Saturday, 25 June 2022

 [

దృష్టికోణం


ఒకసారి ఓ సంస్కృత పండితుడు కబీర్ దగ్గరికొచ్చి ఏం చేస్తున్నారు ప్రస్తుతం ' అని అడిగాడు. మనసును ప్రాపంచిక విషయాలనుంచి వేరుచేసి భగవంతుడి పాదపద్మాలకు అతికిస్తున్నాను' అని జవాబిచ్చారాయన. ఇదే ఏకాగ్రత లేదా ``ధారణ... మనసును ఒకే ఆలోచనపై ఉంచడం. వేదాంతులు మనసును ఆత్మ పైన నిలుపుతారు. హరయోగులు, రాజయోగులు వారి దృష్టిని ఆరు చక్రాల పైన, శక్తి కేంద్రాల పైన కేంద్రీకరిస్తారు. భక్తులు దృష్టిని తమ తమ ఇష్టదేవతల పైన లగ్న చేస్తారు.


అభిలషించేవారికి ఏకాగ్రత ఎంతో అవసరం. దృష్టి నిలిపేటప్పుడు మనసులోని విభిన్న కిరణాలు ఒక చోట కేంద్రీకృతమవుతాయి. మనసు ఎగిరిపడదు. గాఢమైన ఏకాగ్రత ఉన్నప్పుడు శారీరక స్పృహగానీ, పరిసరాలను పట్టించుకోవడంగానీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏకాగ్రతతో ఉంటారు. ఆధ్మాత్మిక లక్ష్యాల్లో ఏకాగ్రత అనంత స్థాయిలో అవసరమవుతుంది.


చదరంగంలాంటి ఆటలకు ఏకాగ్రత ఎంతో అవసరం. ఏకాగ్రత అనేక రకాలుగా వ్యక్తీకరణం చెందుతుంది. తీవ్ర భావపరంపరగా శక్తి వెలువడటం సాధుమార్గంగా గోచరిస్తుంది.


ఉన్నతస్థాయుల్లో ఏకాగ్రత ఎంతో లోతుగా ఉండి, అభ్యాసంలో ప్రశ్నలకందని స్థాయికి చేరుతుంది. యోగిని పూర్తిగా ఏకాగ్రతతోనే గుర్తిస్తారు. 


ఒక విషయం అధ్యయనం చేయాలనే కోరిక ఉంటే, ముందుగా దాన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టమే. లేకపోతే దానిపట్ల శ్రద్ధ ఉండదు. ఏకాగ్రతకు చోటుండదు. ఇకఆనందం ఎక్కడుంటుంది. ఏకాగ్రత లేదని చాలామంది చెప్పడానికి అదే ప్రధాన కారణం. -ప్రాథమిక సమస్య ఇష్టం. లేకపోవడం. మనిషి దేన్నైతే విని అవగాహన చేసుకోవాలనుకుంటాడో దానిలో అతడు లీనమైపోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినికిడి కళ గురించి ఉపదేశిస్తాడు. మనసుతో విని తాను చెప్పేదాన్ని అతిశించుకొమ్మంటాడు


తేనెటీగ ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగురుతూ, నచ్చిన పూలను ఎంపిక చేసుకుని వాలుతుంది. అది ప్రయాణించే బాటలో ఎన్నో ముళ్లుంటాయి. ఆవరోచాలుంటాయి. ఎంతో నేర్పుగా వెళ్ళి పూలను ఎంపిక చేసుకుని, నిరంతర శ్రమతో ఆ అమృతాన్ని సేకరిస్తుంది. అనుకున్న లక్ష్యం పూర్తికాగానే, క్షణం కూడా వృథా చేయకుండా నేరుగా తేనెతుట్టెను చేరుకుంటుంది. సేకరించి తెచ్చిన తేనెను భద్రపరుస్తుంది. దీనికి ఎంతో ఏకాగ్రత అవసరం. చలించకుండా ఉండే శ్రద్ధ, పట్టుదల అవసరమన్న పాఠాన్ని మనుషులు తేనెటీగ నుంచి నేర్చుకోవాలి.


