచి ప్రీతి కోరును
కోరియు మనసునే  పంచుటయే ఈశ్వరా

 మనసులే ఏకమై
ఏకమై  ప్రేమమై
ప్రేమ చేతులతొ ఆలింగనం ఈశ్వరా

మాటల మాయ లేదు
లేదు కధలు చెప్పదు
చెప్పదు చేయూత మిచ్చు ఈశ్వరా

ప్రేమతొ సఖ్యత సఖి
సఖియె ప్రేమతొ లిఖి
లిఖిలో హృదయమును చూడునే ఈశ్వరా

చేయి చేయి కలిపి యు
కలిపి బాస చేసియు
 బాసలుచేసి ప్రేమ శ్వాసలు ఈశ్వరా

ప్రేమను వ్యక్త పరుచు
వ్యక్తమై కళ తలచు
పసిడ కళలే స్నేహ సఖ్యతే ఈశ్వరా

లేత లత పరిమళము
పరిమళమతి మధురము
మధుర కలయికే మనసున మైత్రి ఈశ్వరా

తరగని నిధియె  మైత్రి
మైత్రి ఇది గాయత్రి
గాయత్రి సహనములో ధరిత్రి ఈశ్వరా

కన్న తల్లి కన్నను
కన్న తండ్రి కన్నను
కన్న  ప్రేమ కన్న మిన్న మైత్రి ఈశ్వరా

 చెప్పేటి రహస్యం
రహస్య స్థావరం
స్థావరంలో స్నహ సహకారం ఈశ్వరా  

స్నేహ మె మనిషి చెట్టు
చెట్టు సహనపు మెట్టు
మెట్టు మన ఎదుగుదలకు నిచ్చెన ఈశ్వరా

హృదయ మందు స్నేహము
స్నేహమే శాశ్వితము
శాశ్విత వలయమె మానవత్వం ఈశ్వరా

--(())--

జ్ఞానము సంపద శక్తులను ప్రసాదించే జగన్మాత కొల్లూరు మూగాంబికా దేవి

కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ  చేతులలోనే చస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలీలగా సంహరించింది. ఆమె ధైర్యానికి మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మడమతో శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్టించాడని ప్రతీతి. ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. హలుగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మ వారి విగ్రహం చెక్కించాడని చెప్పుకొంటారు. మంగుళూరు నుండి నూట ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉడిపి క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కుడజాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తుంది. తమిళనాడుకు అతి సమీపంలో ఉంటుంది. బంగారు శిఖరంతో భక్త జనాల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది. కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు. కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.

ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి. గర్భాలయం లో ''శంకర సింహాసనం'' ఉంది.

మూకాంబిక సరస్వతి మహాకాళి, శక్తిలా సంయుక్త స్వరూపంగా భావిస్తారు. అమ్మవారు కొలువైన కుడజాద్రి పర్వతం మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి. భక్తులు వీటిని దర్శించి దివ్యానుభూతికి లోనవుతారు. కర్ణాటకను పాలించిన రాజులందరూ అమ్మవారికి విశేష మైన కానుకలు సమర్పించి భక్తిశ్రద్ధలతో అర్చించారు. నగర, బెద్నూర్ రాజులకు ఈ దేవాలయమే ''రాజ దేవాలయం'' వారి యిలవేల్పు మూకాంబికయే. మహారాష్ట్ర విజయనగర ప్రభువుల పాలనలో కూడా వైభవం పొందింది. ఆ తర్వాతా ముష్కర తురుష్క పాలనలో దోపిడీకి గురైంది. ఇక్కడి కోట్లాదిరూపాయలు విలువచేసే అమూల్య సంపద అంతా దోచుకోబడింది.

పురాణ కధనం

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి, వాడి చావు ఒక స్త్రీ వల్ల  జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన  ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది. మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని ‘’మూకాసురుడు’’  అన్నారు. అప్పుడు ''కోల రుషి'' ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర వెలసిల్లమని కోరుకొన్నాడు. వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

ఆలయ వైశిష్ట్యం

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై సంపన్నులు అవుతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కుడివైపున కాలభైరవుడు దర్శనమిస్తాడు. కేరళవాసులు ఎక్కువశాతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో వుంది. మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే "పంచకడ్జాయం' అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నాడట. అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందువల్ల అతడు మహాపండితుడు అయ్యాడని అంటారు. అందుచేత కేరళ ప్రజల్లో అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజూ ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం.

ఓం శ్రీ మూగాంబికా దేవ్యై నమః



'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం.

మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం.

యజ్ఞ విధానం
వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు.

యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,  సర్పయాగం, విశ్వజిత్ యాగం.. వంటి యాగాలున్నాయి.

ఇతిహాసాలలో...
కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు, అశ్వమేధం నిర్వహించి, పురుషత్వాన్ని తిరిగి పొందాడు. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు.

యజ్ఞాలు - రకాలు

యజ్ఞాల్లో ఆరు రకాలు ఉన్నాయి.
అవి..

1. ద్రవ్యయజ్ఞం: ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి.

2. తాపయజ్ఞం: జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం.

3. స్వాధ్యాయయజ్ఞం: ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాకుండా, అర్థం చేసుకుని లోకకల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం.

4. యోగయజ్ఞం: యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం.

5. జ్ఞానయజ్ఞం: మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? అని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం.

6. సంశితయజ్ఞం: తనలోని కామక్రోధమద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం.

యజ్ఞాలలో మరో మూడు రకాలు ఉన్నాయి.

1. పాక యజ్ఞాలు
2. హవిర్యాగాలు
3. సోమ సంస్థలు
 
పాక యజ్ఞాల్లో
 7 విధాలు ఉన్నాయి.

1. ఔపాసన
2. స్థాలీపాకము
3. వైశ్వదేవము
4. అష్టకము
5. మాస శ్రాద్ధము
6. సర్పబలి
7. ఈశాన బలి

హవిర్యాగాలు..

వీటిలో కూడా 7 రకాలున్నాయి.

1. అగ్నిహోత్రాలు
 2. దర్శపూర్ణిమాసలు
 3. అగ్రయణం
4. చాతుర్మాస్యాలు
5. పిండ, పితృ యజ్ఞాలు
6. నిరూఢ పశుబంధం
7.  సౌత్రామణి

సోమ సంస్థలు..

వీటిలో ఏడు రకాలు ఉన్నాయి.

1. అగ్నిష్టోమం
2. అత్యగ్నిష్టోమం
3. ఉక్థము
4. అతిరాత్రము
5.ఆప్తోర్యామం
6. వాజపేయం
7. పౌండరీకం

యజ్ఞం వల్ల ఫలితాలు
యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు. కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.

మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదండీ ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమవుతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెబుతారు.

ఇటీవల కాలంలో యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. మనం యజ్ఞయాగాదులు చేయడమేంటి..? మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనం, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే, మనకు మనం మేలు చేసుకోవడమే అవుతుంది...
 

: 64 కళలు వివరణ సహితం!!


1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),

3. నృత్యము (భావాభినయము),

4. అలేఖ్యము (చిత్రలేఖనము),

5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),

6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),

7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),

8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),

9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),

10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),

11. ఉదక వాద్యము (జలతరంగిణి),

12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),

13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),

14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),

15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),

16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),

17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),

18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),

19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),

20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),

21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),

22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),

23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),

24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),

25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),

26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),

27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),

28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),

29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),

30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),

31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),

32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),

33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),

34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),

35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),

36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),

37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),

38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),

39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),

40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),

41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),

42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),

43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),

44. ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),

45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),

46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),

47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),

48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),

49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),

50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),

51 ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),

52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),

53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),

54. కావ్యక్రియ (కావ్యములను రచించుట),

55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),

56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),

57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),

58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),

59. ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),

60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),

61 బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),

62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),

63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),

64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
 

🙏శుభమస్తు🙏
 

*******

గాయత్రి దేవి అంటే ఎవరు..?

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు.

మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు.
తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా?
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు.

దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

No comments:

Post a Comment