Tuesday, 28 June 2022

 


ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భావిస్తారు.

మనుషులు నదుల్లో స్నానాలు చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. ఆ పాపాలను స్వీకరించడం వల్ల కలిగే బాధ నుంచి నదులకు విముక్తి కలిగించే ఉత్సవాలే పుష్కరాలు. పూర్వం పుష్కరుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. మనుషుల పాపాలను మోస్తున్న నదులను పునీతం చేసి, వాటి ఆవేదన తీర్చాల్సిందిగా ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆ పాప ప్రాక్షళనలో పుష్కరుడే కీలకం అవుతాడు. ఆయన సాధించిన విజయమే పుష్కరోత్సవాలు. స్వర్గంలోని మందాకినీ నదిలో అంతర్లీనంగా ఉండే పుష్కరుడు ఏడాదికి ఒకసారి బృహస్పతి రాశి సంక్రమణం ఆధారంగా ఒక్కో నదిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఆ నదికి పన్నెండు రోజులు ఉత్సవాలు చేస్తారు. వీటినే పుష్కరాలు అంటున్నారు.

పుష్కరోత్సవం జరుగుతున్న నదికి పదివేల నదుల ప్రవిత్రత ఏర్పడుతుందని మహాభారతంలోని అరణ్యపర్వం తెలియజేస్తుంది. పుష్కరాల వేళ నదీస్నానం చేసి దేవతలకు, రుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని ధర్మరాజుకు నారదుడు చెబుతాడు. అందుకే, పుష్కరాలల్లో పితృదేవతలకు విధిగా శ్రాధ్ధం నిర్వహించాలని శాస్త్రం నిర్దేశించింది. దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నదులకు పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం. ఆ విధంగా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి నదికి పుష్కరాలు వస్తాయి. చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం  బృహస్పతి తన స్వక్షేత్రమైన మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం.

బృహస్పతి రాశి సంక్రమణతో పుష్కరుడు గురువుతోపాటు నదిలోకి ప్రవేశిస్తాడని ప్రతీతి. ఆ పన్నెండు రోజులు నదీజలాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని నమ్మకం. ముక్కోటి దేవతలు సైతం పుష్కర నదిలో స్నానం చేస్తారని పురాణ వచనం. అందుకే పుష్కర స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. అంతేకాదు, పుష్కర నదిలో శ్రాద్ధవిధులు, తర్పణాలు నిర్వహించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. పుణ్యస్నానాలు, దానధర్మాలు, తర్పణాలతో పుష్కర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వైనగంగ, వార్ధా నదులు సంగమించి ప్రాణహితగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రస్థానం మొదలవుతుంది. దాదాపు 113 కిలోమీటర్లు ప్రవహించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతీనది కలుస్తుండటంతో కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా చెబుతారు. ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల దీనిని ప్రణీత అనీ, తీరం వెంబడి అడవిలో రకరకాల ప్రాణులు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారని చెబుతారు. ప్రాణహిత-గోదావరి సంగమ స్థానంలో ఉన్న కాళేశ్వరం అత్యంత మహిమాన్విత క్షేత్రం. ఒకే పానవట్టంపై రెండు లింగాలు కొలువుదీరి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వీటిని కాళేశ్వర, ముక్తీశ్వరుల పేరుతో కొలుస్తారు. ఇక్కడి ప్రధాన ఆలయం ఆవరణలో ఉన్న యమకోణంలో యముడు తపస్సు చేసినట్లు స్థలపురాణం. ఈ యమకోణం దాటిన వారికి యమ బాధలు ఉండవని అంటారు. 

పుష్కర స్నానం అంటే.. ఆటవిడుపుగా చేసేది కాదు. ఎండకు ఓర్చుకోలేక ఈదులాడటమూ కాదు. దైవ సంబంధమైన కార్యం పుష్కర స్నానం. మానసికంగా పవిత్ర భావనతో పుణ్యస్నానం ఆచరించాలి. మూడు మునకలు వేసి సంకల్పం చెబుతూ స్నానం చేయాలి. మంత్రాలు తెలియకపోయినా.. నదీమతల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ కూడా స్నానం చేయవచ్చు. నదిలో ఉమ్మివేయడం, విసర్జించడం మహాపాపం. సబ్బులు, షాంపూలు వాడకూడదు. దుస్తులు ఉతకొద్దు. వ్యర్థాలను నదిలో వదలకూడదు. ఈ భూమ్మిదున్న ప్రతిజీవి మనకుగడుకు జీవనాధారం నీరు. ఈ జలం పుట్టిన తర్వాతనే జీవకోటి ఉద్భవించింది. కాగా పుష్కరాల్లో స్నానాలు ఆచరించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయి. అంతేకాదు నదీస్నానాల వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలుపుతున్నాయి.

...,.....


ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని?


న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం.  ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? 

 ముందుగా అసలు  ఈ పంచభూతాలు అంటే ఏమిటీ?  

వాటి  ప్రాముఖ్యత ఏమిటీ ... 


పంచభూతాలు :- పృథ్వి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం.

నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, శక్తిమంతుడు, చైతన్యుడు, అతీంద్రియుడు, సర్వాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ ... అని మనం పిలిచే కొలిచే భగవంతుడు నుండే ఈ పంచభూతాలు ఓ క్రమపద్ధతిలో ఉత్పన్నాలైనాయి. ముందుగా శబ్దమయమైన ఆకాశం పుట్టగా, దాని నుండి స్పర్శతత్వం గలవాయువు పుట్టింది. ఈ వాయువు నుండి ఘర్షణ చేత రూపం గల అగ్ని పుట్టింది. అగ్ని నుండి రస స్వరూపమైన జలము పుట్టింది. దీని నుండి వాసన కలిగిన పృథ్వి పుట్టింది.

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.

ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.


సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి. ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం. ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం. ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.


మన స్థూల దేహంలోని పంచభూతముల అమరిక ఇలా వుంటుంది -


పృథ్వి :- 

వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియాలు పృథ్విభూతంచే ఏర్పడెను. దీని గుణం గంధం /వాసన.  


అగ్ని :- 

శరీరంలో జఠరాగ్ని రూపంలో వున్నది. చర్మం, ముక్కు, కన్నులు, చెవులు, నాలుక అనబడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంచే ఏర్పడినవి. దీని గుణం రూపం. 


జలం :- 

రక్తరూపంలో యున్నది. శబ్ధం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు జలభూతంచే ఏర్పడెను. దీని గుణం రసం.  


వాయువు :- 

శరీరంలో ప్రాణ రూపంలో ఉన్నది. పంచప్రాణములు (ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం) వాయుభూతంచే ఏర్పడెను. దీని గుణం స్పర్శ. 


ఆకాశం :- 

అంతఃకరణమై యున్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారములతో కూడిన ఈ అంతరింద్రియం 

ఆకాశభూతంచే ఏర్పడెను. దీని గుణం శబ్ధం. 


ఇక సూక్ష్మ దేహంలో పంచభూతాల అమరిక -  


మనలో పంచకోశాలు వున్నాయి మొదటిది అన్నమయకోశం. ఇది భూతత్వం నకు సంబంధించినది. రెండవది జలతత్వంతో కూడిన ప్రాణమయకోశం. మూడవది అగ్నితత్వంనకు సంబంధించిన మనోమయకోశం. నాల్గవది వాయుతత్వంనకు చెందిన విజ్ఞానమయకోశం. ఐదవది ఆకాశతత్వంనకు చెందిన ఆనందమయకోశం. ఈ ఐదు కోశాల మధ్య పరబ్రహ్మతత్వమైన ఆత్మ యున్నది. 


అలానే పంచభూతాలకు ప్రతీకలుగా మనలో ఐదు శక్తి నాడీకేంద్రములున్నాయి. ఇవే శక్తి చక్రాలు.  అవి భూతత్వంనకు చెందిన మూలాధారం, జలతత్వానికి చెందిన స్వాధిష్టానం,  అగ్నితత్త్వానికి ప్రతీకగా మణిపూరకచక్రం, వాయువుకు ప్రతీకగా అనాహతం, ఆకాశతత్త్వానికి ప్రతీకగా విశుద్ధిచక్రం. {ఆజ్ఞా, సహస్రారాలు తత్త్వాతీత చక్రాలు}. మన నడవడిక, అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు, ప్రారబ్ధ వాసనలు బట్టి ప్రభావితమౌతూ ఇవి పనిచేస్తుంటాయి. 


పంచ ప్రాణాలు :__ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము...


వసుదేవత- వసువులంటే ప్రాణులు నివసింప యోగ్యమైనవి. భూమి మనకు నివాస యోగ్యము.

మృగాలకు, పశుపక్ష్యాదులకు,క్రిమికీటకాదులకు ఈ భూమే నివాసం. అన్నింటికి ఆశ్రయమిచ్చే ఈ పృధివి దేవత మనం తినే ఆహార పదార్ధాలు - ధాన్యాలు,పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, సుగంధంతో పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఇవన్నీ భూమి ద్వారా లభ్యమవుతాయి. ఇవేకాక విలువైన ఖనిజాలు,లోహాలు, సువర్ణము, రత్నాలు, వజ్రాలు మొదలైన విశేషమైన ధాతువులు మనకు భూమి నుండే లభిస్తాయి.


జలదేవత:-- మన జీవనానికి నీరు చాలా అవసరం. నీరు లేకుంటే సమస్త ప్రాణులు నిర్జీవంగా ఉంటాయి. నీరు లేకపోతే వృక్షసంపద క్షీణించిపోతుంది. ఎన్నో ప్రాణులు నీటిలోనే నివసిస్తాయి.అందుకే జలం దేవత. 


 వాయుదేవత:-- గాలి లేనిదే సృష్టిలో ఏ ప్రాణి కొన్ని నిమిషాల కంటే ఎక్కువకాలం జీవించలేదు. మనం  తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జఠరాగ్నికి వాయువు తోడ్పడుతుంది.మన రక్తం శుద్ధి కావాలంటే ప్రాణవాయువు కావాలి. ఈ విశ్వమంతా వివిధరకాల వాయువుతో నిండి వుంది. కేవలం వాయువులో నివసించే ప్రాణులు కూడా కొన్ని ఉన్నాయి. కనుక వాయువు దేవత.


అగ్నిదేవత:-- మన నిత్య జీవితంలో అగ్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారపదార్ధాలు తయారుచేయడానికి, చలినుండి ఉపశమనం పొందడానికి, అగ్ని తోడ్పడుతుంది. "అగ్ని సమస్త దేవతలకు ముఖం- నోరు వంటిది. అగ్నిలో వేసిన పదార్ధాలు సూక్ష్మమై గాలిలో కలసి సమస్తప్రాణులకు ఆరోగ్యాన్ని, సుఖశాంతులను కలిగిస్తాయి.భూమ్యాది పంచ భూతాల వలన, సూర్యాది గోళాల వలన మానవులకు అన్న వస్త్రాలు, ప్రకాశం, వేడి మొదలైన జీవన ఉపయుక్త పదార్ధాలు లభిస్తాయి. అందుకే అవి దేవతలు. ఈ దివ్య పధార్ధాలను  ఉపయోగించుకొని, వాడుకొని వాటిని మరల అగ్నిలో పవిత్రం చేయాల్సిన బాధ్యత మానవులకే ఉంది.అగ్నిలో నేయి, ఓషదులు ఆహుతిగా ఇవ్వడం వలన అపవిత్రమైన వాయు,జలాదులు పరిశుద్ధమై పుష్టికారకమవుతాయి.


ఆకాశదేవత:-- అంటే అవకాశం కల్పించేది. మనం చూసే ఖాళీ ప్రదేశం. దాని ద్వారానే శబ్ద తరంగాలు,ఒకరి నుండి మరొకరికి చేరుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేవీ లేకపోతే ప్రాణులేవీ జీవించలేవు. అంతరిక్షంలోని గ్రహాలకు గ్రహాలకు మధ్య, గ్రహాలకు ఉపగ్రహాలకు మధ్య, నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్య ప్రదేశం ఆకాశం. మానవులు ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాలు 'శాటిలైట్స్ ' అన్నీ అంతరిక్షంలోనే తిరుగుతూ భూమి మీద ఉన్న వార్తలను చిత్రాలను ఒకచోటి నుండి మరొక చోటికి అందిస్తున్నాయి. ఆకాశం లేకపోతే ఇది సాధ్యం కాదు. కనుక ఇది దేవత.


బహుశా అందుకేనేమో ... మన పూజా పద్ధతిలో- గంధంతో అర్చించుట, నామోచ్చరణతో పువ్వులను అర్పించుట, ధూప దీపారాధనలతో ఆరాదించుట, నైవేద్యం సమర్పించుట అనే పంచోపచారాలు ప్రధానమైనవిగా పేర్కొంటారు, ఈ ఐదు ఉపచారములలో పంచభూతములు ప్రతిబింబిస్తున్నాయి. పసుపు కుంకుమాది గంధాలు భూమికి, నామమంత్రోచ్చరణలతో పుష్పాలు ఆకాశానికి, ధూపం వాయువుకు, దీపం అగ్నికి, తీర్ధ నైవేద్యాలు నీటికి సంకేతకాలు. ఇట్లా పంచభూతాలను భగవత్ స్వరూపములుగా గుర్తించి ఆరాదించే పద్ధతిని పెద్దలు ప్రవేశపెట్టారనుకుంటాను .

...........


మానవ జీవితంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనుషుల మధ్య సంబంధాలు... వీటిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో మంచి తక్కువ పాళ్ళలో, చెడు ఎక్కువ పాళ్ళలో ఉంటే... ఎక్కడో ఏదో అవరోధం ఉందని అర్థం చేసుకోవాలి. కొందరు జీవితాన్ని సుఖప్రదంగా గడుపుతూ ఉంటే... అది చూసి ‘మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు?’ అనిపిస్తుంది. నిజంగా వారేదో శక్తిని వినియోగించడం వల్లే... వారికి అంతా మంచి జరుగుతోందనేది అపోహ కాదు.

ఆనందాన్ని పొందడానికి వారు ‘ప్రేమ’ అనే శక్తిని వినియోగిస్తూ ఉండొచ్చు. ఆ ప్రేమ శక్తితో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. పూర్వకాలానికి చెందిన ఎందరో ధర్మ గురువులు, మహనీయులు, దార్శనికులు...  ప్రతి ధర్మంలోను ప్రేమకు సముచితమైన స్థానం ఇచ్చారు. తమ తమ యుగ ధర్మాలను అనుసరించి, తాము జీవించిన కాలంలోని మానవుల స్వభావాలను, సంస్కారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఆ సందేశాలు ఇచ్చారనేది నిజం.

వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే... ప్రేమ అన్నిటినీ మించిన పరమశక్తి. అది ప్రేమ సాగరుడైన పరమాత్మ తాలూకు పవిత్ర శక్తి. మనం ప్రేమను పంచినప్పుడు... ఆ పరంధామంలో ఉన్న భగవంతుడి ప్రేమను వినియోగించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ‘ప్రేమ’ అంటే మన పరివారాన్నీ, స్నేహితులనూ, ప్రియమైన వస్తువులనూ ఇష్టపడడం కాదు. మన జీవితంలో ఎదురయ్యే శక్తులు ఏవైనా అవి ప్రేమ నుంచి ఉద్భవించినవేనని గ్రహించాలి. మనల్ని ప్రభావితం చేసే ఈ శక్తి మనలోనే... మన ఆత్మలోనే ఉంది. 

మరి అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి కదా! కానీ మీరు కోరుకుంటున్నవి మీ దగ్గర ఎందుకు లేవు? మీరు అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నారు? సుఖ సంతోషాలు ఎందుకు లేవు?

మానవ హృదయంలోని ప్రేమ శక్తి వల్లే ప్రకృతి పులకిస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణలతో సృష్టి సుసంపన్నమైన ప్రగతిపథాన నడుస్తుంది. . సృష్టి నలువైపులా పరిశీలిస్తే... మనిషి తయారు చేసిన వస్తువులే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కనిపించని ప్రేమ శక్తితోనే సాధ్యమయ్యాయి. ‘‘ఒకవేళ మన నుంచి ప్రేమను తొలగించుకుంటే... ఈ భూమి శ్మశానం అవుతుంది’ అని రాబర్ట్‌ బ్రౌనింగ్‌ అనే కవి అన్నారు. మానవుల్లో శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమే ఈ లోకానికి ఆలంబన.

ప్రేమ శక్తే మనల్ని నడిపిస్తుంది. చెడ్డ విషయాల వల్ల, సమస్యల వల్ల మనలో ప్రేమ లోపిస్తుంది. చాలామందికి ప్రేమ అంటే ఏమిటనే దానిపై అర్థవంతమైన అవగాహన లేదు. ఎందుకంటే... ప్రేమ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది మాత్రమే కాదు, గుర్తించలేనిది కూడా. కంటికి కనిపించని ఈ మహిమాన్విత శక్తిని  గుర్తించాలంటే... మొదట జ్ఞానసాగరుడైన పరమాత్మను గుర్తించాలి. ప్రేమమయమైన ఆయన సృష్టిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమను అర్థం చేసుకోగలం. ఆయన సృష్టించిన ఈ జీవన రంగస్థలంలో పరమానందంతో అభినయిస్తూ జీవించగలం.

.......


*సత్సాంగత్వ ఫలం*


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టు కొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుప కాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగ దీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంత అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మల నుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి.


ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చి తంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్త కాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయ లేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తి ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడు తుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి. ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహా స్వామి వారు ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థ మైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. 'నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవ రకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టు కుంటాను' అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగు తుంది.


అంతేతప్ప తనకోసం బతికే వాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించే వాడూ, పదిమందికి ఆదర్శం కాని వాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు. ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభ విస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ. వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే..హనుమంతుడికి దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం.

........

*పంచతంత్రం*

అయిదును అదృష్టసంఖ్యగా చెబుతారు. సంఖ్యాశాస్త్ర నిపుణులు. 14, 23 తేదీలూ అంతే. వాటిని కూడినా అయిదే అవుతుంది. కాబట్టి ఆ తేదీల్లో జన్మించినవారు భాగ్యవంతులని అంటారు. చాలామంది ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు. తమ పేర్లకు మరికొన్ని ఆంగ్ల అక్షరాలను జోడిస్తూ ఏవేవో మార్పులు చేస్తుంటారు.


అదృష్ట సంఖ్య ఆవునో కాదో గానీ, మనిషి జీవితంలో అయిదును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అయిదుకు అయిదు కలిపితే (10) అది బాల్యం. అయిదును అయిదుతో గుణిస్తే (25) అది యౌవనం అయిదు సరసన అయిదు చేరిస్తే (55) ఆది వృద్ధాప్యానికి వీధి గడప, మనిషికి బాల్య, యౌవన దశల్లో ఇంద్రియాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఇంద్రియ చాపల్యం ప్రభావశీలంగా ఉంటుంది. కాబట్టి అయిదు సంఖ్యను మనిషి జీవితంలోని ముఖ్య దశలకు ప్రతిబింబంగా భావించవచ్చు.


దేన్ని చూడకూడదో- దాన్ని చూడటం వల్ల, దీన్ని వినకూడదో- దాన్ని వినడం వల్ల, ఏది తినకూడదో- దాన్ని తినడం వల్ల, ఏది అనకూడదో దాన్ని అనడం వల్ల దీన్ని తాకకూడదో- దాన్ని తాకడం వల్ల, ఏ వాసనలకు దూరంగా ఉండాలో మనిషికి తెలి యక పోవడం వల్ల... అంటే కన్ను చెవి నాలుక నాసిక చర్మం అనే అయిదు ఇంద్రి యాల ద్వారా హానికరమైనవి ఎన్నో లోపలికి ప్రవేశించి, మనసును దారిమళ్ళిస్తూ ఉంటాయి. పంచేంద్రియాల కారణంగా మనసు తరచూ కలుషితం అవుతుంది.


అయిదక్షరాలు మహా మంత్రం సమళ్ళి వాయ! ఇది పంచాక్షరిగా ప్రసిద్ధికెక్కింది. ఇంద్రియ కాలుష్యానికి సరైన విరుగు డుగా మన పెద్దలు పంచాక్షరిని ప్రతిపా దించారు. ఆ శబ్ద జ్యోతిని నోటి చివర వెలిగిస్తే అది దేహళీ దత్త దీపమై.... అంటే వీధి గడప మీద దీపంలా మనిషి లోపలి, బయటి కాలుష్య చీకట్లను దూరం చేస్తుందని తీర్మానించారు.


మనసులోంచి పుట్టినవాడు కాబట్టి మదనుడికి మనసిజుడు అన్ని చేతోజా తుడని పేర్లు మన్మథుడి ఆయుధాలు. అయిదే! అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం... అనే అయిదు బాణాలు ఉన్నాయి కనుక మదనుడిని పంచశరుడు అన్నారు


పంచబాణుడైన మన్మధుడు సంచేంద్రియాలతో ప్రభావితమైన మనసుకు ప్రతీక, ఆ మన్మథుడిని పరమశివుడు భస్మం చేశాడని పురాణాలు చెప్పాయి. మన్మదుడిని మసిచేయడం అంటే మనసును దగ్ధం చేయడమే. లేదా ఇంద్రియ కాలుష్యాన్ని సమూలంగా నిర్మూలించడమే. అందుకే పంచాక్షరిని అనుక్షణం జపిస్తూ ఉండమని పెద్దలు చెప్పేది!

ఇంద్రియాలను జయించిన వారికి ఈశ్వరుడి చైతన్యంతో అనుసంధానం కుదు రుతుంది. దాన్ని యోగం అన్నారు. యోగం అనే మాటకు కలయిక, చేరిక అని అర్ధం. పరమేశ్వర విభూతితో ప్రత్యక్ష సంయోగాన్ని సిద్ధింపజేస్తుంది కాబట్టే శివపంచాక్షరిని రమణ మహర్షి 'యోగ' పంచాక్షరి'గా సూత్రీకరించారు. 'అరుణాచల' అనేది జ్ఞానపంచాక్షరీ' అన్నారాయన.

శివుడు పంచముఖుడని వేదం చెప్పింది. తత్పురుష అఘోర సద్యోజాత వామ దేవ ఈశాన... అనేవి ఆ అయిదు ముఖాల పేర్లు. సృష్టి స్థితి లయ తిరోగమనం (మరుగు పరచడం) అనుగ్రహం... అనే అయిదు రూపాల్లో శివతత్త్వం! విశ్వమంతటా విస్తరిస్తుందని పురాణ వచనం. ఈ అయిదింటినీ కృత్యశక్తులు అంటారు. కృత్య శక్తుల నుంచి పంచభూతాలు, వాటి నుంచి పంచతన్మాత్రలు ఆవిర్భవించాయని ఆర్యోక్తి పంచ శబ్దానికి అసలైన అర్థం 'విస్తరించు అని సృష్టి అంతటా విస్తరించిన శివతత్త్వాన్ని పంచామృతాలతో అభిషేకిస్తూ, అయిదంకె తన విశేష అర్ధాన్ని సార్ధకం చేసుకుంది.

- ఎర్రాప్రగడ రామకృష్ణ

చెడునుచూసి మంచి నేర్చుకో 🙏

ఒక  ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర  అనేకమంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటూ ఉండేవారు.

 ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది... ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. 

దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి ఫిర్యాదు చేశారు.. అయితే విషయం అంతా విన్న గురువు గారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. 

అలా కొన్నాళ్ళు గడిచాయి.మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. 

ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు. 

అప్పుడు గురువు గారు శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.

ఇంకా..... ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికి గానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమం లోకి తీసుకోరు, విద్య నేర్పించరు.అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ...

*అంతేగాకుండా... తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 

దొంగతనం చేసిన శిష్యుడుకి  గురువు గారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి.. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపం తో గురువు ముందు మోకరిల్లాడు.

జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. 

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు.

మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట సరిగా వినలేదని బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం. తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి బుద్ధి రాదు., ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసిన వాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.


వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి మొదలైనవారు. 


తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా  పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ... దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.


మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు.  మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.

అందుకే గురుకులం లోని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు.. అందుకు మంచి ఉదాహరణ పరమానందయ్య శిష్యులు.

మన శరీరంలో కూడా కొన్ని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా గోర్లు, వాటిని పెంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు... కాబట్టి వాటిని కత్తెరిస్తు వుంటాం. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి..అంతేకానీ జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంత పెద్ద శిక్షలు మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని ఎప్పుడు వెయ్యకూడదు.

ఆలోచించాలి.. ఆచరించాలి.. నేర్పించాలి.. అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం, కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారు గాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.

అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి... బోయవాడు వాల్మీకి గా మారినట్లు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచె గొప్ప మలుపు వున్న రోజును తీసుకోని వస్తుందని ఎదురు చూద్దాం.

****

ప్రపంచంలో ధనానికి ప్రాధాన్యం ఎక్కువ. కానీ సంపాదించిన ఆ ధనం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. అజగర మునితో ప్రహ్లాదుని సంభాషణ సందర్భంగా ధన ప్రసక్తి వస్తుంది. అప్పుడు వేదవ్యాస భగవానుడు చెప్పించిన ఈ మాటలు.. అందరూ తెలుసుకోవాల్సిన అపురూపమైన విషయాలు. ‘‘రాజుల వల్ల, చోరుల వల్ల, శత్రువుల వల్ల, తనవారి వల్ల, పక్షుల వల్ల, కాలము వల్ల.. చివరికి తన వల్ల తనకు కూడా ఽధనవంతులకు నిత్యం భయం ఉంటుంది.’’ అని దీని అర్థం. 

‘‘ధనమూలమిదం జగత్‌’’ ..అన్న భారతీయ ధర్మమే ‘‘దిగర్థందుఃఖభాజనం’’ అని కూడా అన్నది. అంటు ధనమే అన్ని దుఃఖాలకూ కారణమని అర్థం. ధన సంపాదనలో ఎంత కష్టమున్నదో దానికి మించిన కష్టం దాన్ని కాపాడుకోవడంలో ఉందన్న విషయంపై శ్లోకం తెలుపుతున్నది. బాగా డబ్బు సంపాదించేవారిపై పాలకుల దృష్టి ఉంటుంది. దీంతో వారివల్ల చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అతిగా సంపాదించాలన్న దురాశ మనిషిని వక్రమార్గం పట్టిస్తుంది.


అదెప్పటికైనా ప్రమాదమే. అదే విధంగా తాను దాచిన  సొమ్ము దొంగల పాలు కావచ్చు. ధనం ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది. ఇలా ఏ విధంగానైనా ధనం వల్ల ప్రమాదాలే ఎక్కువ. అయితే అక్రమ మార్గంలో, అన్యాయంగా సంపాదించి సుఖాలను అనుభవించాలనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ధర్మ మార్గంలో అవసరానికి తగిన రీతిలో చేసే ధన సంపాదన అసలైన ఆనందాన్నిస్తుంది. అందుకని పండితులైనవారు, ధర్మమార్గ ప్రవర్తకులైన వారు, దీనిపై మమకారాన్ని విడిచిపెడతారు. ధనం ఉన్నవారికి అంతులేని బాధలు ఉంటాయన్న జ్ఞానాన్ని ఇలా శ్రీమద్భాగవతం సప్తమస్కంధంలోని త్రయోదశాధ్యాయంలోని అజగరముని ప్రహ్లాద సంవాదం విపులంగా వివరించింది. మనసు, మమత, బంధం, అనుబంధం, రక్తసంబంధం. ఇలా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా.. ఈ కాలంలో మనుషుల్ని నడిపించేవి మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే ఎవరైనా మనల్ని ఖాతరు చేసేది. ఒక గొప్ప కవి ఇలా రాసాడు ఆనందించండి చదువుతూ 

రైలు బండిని నడిపేది పచ్చజెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటెలే 

తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు ఫెళ ఫెళ లాడే నోటు పెంచును వెయిట్

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు

క్యాష్ యే ఉంటె ఫేసుకు  విలువవస్తుంది నోటే ఉంటె మాటకు బలమోస్తుంది బైకు ఉంటె అమ్మాయి బీట్-ఏ వేస్తుంది

నీకు సైకిల్ ఉంటె ఆ పిల్లే సైడై పోతుంది 

యే బాషా తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది

ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది

డాలర్లైనా రష్యన్ రూబ్లెలైనా డబ్బుంటేనే మనిషికి కాన పీన

చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో 

ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టెమ్మో

అరే భోల్ మేరే భాయ్ ఈ నోటు కీ జై

****

సాక్షి ఎడిటోరియల్

రైటింగ్‌ టేబుల్‌

మగవాడు రాసేప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్‌ కట్‌ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. 

మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్‌ ఉంటుంది. అది డైనింగ్‌ టేబుల్‌. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్‌. వర్జీనియా ఊల్ఫ్‌ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి.

ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి. ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతి ఉపాధ్యాయ్‌ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్‌డౌన్‌ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్‌ ధిర్‌ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివాని సిబాల్‌ అనే మరో రచయిత్రి.

స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం. జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కాని వారు విద్యకు, కలం పట్టి రాయడానికి శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్‌. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబం ఉంటుంది. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్‌షిప్‌ ప్రభావం అది.

పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్‌). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్‌మేన్‌లను  వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ఉంటుంది. కాని స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీuЇ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా. 

‘నేను చెన్నై కన్నెమర లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కాని వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి.’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో. ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం.

వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవును, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలను స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే. స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్థిల్లాలి.

****

ఇది ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందులో మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘సర్వదా నారాయణ స్మరణం, విశ్వాన్ని విస్మరించడం.. ప్రహ్లాదుడి నిత్యకృత్యాలు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, కబుర్లు చెప్తూ, నవ్వుతూ, నిదురిస్తూ, ఊళ్లో తిరుగుతూ, అటూ ఇటూ చూస్తూ, ఏ పనులు చేస్తున్నప్పటికీ నారాయణుని పాద పద్మ యుగళం పైనే ఎప్పటికీ తన చింత నిలిపి, ఆ చింత అనే అమృత ఆస్వాదనలోనే ఈ విశ్వాన్నంతా మరిచిపోయాడు’ అని పై పద్యభావం. ఇందులో చివరి మాట ముఖ్యం. విశ్వాన్ని మరిచిపోవడం ఏమిటి? అంటే ఇక్కడొక విశ్వం ఉన్నది. ఆ విశ్వంలో తానున్నాననే ధ్యాసను ప్రహ్లాదుడు మరిచిపోయాడన్నమాట.

మామూలుగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. కొన్ని మరచిపోవలసినవి కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం ఎంత అవసరమో, మరచిపోవడం కూడా అంతే అవసరం. కానీ, మనకు నియంత్రణ లేని కారణంగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని, ఏదీ మరచిపోవద్దని అనుకోవడం సహజం. మరచిపోదగినవి ఎన్నో ఉన్నాయి. గుర్తుపెట్టుకోదగినవీ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి. అంటే, మతిమరుపును మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ప్రహ్లాదుడు వినియోగించుకున్నాడు. ఏదంటే అది మరచిపోగలిగిన వాడు, ఏదంటే అది గుర్తుపెట్టుకోగలిగినవాడు, ఆ నియంత్రణ కలిగినవాడు కాబట్టి ప్రహ్లాదుడి

మతిమరుపు పనికొచ్చేది. ప్రహ్లాదుడు విశ్వాన్ని విస్మరించి, విశ్వవిఖ్యాతుడయ్యాడు. మనం విశ్వాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటున్నాం. అది తప్ప మనకు మరో ధ్యాస లేదు. అయినా ప్రహ్లాదుడి ప్రసిద్ధి మనకు రావడం లేదు. అందుకే ఆయనది పనికొచ్చే మతిమరుపు. ఇందులోని మర్మం ఏమంటే, ప్రహ్లాదుడు నారాయణుడిని గుర్తుపెట్టుకున్నాడు. లోకాన్నంతా మరిచిపోయాడు. ఒక్క శ్రీహరిని గుర్తుపెట్టుకుంటే చాలు, విశ్వాన్నంతా మరిచిపోయినా చింతించే పనిలేదని స్పష్టమవుతున్నది. మరొక విశేషమేమంటే, ప్రహ్లాదుడికి మతిమరుపు వచ్చింది అనలేదు కవి. అలా పేర్కొని ఉంటే ప్రహ్లాదుడు ఒకడున్నాడు, అతనికి మతిమరుపు ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ మతిమరుపునకు ప్రహ్లాదుడు కర్త కాదు. కానీ, ‘ప్రహ్లాదుడు మరిచిపోయాడు’ అన్నాడు పోతన. అంటే అతను బుద్ధి పూర్వకంగా మరిచిపోయాడని అర్థం చేసుకోవాలి. అతను ఏది మరిచిపోవాలంటే దాన్ని మరిచిపోగలడు. గుర్తుంచుకోవాలనుకున్న దానిని గుర్తుపెట్టుకోగలడని అర్థం.

‘ఇందులో గొప్ప ఏమిటి?’ అన్న అనుమానం రావచ్చు. మనకు ఆ నియంత్రణ లేకపోవడం వల్ల గత జీవితంలోని విషాద సన్నివేశం తటాలున స్మృతిపథంలో మెదిలి మనలను నిర్వీర్యులను చేస్తున్నది. అందుకే చాలామంది అలాంటి వాటిని మరిచిపోవడానికి రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారుతుంటారు. పైగా, బాధను మరిచిపోవడానికి వ్యసనాల దారి పట్టానని గొప్పగా చెప్పుకొంటారు. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు.

మొత్తానికి పరిశీలిస్తే ఏవి మరిచిపోవాలి, వేటిని గుర్తుంచుకోవాలనే అంశాలు ఒక పట్టిక తయారుచేసుకొని సాధన చేసే వ్యవస్థ ఒకప్పుడు ఉండేదేమో! ప్రహ్లాదుడు మరిచిపోదగిన వాటిని ఒక పట్టికగా రాసుకుంటే అందులో ‘విశ్వం’ అనేది ఉండి ఉంటుందన్నది నిర్వివాదం. యథార్థానికి లోకాన్ని మరిచిపోవడం కుదిరేది కాదు. కానీ, లోకేశ్వరుడిని నిరంతరం గుర్తుపెట్టుకోగలిగినవాడికి మాత్రం అది సాధ్యమే. అప్పుడు లోకాన్ని విస్మరించడం వల్ల ఏ నష్టమూ ఉండదు. పైగా అన్ని ప్రాణాపాయ పరిస్థితులలో రక్షణతో కూడిన ప్రయోజనమే కలుగుతుందని ప్రహ్లాద చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు.

***

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు అలా ఒక రోజు  తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. 

ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. 

హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలినుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.

అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.

తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు. 

కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలునిదగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు. 

“ఎవరు నువ్వు? ఈ వాన,చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు?” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువుననుసరించాడు.

గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు. 

గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు. 

ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.

కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి. 

అసలు కారణం     వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? 

తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? 

ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.

ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు. 

ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి. 

అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు. 

ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలోనుండి అనంతుడిని గమనించసాగాడు. 

ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు. కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు. 

అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు. 

వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.

అనంతుడు మందిరం మధ్యలో వున్న 

శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..

"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు..

నాకు చదువురాదు.. పూజలు రావు..

స్తోత్రాలు రావు.... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నున్ని చేసుకోవాలని వచ్చాను.    రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి 

నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో..

"కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి...

"మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.

"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు. 

బయటనుండి ఈ దృశ్యం చూసి…                 శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. 

తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 

కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భాగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...


No comments:

Post a Comment