ఆ సృష్టికర్త ఈ భూమ్మీదకు ఇంతమందిని పంపించాడంటే దానికి కారణం లేపోలేదు. ఆధ్యాత్మిక మూర్తిమత్వానికి కావాల్సిన పరిపూర్ణతను సాధించడానికి ఎదురయ్యే తీసి చేదు అనుభవాలను అసాధారణమైన స్ఫూర్తితో ఎదుర్కొంటూ, ఎంతో ఎరుకతో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి. లక్ష్యం ఏదైనా పూర్తి ఏకాగ్రత అవసరం. మార్గంలో ధ్యానభంగం కలిగించే పరిస్థితులు ఎదురుకావడం సహజం. అనేకానేక ఆకర్షణలు లోనై వాటివైపు అనవసరంగా దృష్టి మళ్ళుతుంటుంది. మనిషి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓర్పు, కరుణలతో ఉంచడానికి ప్రతీకారం వ్యతిరేక భావనల్లాంటివి లేకుండా క్షమాగుణం కలిగి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని

పెంచుకోవాలని సృష్టికర్త ఉద్దేశం. సూదిలో దారం ఎక్కించాలంటే ముందు విడివిడిగా కనిపించే దారపు పోగులను ఒకటిగా చేసి కొనదేరేలా చేస్తాం- సులభంగా దారం ఎక్కించడానికి. అదే విధంగా విచ్చలవిడిగా ఉండే కోరికల్ని తొలగించుకుని, ఆహంకారాన్ని వదిలిపెట్టి. వినమ్రతతో మనసును దైవం పైన లగ్నం చేయడమే ఏకాగ్రత


- మంత్రవాది మహేశ్వర్

[


కత్తులు కడిగిన పెన్నేరు ఎర్రబారింది

-------///-------///-------///-------///---

తొలి సందెవేళ. తూర్పు దిగంతం అరుణ సాగరాన్ని తలపిస్తోంది. బాలభానుడు పొట‌మరించాడు. కురుక్షేత్ర రణస్థలిన కుంగిన రథచక్రాన్ని లేపుతున్న రుధిరవర్ణ కర్ణుని వదనాన్ని తలపిస్తున్నాడు ఆ అరుణవర్ణ సూర్యుడు. తొలికిరణ స్పర్శతో పెన్నేటి‌ మడుగులోని‌ తామరలు వెండి  వన్నెలు పోతున్నాయి. అక్కడ.. ఆజానుబాహుడు, తేజోవంతుడయిన వృద్ధుడు మొలలోతు నీటిలో నిలుచుని ఉన్నాడు. నీటిని దోసిలిపట్టి‌ సూర్యుని కభిముఖుడయి అర్ఘ్యం వదులుతున్నాడాయన. కానీ, ఆయనలో ఎంతకూ ఏకాగ్రత కుదరడం లేదు. భావవేదన వెల్లువెత్తుతోంది. గడచిన జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. విషాద వదనంతో మడుగునొదిలి మిట‌్ట‌మీదకొచ్చాడు.

         - అతడు.‌ తిక్కన. 'కవిబ్రహ్మ'గా బిరుదాంకితుడైన 'తిక్కన సోమయాజి'!


అవసాన కాలానికి అవశేష భావాలే ఆగతించాయనిపించిం దాయనకు. 'ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యం సైతం కర్మానుగతమే గదా. కాక, అది సుఖదుఃఖాల కతీతమైందికూడా!' అని తలపోసుకున్నాడు. రాజ్యసాధనకన్న రాజ్యరక్షణ కష్ట‌ం. ముదిమి భారంతో రాజు, మిడిసిపడే రక్తంతో యువరాజు ఉండే రాజ్యంలో ఇది మరింత జటిలం. ఈ సమయంలో రాజసౌధమంతా అధికార మార్పిడి కార్యక్రమాల్లో తలమునకలయి ఉంటుంది. వారసత్వంమీద, సంతృప్తులూ - అసంతృప్తులూ ఉండనే ఉంటాయి. ఈ ప్రభావానికి వెంట‌నే గురయ్యేది సరిహద్దులే!


