Thursday, 30 June 2022

 


శివ-మాధవులకథ:

రత్నపురి అనే నగరంలో శివుడు-మాధవుడు అనే పేరుగల ఇద్దరు ధూర్తులున్నారు. వారిద్దరు మరికొందరు మోసగాండ్రను చేర్చుకొని నగరంలోని ధనవంతులందరిని కొల్లగొట్టారు. ఇక అక్కడ దోచుకోవటానికి ఎవరు లేకపోయేటప్పటికి ఉజ్జయినీపురంలో రాజుగారి పురోహితుడు శంకరస్వామి అనే మహాధనవంతుడొకడున్నాడని-అతనికో కూతురు కూడా ఉందని-అతడేడు కడవల్లో ధనాన్ని దాచి పాతిపెట్టాడనే సమాచారాన్ని సేకరించుకొని ఆతనిని దోచుకోవటానికి అక్కడకు పోదామనుకున్నారు. మాధవుడు తన పరివారంతో రాకుమారుని వేషంలో ఉజ్జయిని ప్రవేశించాడు. శివుడు ఉజ్జయినికి వచ్చి సిప్రానదీతీరంలో ఒక మఠాన్ని కట్టుకొని సన్యాసి వేషంలో ఉండసాగాడు. కొన్ని రోజులకాతడు ఇతడెంతో తపస్వి యని- ఎంతో శాంతుడని ప్రజలు మెచ్చేటంతగా కఠోరమైన యతి నియమాలు పాటిస్తూ ఉజ్జయినిలో ప్రసిద్ధికెక్కాడు. తనమిత్రునకు తాపసిగా ఎనలేని కీర్తి రాగానే మాధవుడు ఒకరోజు సిప్రానది వద్దకు వచ్చి జనులందరు చూస్తుండగనే శివుని పాదాలపై పడి ఆతనిని కీర్తింపసాగాడు. శివుడాతనిని గుర్తుపట్టనట్లుగా నటించాడు. దానితో శివుని కీర్తి ఇనుమడింప సాగింది. ఒకరోజు రాత్రి ఇద్దరు ఒకచోట కలిసి తరువాతి దోపిడి పనులు చేయటానికి తగిన ఉపాయాలను విచారించుకున్నారు. వారి ఉపాయాలలో ఒక భాగంగా వారు తమ జూదరునిలో నొకనిని దూతగా శంకరస్వామి వద్దకు బహుమానాలతో పాటు పంపారు. ఆ దూత శంకరస్వామితో ''మాధవుడనే రాజపుత్రుడు రాజుగారి దర్శనం చేయాలనుకుంటున్నాడని-రాజదర్శనానికి తమరు సహకరించాల్సింగా శంకరస్వామిని అభ్యర్థించవలసిందిగా కోర''మన్నారు. మాధవుడిచ్చిన లంచాలకు లొంగిపోయి రాజపురోహితుడైన శంకరస్వామి అందులకంగీకరించాడు. లంచమొక్కటే కదా లోభులనాకర్షించటానికి పరమమైన ఉపాయం.(ఉపప్రదానం లిప్సూనామేకం హ్యాకర్షనౌషధమ్'' 5-3-119) మరునాడు మాధవుడు అనుచరులను రాజ సేవకులుగా చేసుకొని తాను రాజపుత్రుని వేషంతో శంకర స్వామిని విలువైన బహుమానాలతో దర్శించాడు. శంకరస్వామి రాజు వద్దకు వెళ్లి మాధవుని సంగతి చెప్పగా రాజు పురోహితునిపై గల గౌరవంతో అంగీకరించాడు. మాధవుని చూచిన వెంటనే రాజు ఆదరంతో తన కొలువులో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. శంకరస్వామి కూడా లోభంతో ఆతనిని తనయింటనే బసచేయమన్నాడు. చెట్టునాశనానికి కారణమైన  కారండవము(మద్గు:) చెట్టుతొఱ్ఱలోనే ప్రవేశించినట్లుగా(''వినాశహేతు: వాసాయ మద్గు: స్కంధం తరోరివ'' (5-1-132) మాధవుడు తన పరివారంతో శంకర స్వామి ఇంటనే తిష్ఠ వేసాడు. కొంతకాలం గడచిన తరువాత ఆతడు కృత్రిమమైన ఆభరణాలను ఒక బిందెలో ఉంచి పురోహితుని ధనాగారంలో జాగ్రత్త చేసాడు. అప్పుడప్పుడు వచ్చి బిందె మూత తెరచి ఆ నగలను పురోహితునకు కానవచ్చేటట్లుగా చూపి మరల బిందెలో పెట్టి జాగ్రత్త చేయసాగాడు. కొన్ని దినాలు గడచిన తరువాత ఆతడు భోజనాన్ని కొద్ది కొద్ది తగ్గిస్తూ చిక్కి పోసాగాడు. తన కగ్నిమాంద్యం ప్రబలిందని మంచి బ్రాహ్మణునకు తన సంపదనంతా దానం చేస్తానని శంకర స్వామితో చెప్పాడు. రాజ పురోహితుడు కూడా రోజుకో బ్రాహ్మణుని తేగా వారందరు దానయోగ్యుల కారని తిరిగి  పంపించాడు. చివరకు సిప్రా నదీ తీరంలో శివుడనే తపస్వి ఉన్నాడని ఆతనిని పిలిపింపుమని కోరాడు. రాజపురోహితుడు మాధవుని మాటపై శివుని వద్దకు వెళ్లి మాధవుడిచ్చే దానాన్ని గ్రహింపమన్నాడు. శివుడు చాలా బెట్టుగా 'సన్యాసినైయుండి ఆ ధనాన్ని తీసుకోని ఏం చేసుకుంటానని గృహస్థునైతే ఆ ధనానికి సార్థకత ఏర్పడుతుందని-తనకెవరు పిల్లనిస్తా'రంటూ ఆ దానగ్రహణానికి తిరస్కరించాడు. అప్పుడు శంకర స్వామి ''నాకు వినయస్వామిని అనే కూతురుందని ఆమెనిచ్చి పెండ్లి చేస్తానని అప్పటివరకు మాధవుడిచ్చిన ధనమంతటిని తానే తన భాండాగారంలో దాచిపెడతానంటూ శివుని దానానికి ఒప్పించాడు. శంకరస్వామి శివుని తనయింటికి తీసుకొని వెళ్లి కూతునిచ్చి వివాహం చేసాడు. వివాహమైన మూడవరోజు మాధవునిచే శివునకు నగలబిందెలను దానమిప్పించాడు. శివుడు తాను 'నగలిట్లా ఉంటాయని ఇంతవరకు చూడలేదని ఇక ఈ నగలబాధ్యత మీదే' నంటూ తన మామకు  నగలనప్పగించాడు. మాధవుడు క్రమక్రమంగా భోజనాన్ని పెంచుతూ రోగం నుండి కోలుకొన్న వానిలాగా నటిస్తూ- శంకరస్వామితో మీ దయ వల్ల శివుడు దానాన్ని గ్రహించటం వలన - నేను తిరిగి ఆరోగ్యాన్ని పొందానంటూ పొగడి దాన గ్రహీత యైన శివునితో స్నేహం చేయసాగాడు. కొంతకాలానికి శివుడు మామగారితో 'నేనెంత కాలమిట్లా మీయింటిలో ఊరికే తింటూ కూర్చుంటాను దానాభరణాలను మీరే వెలకు తీసుకొని మీకున్న సొత్తునివ్వరాదా' అని అడిగాడు. శంకర స్వామి తనకున్న ఏడు కడవలనగలను అల్లునకిచ్చి మాధవుడిచ్చిన కృత్రిమాభరణాలను నిజమైన ఆభరణాలని భ్రమసి  తీసుకొన్నాడు. శివమాధవులిద్దరు పురోహితుని సంపదనంతా యథేచ్ఛగా అనుభవింపసాగారు. ఒకరోజు పురోహితునకు ఏదో అవసరముండి అంగడిలో ఒక ఆభరణమమ్మటానికని పోగా రత్నవర్తకుడు మణిని గాజుపూసగా బంగారం నిజమైనది కాదని చెప్పాడు. తనవద్దనున్న అన్ని ఆభరణాలను చూపింపగా అవన్ని కృత్రిమమైనవని రత్నవణిజుడు తేల్చి చెప్పాడు. అప్పుడు శంకరస్వామి అల్లుని వద్దకు వెళ్లి 'నీధనం నీవు తీసుకొని నాధనం నాకీయ'మన్నాడు.  అపుడు శివుడు '  నీవిచ్చిన ధనాన్నే  ఇంతకాలం మేమనుభవిస్తున్నాము . అంతా ఖర్చయి పోయిం'దని అన్నాడు.   ఇద్దరు వివాదపడి రాజు వద్దకు తీర్పుకై పోయారు. రాజు ఈ దోషంలో ప్రమేయమున్న ముగ్గురిని పిలిపించి విచారించాడు. ముందుగా శివుడిట్లా చెప్పాడు. ''రాజా! నేను మొదటినుండి తాపసినే. నాకు నగల విషయాలేమీ తెలియవని చెప్పగా ఆంతా తానే చూసుకుంటానని రాజపురోహితుడే చెప్పాడు. నేను దానాన్ని పొందిన ఆభరాణాలను పురోహితుడే తగిన విలువనిచ్చి కొన్నాడు. అంతకుమించి నాకేం తెలియ''దన్నాడు. రాజు మాధవుని ప్రశ్నింపగా అతడిట్లా సమాధానమిచ్చాడు. ''రాజా! నేను నాకు పరంపరగా వచ్చిన పిత్రార్జితాన్ని నేను దానం చేసానే గాని పురోహితునకివ్వలేదు కదా! ఒకవేళ అవి గాజుపూసలేయైతే దాని వలన వచ్చే పాపమంతా నాదే. నేనెంతో నమ్మకంగా దానం చేసాను కాబట్టే-మరణం దాకా తీసుకెళ్లిన రోగం నయమైంది. ఇదే నాదానానికి ఉన్న ఫలం. '' అని వాదించాడు. న్యాయమండలి నిర్ణయము ప్రకారం రాజునకు శివునియందుగాని, మాధవునియందు గాని దోషం కనిపించలేదు. పొరపాటు లోభియైన పురోహితునదే అని నిర్ణయించారు. తప్పుచేసినా తప్పుకప్పిపుచ్చగల మాయోపాయాలున్న శివమాధవులను భవిష్యత్ రాజకార్యాలకై తన వద్దనే ఉండనిచ్చాడు. కాబట్టి జాలోపజీవులైన (=వలలతో చేపలుపట్టువారి) పల్లెవారివలె- జాలోపజీవులైన (=మోసముచే జీవించే) ధూర్తులు అనేక సూత్రాలచే జిహ్మాజాలాలను (నోటిమాటలచే మాయలను) పన్నుతుంటారు. (ఏవం సూత్రశతై: తై: తై: జిహ్వాజాలాని తన్వతే/ జాలోపజీవినో ధూర్తా ధారాయాం ధీవరా ఇవా'' (5-1-200) 

కథారిత్సాగరం-ఐదవదియైన చతుర్దారికా లంబకం-మొదటి తరంగం



*🍁యధార్థం - మాయాజాలం - జీవితం 🍁*


ధనమున్నదని... అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని, ఈరోజు మానవుడు గర్విస్తాడు...


ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి...

ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు...


*ధన జన యౌవన గర్వం...!!*


కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...

వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు...

అంతా డబ్బే , డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు...


*కొందరికి జనగర్వం...!!*


తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు... అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు, సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు...

తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. 

కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది, తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో...


*ఇక కొందరికి యౌవన గర్వం...!!*


యవ్వనం శాశ్వతం అనుకుంటారు, శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె మంచి.. చెడూ.. గమనించరు. 

కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, అహంభావంతో ఉంటారు... ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు...


*హరతి నిమేషాత్కాలః సర్వం...!!*


ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు. 

ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. 

నాకేం.. కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది, అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది...


*ఇప్పుడు ఏమైంది ఆ గర్వం..!!* 

నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు...

వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది.


కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు...

అంటే అనుభవించు తప్పులేదు, కాని వాటితో సంగభావం పెట్టుకోకు...

[

 *ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు*!

                     ➖➖➖✍️

                 - గురుమంచి రాజేంద్రశర్మ.


ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది. మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది. క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది. ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.

అది ఒక దీపం. దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.

ఆమె  ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది. కానీ,ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం, అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత                          ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?" అని అడిగింది.

"నేనొక భూతాన్ని ! బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు !    నా వివరాలు తర్వాత చెబుతాను. ముందు నీ విషయం చెప్పు!  నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు? నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను."  అన్నదా భూతం.

‘చెబితే నష్టమేమిటి? దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది’. అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది. 

"నా మనస్సు కు సుఖమనేదే లేదు. 

నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు. ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే ! అని అడ్జెస్ట్ అయ్యాను. కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు. నామాట లెక్క చేయడు. నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు విలువ ఇవ్వడం లేదు. ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు. దీంతో నా మనస్సులో  భరించలేని ఒంటరితనం ఏర్పడి  విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చి పోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఇది ఆవేశంతోనో- దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నిరాశా - నిర్లిప్తతతో తీసుకున్న నిర్ణయం .

ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది…

"నిజమే! మీరంతా సామాజిక జీవులు. మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు  అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం. 

మరి అలా జరగనప్పుడు ఏంచెయ్యాలి? 

ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. 

అసలు నిన్ను  అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?

నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను  అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా? అని ఆలోచించు! వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!

ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ 

ఏపనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. 

సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది. 

మరిప్పుడు ఎలా? నీ కర్మ ఇంతే  అనుకుందామా?  కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకో! 

నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?

ఇది కూడా నిజమే! 

ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి  వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'. 

ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో  అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకోలేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం ?   

ఇంకేం చేస్తాం ? మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము. 

" నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు!"

దీన్నే మరోలా చదువుదాం 

" నేను ఎవరికీ అర్థం కావట్లేదు "

ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా! 

మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది. 

అవును! మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే !

నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని. 

ఇప్పుడు రెండే దారులు. 

ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి. 

ఇక రెండోది. 

నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి.  నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాలు ఉంటేనే  లోకానికి కనబడతావు. సమాజం నిన్ను గుర్తిస్తుంది.

నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదా వేసుకో! 

ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు.అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు !

నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి             నీ అనుభవాలు చెప్పు!

ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.

చివరగా మరొక్క మాట!

ఇతరుల విలువనూ,గౌరవాన్ని కోరుతున్న నువ్వు 'స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! " 

అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.

భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ   "ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.

అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం!  అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానంలో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.

ఆరు నెలలు గడిచిపోయాయి.

ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, 

"ఏం జరిగింది? " అని అడిగింది.

"ఏం చెప్పాలి? ఒకటా ? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.

ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది…

 ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటును అరగంటకు కుదించాను.

అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ నా పనులు తెమిలేవి కావు.

ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం  మిగులుతుంది కూడా !.

డైరీ రాయడం ప్రారంభించాను.నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.

మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిళ్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.

ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ  నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.

నాకు తెలియకుండానే పిల్లలకు కూడా ‘టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను’ అన్న విషయాన్ని గమనించలేకపోయాను.

“నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."

“ఇప్పుడు  నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.

ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.

రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను.

వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తాపిల్లలను నిద్ర లేపుతున్నాను.

నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్న కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.

అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.

రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను,నా భర్తాపిల్లలలో దర్శించలేనా?

కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా ?

అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.

నా భర్త కు "రాధ"నయ్యాను.

అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకుముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.

ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.

నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక. కానీ, చాలా భయపడేదాన్ని. ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను. మా ఆఫీసు మీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.

నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది. కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.

చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను. ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను. ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నాని అనిపించవచ్చు ! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.

నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.

అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను అవేశం తో రగిలిపోయేదాన్ని.

గతంలో  ‘నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే  విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి’ గుర్తుకువస్తుంది.

ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని. 

కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తతకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతోంది.

ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నకొద్ది అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.

అతను  నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ  ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.

నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.

ఇప్పుడు నాకు కుటుంబసభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే !

నీకో విషయం చెప్పనా ? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.

ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఊసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి. అలా వచ్చేవారికి ‘కొంచం కూరగాయాలు తరిగి పెట్టవా? గిన్నెలు కడగడంలో హెల్ప్ చెయ్యవా?’ అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.

ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.

మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 

ప్రధానమంత్రి  స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను. ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.

నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.

ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను. నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.

"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి…ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యి !' అంటే వెళ్లి పోశాను. 'శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో!’ అంటే వెళ్లి పెట్టుకున్నాను.

నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను. మార్పు బయటనుంచి వస్తుందని ఎదురు చూశాను. 

మార్పు లోపలినుంచే వస్తుందని మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.


ఇదంతా నీవల్లే! 


నా ఆత్మహత్య ను తప్పించావు.

నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.

నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా, గౌరవం రావడానికి కారణమయ్యావు. 

ముఖ్యంగా ‘నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు.’

ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.


నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తోంది.


సరే! నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ..


ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో  ఇలా చెప్పసాగింది…

"నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.

నేనున్న స్థితి ఎలాంటిదంటే…

ఆకలౌతుంది కానీ, తినలేను.

నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.

అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.

దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.


ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేళ్ళా పడి విముక్తి కలిగించమని పార్థించాను.


నా ప్రార్థన విన్న అతడు ...

"ఆత్మహత్య మహా పాపం.

నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు. నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.


1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )

2. నీ మాటలు ఒక వ్యక్తికి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి.

( జ్ఞానదానం )

3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )

అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపంలో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.


ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడంలోనే ఉంది గొప్పంతా!

నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు. నేను చేసిందేమీ లేదు.

నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.  నీకే నాహృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం ‘సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా’ బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.


"ఒకరికి సహాయం చేయడంలోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి  బయలుదేరింది

[


ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.


అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*


 ‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.

             

కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో  వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.


కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.


ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.


ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.


మధ్యాహ్నం ఆవ్యక్తి  భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు.


కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.


’తిన్నారు!’  అని చెబుతుంది.l


దానితో   ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’   అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు.


ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు.


ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి   ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*


*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*


*కనుక, ఏ ఇంటిలో  ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.*

[

ఎలా మాట్లాడాలి ??


🌷🌷🌷🌷


*


🌷అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం – రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.


🌷ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.


🌷శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూరవాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం – అంటోంది మహాభారతం.


 గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.


🌷మనసా, వాచా, కర్మణా – ఈ త్రికరణాలలో రెండవదైన ‘వాక్కు’ అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట. 

శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో సుప్రసిద్ధం.


🌷మాటలు సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.


ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా ‘ఒరేయ్’, ‘ఏమిరా’ అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.

అదేవిధంగా – కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ, వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.

*Pranjali Prbha stories in telugu*




తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ



అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.



అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు.



ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.



స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ,  వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.



సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి, తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.



“తర్వాతెప్పుడో కొద్ది కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ!” అన్నాడా భిక్షువు.



“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు బుద్ధ భగవానుడు

         *తారకాసురుడి కొడుకులు*

తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యక, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. 

అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.

"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.

"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.

"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. 

తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. 

మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.

"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. 

తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. 

అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.

"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.

"మీ ఇష్టం" అన్నారు దేవతలు.

"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.

"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. 

ఆశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. 

అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.

.........

*పాప పుణ్యాలు* 

నువ్వు చూస్తున్న విశాల భూభాగమంతా నేను సంపాదించినదే. ఇదికాక నావద్ద అపారమైన ధనరాసులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి' అన్నాడు ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో. వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటీ లేదు కదా? ' అన్నాడు మిత్రుడు.

 'వెంట తీసుకుపోగలవి ఏముంటాయి?' ఆశ్చర్యంగా అడిగాడు. 'పుణ్యరాసులు!' అన్నాడు మిత్రుడు. చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాటిపట్ల శ్రద్ధచూపరు. పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడు పనులు ఆ చెయ్యలేరు. కానీ, ఇతరులకు మేలు కలిగించేది మంచి, కీడు వాటిల్లజే నేది చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు.

 కొందరు గొప్పగొప్ప ఆధ్యాత్మిక విష యాలు మధురంగా బోధిస్తారు. 'అహం' ఆధ్యాత్మిక శత్రువు అన్నవాళ్లే, తమంత వారు తామే అనే ధోరణి కన బరుస్తారు. అసలైన ఆధ్యాత్మికత భగ వాన్ రమణులలో గోచరిస్తుంది. కౌపీనం ధరించిన ఆయనలో

కొండంత వినయం కొలువుండేది. సముద్రమంత సహనం ఆచ్చాదనగా ఉండేది. క్యాన్సరు వ్యాధి బాధను వ్యక్తం చేసే వారే కాదు. అన్నింటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు. ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందే శాలు. ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసులోని ఆలోచనలు, అలజడులన్నీ ఒక్కోటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ వేదికను పరిశుభ్రం చేసుకోవడం.

 అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది. అంత ర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్ష మవుతాడు. కళ్లు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు ధ్యానంలో స్థిరపడుతుంది. ధ్యానం 

 ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక సాధనం .

 తిరస్కరిస్తుంది.వలంటే అష్టసిద్ధులు లేని అనుబంటూ సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకొన్నదే.

 ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి.

 సాధనలన్నీ ఇష్టంగా ఉండు చెయ్యాలి. కష్టంగా చేస్తే ఫలితాలు దక్కవు.

 శరీరసుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. నాలుక రుచిని, శరీరం సౌఖ్యాన్ని, బుద్ధి గౌరవాన్ని అపేక్షిస్తాయి. ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది.

 ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు. సద్బుద్ధి, సద్భక్తి, అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే! అసలు అంతర్యామితో అనుబంధమంటూ ఏర్పడాలేగాని, ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచకన్నా హీనమనిపిస్తుంది.

