Saturday, 25 June 2022

 [

    శ్రీమహాభారతంలోని కథ,   మహాప్రస్థానం

రక్తపుటేరుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఆ తరువాత యదునాశనమూ జరిగింది. అంతటి బీభత్సాన్నీ, మృత్యునృత్యాన్నీ కళ్ళారా చూసాక సకలకర్మలూ త్యజించి మహాప్రస్థానం చెయ్యాలనే బుద్ధి పుట్టింది ధర్మరాజుకు. తక్షణం ఏకైక వంశాంకురం పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి సామ్రాజ్యభారం అప్పగించారు పాండవులు.

అన్నదమ్ములైదుగురూ ఆభరణాలన్నీ తీసేసి, నారచీరలు కట్టుకున్నారు. ద్రౌపది కూడా అలాగే చేసింది. ముందు ధర్మరాజు, ఆయన వెనుక భీముడు, తరువాత అర్జునుడు, అతని వెంట నకులసహదేవులు, వాళ్ళననుసరించి ద్రౌపది కదిలి వెళ్ళారు.

వారి వెంట ఒక కుక్క బయలుదేరింది. యోగబలంతో అనేక నదులూ, పర్వతాలూ, అరణ్యాలూ దాటి వాళ్ళు తూర్పు సముద్రతీరం చేరారు. ఇంతలో ప్రకాశవంతమైన శరీరంతో ఒక మహారూపం వాళ్ళ ఎదురుగా నిలిచింది.

"అర్జునా! నేను అగ్నిని. దేవకార్యం కోసం వరుణదేవుణ్ణి అడిగి నీకు గాండీవాన్ని తెచ్చియిచ్చాను. అనుకున్న పని నెరవేరింది కనుక నీ వద్ద వున్న దివ్యధనువును ఆ మహానుభావుడికి యిచ్చేయ్యి" అన్నాడు అగ్నిదేవుడు. వెంటనే సవ్యసాచి గాండీవాన్ని సముద్రానికి సమర్పించాడు. 

అగ్నిదేవుడు అంతర్హితుడయ్యాడు. అక్కడి నుంచి బయలుదేరి మేరుపర్వతాన్ని సమీపించారు పాండవులు. యోగసాధనాపరులై ఆ పర్వతంపై వెళ్తూ వుండగా యోగబలాన్ని కోల్పోయి పాంచాల పుత్రిక కింద పడిపొయింది. "అన్నా! అన్నా! ద్రౌపది పడిపోయింది" అరిచాడు భీముడు.

"పడనీ" అన్నాడు ధర్మరాజు నిర్లిప్తంగా. లిప్తకాలమైనా ఆగలేదు. "పాంచాలి యందు ఎన్నడూ అధర్మం లేదే! అయినా ఎందుకిలా అయింది?" భీముడు విషాదంతో ప్రశ్నించాడు.

"ఆమెకు అర్జునుడంటే ప్రేమ ఎక్కువ. ఆ పక్షపాతబుద్ధివల్ల ఆవిడ సుకృతాలు ఫలించలేదు" అన్నాడు ధర్మరాజు. కొంచెం దూరం వెళ్ళేక, "అన్నా! సహదేవుడు పతనమయ్యాడు" అని కేకపెట్టాడు భీముడు. "తనకంటే ప్రాజ్ఞుడెవడూ లేడని అహంకారం వాడికి" అన్నాడు ధర్మరాజు.

మరికొంచెం దూరం సాగారు. భార్య, తమ్ముడు పడిపోవడం చూసి ధైర్యం పోయినవాడిలా కూలిపోయాడు నకులుడు. "అన్నా! నకులుడు నేలకూలాడు!" అర్తనాదం చేశాడు భీముడు."తనంత అందగాడెవడూ లేడని మిడిసిపాటు వాడికి. అదే కీడైంది" అన్నాడు ధర్మరాజు.

ఇంకొంచెం దూరం వెళ్ళారు. అంతలో అర్జునుడు ఒరిగిపొయాడు. "అన్నా! అర్జునుడు.." అని అరిచాడు భీముడు. "కౌరవులందరినీ కలిపి ఒక్కనాడే చంపుతానన్నాడు. అలా చేయలేకపోయాడు. ధనుర్థరులైన వాళ్ళకు మాట ఒకటీ, చేత ఒకటీ కాకూడదు. అది మహా దోషం" అన్నాడు ధర్మరాజు.

ఆప్తుల మరణాల్ని చూసేసరికి ధైర్యం జారిపోయింది భీముడికి. కుప్పగా కూలిపోయాడు. "అన్నా! నేనూ పడిపోయాను" అన్నాడు హీనస్వరంతో. "నువ్వు తిండి తెగ తింటావు. ప్రచండమైన భుజశక్తి కలిగి , ఎవరినీ లక్ష్యపెట్టవు. అందుకే యీ గతి పట్టింది నీకు" అని చెప్పి నిర్వికారంగా ముందుకు సాగిపోయాడు ధర్మరాజు. శునకం మాత్రం అతనిని భక్తితో అనుసరించి వెళ్ళింది.

కొంతదూరం వెళ్ళేసరికి దశదిశలూ దివ్యకాంతులతో వెలగసాగాయి. దేవేంద్రుడు స్వయంగా వచ్చి "ధర్మరాజా! ఉత్తమ పురుషుడవు నువ్వు. రా! ఇదిగో దివ్యరథం! ఎక్కు" అంటూ ఆహ్వానించాడు.

దుఃఖం ముంచుకువచ్చింది ధర్మరాజుకు. "తమ్ములంతా పోయారు. పాంచాలకుమారి దప్పికతో కూలిపోయింది. శోకం అగ్నిలా దహిస్తోంది నన్ను. వాళ్ళు లేకుండా నేను మీతో రాలేను" అన్నాడు.

"పాండవాగ్రజా! విచారించకు! శరీరాలు విడిచి నీవాళ్ళందరూ యిదివరకే స్వర్గానికి వచ్చారు. వాళ్ళను అక్కడ చూద్దువుగాని. నువ్వు శరీరం విడిచిపెట్టనక్కరలేదు. రా" అన్నాడు ఇంద్రుడు.

"నేను ఊరు విడిచింది మొదలు, భక్తితో నా వెంట వచ్చింది యీ జాగిలం. మరి దీనికి కూడా స్వర్గ ప్రవేశం కావాలి. అందుకు అనుమతించాలి" అన్నాడు ధర్మరాజు.

"ధర్మరాజా! జాగిలానికి దేవభావం ఎలా వస్తుంది! దీన్ని నీతో తీసుకురావడం సాధ్యం కాదు. పద. రథం ఎక్కు" అని దరహాసం చేశాడు ఇంద్రుడు.

"మహానుభావా! నీ వంటి దివ్యపురుషుడు తలుచుకుంటే సాధ్యం కానిదేముంటుంది! అశ్రయించిన వాళ్ళకోసం ఆ మాత్రపు కార్యం నెరవేర్చడం నీకు భారమా? ఆశ్రితుల్ని విడిచిపెట్టి పొందే సంపద నాకేం యింపుగా వుంటుంది?" అని దీనంగా ప్రార్థించాడు ధర్మరాజు.

"ధర్మజా! ఇదెక్కడి తెలివితక్కువతనం! శునకాలకు స్వర్గవాసం సంభవిస్తుందా? దీన్ని వదలడం కాఠిన్యమెంత మాత్రం కాదు. నా మాట విను."

"భక్తుడైన వాణ్ణి విడిచిపెడితే బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని పెద్దలంటారు. అందువల్ల దీన్ని విడిచిపెట్టను. దివ్యసుఖం కోసం పాపం మూట కట్టుకోలేను."

"నీకింత పట్టుదల ఎందుకు? తమ్ములనూ, భార్యనూ విడిచావా లేదా! జీవితాంతం అన్ని ఒడిదుడుకుల్లోనూ నీకు తోడుగా నిలిచినవారిముందు యీ శునకం ఎంత? దీన్ని విడవలేనంటావు. ఇదేమైనా బాగుందా?"