అది.. సువిశాల కాకతీయ సామ్రాజ్యం. వయసుడిగిన గణపతిదేవుడు సింహాసనం నుంచి తప్పుకోవాలని - వయసొచ్చిన రుద్రదేవుడు సింహపీఠి నధిష్టించాలని కోరుకుంటున్న తరుణం. దీంతో అసంతృప్త సామంతులకది‌‌‌ అందివచ్చిన అవకాశమే అయింది. అంతేగాక, సరిహద్దులకావల పొంచియున్న శతృరాజులకు కలిసొస్తున్న కాలంకూడా. ఇప్పటి వరకూ యావదాంధ్రదేశమూ కాకతీయాంధ్రదేశంగా అలరారింది. కాగా, అణగిపోయిన ఆధిపత్యాలు ఇప్పుడిప్పుడే తిరిగి తలెత్తుతున్నాయి.


విక్రమ సింహపురం కాకతీయులకు ఆత్మీయ రాజ్యం. అంతేకాదు, వారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న రాజ్యంకూడా! దీన్ని మనుమసిద్ధి పరిపాలిస్తున్నాడు. సామ్రాజ్య కేంద్రం ఓరుగల్లు. దీని చక్రవర్తి గణపతిదేవుడు. ఈ సామ్రాజ్య కేంద్రమిప్పుడు వారసత్వ సంఘర్షణలతో అల్లకల్లోలంగా ఉంది. పెన్న - కృష్ణల నడుమనున్న సామంతరాజులు దీన్ని గమనించారు. ఆ విధంగా, కృష్ణకు దక్షిణ రాజ్యాల రాజుల్లో రాజ్యకాంక్ష రగిలింది. ఇక్కడ, కాకతీయుల ఆధిపత్యాన్ని సహించబోమన్నారు వీరంతా. గుంటూరు నాగవిభుడు, ధరణికోట‌ బేతరాజు, కనిగిరి కాట‌మరాజు‌ కలిసి ఒక్కట‌య్యారు. మనుమసిద్ధిని సైతం తమతో చేతులు కలపమని కబురంపారు. అందుకాయన అంగీకరించలేదు. విశ్వాస రాహిత్యానికి పాల్పడబోనని స్పష్ట‌ం చేశాడు. కష్టకాలంలో చక్రవర్తికి అండదండలందిద్దామని మంచిమాట చెప్పాడు. వీరికిది రుచించలేదు. అందుకే, కక్షకట్టి‌ చికాకులు సృష్టించారు.‌ పశువుల పుల్లరి గొడవ కాట‌మరాజుకు కలిసొచ్చింది. ఈ కారణంగానే ఖడ్గతిక్కన మరణం పులిమీద పుట‌్రలా సింహపురిని అతలాకుతలం చేసింది. ఆ రకంగా రాజ్యం రక్షణ కోల్పోయింది.

ఇదిలావుండగా -


దాక్షిణాత్యుడైన 'పాండ్యుడు' కాకతీయులకు ఆగర్భ శతృవు. ఆదినుంచీ వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నవాడూను. పైగా, దక్షిణ సరిహద్దులను అతలాకుతలం చేయగలిగిన సమర్ధుడు. అదునెరగ గలిగిన చాతుర్యంతోబాటు‌గా మహా శౌర్య సంపన్నత ఈయన సొంతం. ఈ పరిస్థితుల్లో మనుమసిద్ధిని రక్షించేందుకు కాకతీయప్రభువు రాలేడని గ్రహించాడు. ఆవిధంగా, అక్కడి అంతఃకల్లోలం ఈయనలో ఆశలు రేపింది. ఇక కాట‌మరాజు సైతం తనకే సహకరించే పరిస్థితులుండడం మరింత కలిసొచ్చే అంశం. దీంతో, ఇక ఆలస్యం చేయదలచ లేదాయన. అశేష సేనావాహినితో సింహపురిపై దాడి చేశాడు.


