ఎన్ని వైపుల నుంచి ఎన్ని నదీజలాలు సముద్రంలోకి ప్రవహించినా విశాల సముద్రం అలజడికి లోను కాదు. అదేవిధంగా అన్నిరకాల ప్రాపంచిక సుఖభోగాలు స్థితప్రజ్ఞుడిలో ప్రవేశించినా ఎలాంటి వికారాన్ని అతడు పొందలేడు. పైగా అవన్నీ అతనిలో లీనమైపోతాయి. అటువంటి వాడే శాంతిని పొందుతాడు. భోగలాలసుడు కాడు’ అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన బోధను అనుసరించి స్థిరచిత్తం కలిగిన స్థితప్రజ్ఞుడిని ఏ కోరికలు చలింపజేయవన్న సత్యం బోధపడుతుంది. సంయమనమే శాంతిని ప్రసాదించే మార్గం. కాబట్టి ఎవరైనా శాంతిని కోరుకున్న వ్యక్తి విధిగా సంయమనాన్ని సాధించాలన్నది భగవదాశయం. ఇది మన జీవితాలకు ఒక పరిపూర్ణతను ఇస్తుందన్నది కాదనరాని సత్యం.
ఆత్మజ్ఞానం సంయమనాన్ని సులభతరం చేస్తుంది. తనను తాను నియంత్రించుకొని, ఇంద్రియాల ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మోద్ధరణ చేసుకున్న వ్యక్తిలో సంయమన గుణం వృద్ధి చెంది అతడొక స్థితప్రజ్ఞత కల సంయమిగా వెలుగగలడు. అందుకే స్వామి సంయమిని సముద్రంతో పోల్చాడు. ఎన్ని నదులు తనను చేరినా సముద్రం హద్దు మీరదు. అది గంభీర వారాశిగానే మిగులుతుంది. దాని లోతు అంత సులభంగా తెలుసుకోలేం. సంయమి గుండె లోతులను కూడా గ్రహించడం సులభమేమీ కాదు. ఏ కోరికలు తనను లొంగదీసుకోలేవు. విషయ వాంఛలేవీ అతనిని బంధించలేవు. అతని హృదయం జ్ఞాన మార్గంలోనే పయనిస్తుంది తప్ప మరొక దారిలోకి మళ్లిపోదు. ఈ సత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు.. అర్జునుడికి వివరించిన తీరు అసదృశం.
ఈ బోధనలను బట్టే జ్ఞాని అయినవాడు సముద్రపు వలె ఎటువంటి చలనం లేక స్థిరంగా నిలుస్తాడు. అజ్ఞాని సముద్రం అలల వంటివాడు. ఎగిసి ఎగిసి పడుతుంటాడు. చలనచిత్తుడై ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన సముద్రం పోలిక విశిష్టమైనది. సాగరాన్ని సమీపించే నదీజలాలు వివిధ వర్ణభేదాలతో, రుచి భేదాలతో ఉంటాయి. వర్షం వల్ల ఏర్పడే వాగులు, వంకల వంటి వాటి లక్షణాలు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండే ఒకేఒక సమాన గుణం ప్రవాహశీలత. సముద్రుడు తానుసైతం ప్రవాహశీలత కలిగినవాడు, తనలోను జలతత్వమే ఉంది కనుక, వాటన్నిటినీ స్వీకరించి, ఏ మాత్రం పొంగిపోకుండా స్థిరచిత్తుడై గంభీరంగా ఉంటాడు. వ్యక్తిలో కోరికలు పరుగులెత్తినా వాటన్నింటినీ అధిగమించి వాటిని తనలో కలుపుకొని స్థిరచిత్తుడిగా నిలబడి ఉన్నప్పుడే అతడు స్థితప్రజ్ఞుడై శాంతిని పొందగలడు. అంటే స్థితప్రజ్ఞుడు సాగర సదృశుడు కావాలి. అనేక భోగభాగ్యాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ, వాటియందు మాత్రమే తన మనసును నిలపరాదు. నిమిత్త మాత్రుడిగానే వాటిని అనుభవించాలన్నది భగవద్గీత బోధించే శాశ్వత తత్వం.
ఇన్ని ప్రవాహాలు తనలో కలవడం వల్ల సాగరానికి ఎంత పూర్ణత్వం ఒనగూడినా, దాని గొప్పదనానికి మాత్రం స్థిరత్వమే ప్రధాన హేతువు. మానవుడికి ఎన్ని కోరికలున్నా వాటికి కట్టుబడక, అవే జీవిత పరమార్థాలుగా భావించక జీవించేవాడే సాగర సదృశచిత్తుడు. అతడే సాటిలేని స్థితప్రజ్ఞుడు. ఆనందాలు ప్రవాహాలై తనను చేరవచ్చు. అయినా తానుమాత్రం అశాశ్వతమైన ఈ ఆనందాలకు లొంగకుండా పూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలగాలి. ఒక మహాసాగరం వలె అన్నింటినీ తనలో కలుపుకొని గంభీరంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమై కర్తవ్య నిర్వహణలో లక్ష్యం చేరుకోగలిగే ఉత్తమ సాధకుడై నిలబడతాడు. అపురూపమైన శాంతిని అందుకోగలుగుతాడు. ఇది శాశ్వత సత్యం.
***
*ఆ కాలం ఏమి నేర్పింది??*
పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం*
నేర్పింది.
*వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,
*శోధించే తత్వం* నేర్పింది.
*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
*అన్వేషణ* నేర్పింది.
*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,
*జీవితం* పూలపాన్పు కాదని నేర్పింది.
*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం *చిట్కాలు* నేర్పింది.
చెట్టుమీద మామిడికాయ
గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని *ఛేదించడం* నేర్పింది.
*నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు..
*బాధ్యత* అని నేర్పింది.
*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా *బరువు* లాగటం నేర్పింది.
*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* గుణం నేర్పింది.
*విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తి నే *ఒద్దికను*
నేర్పింది.
ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో
స్నేహితులతో*పంచుకోవటం* నేర్పింది.
ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును*
నేర్పింది.
దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* నేర్పింది.
*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,
ఊరు ఊరంతా ఒక కుటుంబమనే *ఆత్మీయత* నేర్పింది.
ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన మన బాల్యానికి జీవితాంతం రుణపడి ఉందాం.
🙏🙏🙏🙏🙏🙏
జీవితంలో దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, అపజయాలు కలుగుతున్నప్పుడు అంతా చీకట్లు ఆవరించినట్లుగా అనిపిస్తుంది. చీకటిలో దారీతెన్ను తెలియదు. ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞానాదులతో కూడి స్వధామానికి వెళ్లిపోయాడని చెబుతుంది భాగవతం. జగత్తులో ధర్మం కొరవడినప్పుడు అంతటా చీకట్లు మూగినట్లే కదా! అలాంటి ధర్మరహిత స్థానంలో మానవుడు నిశ్చయంగా దుఃఖాలను, కష్టాలను అనుభవించ వలసి వస్తుంది.
కలియుగంలో అజ్ఞానాంధకారంతో దృష్టి కోల్పోయిన మానవులకు వెలుగు చూపడానికే శ్రీమద్భాగవతం ఉదయించింది. చీకటిని తొలగించేది కాబట్టి ‘భాగవతం పురాణార్కాయ’అని భాగవతాన్ని పురాణ భాస్కరుడిగా అభివర్ణించారు.
సమస్త వేద వాఙ్మయ రచయిత శ్రీల వ్యాసదేవుడే అయినా ఆ రచనలు ఆయనకే శాంతిని కలిగించలేకపోయాయి. తర్వాత తమ గురుదేవుడైన నారదముని ఆదేశంతో వ్యాసదేవుడు భాగవత రచన చేసి పరమశాంతిని పొందాడు. రచయితకే పరమానందం కలిగించిన భాగవతం మానవులందరికీ జీవితాలలో వెలుగులు నింపే పురాణ సూర్యుడు. మానవులకు దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? త్రివిధ తాపాలు ఎలా కలుగుతున్నాయి? వాటిని తొలగించుకోవడం ఎలా? పాపాలను పూర్తిగా శమింపజేసుకోవడం ఎలా? అనే విషయాలు తెలియకపోతే మనం చీకటిలో ఉన్నట్లే అవుతుంది. చీకటిలో ఉన్న మనకు చుట్టూ ఉన్న వస్తువులు కనిపించవు, ఎటువైపు వెళ్లాలో తెలియదు. ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలియదు. అందుకే చీకటి జీవితం అంతులేని భయాన్ని కలిగిస్తుంది. కానీ, భాగవత భాస్కరుడు శీఘ్రమే వెలుగులు ప్రసరించి దుఃఖాలను నశింపజేస్తాడు, సుఖాలను అందజేస్తాడు. అందుకే భాగవతాన్ని నిత్యం వినాలని, అధ్యయనం చేయాలని పెద్దలు చెప్పారు.
భాగవతం మానవులకు అందిస్తున్న ప్రత్యేక సందేశం ‘తపోమయ జీవనం’. జీవితంలో తపస్సు అనివార్యమైనది. మనిషి తపస్సు ద్వారా సమస్త దుఃఖాలను నశింపజేసుకుంటాడు. దుఃఖాలు కలగడానికి కారణం పాపాలు పేరుకొనిపోవడమే! తపస్సు ద్వారా పాపశమనం కలుగుతుంది. పాపాలు తొలగగానే దుఃఖాలు నశించిపోతాయి. ఇదే భాగవతం కురిపించే, తెలియజేసే దివ్యమైన వెలుగు! సృష్టికార్యం కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, శ్రీకృష్ణుడినే పుత్రుడిగా పొందడానికి దేవకీవసుదేవులు తపస్సు చేశారు, ప్రజాసృష్టి చేయగలిగే శక్తి కొరకు దక్షప్రజాపతి తపస్సు చేశాడు. ఈ విధంగా భాగవతంలో అనేకమైన సందర్భాలు, సంఘటనలు తపోమహిమను మానవులకు తెలియజేస్తున్నాయి.
భక్త ధ్రువుడు తన పుణ్యపరిపాకాన్ని భోగాలను అనుభవించడం ద్వారా, పాపాలను తపస్సు ద్వారా పరిహరించుకున్నాడని భాగవతం స్పష్టంగా పలికింది. సుఖాలు కలుగుతున్నాయంటే పుణ్యం తరిగిపోతున్నదని అర్థం. దుఃఖాలు కలుగుతున్నాయంటే, కష్టాలు ఎదురవుతున్నాయంటే పాపం పండుతున్నదని సూచన. అందుకే భాగవత సందేశం ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒక తపస్సులో నెలకొనాలి. మనిషి మూడు రకాల తపస్సులు చేయాలి. అవి.. వాచిక తపస్సు, శారీరిక తపస్సు, మానసిక తపస్సు. మనిషికి అనారోగ్యం కలిగినప్పుడు వైద్యంలో లంఖణాలు చేయవలసివస్తుంది. ఆహారం తినలేకపోవడం రోగికి దుఃఖకరంగా అనిపిస్తుంది. కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారానికి, పక్షానికి ఒకరోజు ఉపవాసం చేస్తే అనారోగ్యం దరి చేరదు. ఉపవాసం చేయడం అంటే శారీరిక తపస్సేగా! అంతేకాదు, తపస్సు ద్వారా తపోశక్తి పెరిగి విజయాలు చేకూరుతాయి, ఫలితంగా సుఖప్రాప్తి కలుగుతుంది. ఈ విధమైన దివ్యసందేశాలతో జీవితంలో చీకట్లు తొలగించి వెలుగులు నింపేది కనుకనే భాగవతాన్ని పురాణ సూర్యుడిగా అభివర్ణించారు. నిత్యం భాగవత సేవ ద్వారా మానవులందరు సుఖశాంతులతో జీవించి కృష్ణప్రేమను పొందెదరు గాక!
*****సాంసారిక దుఃశ్చింత వల్ల కలిగే హాని*
భగవంతుడు కల్పతరువు లాంటి వాడు - మనం ఏమి కోరినా భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి పారమార్థిక సాధనలతో మనసును పరిశుద్ధం చేసుకొని సాధకుడు ఐహిక వాంఛలన్నింటిని విసర్జించటానికై జాగరుకుడు కావాలి. ఈ విషయంగా ఒక కథ చెప్తాను, వినండి: ఒక బాటసారి ప్రయాణం చేస్తూ, దారిలో ఒక మైదానాన్ని చేరుకొన్నాడు. అతడు బైట ఎండలో నడ్చినందున, అలసి ముచ్చెమటలు పట్టగ కాస్సేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంచెం సేపయ్యాక అక్కడ నిద్రపోవటానికి తన కొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో, ఆ విషయం అతగాడు ఎరుగనే ఎరుగడు. అతడి ఊహలో కోరిక మెదలాగానేఅతడి పక్కన ఒక చక్కని పానుపు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దాని మీద పడుకున్నాడు. ఆ తరువాత ఒక సుందరాంగి వచ్చి సుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకొన్నాడు. ఈ తలపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతూండటం కనుగొని బాటసారి పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది . ఇప్పుడు అతడిలా ఊహించాడు: "నేను కోరిందంతా సంప్రాప్తమైంది. నా కిక ఏదైనా ఆహరం లభించకపోతుందా?” మరుక్షణంలోనే అతడి ముందు రక రకాలైన రుచికర పదార్థాలు వడ్డించబడ్డాయి. వెంటనే వాటిని ఆరగించా సాగాడు. తృప్తిగా తిన్న తర్వాత, పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరువేసుకో సాగాడు. అలా చేస్తు చటుక్కున "ఇప్పుడు హటాతుగా నన్నొక పులి వచ్చి గుటుక్కున మింగితే!" అని ఊహించాడు. మరుక్షణంలోనే గాండ్రుమంటూ ఒక పెద్దపులి అతడి మీదకి ఉరికి మెడను పంజాతో కొట్టి నెత్తురు తాగసాగింది. ఇలా ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా లోకుల గతి ఇలాగే పరిణమిస్తూవుంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతున్ని ప్రార్తించే పక్షంలో, మీ కోరికలు కొంతమేరకు తప్పక సిద్ధిస్తాయి. కాని వాటి వెనుకే పెద్ద పులి దాగివుందని జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధననష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటే వెయ్యిరెట్లు భయంకరాలు కదా!
***వయసులో చిన్నవాడైనా.. యముని సన్నిధికి వెళ్లి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు, మంచి నడవడికి ప్రతిరూపం. నచికేతుడి వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు ఒక యాగం చేసి, చివర్లో దానాలు చేస్తుండగా.. చిన్నారి నచికేతుడు వెళ్లి ‘నాన్నా మరి నన్నెవరికి దానం చేస్తావు’ అని పదేపదే అడుగుతాడు. కొడుకు మాటలతో విసిగిన వాజశ్రవుడు ‘నిన్ను యముడికి దానం చేశాను పో’ అంటాడు. తర్వాత.. ఆ మాట అన్నందుకు బాధపడతాడు. తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచికేతుడు యముని వద్దకు వెళ్తాడు. కానీ అక్కడ యమదర్శనం కలగదు. దీంతో అన్నపానీయాలు ముట్టకుండా మూడురోజులపాటు గడుపుతాడు. మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకుని.. మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచికేతునికి మూడు వరాలనిస్తాను కోరుకోమంటాడు. తిరిగి వెళ్లినప్పుడు తండ్రి తనను ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే.. యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు. స్వర్గప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే.. ‘అగ్నిచయనం’ గురించి చెప్పి, ఆ యాగం ఇకపై ‘నాచికేతాగ్ని చయనం’గా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు. మూడో వరం కోరుకోమన్నప్పుడు.. ‘మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు? ఆత్మస్వరూపం ఎట్టిది? ఈ విషయమై నా సంశయం పోగొట్టండి’ అని కోరడంతో యముడు ఆశ్చర్యపోతాడు. నచికేతుని శ్రద్ధాయోగ్యతలను పరీక్షించేందుకు.. ‘‘నచికేతా! మరణం తర్వాత ఆత్మ ఉండునా? అనే విషయమే అతి సూక్ష్మమైనది, తెలుసుకోవడానికి కఠినమైనది. కాబట్టి,అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను’’ అంటాడు. అందుకు నచికేతుడు.. ‘కఠినమైన విషయాన్ని మీవలె బోధ చేసేవారు దొరకరు. ఆత్మను తెలుసుకోవడం కన్నా నాకింకొక వరమేమీ అక్కర్లేదు’ అంటాడు. నచికేతుణ్ని ప్రలోభ పెట్టడానికి యముడు.. ‘నీకు సుఖాలనందజేసే పుత్రులను, పౌత్రులను ఇవ్వాలని కోరుకో. నీ సుఖజీవనానికి అవసరమైన ఆలమందలను, ఏనుగులను, గుర్రాలను, వాటిని పోషించడానికి కావాల్సినంత బంగారాన్ని ఇస్తాను. విశాలమైన భూభాగాన్ని ఇస్తాను. ఆ సంపదలను, సుఖాలను నీవెంత కాలం అనుభవింపదలిస్తే అంత కాలం ఆయువునిస్తాను. నిన్ను రాజును చేస్తాను!’ అని చెబుతాడు. అందుకు నచికేతుడు.. ‘యమధర్మరాజా.. లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవేకదా! ఇంద్రియాలను కుంగదీసే సుఖాలను నేను నమ్మను. ఎక్కువ ధనం, భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు. ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా? నీ దర్శనం దొరికింది. కనుక ఈ ధన, కనక, వస్తువాహనాలపై నాకు భ్రమ లేదు. ఆత్మతత్వం తెలుసుకోవడం తప్ప మరొక వరం నాకొద్దు’ అంటూ తన దృఢసంకల్పాన్ని తెలియజేస్తాడు. యముడు అతడి శ్రద్ధకు, పట్టుదలకు మెచ్చి.. జీవాత్మ, పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి, మోక్షానికి కావలసిన సాధనలు తెలియజేస్తాడు. ఏ జ్ఞానమైనా తపన, ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియజెప్పే అద్భుత వృత్తాంతమిది.
No comments:
Post a Comment