"స్వామీ! అఖిల లోకాలకు అధిపతివి నువ్వు. నీకు తెలీని ధర్మం లేదు. పైగా పెద్దలతో వాదించకూడదు. అయినా మీకొక విన్నపం చేసుకుంటున్నాను. తమ్ములూ,భార్యా ఎలాగో చనిపోయారు. ఇప్పుడు వాళ్లకోసం దుఃఖిస్తే మాత్రం ప్రయోజనమేమిటి? చావకుండా నాతో వచ్చిందీ కుక్క. శరణన్న వాణ్ణి ఉపేక్షించడం, సన్నిత్రుడికి ద్రోహం చెయ్యడం, స్త్రీని చంపడం, బ్రాహ్మణార్థం దొంగలించడం అనే మహాపాపాలెలాంటివో నిరపరాధి అయిన భక్తుణ్ణి విడిచిపెట్టడం కూడా అలాంటి పాపమే. నన్ను మన్నించు. నేనిక్కడే వుండి తపస్సు చేస్తూ నిన్ను సేవిస్తూ వుంటాను" అని ధర్మరాజు దృడంగా చెప్పాడు.

ఉత్తరక్షణమే శునకం ధర్మదేవతగా మారింది. అదిచూసి సంభ్రమానందాలతో నమస్కరించాడు ధర్మతనయుడు.

"కుమారా! నీ భూతదయకు మెచ్చుకున్నాను. నీపై విశ్వాసం చూపి నీతో భక్తిగా వచ్చిందని ఒక కుక్కను చేపట్టి ఇంద్రుడు తెచ్చిన దివ్యరథాన్ని కూడా ఎక్కనన్నావు! నీ ఉదాత్తత ఇంద్రుడు కళ్ళారా చూశాడు. ఇంక శరీరంతో పుణ్యలోకాలకు వెళ్ళు. అవ్యయపదాన్ని పొందు" అన్నాడు ధర్మదేవుడు ఆదరంగా.

[           *అమ్మ అబద్దాలు*           

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం అండి... అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు, గాంధీగారి కధలు చెప్పిన అమ్మ, మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా? అందగాడిని గాకున్నా ....             చందమామనంటుంది.కంచం నిండా తిన్నా .......  కొంచెమే కదా అంటుంది. అల్లరెంతగా చేసినా .......     పిల్లలింతేనని చెబుతుంది.అత్తెసరున పాసయినా .......   కొత్త సిలబసే కారణ మంటుంది. ఆటలు పాటలు రాకుంటే ....  వాటికి విలువలేదంటుంది.ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం ...          ఎంతో గొప్పని అంటుంది.తప్పులెన్ని నే జేసినా .....   ఒప్పులుగనే లెక్కలేస్తుంది అప్పుడప్పుడూ అబద్దమాడినా ....  చెప్పనే చెప్పదు నాన్నకైనా పాతికేళ్ళ వయసున్నా .....   పసివాడిగానే చూస్తుంది.కష్టపడి వాళ్ళు సంపాదించినా...    అదృష్టం నాదంటుంది మనం తల్లి తండ్రులo అయ్యాకే  తెలిసేది .....    అమ్మ అబద్ధాలు  ఆమె మమతల నుంచి .....    

రాలిన పూలరెక్కలం ఆమె వాత్సల్యంతో ఒలికించిన ....

 తేనె చుక్కలం ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం?

  కన్నీటితో కాళ్ళు కడగడం, ప్రేమతో అమ్మని చూసుకోవడం,

 అనంతమైన ప్రేమలో ,           అమ్మని వెతుక్కోవడం తప్ప.

.***

[

కాలం దైవ స్వరూపం

పంచభూతాలలో తేజోరూపుడైన సూర్యుడు కాలమనే తన శక్తితో సకల కారణ తత్వాలలోని బీజశక్తిని కార్యోన్ముఖం చేస్తూ జీవశక్తిగా ప్రకటింపజేస్తున్నాడు. సూర్య పరిభ్రమణం వల్లనే కాలచక్ర గమనం మనకు తెలుస్తోంది. సూర్యుడు రాళ్ళ చక్రాన్ని చుట్టి రావడానికి పట్టే కాలాన్ని సంవత్సరమంటారు. గురువు రాశిచక్రంలో ఒక రాశి నుంచి మరో రాశికి పయనించే కాలాన్ని పరివత్సరమని వ్యవహరిస్తారు. నెలకు సమానంగా ముప్ఫై రోజుల చొప్పున మూడు వందల అరవై రోజులు గల కాలానికి ఇవత్సరమని పేరు. చంద్ర గతిని బట్టి ఆమావాస్యతో అంతమయ్యే పన్నెండు నెలల కాలాన్ని అనువత్సరమని అంటారు. చంద్రుడు నక్షత్రాలతో సంచ రిస్తూ ఇరవై ఏడు రోజులు మాత్రమే నెలగా పరిగణించిన పన్నెండు నెలలు కాలాన్ని వత్సరమని అంటారని కాలగణన శాస్త్రం చెబుతోంది. ఇలా అయిదు రకా లైన సంవత్సరాల రూపంలో ఉన్న సూర్యుడిని ఆరాధించాలని భాగవతంలో మైత్రే యుడు విదురుడికి బోధించాడు.

అందుచేతనే

కాలస్వరూపుడు.

కాలుడని పేరు వచ్చింది. భగవంతుడి శక్తి అయినకాలం కూడా భగవంతుడి స్వరూపమే ఆయన కాలాతీతుడు, కాల

విభాగం లేనివాడు. కాలానికి ఆయన కర్త. ఆయనకు కాలం కర్త్య కాదు. సృష్టించిన పదార్థాల సమూహమంతటినీ వ్యాపించిన తరువాత

సర్వసమర్ధమై దాన్ని విడగొడుతుంది కాలం.సృష్టి నుంచి ప్రళయం వరకు విస్తరించి అతిపెద్ద ప్రమాణంలో నిలుస్తుంది.

తృటి వేద, నిమేషం, క్షణం, ఘటిక ముహూర్తం. జాము, రేయింబవళ్లు, రోజు, పక్షం, నెల, ఋతువు,

కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా వేనవేల సంవత్సరాల విభజన పొందింది. కాలచక్ర భ్రమణంలో సృష్టి, స్థితి, లయలు అంతర్భాగాలు, కాలం చేసే ఇంద్ర జాలం వర్ణనాతీతం. నవ్వేవారిని ఏడిపిస్తుంది. ఏడ్చేవారిని సంతోషపరుస్తుంది. నిన్నటి సుబాలు నేడు కనుమరుగయ్యేలా చేస్తుంది. నేటి ఆశయాలను రేపటికి. ఆవిరిగా మార్చేస్తుంది. ఏవీ స్థిరం కావని చెప్పకనే చెబుతుంది. ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువులను దగ్గరకొచ్చేలా చేస్తుంది. కాలాని కేదీ అసాధ్యం. కాదు. పరుగెత్తే కాలాన్ని ఒడుపుగా పట్టాలని ప్రవహించే నదిని ఒడిసి అడ్డుకట్టా లని భావించడం భ్రమే, మంచులా కరిగే కాలాన్ని, ముందుకు పరుగులు తీసే నదిని సమయానుకూలంగా సద్వినియోగం చేసుకోవాలి. క్షణికమైన జీవితం ధనా ర్జన, నిద్ర సుఖంలో ఎక్కువగా గడిచాక మిగిలిన కొద్ది కాలం పట్ల జాగరూకత, అవగాహన లేని మనిషి మనుగడ ప్రశ్నార్ధకమే. రేపటి పని ఈ రోజు. నేటి పని నిన్ననే నిర్వహించాలన్న ఆలోచన కలిగితే కాలానికి కళ్లెం వేసినట్లే విలువైన కాలాన్ని అందిపుచ్చుకొని, జ్ఞాన సముపార్జన చెయ్యాలి.

భగవదారాధన, సమాజ సేవ, యజ్ఞం, దానం, తపం, యోగం లాంటివి. సకాలంలో ఆచరిస్తే భగవంతున్ని చేరినట్లే. వారే కాల స్వరూపుడైన భగవంతుడి కృపాకటాక్ష వీక్షణాలకు అర్హులు కాగలరని భాగవతం చెబుతోంది. కాల ప్రవాహా నికి ఎదురీదాలనుకోవడం మూర్ఖుల లక్షణం. సాహసిస్తే కాల ప్రవాహంలో కొట్టు కుపోవలసిందే. కాలాన్ని శాసించే శక్తి ఎవరికీ లేదు. చివరికి కాల స్వరూపుడైన భగవంతుడికి కూడా. ఎంతటి జ్ఞానులైనా, మహాపురుషులైనా కాలానికి తల వంచి నమస్కరించాల్సిందే. దైవం ఉన్నాడా, ఉంటే కన్పించడం అని ప్రశ్నలు సంధించే నిరీశ్వరవాదులకు సమాదానమొక్కటే కనిపించే సూర్యచంద్రులతో పాటే కనిపిం చక పరుగులు తీసే కాలమే దైవ స్వరూపమని వివరించి సమాధానపరచ డమే సరైన జవాబు

మాడుగుల రామకృష్ణ

[

🚩🚩 రఘు వంశం ...దిలీపుడు!

శ్రీరాముని తండ్రి దశరధుడు!  మరి దశరధుని తండ్రి అజుడు! అయితే అజుని తండ్రి రఘు మహారాజు!సరే, రఘు మహారాజు తండ్రి దిలీపుడు! అంటే దిలీపుని మునిమనవడే శ్రీరాముడు!

సూర్య వంశానికే వెలుగు తెచ్చిన వాడు దిలీపుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నా కడుపున పుట్టిన వారు లేరు. దానికీ కారణం ఉంది. ఇంద్రలోకం వెళ్ళి దేవేంద్రుణ్ని దర్శించి వస్తున్నాడు దిలీపుడు. ధర్మ సంరక్షణ కోసం భార్య సుదక్షిణాదేవి దగ్గరకు వెళ్ళే తొందరలో కానవచ్చిన కామధేనువును పూజించడం మరిచిపోయాడు. అవమానంగా భావించిన కామధేనువు శపించింది. సంతానం లేకుండా అయిపొమ్మని. ఐరావత ఘీంకారం వల్ల ఆ మాట దిలీపునికి వినిపించలేదు. ఇవేవీ తెలియక పిల్లలు లేరని దుఃఖంతో రాణీ సమేతుడై వశిష్ఠుని ఆశ్రయించాడు. వసిష్ఠుడు దివ్య దృష్టితో శాపమూలం తెలుసుకున్నాడు. కాని కామధేనువు పాతాళ లోకంలో ఉండడంతో – తన ఆశ్రమంలో ఉన్న “నందినీ ధేనువు”ని సేవించమన్నాడు. అలా సేవిస్తే సంతానం కలుగుతుందనన్నాడు.

దిలీపుడు సర్వ సుఖాలూ వదిలి గోవుల కాపరి అయ్యాడు. నందినీ సేవకుడయ్యాడు. సతీసమేతంగా ఆ గోవుని కన్న బిడ్డకన్నా ఎక్కువ మమకారంతో చూసుకున్నారు. అలా ఇరవై రోజులు గడిచాయి. నందిని కూడా రాజ దంపతులను గమనిస్తూనే ఉంది. ఒకరోజు నందిని కావాలని దారి తప్పింది. మేస్తూ మేస్తూ హిమవత్పర్వతమున్న ప్రాంతం చేరింది. ఒక గుహలోకి దూరింది. వెన్నంటే ఉన్న దిలీపుడు పరిసరాల ప్రకృతి అందాలకు మైమరచి పోయాడు. సింహపు గాండ్రింపు విని ఉలిక్కి పడ్డాడు. గృహలోకి చొరబడ్డాడు. అప్పటికే నందని మీదకి సింహం ఉరికింది. దిలీపుడు క్షణాల్లో బాణాన్ని అందుకోబోయి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఎందుకంటే సింహం మనిషిలా మాట్లాడడం మొదలు పెట్టింది. ఆ పరిసర ప్రాంతాల రక్షకుడిగా శివకింకురుడిగా చెప్పుకుంది. అక్కడకు వచ్చిన జంతువులను చంపితినే అధికారం తనకుంది అంది. శివుని ఆజ్ఞగా చెప్పుకుంది సింహం. ఆవు ఆహారమై పోనుందని చెప్పి దిలీపుణ్ని వెళ్ళిపోమంది. దిలీపుడు చేతులు జోడించి సింహరాజుని వేడుకున్నాడు. తనని ఆహారంగా స్వీకరించమన్నాడు. నందినీ గోవుని విడిచి పెట్టమన్నాడు. గురువు గారి ప్రాణంగా చెప్పాడు. తన ప్రాణం తీసుకోమన్నాడు. అపకీర్తిని అంట గట్టొద్దన్నాడు. ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే అన్నాడు. తనకు తానే ఓ మాంసపు ముద్దలా ముడుచుకుపోయి సింహం నోటి ముందు నిలబడ్డాడు. మూసినకళ్ళు తెరిచేసరికి సింహం మాయమయ్యింది. నందిని నవ్వింది. అంతా తను పెట్టిన పరీక్షంది. పరీక్షలో గెలిచావంది. సంతానం కలుగుతుంది అంది. అందుకు తన పాలను స్వీకరించమంది. దిలీపుడు ఎంతో సంతోషపడినా పాలను స్వీకరించలేనన్నాడు… నీ పాలు గురువుగారి యాగ కార్యాలకు వినియోగించాక, నీ బిడ్డలకు ఇచ్చాక మిగిలితే… అందుకు గురు దేవులు వసిష్టమహర్షి అనుమతిస్తే… అన్నాడు. అతని ధర్మ నిరతికి వసిష్ఠుడు మెచ్చుకుని అనుమతినీ ఆశీర్వాదాన్నీ అందించాడు. ఆ దంపతులు పాలను సేవించారు. ఆ తర్వాత పండంటి బిడ్డను కన్నారు. అతడే రఘు మహారాజు!

దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు. తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది. అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు. రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!.

[           *కోరికలు... వరాలు..!*

పుత్రభిక్ష  వరం.     ఆ పుత్రుడు ప్రయోజకుడు కావాలని చేసే ప్రార్థన కోరిక. ప్రపంచంలో కోరికలు కోరే భక్తులే ఎక్కువ. వరాలు అంత సులభంగా లభించవు. ముందు అర్హత సంపాదించాలి. అది తపస్సు లాంటిదై ఉండాలి. తపస్సుకు అనేక పరీక్షలుంటాయి. ప్రలోభాల వలలు ఉంటాయి. మనం           ఏ రంగంలో ఎలాంటి కృషి చేసినా అది తపస్సుతో పోల్చదగినదై ఉండాలి.

విద్యార్థులు చదువును తపస్సుగా భావిస్తే.. ఆ కృషి తీవ్రత వేరు. అందుకు లభించే ఫలితాలు కూడా అమోఘంగా ఉంటాయి. అవి వరాలంత ఘనంగా ఉంటాయి. అవి అత్యున్నత స్థాయిలో, అత్యధిక జీతంతో వరించే ఉద్యోగాలు కావచ్చు. సాధారణ స్థాయిలో ఆకతాయిగా ఆడుతూ పాడుతూ చదివే విద్యార్థి అత్తెసరు మార్కులతో సరిపెట్టుకోక తప్పదు. వారికి దక్కే ఉద్యోగమూ అంతే. ఉద్యోగులు తమ పనిలో అంకితభావంతో, సంస్థ అభివృద్ధినే లక్ష్యంగా ఏకదీక్షగా కృషి చేసినప్పుడు, అది యజమాని గుర్తింపు, మెప్పును పొందుతుంది. ఉద్యోగి పదోన్నతికది పునాది అవుతుంది. క్రీడాకారుడు తన దేహశక్తిని ద్విగుణీకృతం చేసుకుంటూ, మెలకువలు మెరుగు పరచుకుంటూ చేసే నిత్య అభ్యాసం సత్ఫలితాలు నిస్తుంది.

సాధకుడు ఆడంబరాల జోలికి పోకుండా ఆత్మానుభవం కోసం తపిస్తే, ఆత్మజ్ఞాని అవుతాడు. ఇలా అన్ని రంగాల్లో కృషి ఫలాలు కమనీయంగా ఉంటాయి. రాయిలా పడి ఉండే సోమరికి ఎలాంటి ప్రగతీ లభించదు. రాయి కూడా తనకు తానుగా శిల్పంగా మారదు. ఉలిని నైపుణ్యంగా ఉపయోగించగల చేతులు కావాలి. ఆ చేతులు ఆ శిల మీద కదలాడాలి. అలాగే శరీరం మనసు, బుద్ధి అనే కరద్వయం కృషిలో నిమగ్నం కావాలి. అది తపోదీక్షలా ఉండాలి. తపస్సు అనగానే కాషాయ వస్త్రాలతో, కారడవుల్లో ముక్కు మూసుకుని చేసేదిగా అనుకోనవసరం లేదు. తపస్సు మనసుకు సంబంధించింది. శరీరం కేవలం ఉపకరణం మాత్రమే. ఏ స్థితిలో ఉన్నా మనసు లక్ష్యం మీదనే లగ్నమై ఉండాలి. మన లక్ష్యం ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాలి...!

మనం సరిగ్గా గమనించం కానీ, కృషికి పూనుకొన్నాక మనలో నిద్రాణంగా ఉన్న అమోఘ శక్తులు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతాయి. శాస్త్రజ్ఞుల పరిశోధనలన్నీ దీర్ఘ తపస్సులే. ఫలితాలన్నీ అంతర్యామి వరాలే..!

ప్రాపంచిక పరిధుల్ని దాటి, మనసు జ్ఞానభూమిలోకి ప్రవేశించగానే అనేక అద్భుత సత్యాలు పలకరిస్తాయి. అవి ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. వాటిని శోధించడంలోనే ఆలస్యం జరిగింది. ఇంకా ఎన్నో అద్భుత సత్యాలు ఆకాశంలోని నక్షత్రాల్లా, సంజీవనీ మూలికల్లాగా కాంతులీనుతూ ఉంటాయి. అవన్నీ   జ్ఞాన సంపదలు. ఎంతో తపనతో గానీ లభ్యం కావు. అసలు తపస్సు అంటేనే అనంతమైన తపన.

తపన పరమాత్మ కోసమే అయినప్పుడు ఆయన వరాలివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏమి కోరాలి...?ఆయన అనంతుడు. అన్నీ అనంత పరిమాణంలో ఉంటాయి. నచికేతుడు యమధర్మరాజును ‘ఆత్మజ్ఞానం’ వరంగా అడిగినప్పుడు, అనేక ప్రలోభాలతో మోహితుణ్ని చేయాలని ప్రయత్నిస్తాడు. చివరకు నచికేతుడే గెలుస్తాడు.

కుంతీదేవి…   శ్రీకృష్ణ పరమాత్ముడి మాయనుంచి రక్షణను, అనన్య భక్తిని వరంగా కోరుతుంది. ఇలాంటి వరాలు కోరేవారు ఎంతో ధన్యులు.  ఈ వరాలు ఎంత గొప్పవో అర్థం చేసుకుంటే, మనం కూడా అవే కోరతాం. ఎందుకంటే, అవి కోరినాక ఇక కోరదగిన వరాలు ఏమీ ఉండవు.

****

No comments:

Post a Comment