ఖడ్గతిక్కన మరణశోకం నుంచి సింహపురి ఇంకా తేరుకోనేలేదు. ఆయన స్థానాన్ని భర్తీ చేయ గలిగిన సైన్యాధ్యక్షుడింకా సమకూరనూ లేదు. ఇంతలోనే, పులిమీదపుట‌్రలా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. అతలాకుతలమయ్యాడు మనుమసిద్ధి. అయినా, ఈ అనూహ్య యుద్ధాన్ని ఎదుర్కొనక తప్పలేదు. భీకర యుద్ధం జరిగింది. రక్తపుటే‌రులు పారాయి. పాండ్యుడు యుద్ధంలో నెగ్గాడు. కత్తులు కడిగిన పెన్నేరు ఎర్రబారింది! ఇలా విక్రమ సింహపురి రాజ్యం పాండ్యుల వశమైంది. దీంతో పాండ్యుడికి పట‌్ట‌పగ్గాలు లేకుండాపోయాయి. రాజ్యం వీరభోజ్యభోజ్యమంటూ వికటాట్టహాసం చేశాడు. ధనధాన్యాలేగాక భావ భాష్య సంనదలతో తులతూగిన రాజ్యం ఇలా విలవిలలాడింది.


తొలిపొద్దు ఎదిగి మింటికెగసింది. చురుకుమంటున్న‌‌‌ ఎండ ఆయన జ్ఞాపకాల తెరలను మండించింది. మనసు కల్లోల తరంగితంకాగా, ఆలోచనలకు స్వస్తిచెప్పి ముందుకు నడిచాడు తిక్కన. చెలమలయిన కళ్ళు చేదు నిజాలను చిందిస్తున్నాయి. భావాలకు భాష్యం చెప్పిన అతడిప్పుడు భార మతుడయ్యాడు. మాన్యతకు మన్ననల నందించిన మనుమసిద్ధి జ్ఞాపకం ఆయనలోని మోనవేదనకు కారణమయింది.

[

హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

 రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు "ఆ ప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి"మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".


 “ప్రశ్న ఏమిటంటే, 


'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది...?' 


 సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది. ”అని అనగా...

 రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించారు.

హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నారు.

 ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు

 ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.

 నెల ముగిసిపోయే సమయం వచ్చింది,

 మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.

 అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు


 అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.

అందుకు  మంత్రగత్తె,  "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది.

 హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తె ను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు.అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు

 కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి  వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.

 అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, “ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.”

 హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు,

అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు.  రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.

 మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది.  మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ” అంది


 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు. ”అని అడిగింది

దానికి సిద్ధిరాజ్ “అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.”

 ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి “మీరు నన్ను స్వయంనిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను” అని అన్నది.

 “వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం.  చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది.....


 ఇందులో గమనించాల్సిందేమంటే..


 సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.


 అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.


 భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే మీరు, మిగితా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి, దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి, మీ మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది...

[

 విక్రమార్కుడి మరణం ...!!


రాజులు రాజ్యాలు అంతరించినా, శకాలు మారినా, యుగాలు గడచినా, శక కర్తలుగా యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు,

 మంచి మంచి పురాణ కధలూ తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. 

అందుకే వాటిలో అణు మాత్రమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ విక్రమార్కీయము.

ఇంతవరకు విక్రమార్కుడు శివుని వలన వరం పొందాడని తెలుసుకున్నాం ! ఐతే ఆ వరము ఎలా నిజమయ్యిందో , ఇప్పుడు తెలుసుకుందాం.

 జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు, దారి పొడవునా పూలూ ముళ్ళూ ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. 

వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి.

 వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు.

అందుకు మంత్రి ఐన భట్టి "రాజా! మేడ మీద కాకులు గుడ్ల గూబలూ చేరి అరవటం, 

పట్టపుటేనుగు మరణించటం, గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి. ఏదో కీడును సూచిస్తున్నాయి. ఎందుకో భయంగా ఉంది" అన్నాడు.


అందుకు విక్రమార్కుడు నవ్వి "పూర్వము నాకు పరమ శివుడు ఇచ్చిన వరం గుర్తులేదా? ఒక్క సంవత్సరము మీద ఒక్క రోజు మాత్రమే వయస్సు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది? 


అట్టి కొడుకు వల్ల నాకు మరణమెలా సంభవిస్తుంది? వింతగా లేదా? ఇదంతా కల్ల, ఇది జరిగే అవకాశమే లేదు. నీవేమీ విచారించకు" అని ధైర్యం చెప్పాడు.


అందుకు భట్టి "మహరాజా! మీరు పొరబడుతున్నారు. అది శివుడిచ్చిన వరం. అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు,


 సంభవములు అసంభవములు కావచ్చు. ఇది ఈశ్వరేచ్ఛ. ఒకప్పుడు ఉగ్ర నరసింహుడు ఉక్కు స్థంభములో ప్రత్యక్షమవలేదా? 


ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు ముఖములు గల వారెవ్వరితోను చావు రాని తారకాసురుని షణ్ముఖుడు చంపలేదా?


 రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా? కావున రాజా, అట్టి బాలుడు పుట్ట వచ్చును అని నా నమ్మకం. 


అందువలన మన వేగుల వారిని నలు దిశలా పంపి ఎప్పడి కప్పుడు వార్తలను సేకరించుకుని రమ్మనటం శ్రేయస్కరం" అని సలహా ఇచ్చాడు.


అప్పుడు విక్రమార్కుడు తనకీ పని సక్రమంగా చేయగల సమర్ధుడెవరా? అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు. 


తననీ ఆపదనుంచి కాపాడగల సమర్ధుడు బేతాళుడు ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనస్సులో తలచుకున్నాడు. అంతే, తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు.


 రాజు కోరిక తెలుసుకుని వెంటనే మాయమై స్వర్గ మత్స పాతాళ లోకాలని గాలించటనికి వెళ్ళిపోయాడు.


అన్ని లోకాలు చుట్టి వచ్చి "మహరాజా! మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టి వచ్చాను. ఐతే నాకు మార్గ మధ్యాన ఒక వింత కనిపించింది. 


అదేమిటంటే ఓ కుమ్మరి వాని ఇంటిముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్నపిల్ల వాడు కూర్చుని ఉన్నాడు. వాడు మట్టి తో చేసిన సైన్యము తో ఆడుకుంటున్నాడు. 


అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట గలిపి ఈ ' బాలుడెవడు? ' అని అడిగాను. అందుకు ఆ విప్రుడు ' వీడు నా మనుమడు. ఇదిగో ఈమె వాడి తల్లి. ఈమెకు సరిగ్గా ఒక సంవత్సరమ్మీద ఒక రోజు వయస్సు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృపవలన వీడు జన్మించాడు. 


ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు ' అని చెప్పాడు. కావున నీ రాజ భోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలుని ఎలాగైనా చంపగల ప్రయత్నం చేయి" అని చెప్పి మాయ మయ్యాడు.


అదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయి పడింది. "ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీలేదు" అనుకుని ధైర్యం తెచ్చుకుని


 "ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి" అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్య భారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనిడుకొని ప్రతిస్టానపురానికి ప్రయాణం సాగించాడు.


ఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు. ఇంతకీ ఆ బాలుని పేరు "శాలివాహనుడు". అతనికి నాగేంద్రుని మంత్ర శక్తి వలన నాగులు, గుర్రములు, రథములు, భటులు అందరు యుద్ధానికి తరలివచ్చారు.


ఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టు ముట్టి చంపసాగాయి. 


శాలివాహనునికీ విక్రమార్కునికీ ముఖా ముఖీని భయంకర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది. కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదరైపోయాయి.


 ఐనా సరే "ఆ సర్వేశ్వరుడే కాలఖర్మాన్ని తప్పించుకోలేనప్పుడు, మానవ మాత్రులం మనమనగా ఎంత?" అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు శాయశక్తులా ఫోరాడాడు. 

ఐనా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురియై మరణించాడు.

[

విశ్వహిత కాంక్ష


మనిషి పుట్టుక ఒక వరం. ఎన్నో జన్మల పుణ్య విశేషంతో మనిషి వివేకవంతు డిగా ఈ పుడమిపై జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఉండే శైశవదశలో అతడిలో ఏ వికారాలూ ఉండవు. భగవంతుడిలా మాయకు అతీతుడిగా, ఆనందంలో మునిగి తేలతాడు. శైశవదశ తరవాత బాల్యంలోకి అడుగు పెట్టి, విద్యాబుద్ధులు నేర్చుకొం టాడు. తదనంతరం యౌవనదశకు చేరుకుంటాడు. ఆ దశలో మనిషికి ఏర్పడే శక్తియుక్తులు, లోకజ్ఞానం కారణంగా రాగద్వేషాలు, శత్రుత్వమిత్రత్వాలు, స్వార్ధ పరమార్థాలు సంక్రమిస్తాయి. అవి వృద్ధాప్యందాకా కొనసాగుతాయి. జన సత్యాలన్నీ ఉడిగిపోయిన ముసలితనంలో మనిషి క్రమంగా నిశ్చేష్టుడిగా కాలం గడుపుతాడు. చివరికి మరణ చక్రంలోకి చేరుకుంటాడు.


మనిషి తన నూరేళ్ల జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మంచి మార్గాలు.. న్నాయి. మనిషి తన స్వశక్తితో దేన్నైనా సాధించగలుగుతాడు. అసాధ్యాలను సుసా ధ్యాలు చేసుకుంటాడు. ఎవరూ ఊహించని అద్భుత చరిత్రలను సృష్టిస్తాడు. మనిషి తలచుకుంటే సంభవం కాని పనులు లేవు. మనిషికి ఆశలు మాత్రమే ఉంటే చాలదు. ఆశలను సఫలీకృతం చేసుకోగలిగే కృషి తోడు కావాలి.


నిరంతరం


ప్రయత్నం చేసే మనిషికి దైవం


కూడా తోడవుతుందని పెద్దల మాట. మనిషి తన జీవితావసరాలు తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తాడు. ఆపారధనాన్ని కూడబెడ తాడు. ఆస్తులను పెంచుకుంటాడు. తాను, తన కుటుంబం ఏ లోటూ లేకుండా ఉండాలని తపిస్తాడు. మనిషి తన సొంత లాభం మాత్రమే చూసుకొంటే జీవితంలో సంతృప్తిని సంపూర్ణంగా పొంద లేదు. తన చుట్టూ ఉన్న ప్రపం చాన్నీ మనిషి చూడాలి. తానూ బతకాలి, అందరూ బతకాలి అని. ఎప్పుడూ భావిస్తూ ఉండాలి.


అంతర్యామి


మహాత్యులు పరోపకారంతో చరి త్రలో నిలిచిపోయారు. వారి చరి త్రలు స్ఫూర్తిదాయకాలు, వారు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. 'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంపూర్ణారోగ్యంతో ఉండాలి. అందరూ ఎల్లవేళలా మంచినే చూడాలి. ఏ ఒక్కరూ దుఃఖించరాదు' అని ప్రాచీనుల సదుపదేశం అందరి సుఖాన్ని కోరే మనిషి తాను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సహిస్తాడు. సహనం ఒక ఆభరణం, అందరి ఆరోగ్యాన్ని ఆశించే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఎవ్వరికీ హాని కలగని రీతిలో పరిసరాలను కాపాడ తాడు అందరూ మంచినే చూడాలని కోరుకుంటే మనిషి తాను మొదట మంచివాడు. కావాలి. తాను మారితేనే లోకమంతా మారుతుందని గ్రహించాలి.


విశ్వక్షేమమే మనిషికి దక్ష. విశ్వమంతా అల్లకల్లోలం అయితే, తాను ఒక్కడు మాత్రమే బతికి బట్టకట్టగలడా? లోకంలో కనిపించే సృష్టి అంతా పరోపకారం కోసమే. ప్రపంచం అందరి యోగక్షేమాల కోసమే తప్ప కొందరి లాభాల కోసం | ఏర్పడలేదు. విశ్వం అంతా ప్రకృతి ప్రసాదించిన దివ్యఫలం. దాన్ని అమృత ఫలంలా భావించి, ఆస్వాదించాలే కానీ ధ్వంసరచనలతో కలుషితం చేయరాదు. విశ్వహితంలోనే వ్యక్తిహితం అంతర్భవించి ఉంటుందనేది సత్యం.


వేల ఏళ్ల క్రితం ఎవరో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో మధు రఫలాలను, చల్లని నీడను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనిషి తాను చేసే మంచి పనులవల్ల భవిష్యత్తులో మానవాళికి శ్రేయస్సును అందించాలి. అదే జీవన పరమార్ధం. మనసును విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు.


- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment