శివ-మాధవులకథ:
రత్నపురి అనే నగరంలో శివుడు-మాధవుడు అనే పేరుగల ఇద్దరు ధూర్తులున్నారు. వారిద్దరు మరికొందరు మోసగాండ్రను చేర్చుకొని నగరంలోని ధనవంతులందరిని కొల్లగొట్టారు. ఇక అక్కడ దోచుకోవటానికి ఎవరు లేకపోయేటప్పటికి ఉజ్జయినీపురంలో రాజుగారి పురోహితుడు శంకరస్వామి అనే మహాధనవంతుడొకడున్నాడని-అతనికో కూతురు కూడా ఉందని-అతడేడు కడవల్లో ధనాన్ని దాచి పాతిపెట్టాడనే సమాచారాన్ని సేకరించుకొని ఆతనిని దోచుకోవటానికి అక్కడకు పోదామనుకున్నారు. మాధవుడు తన పరివారంతో రాకుమారుని వేషంలో ఉజ్జయిని ప్రవేశించాడు. శివుడు ఉజ్జయినికి వచ్చి సిప్రానదీతీరంలో ఒక మఠాన్ని కట్టుకొని సన్యాసి వేషంలో ఉండసాగాడు. కొన్ని రోజులకాతడు ఇతడెంతో తపస్వి యని- ఎంతో శాంతుడని ప్రజలు మెచ్చేటంతగా కఠోరమైన యతి నియమాలు పాటిస్తూ ఉజ్జయినిలో ప్రసిద్ధికెక్కాడు. తనమిత్రునకు తాపసిగా ఎనలేని కీర్తి రాగానే మాధవుడు ఒకరోజు సిప్రానది వద్దకు వచ్చి జనులందరు చూస్తుండగనే శివుని పాదాలపై పడి ఆతనిని కీర్తింపసాగాడు. శివుడాతనిని గుర్తుపట్టనట్లుగా నటించాడు. దానితో శివుని కీర్తి ఇనుమడింప సాగింది. ఒకరోజు రాత్రి ఇద్దరు ఒకచోట కలిసి తరువాతి దోపిడి పనులు చేయటానికి తగిన ఉపాయాలను విచారించుకున్నారు. వారి ఉపాయాలలో ఒక భాగంగా వారు తమ జూదరునిలో నొకనిని దూతగా శంకరస్వామి వద్దకు బహుమానాలతో పాటు పంపారు. ఆ దూత శంకరస్వామితో ''మాధవుడనే రాజపుత్రుడు రాజుగారి దర్శనం చేయాలనుకుంటున్నాడని-రాజదర్శనానికి తమరు సహకరించాల్సింగా శంకరస్వామిని అభ్యర్థించవలసిందిగా కోర''మన్నారు. మాధవుడిచ్చిన లంచాలకు లొంగిపోయి రాజపురోహితుడైన శంకరస్వామి అందులకంగీకరించాడు. లంచమొక్కటే కదా లోభులనాకర్షించటానికి పరమమైన ఉపాయం.(ఉపప్రదానం లిప్సూనామేకం హ్యాకర్షనౌషధమ్'' 5-3-119) మరునాడు మాధవుడు అనుచరులను రాజ సేవకులుగా చేసుకొని తాను రాజపుత్రుని వేషంతో శంకర స్వామిని విలువైన బహుమానాలతో దర్శించాడు. శంకరస్వామి రాజు వద్దకు వెళ్లి మాధవుని సంగతి చెప్పగా రాజు పురోహితునిపై గల గౌరవంతో అంగీకరించాడు. మాధవుని చూచిన వెంటనే రాజు ఆదరంతో తన కొలువులో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. శంకరస్వామి కూడా లోభంతో ఆతనిని తనయింటనే బసచేయమన్నాడు. చెట్టునాశనానికి కారణమైన కారండవము(మద్గు:) చెట్టుతొఱ్ఱలోనే ప్రవేశించినట్లుగా(''వినాశహేతు: వాసాయ మద్గు: స్కంధం తరోరివ'' (5-1-132) మాధవుడు తన పరివారంతో శంకర స్వామి ఇంటనే తిష్ఠ వేసాడు. కొంతకాలం గడచిన తరువాత ఆతడు కృత్రిమమైన ఆభరణాలను ఒక బిందెలో ఉంచి పురోహితుని ధనాగారంలో జాగ్రత్త చేసాడు. అప్పుడప్పుడు వచ్చి బిందె మూత తెరచి ఆ నగలను పురోహితునకు కానవచ్చేటట్లుగా చూపి మరల బిందెలో పెట్టి జాగ్రత్త చేయసాగాడు. కొన్ని దినాలు గడచిన తరువాత ఆతడు భోజనాన్ని కొద్ది కొద్ది తగ్గిస్తూ చిక్కి పోసాగాడు. తన కగ్నిమాంద్యం ప్రబలిందని మంచి బ్రాహ్మణునకు తన సంపదనంతా దానం చేస్తానని శంకర స్వామితో చెప్పాడు. రాజ పురోహితుడు కూడా రోజుకో బ్రాహ్మణుని తేగా వారందరు దానయోగ్యుల కారని తిరిగి పంపించాడు. చివరకు సిప్రా నదీ తీరంలో శివుడనే తపస్వి ఉన్నాడని ఆతనిని పిలిపింపుమని కోరాడు. రాజపురోహితుడు మాధవుని మాటపై శివుని వద్దకు వెళ్లి మాధవుడిచ్చే దానాన్ని గ్రహింపమన్నాడు. శివుడు చాలా బెట్టుగా 'సన్యాసినైయుండి ఆ ధనాన్ని తీసుకోని ఏం చేసుకుంటానని గృహస్థునైతే ఆ ధనానికి సార్థకత ఏర్పడుతుందని-తనకెవరు పిల్లనిస్తా'రంటూ ఆ దానగ్రహణానికి తిరస్కరించాడు. అప్పుడు శంకర స్వామి ''నాకు వినయస్వామిని అనే కూతురుందని ఆమెనిచ్చి పెండ్లి చేస్తానని అప్పటివరకు మాధవుడిచ్చిన ధనమంతటిని తానే తన భాండాగారంలో దాచిపెడతానంటూ శివుని దానానికి ఒప్పించాడు. శంకరస్వామి శివుని తనయింటికి తీసుకొని వెళ్లి కూతునిచ్చి వివాహం చేసాడు. వివాహమైన మూడవరోజు మాధవునిచే శివునకు నగలబిందెలను దానమిప్పించాడు. శివుడు తాను 'నగలిట్లా ఉంటాయని ఇంతవరకు చూడలేదని ఇక ఈ నగలబాధ్యత మీదే' నంటూ తన మామకు నగలనప్పగించాడు. మాధవుడు క్రమక్రమంగా భోజనాన్ని పెంచుతూ రోగం నుండి కోలుకొన్న వానిలాగా నటిస్తూ- శంకరస్వామితో మీ దయ వల్ల శివుడు దానాన్ని గ్రహించటం వలన - నేను తిరిగి ఆరోగ్యాన్ని పొందానంటూ పొగడి దాన గ్రహీత యైన శివునితో స్నేహం చేయసాగాడు. కొంతకాలానికి శివుడు మామగారితో 'నేనెంత కాలమిట్లా మీయింటిలో ఊరికే తింటూ కూర్చుంటాను దానాభరణాలను మీరే వెలకు తీసుకొని మీకున్న సొత్తునివ్వరాదా' అని అడిగాడు. శంకర స్వామి తనకున్న ఏడు కడవలనగలను అల్లునకిచ్చి మాధవుడిచ్చిన కృత్రిమాభరణాలను నిజమైన ఆభరణాలని భ్రమసి తీసుకొన్నాడు. శివమాధవులిద్దరు పురోహితుని సంపదనంతా యథేచ్ఛగా అనుభవింపసాగారు. ఒకరోజు పురోహితునకు ఏదో అవసరముండి అంగడిలో ఒక ఆభరణమమ్మటానికని పోగా రత్నవర్తకుడు మణిని గాజుపూసగా బంగారం నిజమైనది కాదని చెప్పాడు. తనవద్దనున్న అన్ని ఆభరణాలను చూపింపగా అవన్ని కృత్రిమమైనవని రత్నవణిజుడు తేల్చి చెప్పాడు. అప్పుడు శంకరస్వామి అల్లుని వద్దకు వెళ్లి 'నీధనం నీవు తీసుకొని నాధనం నాకీయ'మన్నాడు. అపుడు శివుడు ' నీవిచ్చిన ధనాన్నే ఇంతకాలం మేమనుభవిస్తున్నాము . అంతా ఖర్చయి పోయిం'దని అన్నాడు. ఇద్దరు వివాదపడి రాజు వద్దకు తీర్పుకై పోయారు. రాజు ఈ దోషంలో ప్రమేయమున్న ముగ్గురిని పిలిపించి విచారించాడు. ముందుగా శివుడిట్లా చెప్పాడు. ''రాజా! నేను మొదటినుండి తాపసినే. నాకు నగల విషయాలేమీ తెలియవని చెప్పగా ఆంతా తానే చూసుకుంటానని రాజపురోహితుడే చెప్పాడు. నేను దానాన్ని పొందిన ఆభరాణాలను పురోహితుడే తగిన విలువనిచ్చి కొన్నాడు. అంతకుమించి నాకేం తెలియ''దన్నాడు. రాజు మాధవుని ప్రశ్నింపగా అతడిట్లా సమాధానమిచ్చాడు. ''రాజా! నేను నాకు పరంపరగా వచ్చిన పిత్రార్జితాన్ని నేను దానం చేసానే గాని పురోహితునకివ్వలేదు కదా! ఒకవేళ అవి గాజుపూసలేయైతే దాని వలన వచ్చే పాపమంతా నాదే. నేనెంతో నమ్మకంగా దానం చేసాను కాబట్టే-మరణం దాకా తీసుకెళ్లిన రోగం నయమైంది. ఇదే నాదానానికి ఉన్న ఫలం. '' అని వాదించాడు. న్యాయమండలి నిర్ణయము ప్రకారం రాజునకు శివునియందుగాని, మాధవునియందు గాని దోషం కనిపించలేదు. పొరపాటు లోభియైన పురోహితునదే అని నిర్ణయించారు. తప్పుచేసినా తప్పుకప్పిపుచ్చగల మాయోపాయాలున్న శివమాధవులను భవిష్యత్ రాజకార్యాలకై తన వద్దనే ఉండనిచ్చాడు. కాబట్టి జాలోపజీవులైన (=వలలతో చేపలుపట్టువారి) పల్లెవారివలె- జాలోపజీవులైన (=మోసముచే జీవించే) ధూర్తులు అనేక సూత్రాలచే జిహ్మాజాలాలను (నోటిమాటలచే మాయలను) పన్నుతుంటారు. (ఏవం సూత్రశతై: తై: తై: జిహ్వాజాలాని తన్వతే/ జాలోపజీవినో ధూర్తా ధారాయాం ధీవరా ఇవా'' (5-1-200)
కథారిత్సాగరం-ఐదవదియైన చతుర్దారికా లంబకం-మొదటి తరంగం
*🍁యధార్థం - మాయాజాలం - జీవితం 🍁*
ధనమున్నదని... అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని, ఈరోజు మానవుడు గర్విస్తాడు...
ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి...
ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు...
*ధన జన యౌవన గర్వం...!!*
కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...
వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు...
అంతా డబ్బే , డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు...
*కొందరికి జనగర్వం...!!*
తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు... అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు, సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు...
తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు.
కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది, తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో...
*ఇక కొందరికి యౌవన గర్వం...!!*
యవ్వనం శాశ్వతం అనుకుంటారు, శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె మంచి.. చెడూ.. గమనించరు.
కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, అహంభావంతో ఉంటారు... ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు...
*హరతి నిమేషాత్కాలః సర్వం...!!*
ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు.
ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి.
నాకేం.. కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది, అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది...
*ఇప్పుడు ఏమైంది ఆ గర్వం..!!*
నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు...
వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది.
కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు...
అంటే అనుభవించు తప్పులేదు, కాని వాటితో సంగభావం పెట్టుకోకు...
[
*ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు*!
➖➖➖✍️
- గురుమంచి రాజేంద్రశర్మ.
ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది. మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది. క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది. ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.
అది ఒక దీపం. దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.
ఆమె ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది. కానీ,ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం, అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?" అని అడిగింది.
"నేనొక భూతాన్ని ! బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు ! నా వివరాలు తర్వాత చెబుతాను. ముందు నీ విషయం చెప్పు! నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు? నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను." అన్నదా భూతం.
‘చెబితే నష్టమేమిటి? దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది’. అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది.
"నా మనస్సు కు సుఖమనేదే లేదు.
నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు. ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే ! అని అడ్జెస్ట్ అయ్యాను. కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు. నామాట లెక్క చేయడు. నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు విలువ ఇవ్వడం లేదు. ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు. దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చి పోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఇది ఆవేశంతోనో- దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నిరాశా - నిర్లిప్తతతో తీసుకున్న నిర్ణయం .
ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది…
"నిజమే! మీరంతా సామాజిక జీవులు. మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం.
మరి అలా జరగనప్పుడు ఏంచెయ్యాలి?
ముందు ఒక ప్రశ్న వేసుకుందాం.
అసలు నిన్ను అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?
నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా? అని ఆలోచించు! వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!
ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ
ఏపనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు.
సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది.
మరిప్పుడు ఎలా? నీ కర్మ ఇంతే అనుకుందామా? కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకో!
నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?
ఇది కూడా నిజమే!
ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'.
ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకోలేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం ?
ఇంకేం చేస్తాం ? మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము.
" నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు!"
దీన్నే మరోలా చదువుదాం
" నేను ఎవరికీ అర్థం కావట్లేదు "
ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా!
మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది.
అవును! మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే !
నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని.
ఇప్పుడు రెండే దారులు.
ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి.
ఇక రెండోది.
నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి. నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాలు ఉంటేనే లోకానికి కనబడతావు. సమాజం నిన్ను గుర్తిస్తుంది.
నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదా వేసుకో!
ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు.అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు !
నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు!
ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.
చివరగా మరొక్క మాట!
ఇతరుల విలువనూ,గౌరవాన్ని కోరుతున్న నువ్వు 'స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! "
అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.
భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ "ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.
అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం! అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానంలో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.
ఆరు నెలలు గడిచిపోయాయి.
ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి,
"ఏం జరిగింది? " అని అడిగింది.
"ఏం చెప్పాలి? ఒకటా ? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.
ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది…
ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటును అరగంటకు కుదించాను.
అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ నా పనులు తెమిలేవి కావు.
ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం మిగులుతుంది కూడా !.
డైరీ రాయడం ప్రారంభించాను.నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.
మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిళ్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.
ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.
నాకు తెలియకుండానే పిల్లలకు కూడా ‘టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను’ అన్న విషయాన్ని గమనించలేకపోయాను.
“నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."
“ఇప్పుడు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.
ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.
రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను.
వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తాపిల్లలను నిద్ర లేపుతున్నాను.
నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్న కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.
అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.
రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను,నా భర్తాపిల్లలలో దర్శించలేనా?
కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా ?
అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.
నా భర్త కు "రాధ"నయ్యాను.
అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకుముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.
ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.
నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక. కానీ, చాలా భయపడేదాన్ని. ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను. మా ఆఫీసు మీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.
నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది. కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.
చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను. ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను. ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నాని అనిపించవచ్చు ! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.
నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.
అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను అవేశం తో రగిలిపోయేదాన్ని.
గతంలో ‘నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి’ గుర్తుకువస్తుంది.
ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని.
కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తతకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతోంది.
ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నకొద్ది అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.
అతను నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.
నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.
ఇప్పుడు నాకు కుటుంబసభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే !
నీకో విషయం చెప్పనా ? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.
ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఊసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి. అలా వచ్చేవారికి ‘కొంచం కూరగాయాలు తరిగి పెట్టవా? గిన్నెలు కడగడంలో హెల్ప్ చెయ్యవా?’ అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.
ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.
మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?
ప్రధానమంత్రి స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను. ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.
నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.
ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను. నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.
"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి…ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యి !' అంటే వెళ్లి పోశాను. 'శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో!’ అంటే వెళ్లి పెట్టుకున్నాను.
నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను. మార్పు బయటనుంచి వస్తుందని ఎదురు చూశాను.
మార్పు లోపలినుంచే వస్తుందని మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.
ఇదంతా నీవల్లే!
నా ఆత్మహత్య ను తప్పించావు.
నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.
నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా, గౌరవం రావడానికి కారణమయ్యావు.
ముఖ్యంగా ‘నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు.’
ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.
నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తోంది.
సరే! నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ..
ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో ఇలా చెప్పసాగింది…
"నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.
నేనున్న స్థితి ఎలాంటిదంటే…
ఆకలౌతుంది కానీ, తినలేను.
నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.
అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.
దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.
ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేళ్ళా పడి విముక్తి కలిగించమని పార్థించాను.
నా ప్రార్థన విన్న అతడు ...
"ఆత్మహత్య మహా పాపం.
నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు. నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.
1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )
2. నీ మాటలు ఒక వ్యక్తికి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి.
( జ్ఞానదానం )
3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )
అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపంలో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.
ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడంలోనే ఉంది గొప్పంతా!
నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు. నేను చేసిందేమీ లేదు.
నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది. నీకే నాహృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం ‘సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా’ బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.
"ఒకరికి సహాయం చేయడంలోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి బయలుదేరింది
[
ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.
అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*
‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.
కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.
కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.
ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.
ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.
మధ్యాహ్నం ఆవ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు.
కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.
’తిన్నారు!’ అని చెబుతుంది.l
దానితో ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’ అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు.
ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు.
ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*
*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*
*కనుక, ఏ ఇంటిలో ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.*
[
ఎలా మాట్లాడాలి ??
🌷🌷🌷🌷
*
🌷అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం – రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.
🌷ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.
🌷శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూరవాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం – అంటోంది మహాభారతం.
గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.
🌷మనసా, వాచా, కర్మణా – ఈ త్రికరణాలలో రెండవదైన ‘వాక్కు’ అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట.
శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో సుప్రసిద్ధం.
🌷మాటలు సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.
ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా ‘ఒరేయ్’, ‘ఏమిరా’ అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.
అదేవిధంగా – కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ, వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.