*భంగపడిన అశ్వత్థామ*
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణుని దగ్గరకు అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామకు తగిన అతిథి మర్యాదలు జరిపించిన తరువాత వచ్చిన పనేమిటో అడిగాడు శ్రీకృష్ణుడు.
“కృష్ణా! మా తండ్రి చేసిన గొప్ప తపస్సుకు మెచ్చి అగస్త్యుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఆయనకిచ్చాడు. నా మీదున్న ప్రేమతో నా తండ్రి దాన్ని నాకిచ్చాడు . ఆ దివ్యాస్త్రాన్ని నీకిస్తాను . బదులుగా నీ సుదర్శన చక్రాన్నివ్వు” అని అడిగాడు.
అతడి దుర్బుద్ధిని గ్రహించిన శ్రీకృష్ణుడు “ఇవిగో నా ఆయుధాలు నాలుగు ఇక్కడ పెడుతున్నాను. చక్రం , గద, ధనస్సు , ఖడ్గం . వీటిలో నీకు ఏది కావాలో తీసుకో. నువ్వు స్నేహితుడవు. నువ్వడిగింది ఇవ్వడమే ధర్మం. అందుకు ప్రతిగా నీ నుండి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఆశించను” అన్నాడు.
అందుకు సంతోషించిన అశ్వత్థామ తనకు సుదర్శన చక్రమే కావాలన్నాడు.
సరేనన్నాడు కృష్ణుడు.
ముందుగా చక్రాన్ని ఎడమ చేతితో ఎత్తాలని ప్రయత్నించాడు అశ్వత్థామ . అతని వల్ల కాలేదు. తరువాత కుడిచేత్తో ప్రయత్నించాడు. అప్పుడూ సాధ్యం కాలేదు . ఈసారి రెండు చేతులతోను ప్రయత్నించాడు. అప్పుడూ అతనివల్ల కాలేదు.
అశ్వత్థామ పడుతున్న అవస్థ చూసిన శ్రీకృష్ణుడు “ ఎంతో నిష్ఠతో హిమాలయాల్లో పన్నెండేళ్ల పాటు ఘోరమైన తపస్సు చేసి చక్రాన్ని పొందాను. ఈ గొప్పసాధనాన్ని పొందిన తరువాత దేవతలు, రాక్షసులు, గంధర్వాదులెవ్వరూ నా భుజబలం ముందు నిలవలేకపోయారు. అది దీని బలం. ఇంతవరకు బలరాముడు గానీ, ప్రద్యుమ్నుడు గానీ, సాంబుడు గానీ దీన్ని అడుగలేదు. అర్జునుడు తన కపిధ్వజాన్ని తపస్సు చేతనే పొందాడు. శివుడితో యుద్ధం చేసి ఆయనను మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. నాకు ప్రాణం కన్నా అధికుడైన అర్జునుడికి ఇవ్వరానిదంటూ నా వద్ద ఏదీ లేదు. అయినా అర్జునుడు ఈ చక్రాన్ని అడుగలేదు. ధనుర్విద్యా గురువైన ద్రోణుడి పుత్రుడవు. నువ్వు అజ్ఞానం చేత ఈ చక్రాన్ని అడిగి ఉండవు. ఎవరితో యుద్ధం చేయాలని ఈ చక్రాన్ని అడిగావో తెలుసుకోవచ్చా?“ అని ప్రశ్నించాడు.
అశ్వత్థామ “కృష్ణా! సుదర్శనాన్ని నువ్విస్తే ఇప్పుడు పుచ్చుకుని ఆ తర్వాత నీతోనే యుద్ధం చేసి నిన్ను జయించి లోకుల మెప్పు పొందాలనుకున్నాను. పోనిమ్ము. ఈ చక్రాన్ని నువ్వొక్కడివే ధరించాల్సిందయితే అట్లాగే కానిమ్ము. నాకు వచ్చిన నష్టమేమి లేదు. ఎట్లాగూ నీతో యుద్ధము చేస్తాను“ అన్నాడు.
కృష్ణుడు నవ్వుతూ అట్లాగే లెమ్మని బదులిచ్చాడు.
అశ్వత్థామ ద్రోణపుత్రుడన్న గౌరవంతో మంచి గుర్రాల్ని, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పంపాడు శ్రీకృష్ణుడు.
ఎవరితో యుద్ధం చేయాలనుకున్నాడో ఆ శ్రీకృష్ణుడినే ఆయుధం అడిగే సాహసం చేసాడు అశ్వత్థామ. కనీసం సుదర్శన చక్రాన్ని ఎత్తలేకపోయాడు. ఇంక దాన్ని ధరించడమన్న విషయం అతడికి సాధ్యమా? అలా అతడికి గౌరవభంగం అయింది.