 మన ఆకాంక్షలన్నీ 'అంతర్యామి'తో అనుబంధానికి అంకి తమై ఉండాలి. మన ఆచరణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి. అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం. ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే. ఏమి చేసినా భగవంతుడి సేవే

 - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్




విదురుడు చెప్పిన…

           *ఆణిముత్యాలు*

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! 

యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని ఋషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు.

విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు.

మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.

 వి. లక్ష్మి శేఖర్.

****

 *కాళీకి కొంతసేపు కలిగిన భక్తి భావం:* 

ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరులను గురించి మాతృదేవి ఒకసారి, "వీరందరవి ఎలాంటి జన్మలు? సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూంటారు. కాని *భక్తి కావాలి. జ్ఞానం కావాలి* అనే ఆలోచన కూడా వారికి రాదు!" అంటూ ఎంతో కలవరపడ్డారు. 

అప్పుడు శిష్యుడొకడు, "అమ్మా! గురుదేవులను ప్రార్థించి వారికి కావలసిన డబ్బు లభించేలా చేయవచ్చు కదా!" అన్నాడు. అందుకు మాతృదేవి, *"నాయనా! వారి కోర్కెలు తీరేవేనా? ఇస్తూ వుంటే అడుగుతూనే వుంటారు. వారి కోర్కెలకు అంతు లేదు. ప్రాపంచికలకు తృప్తి అనేది ఉందా ఏమిటి?"* అన్నారు.

కానీ ఒకసారి ఎలాగో పొరపాటున *భక్తి, జ్ఞానం* కావాలనే ఆకాంక్ష కాళీకి రానే వచ్చింది. కానీ వచ్చిన వేగంతోనే అది ఎగిరిపోయింది. ఆ సంఘటన ఇలా జరిగింది: 

మాతృదేవిని దర్శించుకోవడానికి *గిరీశ్* జయరాంబాటికి వచ్చాడు. ఆయన *కాళీతో* , "ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహారాజ్ఞి అయిన మాతృదేవిని సోదరిగా పొందిన తర్వాత కూడా డబ్బు డబ్బు అంటూ ప్రాకులాడడం ఎంతో శోచ నీయం" అన్నారు. కాళీకి కూడా వెంటనే ఏదో స్ఫురించింది. వెంటనే వెళ్లి రెండు చేతులూ జోడించి అత్యంత భక్తిభావంతో మాతృదేవికి ప్రణమిల్లాడు. మాతృదేవికి ఆతడి మనోస్థితి బాగా తెలుసు కాబట్టి, “కాళీ! ఏమిటి ఇదంతా? నేను గురువునూ కాను, దేవిని కూడా కాను; నీ అక్కయ్యను, అక్కయ్యనే, లే!" అన్నారు. కాళీకి ఈ మాటలు బాగా తృప్తి నిచ్చాయి. ఆ సంఘటనకు తర్వాత ఆతడెప్పుడూ ఆధ్యాత్మికత అదీ ఇదీ అంటూ ఆలోచించిన పాపాన పోలేదు.

ఒక రోజు ఉదయం దాదాపు పది గంటలు. మాతృదేవి వసారాలో కూర్చొని ఉన్నారు. కాళీ (3వ తమ్ముడు) వేసిన ఒక కంచె గురించి వరదునికి (4వ తమ్ముడు), ఆతనికి మధ్య పోట్లాట వచ్చింది. ఇద్దరూ కొట్టుకోసాగారు. మాతృదేవి లేచి వెళ్లి వారిని విడదీశారు. కానీ వాళ్లు ఆగలేదు. మాతృదేవి కోపంతో ఇద్దరినీ చీవాట్లు పెట్టారు. కాని వారు దానిని పెడచెవిని పెట్టి తీవ్రంగా పోట్లాడసాగారు. మాతృదేవి శిష్యుడు ఒకరు, మరికొందరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఆ తరువాత ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లి అక్కడ నుండే పరస్పరం తిట్టుకోసాగారు. 

మాతృదేవి కూడా ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్లి కూర్చొని బిగ్గరగా నవ్వసాగారు. నవ్వుకుంటూనే, "ఆహా! మహామాయ విచిత్రాన్ని ఏమనాలి? *మరణం వచ్చేటప్పుడు ఒక వ్యక్తి దీన్లో నుండి ఒక్క అణువు కూడా తనతో తీసుకెళ్లలేడు.* ఈ సామాన్య సత్యాన్ని కూడా తెలుసుకోకుండా పోట్లాడుకొంటున్నారే! ఏం వింత ఇది!" అంటూ చాలాసేపు పగలబడి నవ్వుతూనే ఉన్నారు. ఆమె నవ్వును ఆపుకోలేకపోయారు.

****

*నేను… నాది…!*

నేను – నాది అనే భావన నుంచి భయటపడాలి.

నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు.

నేను మొదలవుతుంటే నాది అనేది. దాని వెనక తోకల్లాగవస్తుంది. స్వార్థానికి నేను-నాది’రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని ” ఆ రెక్కలు వదులుకోఅని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే.

నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు.అప్పుడులోకం కూడా ఉండదు. ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది.

అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మికవాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి.

ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు.

ప్రార్ధన చేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది.

ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది.

అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం.

దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.

 చాలామందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకుతింటూ ఉంటాయి.

అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచం బాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే.  నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది. నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను.

ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు.

సమబుద్దికలవాడి కంటే మించినవాడు ఈ లోకంలోలేడు. ఈ సమత్వమే యోగం.

****

ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అని ఆర్షవాక్కు. ధర్మబద్ధమైన జీవితం సాధించాలంటే ముందు శరీరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కట్టు, బొట్టు, స్నానం, ధ్యానం ఇవన్నీ మనల్ని శారీరకంగా శుచిగా ఉండటానికి దోహదం చేస్తాయి.

మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధానం. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని పాటించడం మనిషి తన సహజ లక్షణాలుగా చేసుకోవాలి. సత్య, ధర్మాలను పట్టుకున్నవాడిని విజయం తప్పకుండా వరిస్తుంది. శ్రీరాముడు, ధర్మరాజు వంటి పురాణ పురుషులు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడలేదు. అందుకే వాళ్లు భావితరాలకు ఆదర్శమూర్తులయ్యారు. ధర్మరాజు ఒకసారి భీష్ముడిని ‘ధర్మం అంటే ఏమిటి?’ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘ఆచారం నుంచి ధర్మం అలవడుతుంది’ అని సమాధానమిస్తాడు. అవి సదాచారాలు అయి ఉండాలి. ఈ ఆచార, సంప్రదాయాలను పాటించడమే క్రమశిక్షణ. అటువంటి జీవన విధానం అలవర్చుకున్నప్పుడు మనసు కూడా నిష్కల్మషంగా మారుతుంది.

ఆచార, సంప్రదాయాలను పాటించడం ఎలా? మంచి నడవడిక నేర్పేది ముందుగా కుటుంబమే. అమ్మ, నాన్న, తోబుట్టువుల ప్రవర్తన మనిషిపై ప్రభావం చూపుతుంది. సమాజంలో మంచివ్యక్తిగా నిలబడాలంటే అందుకు ఇంట్లోనే చక్కటి పునాది నిర్మాణం కావాల్సి ఉంటుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ జీవన విధానానికి, నేటి వ్యష్టి కుటుంబ జీవన విధానానికి చాలా తేడా ఉంది. గతంలో పిల్లలకు బామ్మలు, తాతయ్యలు రామాయణ, మహాభారత కథలు చెబుతూ బాల్యంలోనే సత్యం, ధర్మం తదితర విషయాలను బోధించేవారు. నైతిక విలువలు నేర్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం రానున్న తరాల వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

భారతావని అదృష్టం అద్భుతమైన పురాణ వాఙ్మయం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి మనకు కుటుంబ జీవన విధానాన్ని, సంప్రదాయాలను, సామాజిక కట్టుబాట్లను, ఆధ్యాత్మికత అవసరాన్ని తెలియజేస్తాయి. రాముడి చరిత్ర సత్యవాక్కు విశిష్ఠతను తెలియజేస్తుంది. సహనం ప్రాధాన్యాన్ని ధర్మరాజు జీవనం తెలుపుతుంది. దానగుణం గొప్పదనాన్ని శిబి కథ చెబుతుంది, సంకల్పబలం ఎంత గొప్పదో ఏకలవ్యుడి జీవితం చెబుతుంది. ఇలా మన పురాణాల్లోని అనేక గాథలు సామాజికంగా ఎలా మసలుకోవాలో చెబుతాయి. వాటిని తెలుసుకోగలిగితే విలువలతో కూడిన సమాజం తయారవుతుంది.

మనిషికి నిజంగా ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? భోగభాగ్యాలు, కీర్తిప్రతిష్ఠలు, విలాసవంతమైన జీవితం ఎన్ని ఉన్నా ఇవన్నీ మనిషిని సంతోషపెడతాయా అంటే చెప్పలేం. కానీ, ఆత్మసంతృప్తిని మించిన సంతోషం మరొకటి లేదు. ఆ సంతృప్తి మన నడవడికతోనే లభిస్తుంది. విలాసాలు, సంపదే ఆనందానికి మూలం అనుకుంటే.. మనకంటే తక్కువ సౌకర్యాలు, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ముందుతరాల మనకంటే ఎందుకు ఎక్కువ ఆనందంగా జీవించారో సమీక్షించుకుంటే సమాధానం తెలిసిపోతుంది. సదాచారాలు, సంప్రదాయాలు వారి జీవన విధానంలో భాగంగా ఉండేవి. అందుకే వాళ్లు సంతృప్తిగా బతకగలిగారు. మన ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు. వాటిలో పారమార్థిక భక్తి, ఆరోగ్య, వైద్య, వైజ్ఞానిక అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గుర్తించి, ఆచరించగలిగితే మనిషి మంచి పౌరుడిగా మారుతాడు.

***

*నరుడి జన్మవృత్తాతం సమ్మోహనం*

    *హిందూ పురాణాలలో ఎందరో దైవాంశ రూపులు ఉన్నారు. వారిలో ‘నరుడు’ కూడా ఒకడు. ఇతను దైవిక శక్తి గల ఓ ఋషి.*

*ఇతని జన్మవృత్తాతం…*

*బ్రహ్మ శరీర భాగం నుండి ’ధర్మదేవుడు జన్మించాడు. ఇతడు దక్షుని  10 మంది పుత్రిక లను వివాహమాడగా చాల మంది సంతానం జన్మించారు. అందులో ముఖ్యమైనవారు హరి, కృష్ణ, నర, నారాయణ.*

*హరి, కృష్ణులు గొప్ప యోగులు కాగా నరనారాయణులు గొప్ప ఋషులయ్యారు. హిమాలయాలలోని బదరికాశ్రమంలో వేల సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. వీరు ఊర్వశికి జన్మనిచ్చారు. నరుడు పురాణాలలో వివిధ సందర్భాలలో ప్రముఖపాత్ర  పోషించాడు.*

*దేవదానవులు క్షీర సాగర మదనం చేసినపుడు అమృతం వెలువడగా మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు దానవుల్ని మోసగించి అమృతాన్ని ఇంద్రునికి అప్పగిస్తాడు. దానవులు ఇంద్రునిపై దండెత్తినపుడు నరనారాయణులు ఇంద్రుని పక్షాన నిలబడి పోరాటం చేసి, దానవులను ఓడించి తరిమికొడతారు. అప్పుడు నరుడికి అమృతాన్ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు ఇంద్రుడు. అలా దేవతలకు ఎంతో గొప్ప శక్తులను ఇచ్చిన అమృతం నరుడి వల్ల సురక్షితంగా ఉంది.*

 *శివునితో పోరాటం చేసిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. దక్ష యజ్ఞానికి ఆహ్వానించనందుకు శివుడు కోపించి తన శక్తిని దక్షునిపైకి పంపితే ఆ యజ్ఞాన్ని భగ్నం చేసి గాలిలో విహరిస్తూ బదరికాశ్రమాన్ని చేరి తపస్సు చేస్తున్న నారాయణుడి హృదయాన్ని ఆ శక్తి తాకుతుంది. అప్పుడు నారాయణుని 'హమ్' అను శబ్దం వెలువడి ఆ శక్తికి చోటులేక వెనక్కు వెళ్లి శివుడ్ని చేరింది. అప్పుడు శివుడు నరనారాయణులపైకి దండెత్తి వచ్చాడు. నరుడు మంత్రించి ఓ గడ్డి పరకను విసరగా అది గొడ్డలిగా మారి శివుని పైకి రాగా దాన్ని శివుడు విరగ్గొట్టాడు. అందువల్ల శివుడ్ని ‘ఖండ పరశుడు’ అంటారు. అప్పుడే నారాయణుడి నుండి వెడలిన శక్తి వేడికి శివుడి తల వెంట్రుకలు నల్లబడి ఎండిన గడ్డిలా మారాయి. - మహాభారతం నుండి సేకరించిన విషయం.*

*ప్రహ్లాదునితో యుద్ధం జరిగిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. ఒకసారి చ్యవన మహర్షి తప్పనిసరై పాతాళానికి వెళ్లగా ప్రహ్లాదుడు ప్రపంచంలోని గొప్ప పుణ్యక్షేత్రాలను చెప్పమని కోరతాడు.*

*చ్యవనుడు "భూమిమీద నైమిశారణ్యం, ఆకాశంలో పుష్కరం, పాతాళంలో చక్రతీర్థం" అని చెబుతాడు చ్యవన మహర్షి.*

*అప్పుడు ప్రహ్లాదుడు నైమిశారణ్యం వస్తాడు. ప్రహ్లాదుడు నైమిశ తీర్థంలో స్నానం చేసి వేటకు వెళ్లగా అక్కడో వృక్షం దాని క్రింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు ఋషులు కన్పించారు. ఆ చెట్టు కొమ్మలకు, ఆకులకు ఆయుధాలు వుండటం చూసి వీరిని గురించి ప్రశ్నించగా వాగ్వాదం జరిగి బలాబలాలు తేల్చుకో దల్చుకుంటారు. నరుడు అజగవమనే వింటితో ప్రహ్లాదుని పైకి బాణాలు సంధిస్తాడు. ప్రహ్లాదుడు వాటిని త్రుంచివేస్తాడు. అప్పుడు నరుడు మరిన్ని బాణాలు సంధించినా ప్రహ్లాదుడు వాటిని ఎదుర్కోగా నారాయణుడు ముందుకు వచ్చి ప్రహ్లాదుడితో ఘోరయుద్ధం చేస్తాడు. అప్పుడే ప్రహ్లాదుడు పడిపోతాడు. ఆ బాణాలు గుచ్చుకొని ప్రహ్లాదుడి హృదయం చీలుతుంది. ప్రహ్లాదుడు ఇతడ్ని శ్రీమహావిష్ణువుగా గుర్తించి అతడ్ని ప్రార్థిస్తాడు.*

*నరనారాయణులు ఇద్దరూ సహస్ర కవచుడి 999 కవచాలు బద్దలు కొడతారు. ఆ సహస్ర కవచుడు తిరిగి కర్ణుడిగా జన్మించగా 1000వ కవచాన్ని ఛేదించడానికి కృష్ణార్జునులుగా జన్మిస్తారు. ఇదీ నరుడి వివరణ వృత్తాంతం.*

*కొసమెరుపులో విషయం ఏమిటంటే పాంచాలి వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది స్మరించుకున్నది నవనారాయణులనే.*

*శ్రీకృష్ణార్జునులు నరనారాయణుల పునర్జన్మలు.*

*భృగుని శాపం వల్ల వీరు కృష్ణార్జునులుగా జన్మించారు. అందుకే నవనారాయణులను ద్రౌపతి ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు కాపాడతాడు.*✍️

Pranjali Prabha stories in telugu*




ఎన్ని వైపుల నుంచి ఎన్ని నదీజలాలు సముద్రంలోకి ప్రవహించినా విశాల సముద్రం అలజడికి లోను కాదు. అదేవిధంగా అన్నిరకాల ప్రాపంచిక సుఖభోగాలు స్థితప్రజ్ఞుడిలో ప్రవేశించినా ఎలాంటి వికారాన్ని అతడు పొందలేడు. పైగా అవన్నీ అతనిలో లీనమైపోతాయి. అటువంటి వాడే శాంతిని పొందుతాడు. భోగలాలసుడు కాడు’ అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన బోధను అనుసరించి స్థిరచిత్తం కలిగిన స్థితప్రజ్ఞుడిని ఏ కోరికలు చలింపజేయవన్న సత్యం బోధపడుతుంది. సంయమనమే శాంతిని ప్రసాదించే మార్గం. కాబట్టి ఎవరైనా శాంతిని కోరుకున్న వ్యక్తి విధిగా సంయమనాన్ని సాధించాలన్నది భగవదాశయం. ఇది మన జీవితాలకు ఒక పరిపూర్ణతను ఇస్తుందన్నది కాదనరాని సత్యం.

ఆత్మజ్ఞానం సంయమనాన్ని సులభతరం చేస్తుంది. తనను తాను నియంత్రించుకొని, ఇంద్రియాల ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మోద్ధరణ చేసుకున్న వ్యక్తిలో సంయమన గుణం వృద్ధి చెంది అతడొక స్థితప్రజ్ఞత కల సంయమిగా వెలుగగలడు. అందుకే స్వామి సంయమిని సముద్రంతో పోల్చాడు. ఎన్ని నదులు తనను చేరినా సముద్రం హద్దు మీరదు. అది గంభీర వారాశిగానే మిగులుతుంది. దాని లోతు అంత సులభంగా తెలుసుకోలేం. సంయమి గుండె లోతులను కూడా గ్రహించడం సులభమేమీ కాదు. ఏ కోరికలు తనను లొంగదీసుకోలేవు. విషయ వాంఛలేవీ అతనిని బంధించలేవు. అతని హృదయం జ్ఞాన మార్గంలోనే పయనిస్తుంది తప్ప మరొక దారిలోకి మళ్లిపోదు. ఈ సత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు.. అర్జునుడికి వివరించిన తీరు అసదృశం.

ఈ బోధనలను బట్టే జ్ఞాని అయినవాడు సముద్రపు వలె ఎటువంటి చలనం లేక స్థిరంగా నిలుస్తాడు. అజ్ఞాని సముద్రం అలల వంటివాడు. ఎగిసి ఎగిసి పడుతుంటాడు. చలనచిత్తుడై ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన సముద్రం పోలిక విశిష్టమైనది. సాగరాన్ని సమీపించే నదీజలాలు వివిధ వర్ణభేదాలతో, రుచి భేదాలతో ఉంటాయి. వర్షం వల్ల ఏర్పడే వాగులు, వంకల వంటి వాటి లక్షణాలు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండే ఒకేఒక సమాన గుణం ప్రవాహశీలత. సముద్రుడు తానుసైతం ప్రవాహశీలత కలిగినవాడు, తనలోను జలతత్వమే ఉంది కనుక, వాటన్నిటినీ స్వీకరించి, ఏ మాత్రం పొంగిపోకుండా స్థిరచిత్తుడై గంభీరంగా ఉంటాడు. వ్యక్తిలో కోరికలు పరుగులెత్తినా వాటన్నింటినీ అధిగమించి వాటిని తనలో కలుపుకొని స్థిరచిత్తుడిగా నిలబడి ఉన్నప్పుడే అతడు స్థితప్రజ్ఞుడై శాంతిని పొందగలడు. అంటే స్థితప్రజ్ఞుడు సాగర సదృశుడు కావాలి. అనేక భోగభాగ్యాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ, వాటియందు మాత్రమే తన మనసును నిలపరాదు. నిమిత్త మాత్రుడిగానే వాటిని అనుభవించాలన్నది భగవద్గీత బోధించే శాశ్వత తత్వం.

ఇన్ని ప్రవాహాలు తనలో కలవడం వల్ల సాగరానికి ఎంత పూర్ణత్వం ఒనగూడినా, దాని గొప్పదనానికి మాత్రం స్థిరత్వమే ప్రధాన హేతువు. మానవుడికి ఎన్ని కోరికలున్నా వాటికి కట్టుబడక, అవే జీవిత పరమార్థాలుగా భావించక జీవించేవాడే సాగర సదృశచిత్తుడు. అతడే సాటిలేని స్థితప్రజ్ఞుడు. ఆనందాలు ప్రవాహాలై తనను చేరవచ్చు. అయినా తానుమాత్రం అశాశ్వతమైన ఈ ఆనందాలకు లొంగకుండా పూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలగాలి. ఒక మహాసాగరం వలె అన్నింటినీ తనలో కలుపుకొని గంభీరంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమై కర్తవ్య నిర్వహణలో లక్ష్యం చేరుకోగలిగే ఉత్తమ సాధకుడై నిలబడతాడు. అపురూపమైన శాంతిని అందుకోగలుగుతాడు. ఇది శాశ్వత సత్యం.

***

*ఆ కాలం ఏమి నేర్పింది??* 


పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం*

నేర్పింది.


*వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,

*శోధించే తత్వం* నేర్పింది.

*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,

*అన్వేషణ* నేర్పింది.

*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,

*జీవితం*  పూలపాన్పు కాదని నేర్పింది.

*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం *చిట్కాలు*  నేర్పింది.

చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని *ఛేదించడం* నేర్పింది.

*నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు..

*బాధ్యత* అని నేర్పింది.

*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా *బరువు* లాగటం నేర్పింది.

*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,

ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* గుణం నేర్పింది.

*విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తి నే *ఒద్దికను*

నేర్పింది.

ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో

స్నేహితులతో*పంచుకోవటం* నేర్పింది.

ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* 

నేర్పింది.

దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* నేర్పింది.

*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,

ఊరు ఊరంతా ఒక కుటుంబమనే *ఆత్మీయత* నేర్పింది.

ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన మన బాల్యానికి జీవితాంతం రుణపడి ఉందాం.

🙏🙏🙏🙏🙏🙏

జీవితంలో దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, అపజయాలు కలుగుతున్నప్పుడు అంతా చీకట్లు ఆవరించినట్లుగా అనిపిస్తుంది. చీకటిలో దారీతెన్ను తెలియదు. ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞానాదులతో కూడి స్వధామానికి వెళ్లిపోయాడని చెబుతుంది భాగవతం. జగత్తులో ధర్మం కొరవడినప్పుడు అంతటా చీకట్లు మూగినట్లే కదా! అలాంటి ధర్మరహిత స్థానంలో మానవుడు నిశ్చయంగా దుఃఖాలను, కష్టాలను అనుభవించ వలసి వస్తుంది.

కలియుగంలో అజ్ఞానాంధకారంతో దృష్టి కోల్పోయిన మానవులకు వెలుగు చూపడానికే శ్రీమద్భాగవతం ఉదయించింది. చీకటిని తొలగించేది కాబట్టి ‘భాగవతం పురాణార్కాయ’అని భాగవతాన్ని పురాణ భాస్కరుడిగా అభివర్ణించారు.

సమస్త వేద వాఙ్మయ రచయిత శ్రీల వ్యాసదేవుడే అయినా ఆ రచనలు ఆయనకే శాంతిని కలిగించలేకపోయాయి. తర్వాత తమ గురుదేవుడైన నారదముని ఆదేశంతో వ్యాసదేవుడు భాగవత రచన చేసి పరమశాంతిని పొందాడు. రచయితకే పరమానందం కలిగించిన భాగవతం మానవులందరికీ జీవితాలలో వెలుగులు నింపే పురాణ సూర్యుడు. మానవులకు దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? త్రివిధ తాపాలు ఎలా కలుగుతున్నాయి? వాటిని తొలగించుకోవడం ఎలా? పాపాలను పూర్తిగా శమింపజేసుకోవడం ఎలా? అనే విషయాలు తెలియకపోతే మనం చీకటిలో ఉన్నట్లే అవుతుంది. చీకటిలో ఉన్న మనకు చుట్టూ ఉన్న వస్తువులు కనిపించవు, ఎటువైపు వెళ్లాలో తెలియదు. ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలియదు. అందుకే చీకటి జీవితం అంతులేని భయాన్ని కలిగిస్తుంది. కానీ, భాగవత భాస్కరుడు శీఘ్రమే వెలుగులు ప్రసరించి దుఃఖాలను నశింపజేస్తాడు, సుఖాలను అందజేస్తాడు. అందుకే భాగవతాన్ని నిత్యం వినాలని, అధ్యయనం చేయాలని పెద్దలు చెప్పారు.

భాగవతం మానవులకు అందిస్తున్న ప్రత్యేక సందేశం ‘తపోమయ జీవనం’. జీవితంలో తపస్సు అనివార్యమైనది. మనిషి తపస్సు ద్వారా సమస్త దుఃఖాలను నశింపజేసుకుంటాడు. దుఃఖాలు కలగడానికి కారణం పాపాలు పేరుకొనిపోవడమే! తపస్సు ద్వారా పాపశమనం కలుగుతుంది. పాపాలు తొలగగానే దుఃఖాలు నశించిపోతాయి. ఇదే భాగవతం కురిపించే, తెలియజేసే దివ్యమైన వెలుగు! సృష్టికార్యం కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, శ్రీకృష్ణుడినే పుత్రుడిగా పొందడానికి దేవకీవసుదేవులు తపస్సు చేశారు, ప్రజాసృష్టి చేయగలిగే శక్తి కొరకు దక్షప్రజాపతి తపస్సు చేశాడు. ఈ విధంగా భాగవతంలో అనేకమైన సందర్భాలు, సంఘటనలు తపోమహిమను మానవులకు తెలియజేస్తున్నాయి.

భక్త ధ్రువుడు తన పుణ్యపరిపాకాన్ని భోగాలను అనుభవించడం ద్వారా, పాపాలను తపస్సు ద్వారా పరిహరించుకున్నాడని భాగవతం స్పష్టంగా పలికింది. సుఖాలు కలుగుతున్నాయంటే పుణ్యం తరిగిపోతున్నదని అర్థం. దుఃఖాలు కలుగుతున్నాయంటే, కష్టాలు ఎదురవుతున్నాయంటే పాపం పండుతున్నదని సూచన. అందుకే భాగవత సందేశం ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒక తపస్సులో నెలకొనాలి. మనిషి మూడు రకాల తపస్సులు చేయాలి. అవి.. వాచిక తపస్సు, శారీరిక తపస్సు, మానసిక తపస్సు. మనిషికి అనారోగ్యం కలిగినప్పుడు వైద్యంలో లంఖణాలు చేయవలసివస్తుంది. ఆహారం తినలేకపోవడం రోగికి దుఃఖకరంగా అనిపిస్తుంది. కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారానికి, పక్షానికి ఒకరోజు ఉపవాసం చేస్తే అనారోగ్యం దరి చేరదు. ఉపవాసం చేయడం అంటే శారీరిక తపస్సేగా! అంతేకాదు, తపస్సు ద్వారా తపోశక్తి పెరిగి విజయాలు చేకూరుతాయి, ఫలితంగా సుఖప్రాప్తి కలుగుతుంది. ఈ విధమైన దివ్యసందేశాలతో జీవితంలో చీకట్లు తొలగించి వెలుగులు నింపేది కనుకనే భాగవతాన్ని పురాణ సూర్యుడిగా అభివర్ణించారు. నిత్యం భాగవత సేవ ద్వారా మానవులందరు సుఖశాంతులతో జీవించి కృష్ణప్రేమను పొందెదరు గాక!

****

*సాంసారిక దుఃశ్చింత వల్ల కలిగే హాని*

భగవంతుడు కల్పతరువు లాంటి వాడు - మనం ఏమి కోరినా భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి పారమార్థిక సాధనలతో మనసును పరిశుద్ధం చేసుకొని సాధకుడు ఐహిక వాంఛలన్నింటిని విసర్జించటానికై జాగరుకుడు కావాలి. ఈ విషయంగా ఒక కథ చెప్తాను, వినండి: ఒక బాటసారి ప్రయాణం చేస్తూ, దారిలో ఒక మైదానాన్ని చేరుకొన్నాడు. అతడు బైట ఎండలో నడ్చినందున, అలసి ముచ్చెమటలు పట్టగ కాస్సేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంచెం సేపయ్యాక అక్కడ నిద్రపోవటానికి తన కొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో, ఆ విషయం అతగాడు ఎరుగనే ఎరుగడు. అతడి ఊహలో కోరిక మెదలాగానేఅతడి పక్కన ఒక చక్కని పానుపు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దాని మీద పడుకున్నాడు. ఆ తరువాత ఒక సుందరాంగి వచ్చి సుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకొన్నాడు. ఈ తలపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతూండటం కనుగొని బాటసారి పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది . ఇప్పుడు అతడిలా ఊహించాడు: "నేను కోరిందంతా సంప్రాప్తమైంది. నా కిక ఏదైనా ఆహరం లభించకపోతుందా?” మరుక్షణంలోనే అతడి ముందు రక రకాలైన రుచికర పదార్థాలు వడ్డించబడ్డాయి. వెంటనే వాటిని ఆరగించా సాగాడు. తృప్తిగా తిన్న తర్వాత, పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరువేసుకో సాగాడు. అలా చేస్తు చటుక్కున "ఇప్పుడు హటాతుగా నన్నొక పులి వచ్చి గుటుక్కున మింగితే!" అని ఊహించాడు. మరుక్షణంలోనే గాండ్రుమంటూ ఒక పెద్దపులి అతడి మీదకి ఉరికి మెడను పంజాతో కొట్టి నెత్తురు తాగసాగింది. ఇలా ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా లోకుల గతి ఇలాగే పరిణమిస్తూవుంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతున్ని ప్రార్తించే పక్షంలో, మీ కోరికలు కొంతమేరకు తప్పక సిద్ధిస్తాయి. కాని వాటి వెనుకే పెద్ద పులి దాగివుందని జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధననష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటే వెయ్యిరెట్లు భయంకరాలు కదా!

***

వయసులో చిన్నవాడైనా.. యముని సన్నిధికి వెళ్లి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు, మంచి నడవడికి ప్రతిరూపం. నచికేతుడి వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు ఒక యాగం చేసి, చివర్లో దానాలు చేస్తుండగా.. చిన్నారి నచికేతుడు వెళ్లి ‘నాన్నా మరి నన్నెవరికి దానం చేస్తావు’ అని పదేపదే అడుగుతాడు. కొడుకు మాటలతో విసిగిన వాజశ్రవుడు ‘నిన్ను యముడికి దానం చేశాను పో’ అంటాడు. తర్వాత.. ఆ మాట అన్నందుకు బాధపడతాడు. తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచికేతుడు యముని వద్దకు వెళ్తాడు. కానీ అక్కడ యమదర్శనం కలగదు. దీంతో అన్నపానీయాలు ముట్టకుండా మూడురోజులపాటు గడుపుతాడు. మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకుని.. మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచికేతునికి మూడు వరాలనిస్తాను కోరుకోమంటాడు. తిరిగి వెళ్లినప్పుడు తండ్రి తనను ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే.. యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు. స్వర్గప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే.. ‘అగ్నిచయనం’ గురించి చెప్పి, ఆ యాగం ఇకపై ‘నాచికేతాగ్ని చయనం’గా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు. మూడో వరం కోరుకోమన్నప్పుడు.. ‘మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు? ఆత్మస్వరూపం ఎట్టిది? ఈ విషయమై నా సంశయం పోగొట్టండి’ అని కోరడంతో యముడు ఆశ్చర్యపోతాడు. నచికేతుని శ్రద్ధాయోగ్యతలను పరీక్షించేందుకు.. ‘‘నచికేతా! మరణం తర్వాత ఆత్మ ఉండునా? అనే విషయమే అతి సూక్ష్మమైనది, తెలుసుకోవడానికి కఠినమైనది. కాబట్టి,అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను’’ అంటాడు. అందుకు నచికేతుడు.. ‘కఠినమైన విషయాన్ని మీవలె బోధ చేసేవారు దొరకరు. ఆత్మను తెలుసుకోవడం కన్నా నాకింకొక వరమేమీ అక్కర్లేదు’ అంటాడు. నచికేతుణ్ని ప్రలోభ పెట్టడానికి యముడు.. ‘నీకు సుఖాలనందజేసే పుత్రులను, పౌత్రులను ఇవ్వాలని కోరుకో. నీ సుఖజీవనానికి అవసరమైన ఆలమందలను, ఏనుగులను, గుర్రాలను, వాటిని పోషించడానికి కావాల్సినంత బంగారాన్ని ఇస్తాను. విశాలమైన భూభాగాన్ని ఇస్తాను. ఆ సంపదలను, సుఖాలను నీవెంత కాలం అనుభవింపదలిస్తే అంత కాలం ఆయువునిస్తాను. నిన్ను రాజును చేస్తాను!’ అని చెబుతాడు. అందుకు నచికేతుడు.. ‘యమధర్మరాజా.. లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవేకదా! ఇంద్రియాలను కుంగదీసే సుఖాలను నేను నమ్మను. ఎక్కువ ధనం, భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు. ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా? నీ దర్శనం దొరికింది. కనుక ఈ ధన, కనక, వస్తువాహనాలపై నాకు భ్రమ లేదు. ఆత్మతత్వం తెలుసుకోవడం తప్ప మరొక వరం నాకొద్దు’ అంటూ తన దృఢసంకల్పాన్ని తెలియజేస్తాడు. యముడు అతడి శ్రద్ధకు, పట్టుదలకు మెచ్చి.. జీవాత్మ, పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి, మోక్షానికి కావలసిన సాధనలు తెలియజేస్తాడు. ఏ జ్ఞానమైనా తపన, ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియజెప్పే అద్భుత వృత్తాంతమిది.


 

హనుమత్ ప్రదిక్షణాలు చేసేటప్పుడు పఠించదగ్గ శ్లోకాలు, మంత్రం :
0x0x0x0x0x0x0x0x0x0


భూతప్రేతపిశాచాది బాధలు తొలగడానికీ, రోగాలు కష్టాలు తొలగేందుకు, అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు.

' శ్రీ హనుమాన్ జయహనుమాన్ జయజయ హనుమాన్'

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం౹
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం౹౹

మర్కటేష మహోత్సాహ సర్వశోక వినాశన |
శత్రూన్ సంహర మాంరక్ష శ్రియం దాపయ మే ప్రభో౹౹'

అని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని, పరుగువిడక, నమ్రులై ప్రదక్షిణం చేయాలి.

మధ్యలో మాట్లాడరాదు. స్నానాదికం నిర్వహించి శుచులై చేయాలి. 108 కానీ, అందులో సగం కానీ, లేదా 5 గానీ - దీనితో గుణించబడిన సంఖ్యతో కానీ చేయవచ్చు.

నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన౹
విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్తవత్సల౹౹

అని అయిదుసార్లు నమస్కరించాలి.
x÷x÷x÷x÷x÷x÷x÷x÷x÷x
సేకరణ :

****
తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు  !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతంవారిని మనువాడాడని
మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!

ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవం  పరిధులు మించిపోతుంది!!
వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!

అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!


అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత  సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!

స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోందని
అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!
****
భగవాన్‌ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం.
ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. ‘భగవాన్‌! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు.
‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు.
‘భగవాన్‌ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది.
‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే!
ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు
అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది.
ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు. ‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’’


Tuesday, 28 June 2022




                *మరణంలో స్మరణ*

                        *మహిమ*

 

"పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండే వాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది,   భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు."


ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసు కొనిపోవడానికి నిశ్చయించు కొన్నారు. 


గురువుగారి దగ్గరకు వెళ్ళి...

“గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు".


వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.


ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులతో… “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు.


అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని *మాలవాడ*' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు.


 ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ' అనే పదం మాత్రమే వినిపించింది.


 ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.


*ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి.*


 అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది.


అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు.


ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.


ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు.


అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి.


ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూపనికిరానిఅప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు.


*మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేకకాలం  గడపసాగాడు.*


ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.


అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.


ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!


రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు. రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడ…


*కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.*


మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.


'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.

ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు. 


మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:


*జన్మదుఃఖం జరాదుఃఖం -జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.*


"పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక."


ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:


*మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః*


'తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త!' - అని చాటాడు.


 ఇది విన్నరాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు…


 

*ఆశయా బధ్యతే లోకే - కర్మణాబహుచింతయా ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.*


అని చాటింపు వేశాడు.


"ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు."


ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.


మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు:


“ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాదు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”


తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.


అప్పుడు రాజు : “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్నిచేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.


తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.


అప్పుడు ఆ జీవన్ముక్తుడు :  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.


“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను"- అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.


రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.


ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించ సాగాడు. ఇలా కొంతకాలంగడిచింది.


దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.


 “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.


అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు…

“ఓ బ్రహ్మదేవా! ఏంచెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”


బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. 


అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే…

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.ఆచోటుదేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..


మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు.


అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.


*అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేక పోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.*


ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.


"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు…

"ఓబ్రహ్మదేవా మీకుతెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు *మాలపల్లె* అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో   మళ్ళా జన్మించాల్సి వచ్చింది.


 భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా!


కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”


అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.


*మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది*.


కాబట్టిఅంత్యకాలంలోభగవన్నామమే పరమ ఔషధంగా  పనిచేస్తున్నది.


*నామస్మరణే సులభోపాయం. ఆనామ స్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గంచూసుకొందుంగాక!*


పవిత్రాత్మ స్వరూపులారా!

శ్రీ భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ 8-6 శ్లోకంలో ఇలా …సెలవిచ్చారు :


శ్రీ భగవానువాచ :


*యం యం వాపి స్మరణ్ భావంత్యజ త్యంతే కళేబరం, తంతమే వైతి కవున్తేయ సదా తద్భావ భావి తః*! (08-06)


భావం : "అర్జునా! ఎవడు మరణకాలంలో ఏయే భావంతో వుంటూ దేహాన్ని వదులుతాడో, ఆభావం యొక్క స్మరణచేత కలిగిన సంస్కారం కలిగి ఉండడం చేత, ఆయా రూపాన్నే పొందుతున్నాడు."


భగవద్భక్తులైన వారంతా  వారి వారి జీవితాల్లో సదా దైవనామ స్మరణ ను అలవాటు చేసుకొని, అంత్యకాలంలో కూడా ఆ దైవ నామాన్ని తలుస్తూ, ఆదైవాన్నే పొందెదరుగాక!

 


ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భావిస్తారు.

మనుషులు నదుల్లో స్నానాలు చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. ఆ పాపాలను స్వీకరించడం వల్ల కలిగే బాధ నుంచి నదులకు విముక్తి కలిగించే ఉత్సవాలే పుష్కరాలు. పూర్వం పుష్కరుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. మనుషుల పాపాలను మోస్తున్న నదులను పునీతం చేసి, వాటి ఆవేదన తీర్చాల్సిందిగా ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆ పాప ప్రాక్షళనలో పుష్కరుడే కీలకం అవుతాడు. ఆయన సాధించిన విజయమే పుష్కరోత్సవాలు. స్వర్గంలోని మందాకినీ నదిలో అంతర్లీనంగా ఉండే పుష్కరుడు ఏడాదికి ఒకసారి బృహస్పతి రాశి సంక్రమణం ఆధారంగా ఒక్కో నదిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఆ నదికి పన్నెండు రోజులు ఉత్సవాలు చేస్తారు. వీటినే పుష్కరాలు అంటున్నారు.

పుష్కరోత్సవం జరుగుతున్న నదికి పదివేల నదుల ప్రవిత్రత ఏర్పడుతుందని మహాభారతంలోని అరణ్యపర్వం తెలియజేస్తుంది. పుష్కరాల వేళ నదీస్నానం చేసి దేవతలకు, రుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని ధర్మరాజుకు నారదుడు చెబుతాడు. అందుకే, పుష్కరాలల్లో పితృదేవతలకు విధిగా శ్రాధ్ధం నిర్వహించాలని శాస్త్రం నిర్దేశించింది. దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నదులకు పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం. ఆ విధంగా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి నదికి పుష్కరాలు వస్తాయి. చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం  బృహస్పతి తన స్వక్షేత్రమైన మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం.

బృహస్పతి రాశి సంక్రమణతో పుష్కరుడు గురువుతోపాటు నదిలోకి ప్రవేశిస్తాడని ప్రతీతి. ఆ పన్నెండు రోజులు నదీజలాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని నమ్మకం. ముక్కోటి దేవతలు సైతం పుష్కర నదిలో స్నానం చేస్తారని పురాణ వచనం. అందుకే పుష్కర స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. అంతేకాదు, పుష్కర నదిలో శ్రాద్ధవిధులు, తర్పణాలు నిర్వహించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. పుణ్యస్నానాలు, దానధర్మాలు, తర్పణాలతో పుష్కర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వైనగంగ, వార్ధా నదులు సంగమించి ప్రాణహితగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రస్థానం మొదలవుతుంది. దాదాపు 113 కిలోమీటర్లు ప్రవహించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతీనది కలుస్తుండటంతో కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా చెబుతారు. ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల దీనిని ప్రణీత అనీ, తీరం వెంబడి అడవిలో రకరకాల ప్రాణులు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారని చెబుతారు. ప్రాణహిత-గోదావరి సంగమ స్థానంలో ఉన్న కాళేశ్వరం అత్యంత మహిమాన్విత క్షేత్రం. ఒకే పానవట్టంపై రెండు లింగాలు కొలువుదీరి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వీటిని కాళేశ్వర, ముక్తీశ్వరుల పేరుతో కొలుస్తారు. ఇక్కడి ప్రధాన ఆలయం ఆవరణలో ఉన్న యమకోణంలో యముడు తపస్సు చేసినట్లు స్థలపురాణం. ఈ యమకోణం దాటిన వారికి యమ బాధలు ఉండవని అంటారు. 

పుష్కర స్నానం అంటే.. ఆటవిడుపుగా చేసేది కాదు. ఎండకు ఓర్చుకోలేక ఈదులాడటమూ కాదు. దైవ సంబంధమైన కార్యం పుష్కర స్నానం. మానసికంగా పవిత్ర భావనతో పుణ్యస్నానం ఆచరించాలి. మూడు మునకలు వేసి సంకల్పం చెబుతూ స్నానం చేయాలి. మంత్రాలు తెలియకపోయినా.. నదీమతల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ కూడా స్నానం చేయవచ్చు. నదిలో ఉమ్మివేయడం, విసర్జించడం మహాపాపం. సబ్బులు, షాంపూలు వాడకూడదు. దుస్తులు ఉతకొద్దు. వ్యర్థాలను నదిలో వదలకూడదు. ఈ భూమ్మిదున్న ప్రతిజీవి మనకుగడుకు జీవనాధారం నీరు. ఈ జలం పుట్టిన తర్వాతనే జీవకోటి ఉద్భవించింది. కాగా పుష్కరాల్లో స్నానాలు ఆచరించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయి. అంతేకాదు నదీస్నానాల వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలుపుతున్నాయి.

...,.....


ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?


న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? 

 ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  

వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... 


పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.

నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.

ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.


సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.


మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -


పృథ్వి :- 

వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  


అగ్ని :- 

శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 


జలం :- 

రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  


వాయువు :- 

శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 


ఆకాశం :- 

అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 

ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 


ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  


మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 


అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం,  అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 


పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...


వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.

మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.


జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 


 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.


అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.


ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.


బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను .

...........


మానవ జీవితంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనుషుల మధ్య సంబంధాలు... వీటిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో మంచి తక్కువ పాళ్ళలో, చెడు ఎక్కువ పాళ్ళలో ఉంటే... ఎక్కడో ఏదో అవరోధం ఉందని అర్థం చేసుకోవాలి. కొందరు జీవితాన్ని సుఖప్రదంగా గడుపుతూ ఉంటే... అది చూసి ‘మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు?’ అనిపిస్తుంది. నిజంగా వారేదో శక్తిని వినియోగించడం వల్లే... వారికి అంతా మంచి జరుగుతోందనేది అపోహ కాదు.

ఆనందాన్ని పొందడానికి వారు ‘ప్రేమ’ అనే శక్తిని వినియోగిస్తూ ఉండొచ్చు. ఆ ప్రేమ శక్తితో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. పూర్వకాలానికి చెందిన ఎందరో ధర్మ గురువులు, మహనీయులు, దార్శనికులు...  ప్రతి ధర్మంలోను ప్రేమకు సముచితమైన స్థానం ఇచ్చారు. తమ తమ యుగ ధర్మాలను అనుసరించి, తాము జీవించిన కాలంలోని మానవుల స్వభావాలను, సంస్కారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఆ సందేశాలు ఇచ్చారనేది నిజం.

వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే... ప్రేమ అన్నిటినీ మించిన పరమశక్తి. అది ప్రేమ సాగరుడైన పరమాత్మ తాలూకు పవిత్ర శక్తి. మనం ప్రేమను పంచినప్పుడు... ఆ పరంధామంలో ఉన్న భగవంతుడి ప్రేమను వినియోగించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ‘ప్రేమ’ అంటే మన పరివారాన్నీ, స్నేహితులనూ, ప్రియమైన వస్తువులనూ ఇష్టపడడం కాదు. మన జీవితంలో ఎదురయ్యే శక్తులు ఏవైనా అవి ప్రేమ నుంచి ఉద్భవించినవేనని గ్రహించాలి. మనల్ని ప్రభావితం చేసే ఈ శక్తి మనలోనే... మన ఆత్మలోనే ఉంది. 

మరి అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి కదా! కానీ మీరు కోరుకుంటున్నవి మీ దగ్గర ఎందుకు లేవు? మీరు అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నారు? సుఖ సంతోషాలు ఎందుకు లేవు?

మానవ హృదయంలోని ప్రేమ శక్తి వల్లే ప్రకృతి పులకిస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణలతో సృష్టి సుసంపన్నమైన ప్రగతిపథాన నడుస్తుంది. . సృష్టి నలువైపులా పరిశీలిస్తే... మనిషి తయారు చేసిన వస్తువులే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కనిపించని ప్రేమ శక్తితోనే సాధ్యమయ్యాయి. ‘‘ఒకవేళ మన నుంచి ప్రేమను తొలగించుకుంటే... ఈ భూమి శ్మశానం అవుతుంది’ అని రాబర్ట్‌ బ్రౌనింగ్‌ అనే కవి అన్నారు. మానవుల్లో శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమే ఈ లోకానికి ఆలంబన.

ప్రేమ శక్తే మనల్ని నడిపిస్తుంది. చెడ్డ విషయాల వల్ల, సమస్యల వల్ల మనలో ప్రేమ లోపిస్తుంది. చాలామందికి ప్రేమ అంటే ఏమిటనే దానిపై అర్థవంతమైన అవగాహన లేదు. ఎందుకంటే... ప్రేమ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది మాత్రమే కాదు, గుర్తించలేనిది కూడా. కంటికి కనిపించని ఈ మహిమాన్విత శక్తిని  గుర్తించాలంటే... మొదట జ్ఞానసాగరుడైన పరమాత్మను గుర్తించాలి. ప్రేమమయమైన ఆయన సృష్టిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమను అర్థం చేసుకోగలం. ఆయన సృష్టించిన ఈ జీవన రంగస్థలంలో పరమానందంతో అభినయిస్తూ జీవించగలం.

.......


*సత్సాంగత్వ ఫలం*


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టు కొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుప కాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగ దీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంత అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మల నుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి.


ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చి తంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్త కాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయ లేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తి ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడు తుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి. ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహా స్వామి వారు ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థ మైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. 'నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవ రకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టు కుంటాను' అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగు తుంది.


అంతేతప్ప తనకోసం బతికే వాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించే వాడూ, పదిమందికి ఆదర్శం కాని వాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు. ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభ విస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ. వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే..హనుమంతుడికి దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం.

........

*పంచతంత్రం*

అయిదును అదృష్టసంఖ్యగా చెబుతారు. సంఖ్యాశాస్త్ర నిపుణులు. 14, 23 తేదీలూ అంతే. వాటిని కూడినా అయిదే అవుతుంది. కాబట్టి ఆ తేదీల్లో జన్మించినవారు భాగ్యవంతులని అంటారు. చాలామంది ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు. తమ పేర్లకు మరికొన్ని ఆంగ్ల అక్షరాలను జోడిస్తూ ఏవేవో మార్పులు చేస్తుంటారు.


అదృష్ట సంఖ్య ఆవునో కాదో గానీ, మనిషి జీవితంలో అయిదును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అయిదుకు అయిదు కలిపితే (10) అది బాల్యం. అయిదును అయిదుతో గుణిస్తే (25) అది యౌవనం అయిదు సరసన అయిదు చేరిస్తే (55) ఆది వృద్ధాప్యానికి వీధి గడప, మనిషికి బాల్య, యౌవన దశల్లో ఇంద్రియాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఇంద్రియ చాపల్యం ప్రభావశీలంగా ఉంటుంది. కాబట్టి అయిదు సంఖ్యను మనిషి జీవితంలోని ముఖ్య దశలకు ప్రతిబింబంగా భావించవచ్చు.


దేన్ని చూడకూడదో- దాన్ని చూడటం వల్ల, దీన్ని వినకూడదో- దాన్ని వినడం వల్ల, ఏది తినకూడదో- దాన్ని తినడం వల్ల, ఏది అనకూడదో దాన్ని అనడం వల్ల దీన్ని తాకకూడదో- దాన్ని తాకడం వల్ల, ఏ వాసనలకు దూరంగా ఉండాలో మనిషికి తెలి యక పోవడం వల్ల... అంటే కన్ను చెవి నాలుక నాసిక చర్మం అనే అయిదు ఇంద్రి యాల ద్వారా హానికరమైనవి ఎన్నో లోపలికి ప్రవేశించి, మనసును దారిమళ్ళిస్తూ ఉంటాయి. పంచేంద్రియాల కారణంగా మనసు తరచూ కలుషితం అవుతుంది.


అయిదక్షరాలు మహా మంత్రం సమళ్ళి వాయ! ఇది పంచాక్షరిగా ప్రసిద్ధికెక్కింది. ఇంద్రియ కాలుష్యానికి సరైన విరుగు డుగా మన పెద్దలు పంచాక్షరిని ప్రతిపా దించారు. ఆ శబ్ద జ్యోతిని నోటి చివర వెలిగిస్తే అది దేహళీ దత్త దీపమై.... అంటే వీధి గడప మీద దీపంలా మనిషి లోపలి, బయటి కాలుష్య చీకట్లను దూరం చేస్తుందని తీర్మానించారు.


మనసులోంచి పుట్టినవాడు కాబట్టి మదనుడికి మనసిజుడు అన్ని చేతోజా తుడని పేర్లు మన్మథుడి ఆయుధాలు. అయిదే! అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం... అనే అయిదు బాణాలు ఉన్నాయి కనుక మదనుడిని పంచశరుడు అన్నారు


పంచబాణుడైన మన్మధుడు సంచేంద్రియాలతో ప్రభావితమైన మనసుకు ప్రతీక, ఆ మన్మథుడిని పరమశివుడు భస్మం చేశాడని పురాణాలు చెప్పాయి. మన్మదుడిని మసిచేయడం అంటే మనసును దగ్ధం చేయడమే. లేదా ఇంద్రియ కాలుష్యాన్ని సమూలంగా నిర్మూలించడమే. అందుకే పంచాక్షరిని అనుక్షణం జపిస్తూ ఉండమని పెద్దలు చెప్పేది!

ఇంద్రియాలను జయించిన వారికి ఈశ్వరుడి చైతన్యంతో అనుసంధానం కుదు రుతుంది. దాన్ని యోగం అన్నారు. యోగం అనే మాటకు కలయిక, చేరిక అని అర్ధం. పరమేశ్వర విభూతితో ప్రత్యక్ష సంయోగాన్ని సిద్ధింపజేస్తుంది కాబట్టే శివపంచాక్షరిని రమణ మహర్షి 'యోగ' పంచాక్షరి'గా సూత్రీకరించారు. 'అరుణాచల' అనేది జ్ఞానపంచాక్షరీ' అన్నారాయన.

శివుడు పంచముఖుడని వేదం చెప్పింది. తత్పురుష అఘోర సద్యోజాత వామ దేవ ఈశాన... అనేవి ఆ అయిదు ముఖాల పేర్లు. సృష్టి స్థితి లయ తిరోగమనం (మరుగు పరచడం) అనుగ్రహం... అనే అయిదు రూపాల్లో శివతత్త్వం! విశ్వమంతటా విస్తరిస్తుందని పురాణ వచనం. ఈ అయిదింటినీ కృత్యశక్తులు అంటారు. కృత్య శక్తుల నుంచి పంచభూతాలు, వాటి నుంచి పంచతన్మాత్రలు ఆవిర్భవించాయని ఆర్యోక్తి పంచ శబ్దానికి అసలైన అర్థం 'విస్తరించు అని సృష్టి అంతటా విస్తరించిన శివతత్త్వాన్ని పంచామృతాలతో అభిషేకిస్తూ, అయిదంకె తన విశేష అర్ధాన్ని సార్ధకం చేసుకుంది.

- ఎర్రాప్రగడ రామకృష్ణ

చెడునుచూసి మంచి నేర్చుకో 🙏

ఒక  ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర  అనేకమంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటూ ఉండేవారు.

 ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది... ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. 

దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి ఫిర్యాదు చేశారు.. అయితే విషయం అంతా విన్న గురువు గారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. 

అలా కొన్నాళ్ళు గడిచాయి.మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. 

ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు. 

అప్పుడు గురువు గారు శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.

ఇంకా..... ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికి గానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమం లోకి తీసుకోరు, విద్య నేర్పించరు.అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ...

*అంతేగాకుండా... తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 

దొంగతనం చేసిన శిష్యుడుకి  గురువు గారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి.. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపం తో గురువు ముందు మోకరిల్లాడు.

జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. 

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు.

మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట సరిగా వినలేదని బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం. తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి బుద్ధి రాదు., ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసిన వాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.


వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి మొదలైనవారు. 


తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా  పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ... దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.


మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు.  మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.

అందుకే గురుకులం లోని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు.. అందుకు మంచి ఉదాహరణ పరమానందయ్య శిష్యులు.

మన శరీరంలో కూడా కొన్ని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా గోర్లు, వాటిని పెంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు... కాబట్టి వాటిని కత్తెరిస్తు వుంటాం. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి..అంతేకానీ జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంత పెద్ద శిక్షలు మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని ఎప్పుడు వెయ్యకూడదు.

ఆలోచించాలి.. ఆచరించాలి.. నేర్పించాలి.. అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం, కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారు గాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.

అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి... బోయవాడు వాల్మీకి గా మారినట్లు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచె గొప్ప మలుపు వున్న రోజును తీసుకోని వస్తుందని ఎదురు చూద్దాం.

****

ప్రపంచంలో ధనానికి ప్రాధాన్యం ఎక్కువ. కానీ సంపాదించిన ఆ ధనం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. అజగర మునితో ప్రహ్లాదుని సంభాషణ సందర్భంగా ధన ప్రసక్తి వస్తుంది. అప్పుడు వేదవ్యాస భగవానుడు చెప్పించిన ఈ మాటలు.. అందరూ తెలుసుకోవాల్సిన అపురూపమైన విషయాలు. ‘‘రాజుల వల్ల, చోరుల వల్ల, శత్రువుల వల్ల, తనవారి వల్ల, పక్షుల వల్ల, కాలము వల్ల.. చివరికి తన వల్ల తనకు కూడా ఽధనవంతులకు నిత్యం భయం ఉంటుంది.’’ అని దీని అర్థం. 

‘‘ధనమూలమిదం జగత్‌’’ ..అన్న భారతీయ ధర్మమే ‘‘దిగర్థందుఃఖభాజనం’’ అని కూడా అన్నది. అంటు ధనమే అన్ని దుఃఖాలకూ కారణమని అర్థం. ధన సంపాదనలో ఎంత కష్టమున్నదో దానికి మించిన కష్టం దాన్ని కాపాడుకోవడంలో ఉందన్న విషయంపై శ్లోకం తెలుపుతున్నది. బాగా డబ్బు సంపాదించేవారిపై పాలకుల దృష్టి ఉంటుంది. దీంతో వారివల్ల చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అతిగా సంపాదించాలన్న దురాశ మనిషిని వక్రమార్గం పట్టిస్తుంది.


అదెప్పటికైనా ప్రమాదమే. అదే విధంగా తాను దాచిన  సొమ్ము దొంగల పాలు కావచ్చు. ధనం ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది. ఇలా ఏ విధంగానైనా ధనం వల్ల ప్రమాదాలే ఎక్కువ. అయితే అక్రమ మార్గంలో, అన్యాయంగా సంపాదించి సుఖాలను అనుభవించాలనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ధర్మ మార్గంలో అవసరానికి తగిన రీతిలో చేసే ధన సంపాదన అసలైన ఆనందాన్నిస్తుంది. అందుకని పండితులైనవారు, ధర్మమార్గ ప్రవర్తకులైన వారు, దీనిపై మమకారాన్ని విడిచిపెడతారు. ధనం ఉన్నవారికి అంతులేని బాధలు ఉంటాయన్న జ్ఞానాన్ని ఇలా శ్రీమద్భాగవతం సప్తమస్కంధంలోని త్రయోదశాధ్యాయంలోని అజగరముని ప్రహ్లాద సంవాదం విపులంగా వివరించింది. మనసు, మమత, బంధం, అనుబంధం, రక్తసంబంధం. ఇలా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా.. ఈ కాలంలో మనుషుల్ని నడిపించేవి మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే ఎవరైనా మనల్ని ఖాతరు చేసేది. ఒక గొప్ప కవి ఇలా రాసాడు ఆనందించండి చదువుతూ 

రైలు బండిని నడిపేది పచ్చజెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటెలే 

తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు ఫెళ ఫెళ లాడే నోటు పెంచును వెయిట్

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు

క్యాష్ యే ఉంటె ఫేసుకు  విలువవస్తుంది నోటే ఉంటె మాటకు బలమోస్తుంది బైకు ఉంటె అమ్మాయి బీట్-ఏ వేస్తుంది

నీకు సైకిల్ ఉంటె ఆ పిల్లే సైడై పోతుంది 

యే బాషా తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది

ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది

డాలర్లైనా రష్యన్ రూబ్లెలైనా డబ్బుంటేనే మనిషికి కాన పీన

చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో 

ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టెమ్మో

అరే భోల్ మేరే భాయ్ ఈ నోటు కీ జై

****

సాక్షి ఎడిటోరియల్

రైటింగ్‌ టేబుల్‌

మగవాడు రాసేప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్‌ కట్‌ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. 

మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్‌ ఉంటుంది. అది డైనింగ్‌ టేబుల్‌. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్‌. వర్జీనియా ఊల్ఫ్‌ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి.

ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి. ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతి ఉపాధ్యాయ్‌ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్‌డౌన్‌ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్‌ ధిర్‌ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివాని సిబాల్‌ అనే మరో రచయిత్రి.

స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం. జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కాని వారు విద్యకు, కలం పట్టి రాయడానికి శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్‌. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబం ఉంటుంది. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్‌షిప్‌ ప్రభావం అది.

పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్‌). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్‌మేన్‌లను  వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ఉంటుంది. కాని స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీuЇ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా. 

‘నేను చెన్నై కన్నెమర లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కాని వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి.’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో. ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం.

వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవును, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలను స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే. స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్థిల్లాలి.

****

ఇది ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందులో మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘సర్వదా నారాయణ స్మరణం, విశ్వాన్ని విస్మరించడం.. ప్రహ్లాదుడి నిత్యకృత్యాలు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, కబుర్లు చెప్తూ, నవ్వుతూ, నిదురిస్తూ, ఊళ్లో తిరుగుతూ, అటూ ఇటూ చూస్తూ, ఏ పనులు చేస్తున్నప్పటికీ నారాయణుని పాద పద్మ యుగళం పైనే ఎప్పటికీ తన చింత నిలిపి, ఆ చింత అనే అమృత ఆస్వాదనలోనే ఈ విశ్వాన్నంతా మరిచిపోయాడు’ అని పై పద్యభావం. ఇందులో చివరి మాట ముఖ్యం. విశ్వాన్ని మరిచిపోవడం ఏమిటి? అంటే ఇక్కడొక విశ్వం ఉన్నది. ఆ విశ్వంలో తానున్నాననే ధ్యాసను ప్రహ్లాదుడు మరిచిపోయాడన్నమాట.

మామూలుగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. కొన్ని మరచిపోవలసినవి కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం ఎంత అవసరమో, మరచిపోవడం కూడా అంతే అవసరం. కానీ, మనకు నియంత్రణ లేని కారణంగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని, ఏదీ మరచిపోవద్దని అనుకోవడం సహజం. మరచిపోదగినవి ఎన్నో ఉన్నాయి. గుర్తుపెట్టుకోదగినవీ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి. అంటే, మతిమరుపును మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ప్రహ్లాదుడు వినియోగించుకున్నాడు. ఏదంటే అది మరచిపోగలిగిన వాడు, ఏదంటే అది గుర్తుపెట్టుకోగలిగినవాడు, ఆ నియంత్రణ కలిగినవాడు కాబట్టి ప్రహ్లాదుడి

మతిమరుపు పనికొచ్చేది. ప్రహ్లాదుడు విశ్వాన్ని విస్మరించి, విశ్వవిఖ్యాతుడయ్యాడు. మనం విశ్వాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటున్నాం. అది తప్ప మనకు మరో ధ్యాస లేదు. అయినా ప్రహ్లాదుడి ప్రసిద్ధి మనకు రావడం లేదు. అందుకే ఆయనది పనికొచ్చే మతిమరుపు. ఇందులోని మర్మం ఏమంటే, ప్రహ్లాదుడు నారాయణుడిని గుర్తుపెట్టుకున్నాడు. లోకాన్నంతా మరిచిపోయాడు. ఒక్క శ్రీహరిని గుర్తుపెట్టుకుంటే చాలు, విశ్వాన్నంతా మరిచిపోయినా చింతించే పనిలేదని స్పష్టమవుతున్నది. మరొక విశేషమేమంటే, ప్రహ్లాదుడికి మతిమరుపు వచ్చింది అనలేదు కవి. అలా పేర్కొని ఉంటే ప్రహ్లాదుడు ఒకడున్నాడు, అతనికి మతిమరుపు ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ మతిమరుపునకు ప్రహ్లాదుడు కర్త కాదు. కానీ, ‘ప్రహ్లాదుడు మరిచిపోయాడు’ అన్నాడు పోతన. అంటే అతను బుద్ధి పూర్వకంగా మరిచిపోయాడని అర్థం చేసుకోవాలి. అతను ఏది మరిచిపోవాలంటే దాన్ని మరిచిపోగలడు. గుర్తుంచుకోవాలనుకున్న దానిని గుర్తుపెట్టుకోగలడని అర్థం.

‘ఇందులో గొప్ప ఏమిటి?’ అన్న అనుమానం రావచ్చు. మనకు ఆ నియంత్రణ లేకపోవడం వల్ల గత జీవితంలోని విషాద సన్నివేశం తటాలున స్మృతిపథంలో మెదిలి మనలను నిర్వీర్యులను చేస్తున్నది. అందుకే చాలామంది అలాంటి వాటిని మరిచిపోవడానికి రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారుతుంటారు. పైగా, బాధను మరిచిపోవడానికి వ్యసనాల దారి పట్టానని గొప్పగా చెప్పుకొంటారు. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు.

మొత్తానికి పరిశీలిస్తే ఏవి మరిచిపోవాలి, వేటిని గుర్తుంచుకోవాలనే అంశాలు ఒక పట్టిక తయారుచేసుకొని సాధన చేసే వ్యవస్థ ఒకప్పుడు ఉండేదేమో! ప్రహ్లాదుడు మరిచిపోదగిన వాటిని ఒక పట్టికగా రాసుకుంటే అందులో ‘విశ్వం’ అనేది ఉండి ఉంటుందన్నది నిర్వివాదం. యథార్థానికి లోకాన్ని మరిచిపోవడం కుదిరేది కాదు. కానీ, లోకేశ్వరుడిని నిరంతరం గుర్తుపెట్టుకోగలిగినవాడికి మాత్రం అది సాధ్యమే. అప్పుడు లోకాన్ని విస్మరించడం వల్ల ఏ నష్టమూ ఉండదు. పైగా అన్ని ప్రాణాపాయ పరిస్థితులలో రక్షణతో కూడిన ప్రయోజనమే కలుగుతుందని ప్రహ్లాద చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు.

***

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు అలా ఒక రోజు  తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. 

ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. 

హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలినుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.

అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.

తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు. 

కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలునిదగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు. 

“ఎవరు నువ్వు? ఈ వాన,చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు?” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువుననుసరించాడు.

గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు. 

గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు. 

ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.

కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి. 

అసలు కారణం     వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? 

తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? 

ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.

ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు. 

ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి. 

అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు. 

ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలోనుండి అనంతుడిని గమనించసాగాడు. 

ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు. కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు. 

అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు. 

వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.

అనంతుడు మందిరం మధ్యలో వున్న 

శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..

"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు..

నాకు చదువురాదు.. పూజలు రావు..

స్తోత్రాలు రావు.... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నున్ని చేసుకోవాలని వచ్చాను.    రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి 

నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో..

"కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి...

"మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.

"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు. 

బయటనుండి ఈ దృశ్యం చూసి…                 శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. 

తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 

కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భాగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...