—--******------
భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే! అందుకే నవవిధ భక్తిమార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ భక్తి విధానాల్లో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. అనంతశక్తులు తనలో దాగి ఉన్నా.. రామబంటుగా ఒదిగి ఉండటమే దాసాంజనేయుడికి ఇష్టం. ఆ పరమభక్తుడు పిల్లల దేవుడు, పెద్దల దేవుడు, అందరి దేవుడు.
ఆంజనేయుడి కోవెల లేని ఊరు ఉండదు. ఒకచోట సంజీవరాయడిగా, మరోచోట సహకార ఆంజనేయుడిగా, ఇంకోచోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు. మనందరికీ దేవుడే అయినా, తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు స్వామి. లంకాపురిలో సీతమ్మ జాడకనిపెట్టిన రోజు చైత్ర పౌర్ణమి. అంతటి ఘనకార్యం చేసినా.. దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకొన్నాడు.
శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు. అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు. ‘హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే. అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని, రామచంద్రుడు చెప్పాడంటే అంతే! మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమ వంతు. తన అపారమైన దేహబలాన్ని ప్రభుసేవలో వినియోగించడమే. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడివారు చెప్పారు. కానీ, ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు. రివ్వున ఎగిరిపోయాడు. సంజీవని గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు. స్వామికార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్నే పెళ్లగించి తీసుకుపోయాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు. అంతేకాదు, యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు, గుట్టలు, మురికి కుప్పలతో ముంచేసి, శత్రుసేనలు కదిలేందుకు వీల్లేకుండా చేశాడు. ఇలా వానరుడిగా జన్మించినా, రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం వాయునందనుడిని భక్తాగ్రేసరుడిగా నిలబెట్టింది. జీవిత పరమసిద్ధివైపు నడిపించింది’ అని ప్రభుపాదులు వివరించారు.
నమ్మిన దైవంపై పరిపూర్ణమైన అంకితభావం కలిగి ఉండాలి. నిరంతరం స్వామి సేవలో తరిస్తూ ఇది తప్ప మరేదీ తనకు అవసరం లేదని ఆంజనేయుడు ప్రార్థించేవాడు.
భవబంధచ్ఛిదే తస్యై స్పృహయామి న ముక్తయే
భవాన్ ప్రభురహం దాస ఇతి యత విలుప్యతే
‘ఓ ప్రభూ! ఈ భవబంధాల నుంచి నన్ను విముక్తుడిని చేయదలిచితే చేయి. మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటే, ప్రసాదించు. కానీ, నేను మాత్రం ఇవేవీ కోరుకోను. మీపై నా దాస్య భావనను మరిపించేదేదీ నాకు అవసరం లేదు’ అని వినయంగా వేడుకుంటాడు హనుమ.
పురాణాలను అనుసరించి హనుమ చిరంజీవి. నిరంతరం రామనామాన్ని జపిస్తుంటాడు. అంతేకాదు, ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు.. అక్కడికి వెళ్లిపోతాడు. ఆనందబాష్పాలు నిండిన కండ్లతో, చేతులు జోడించి అక్కడే ఉంటాడు. రామకథా గానం చేస్తున్న భక్తుల సేవా సంకల్పాన్ని పవనసుతుడు మరింత బలపరుస్తాడని శాస్ర్తాలు చెబుతున్నాయి.
సురోవసురో వాప్యథ వానరో నరః
సర్వాత్మనా యః సుకృతజ్ఞముత్తమమ్
భజేత రామం మనుజాకృతిం హరిం
య ఉత్తరాననయత్కోసలాన్దివమితి (భాగవతం)
‘సురులు గానీ, అసురులు గానీ, నరులు గానీ, వానరులు గానీ, మానవమాత్రునిగా ఈ లోకంలో అవతరించిన దేవాదిదేవుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించాలి. భక్తుడు ఆచరించే తృణమాత్రపు సేవనైనా ప్రేమతో స్వీకరించే ఆ స్వామిని సేవించడానికి కఠోర తపస్సులు ఆచరించ అవసరం లేదు. భగవంతుడు ప్రీతి చెందితే, తన భక్తుడికి సార్థకత చేకూరినట్టే. రామచంద్రుడు అయోధ్య వాసులందరికీ తన స్వధామాన్ని (వైకుంఠాన్ని) అనుగ్రహించాడు’ అని పలికిన హనుమంతుడి మాటలు రామభక్తులకు కొండంత బలాన్నిస్తాయి.
ఒకసారి శ్రీరాముడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ హనుమను ఎంతగానో కొనియాడాడు. ‘వాలి, రావణుడి బలాలు అసాధారణమైనవి. కానీ, అవి హనుమంతుడి బలపరాక్రమాలతో సమం కాదు. హనుమ రౌద్రం, పరాక్రమం, సహనం, బుద్ధి, శాస్త్ర విజ్ఞానంతోపాటు సద్బుద్ధి కలిగిన గొప్ప సమర్థుడు. ఒక్క హనుమంతుడే సముద్రాన్ని దాటి, రాక్షసులను మర్దించి, లంకా దహనం చేసి, సీత సందేశాన్ని తెచ్చాడు. అలాంటి సాహస కృత్యాలు యముడు, ఇంద్రుడు, కుబేరుడు వంటి దేవతలు చేసినట్టుగా కూడా మనం వినలేదు. కేవలం హనుమ శక్తిసామర్థ్యాల వల్లే లంకను జయించి, సీతను రక్షించి, లక్ష్మణుడిని కాపాడుకోగలిగాను’ అన్నాడు.
🕉🙏
గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు
ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు.ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు.నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి...ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు.నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని.నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు.వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని.సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు.నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు.నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య.తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు.నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు.చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు.అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు.భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి.
కాలం దైవ స్వరూపం
పంచభూతాలలో తేజోరూపుడైన సూర్యుడు కాలమనే తన శక్తితో సకల కారణ తత్వాలలోని బీజశక్తిని కార్యోన్ముఖం చేస్తూ జీవశక్తిగా ప్రకటింపజేస్తున్నాడు. సూర్య పరిభ్రమణం వల్లనే కాలచక్ర గమనం మనకు తెలుస్తోంది. సూర్యుడు రాళ్ళ చక్రాన్ని చుట్టి రావడానికి పట్టే కాలాన్ని సంవత్సరమంటారు. గురువు రాశిచక్రంలో ఒక రాశి నుంచి మరో రాశికి పయనించే కాలాన్ని పరివత్సరమని వ్యవహరిస్తారు. నెలకు సమానంగా ముప్ఫై రోజుల చొప్పున మూడు వందల అరవై రోజులు గల కాలానికి ఇవత్సరమని పేరు. చంద్ర గతిని బట్టి ఆమావాస్యతో అంతమయ్యే పన్నెండు నెలల కాలాన్ని అనువత్సరమని అంటారు. చంద్రుడు నక్షత్రాలతో సంచ రిస్తూ ఇరవై ఏడు రోజులు మాత్రమే నెలగా పరిగణించిన పన్నెండు నెలలు కాలాన్ని వత్సరమని అంటారని కాలగణన శాస్త్రం చెబుతోంది. ఇలా అయిదు రకా లైన సంవత్సరాల రూపంలో ఉన్న సూర్యుడిని ఆరాధించాలని భాగవతంలో మైత్రే యుడు విదురుడికి బోధించాడు.
అందుచేతనే
కాలస్వరూపుడు.
కాలుడని పేరు వచ్చింది. భగవంతుడి శక్తి అయినకాలం కూడా భగవంతుడి స్వరూపమే ఆయన కాలాతీతుడు, కాల
విభాగం లేనివాడు. కాలానికి ఆయన కర్త. ఆయనకు కాలం కర్త్య కాదు. సృష్టించిన పదార్థాల సమూహమంతటినీ వ్యాపించిన తరువాత
సర్వసమర్ధమై దాన్ని విడగొడుతుంది కాలం.సృష్టి నుంచి ప్రళయం వరకు విస్తరించి అతిపెద్ద ప్రమాణంలో నిలుస్తుంది.
తృటి వేద, నిమేషం, క్షణం, ఘటిక ముహూర్తం. జాము, రేయింబవళ్లు, రోజు, పక్షం, నెల, ఋతువు,
కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా వేనవేల సంవత్సరాల విభజన పొందింది. కాలచక్ర భ్రమణంలో సృష్టి, స్థితి, లయలు అంతర్భాగాలు, కాలం చేసే ఇంద్ర జాలం వర్ణనాతీతం. నవ్వేవారిని ఏడిపిస్తుంది. ఏడ్చేవారిని సంతోషపరుస్తుంది. నిన్నటి సుబాలు నేడు కనుమరుగయ్యేలా చేస్తుంది. నేటి ఆశయాలను రేపటికి. ఆవిరిగా మార్చేస్తుంది. ఏవీ స్థిరం కావని చెప్పకనే చెబుతుంది. ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువులను దగ్గరకొచ్చేలా చేస్తుంది. కాలాని కేదీ అసాధ్యం. కాదు. పరుగెత్తే కాలాన్ని ఒడుపుగా పట్టాలని ప్రవహించే నదిని ఒడిసి అడ్డుకట్టా లని భావించడం భ్రమే, మంచులా కరిగే కాలాన్ని, ముందుకు పరుగులు తీసే నదిని సమయానుకూలంగా సద్వినియోగం చేసుకోవాలి. క్షణికమైన జీవితం ధనా ర్జన, నిద్ర సుఖంలో ఎక్కువగా గడిచాక మిగిలిన కొద్ది కాలం పట్ల జాగరూకత, అవగాహన లేని మనిషి మనుగడ ప్రశ్నార్ధకమే. రేపటి పని ఈ రోజు. నేటి పని నిన్ననే నిర్వహించాలన్న ఆలోచన కలిగితే కాలానికి కళ్లెం వేసినట్లే విలువైన కాలాన్ని అందిపుచ్చుకొని, జ్ఞాన సముపార్జన చెయ్యాలి.
భగవదారాధన, సమాజ సేవ, యజ్ఞం, దానం, తపం, యోగం లాంటివి. సకాలంలో ఆచరిస్తే భగవంతున్ని చేరినట్లే. వారే కాల స్వరూపుడైన భగవంతుడి కృపాకటాక్ష వీక్షణాలకు అర్హులు కాగలరని భాగవతం చెబుతోంది. కాల ప్రవాహా నికి ఎదురీదాలనుకోవడం మూర్ఖుల లక్షణం. సాహసిస్తే కాల ప్రవాహంలో కొట్టు కుపోవలసిందే. కాలాన్ని శాసించే శక్తి ఎవరికీ లేదు. చివరికి కాల స్వరూపుడైన భగవంతుడికి కూడా. ఎంతటి జ్ఞానులైనా, మహాపురుషులైనా కాలానికి తల వంచి నమస్కరించాల్సిందే. దైవం ఉన్నాడా, ఉంటే కన్పించడం అని ప్రశ్నలు సంధించే నిరీశ్వరవాదులకు సమాదానమొక్కటే కనిపించే సూర్యచంద్రులతో పాటే కనిపిం చక పరుగులు తీసే కాలమే దైవ స్వరూపమని వివరించి సమాధానపరచ డమే సరైన జవాబు
మాడుగుల రామకృష్ణ
*విశ్వమే ప్రకృతి*
భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుని మనుగడయే కష్టం.
మానవుడు ఈ భూమిపై అవతరించి తన అవసరాలను తీర్చుకొనుటకు ప్రకృతిమీదనే ఆధారపడుతున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలాలు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాసులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ముఖ్యవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుండి లభించేవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్ల నీడను సౌధాలుగా చెట్ల నారను పట్టు వస్త్రాలుగా కాయలు, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభమునుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలనం ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నది. మానవుని ప్రజ్ఞా ప్రాభవాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లాగా విహరింపజేస్తున్నాయి. సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికిని దీని ప్రభావంతో ప్రకృతి దెబ్బతింటున్నది. పూర్వకాలంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కందమూలాలు ఆరగించి మూలికా ఔషధాలను వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించెడివాడు. నేటి మానవుడు పట్టణ జీవితానికి అలవడి కృత్రిమ ఆహారాన్ని కల్తీ ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాడు.
ప్రకృతికి మూలాధారాలైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటికి హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు- మనం ఇక్కడినుండి రాళ్ళతో కొడితే అవి మనకు అక్కడినుండి ఫలాలనందిస్తున్నాయి. మనకు అవసరమైన ప్రాణవాయువును, ఆకులు, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, రావి, మేడి, వేప, జమ్మి, ఉసిరిచెట్లను పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖ దుఃఖాలున్నవని జగదీశ చంద్రబోసు నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన ‘నోబుల్’ బహుమతి పొందాడు. ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియాశక్తి, ఘ్రాణాశక్తి ఉందని నిరూపించారు. సాధారణంగా సామాన్య మానవులకుండే లక్షణాలన్నియు చెట్లకూఉన్నాయి. చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకున్నది. చెట్లు దైవీ శక్తులను కలిగి ఉన్నాయి. అవి పిలిస్తే పలికే దైవాలు. భక్తితో చెట్లను పూజించి, ప్రదక్షిణలు చేసి ఏకాగ్రతతో ప్రార్థిస్తే వృక్షమాత అనుగ్రహించి ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిలో ఒక్కొక్క చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి మహత్తర శక్తులను కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని గ్రహించి వృక్ష సంపదను పెంపొందించిన దేశ సౌభాగ్యము ఇనుమడిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో- నిరంతరం నిష్కామ భావంతో ప్రకృతిని సేవిస్తూ, రక్షిస్తారో వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తానని అర్థం, ‘వృక్షో రక్షతి రక్షితః’ అని. మనం ప్రకృని కాపాడితే ప్రకృతి మనలను తన ఒడిలో పెట్టుకుని కన్నబిడ్డలా పరిరక్షిస్తుంది. ప్రకృతిని రక్షించు ప్రకృతిలో జీవించు. ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలిసి కొని భగవంతుడు అన్నింటా వ్యాపించి యున్నాడని అన్ని ప్రాణుల యెడ భూతదయ కలిగి రక్షించుట మానవ ధర్మం. ఇదే వేద సారాంశం.
🙏🕉️🚩🌹💐
💝 *ఓం పూర్ణమిదః పూర్ణమదం*
*పూర్ణాత్ పూర్ణముదచ్యతే|*
*పూర్ణస్య పూర్ణ మాదాయా* *పూర్ణమేవావశిష్యతే||*
*ఓం శాంతి శాంతి శాంతిః*
💖 *~భగవంతుడు పూర్ణుడు.*
*పూర్ణానికి పూర్ణం కలిపినా,* *పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే.*
❤️ *~ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే... జీవితమంతా ఇందులోనే ఉంది. మోక్ష మార్గం ఇందులోనే దాగి ఉంది. సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.*
💕 *0 + 0 = 0*
💕 *0 ౼ 0 = 0*
💞 *కానీ...*
💓 *0+1 = ఎంత అంటే.....మనం వెంటనే 1 అని సమాధానమిస్తాం.*
❤️ *ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే 1 గామారిపోయింది.*
💓 *0+2 =2....*
❤️ *సున్నా 2 తో కలవగానే సున్న మాయమై రెండుగా మారింది.*
💞 *అంటే.....సున్నా దేనితో కలిస్తే దానిలా మారిపోతూంది.*
💝 *గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం.*
💖 *మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో ఎప్పుడైతే కలుస్తున్నామో మనం అప్పటికప్పుడే ప్రకృతే ఐపోతున్నాం.*
💓 *మనం దేనితో కలుస్తామో.. దానిగా మారిపోతున్నాం.....*
♦️ *బాగా గమనించాలి.*
💕 *నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు…*
*ఆ వ్యక్తిని చూడగానే...నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు.*
💕 *ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు...అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావు.*
❤️ *ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది.*
❤️ *ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతున్నది.*
💝 *అంటే...*
💖 *మనం ఎదుటి వ్యక్తిలోని ఏ* *గుణాన్నాయితే గమనిస్తున్నామో..*
*మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి....ఆ గుణంగానే మారిపోతున్నాం.*
💝*మనం దేనితో కలుస్తున్నామో... దానిలా మారిపోతున్నాం.*
💓 *మనలో సున్నా (0) లా ఉన్న పరమాత్మతత్వం...ఎదుటి వ్యక్తీలోని కోపంతో కలవగానే అది కోపంగా మారి మనకు కోపం వస్తుంది.*
❤️ *నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా, ద్వేషంతో కలిస్తే ద్వేషంగా మారిపోతావ్.*
💝 *ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.*
❤️ *అందుకే....*
💞 *ప్రతి జీవిలోనూ, మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడని గ్రహించి ఆయనతో అనుసంధానం అవ్వు.*
💝 *అంటే నీలోని పూర్ణాన్ని ఎదుటి వ్యక్తీలోని పూర్ణంతో కలుపు.*
*వచ్చేది పూర్ణమే.*
💖 *ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో మనం అదిగా మారిపోతామన్న మహా సత్యాన్ని గమనించాలి.*
❤️ *అందుకే ఎలాంటి వారిలోనైనా భగవంతుణ్ణి చూడగల్గి ఆయనతో* *కలిస్తే...మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.*
💕 *సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ ఉండాలి.*
💞 *అంటే మంచి చెడు తటస్థ లక్షణాల్లో,అన్ని గుణాలలో, అన్ని ఆలోచనలలో, అన్ని అనుభూతుల్లో, మనోభావాల్లో, అనారోగ్య లక్షణాల్లో, అరోగ్య లక్షణాలలో, పూర్ణాన్ని అనుభూతి చెందాలన్నమాట.*
💝 *ఇక్కడ పూర్ణం లేదా భగవంతుడు అంటే నిరాకారం, వ్యాపకం, నిశ్చలం, నిర్గుణం, సచ్చిదానంద స్వరూపం,తృప్తి, బ్రహ్మానందం, ప్రశాంతత.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment