Saturday, 25 June 2022

 

*వైశాఖ బుద్ధ పూర్ణిమ*

పరమ శాంతి పల్లవించే మనోహరమైన, దివ్యమైన పలుకులకు నెలవు- శాంతి స్వరూపుడు గౌతముడు. తల్లి పేరుతో చరిత్ర గతిని మార్చేశాడు. దివ్యమైన అంతరంగ ఆనంద తరంగాలు కనురెప్ప వాల్చకుండా అతడిని చూడగలిగే సామర్థ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. అతడి సన్నిధిని అనుభవించిన వారెందరో మహా చైతన్యపు లోతులు చూశారు.


అతడు ఊరూ పేరూ లేనివాడు కాదు. పేద కుటుంబంలో పస్తులున్నవాడు కాదు. రదాలు, పల్లకీలు, సేవకులు, వజ్రవైడూర్యాలతో తులతూగే మహా చక్రవర్తి కుమారుడు. ఆ స్థితి అతడికి తృణప్రాయం. అందుకే అన్నీ వదిలేశాడు. నిరాడంబరుడై, నిత్యం భిక్షాటన చేస్తూ, ముప్పై ఏళ్లకే దివ్య జ్ఞానం పొంది, తరువాత మరో ఏబై ఏళ్లు బతికాడు.. కాలి నడకన వేల మైళ్లు తిరిగాడు. దుఖ నివారణ మార్గం కనుగొన్నాడు. మానవాళికి శాశ్వత శాంతి బాటను ప్రసాదించాడు. అతడే తొలుత సిద్ధార్ధుడు తరువాత బుద్ధుడు. వైశాఖ పూర్ణిమ రోజున అతడు భూమి మీదకు వచ్చి, మళ్ళీ అదే రోజున భూమికి శరీరాన్ని అర్పించాడు. బుద్ధుడు, అతడి శిష్యులు, ప్రతి సంవత్సరం అష్టాంగ యోగ మార్గం గురించి చర్చించి, ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం. చెయ్యడానికి బుద్ధుడి నిర్యాణం తరువాత ఒక సంఘం ఏర్పడింది.. ఒక శతాబ్దం తరవాత మరో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుడి బోధనలను ప్రచారం చేశాయి.


ఒకరోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తూ ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. రుసరుసలాడుతూ. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇల్లాలు. ఎదురుగా నిలబడి ఉన్న బుద్దుడిని ఇలా అడుక్కోకపోతే ఏదైనా పనీ పాటా చేసుకుని బతకవచ్చుగా.... నీవు సోమరిగా తయారవడమే కాకుండా నీ శిష్యులని చెప్పుకొంటున్న వీరిని కూడా సోమరులుగా తయారుచేస్తున్నావని తెచ్చింది. బుద్ధుడు చిరునవ్వుతో ఆమె పరుష వాక్కుల్ని విన్నాడు. కానీ, ఏమీ అనలేదు. పట్టరాని కోపంతో ఊగిపోతున్న శిష్యులను చూసి వారించాడు.


తరవాత ప్రసన్నవదనంతో, మాతా చిన్న సంశయం తీరుస్తారా?' అన్నాడు. అందుకు ఆమె "సరే... చెప్పు " అంది. బుద్ధుడు తన చేతిలోని విక్షాపాత్రను చూపుతూ తల్లీ నేను నీకు ఓ వస్తువును ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఎవరికి చెందుతుంది... అని ప్రశ్నించాడు. అందుకు ఆమె 'నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి, ఆ 'వస్తువు నీకే చెందుతుంది' అని వేళాకోళంగా బదులిచ్చింది.


'అయితే... తల్లీ! నేను నీ తిట్లను స్వీకరించడం లేదు' అన్నాడు. ఆమె తన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది.


ఈ సంఘటనతో బుద్ధుడు గొప్ప ధర్మాన్ని బోధించాడు. మంచి చేసేటప్పుడు కూడా మనల్ని అవమానించేవాళ్లు, వేళాకోళం చేసేవాళ్లు చుట్టూ చాలామంది ఉంటారు. కొందరు బహిరంగంగా విమర్శిస్తే, ఇంకొందరు చాటుగా విమర్శిస్తుంటారు. వాటిని మనం పట్టించుకోనంత వరకు మన దారిలో ఎలాంటి ఆటంకాలూ

ఉండవు. ఎప్పుడైతే వాటిని పట్టించుకుని బాధపడతామో.. ఇక ముందుకు వెళ్ళలేం. విమర్శ హృదయాన్ని బాధించేలా కాక మనసును ఆలోచింపజేసేదిగా ఉండాలి. బుద్ధుడి మార్గంలో జనన మరణాలు చైతన్య స్థాయిలో భేదాలు. సాధకుడు అష్టాంగ యోగ మార్గంలో సాధన చేసి, నిర్వాణం పొందగలరు. అత్యుత్తమమైన ప్రశాంతిని అనుభవించగలడు. ఎక్కడా, ఎవరినీ వ్యక్తిగత ఆరాధన చేయనవసరం లేదు. అప్పోడిపోభవ అని చెప్పారు. అంటే, ఎవరికి వారే వెలుగై దారిచూపాలి?


- ఆనందసాయి స్వామి

......


*🍁ఎవరికీ మోక్షం*🍁 


🙏త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.


‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.


‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.


స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.


విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.


‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.


‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.

ఈ పరిపక్వత  మన అందరిలో వచ్చినప్పుడే మనం నిజమైన స్వామీ భక్తులం అవుతాము🤘

....

మృత్యువల్లరి


మనిషి ఎప్పుడూ జీవితాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. ఒక శాపంగా దాపురించిన మహమ్మారి సృష్టిస్తున్న విపరీత పరిస్థితులవల్ల మృత్యువు గురించి కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. "నాకు మృత్యువంటే భయం. దీనిలోంచి ఎలా బయటపడగలను' అని అడిగాడు. శిష్యుడు గురువుగారిని 'ఒక్క విషయం చెప్ప. కొన్ని నాణేలను అప్పుగా


తీసుకున్నావనుకో... తిరిగిచ్చేయాల్సి వచ్చినప్పుడు భయపడతావా??


"లేదే... దీనికి దానికి ఏమిటి సంబంధం గురువుగారూ! గురువుగారు భూమి మీద నుంచి కొద్దిగా మట్టిని తీసుకుంటూ- 'నువ్వు ఈ దేహాన్ని రుణంగా తీసుకున్నావు. తిరిగిచ్చేయాలిగా. తీసుకునే ఆహారం, తాగే నీరు నీ రుణాన్ని పెంచుతుంది. దూళిలోంచి తయారైన నువ్వు ఈ భూమికి రుణపడి ఉన్నావు ఆది కిందకు లాగుతూనే ఉంటుంది. చివరికి మొత్తంగా తనలోకి తీసేసుకుంటుంది- ఏమీ మిగల్చకుండా! చేతిలోకి తీసుకున్న ఆ మట్టిని పైకి విసిరాడు. అది కింద పడింది. 'నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎగిరినా కిందపడక తప్పదు. అది సహజం. పడతాననే భయంలోంచి బయటపడాలి. ఈ శరీరానికి ఆధిపతిననే భావనను విడిచిపెట్టాలి. అద్దెకు తీసుకున్నానన్న సత్యాన్ని గ్రహించాలి. అంతా రుణగ్రస్తులమే'


మృత్యువు అనేది అత్యున్నతమైన సత్యమైనా. ఎవరూ ఎప్పుడూ దానిగురించి మాట్లాడుకోవడం గానీ, అవగాహన ప్రయత్నించడంగానీ ఇష్టపడరు. పరిణతి. చెందిన వారుగా కనిపించే వారిలో సైతం, వారి ఆలోచనలు, ఆందోళనలు కుటుంబ వ్యవహారాలు, పదోన్నతులు, వ్యాపార మార్గాలు.. ఇలా భౌతిక

విషయాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. మన జననం సాధారణమైనది. కావచ్చు. కానీ మరణం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలనేవారు అబ్దుల్

గీతలో కృష్ణుడు. చివరి శ్వాసలో హరినామాన్ని స్మరిస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంటాడు. అర్జునుడు అదెంతో తేలిక విషయం అన్న భావం వ్యక్తంచేసినప్పుడు, జీవితంలో ఆ నామాన్ని జపించే అభ్యాసం లేకపోతే తుది క్షణాల్లో ఉచ్చరించడం సాధ్యంకాదని నవ్వుతూ చెబుతాడు శ్రీకృష్ణుడు. చివరి ఆలోచన అనేది మనిషి అంతవరకూ గడిపిన జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నపళంగా వచ్చే మార్చంటూ జీవితంలో ఉండదు. భౌతిక సంపదల పట్ల ఆకర్షితులైనవారికి, 'నేను- నాది' అనుకుంటూ స్వార్ధ బుద్ధితో జీవితం గడిపేవారికి 'హరినామ స్మరణ" అంత తేలికైన విషయం కాదు.


ప్రతి ఒక్కరూ తుది ప్రయాణానికి సిద్ధపడాల్సిందే. జీవితాన్ని ఒక ఉత్సవంలా ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటూనే మరణించే కళను నేర్చుకోవాలి. ఆశాశ్వతమైన శరీరాన్ని పెనవేసుకున్న బంధాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. తరువాతి తరాలవారికి అందించాల్సినవి శాశ్వతమైన విలువగలిగినవి- సంస్కారాలు, విలువలు,


మధురానుభూతులు, ప్రగతిశీల ఆలోచనలని తెలుసుకోవాలి. మానవ దేహం పంచభూతాల సమ్మేళనం, మట్టిలో కలవాల్సిందే. మట్టితో కాలమనే చక్రంమీద దైవం నగిషీలు పెట్టి తీసే అందమైన మట్టికుండ- మనిషి జన్మ. ఈ భూమ్మీద మనిషిది తాత్కాలిక నివాసమే! |

మంత్రవాది మహేశ్వర్

......

*పంచమ వేదం*


'మహాభారతానికి వేదవ్యాసుడు తొలుత నిర్దేశించిన పేరు 'జయం'  వ్యాసమహర్షి శిష్యులను ఆశ్వలాయన గుహ్య సూత్రాలు- 'భారత మహాభారత ఆచార్యులు'గా అభివర్ణించాయి. అంటే వ్యాసశిష్యుల మూలంగా జయం భారతంగా మహాభారతంగా ఆవిర్భవించిందని అర్ధం. ఆ క్రమంలో సంస్కృత భారతం లక్షా అయిదు వందల శ్లోకాలుగా విస్తరించింది. ఆదిపర్వంలోని పర్వానుక్రమణికలో ఇది నన్నయభట్టు వెల్లడించిన లెక్క


వ్యాసమహర్షి జయ కావ్య రచనను లోక హితం కోరి ప్రచారం చేసే బాధ్యతను శిష్యులు, మునులు స్వీకరించారు. నారదుడు దేవలోకంలోను, దేవలుడు. పితృలోకాల్లోను, జనమేజయుడికి భారతాన్ని వివరించే క్రమంలో వైశంపాయన మహర్షి మానవ లోకులోనూ వ్యాసకృతికి లోకోత్తర ప్రాచుర్యాన్ని చేకూర్చారు. వైశంపాయనుడు చెబుతున్న సమ యంలో ఉగ్రశ్రవసుడు. అనే సూతుడు ఆ కథను విన్నాడు. ఆయన ఆ కాలంలో సుప్రసిద్ధ పౌరాణికుడు. నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల పాటు శౌనక మహర్షి సత్రయాగాన్ని నిర్వహించిన సందర్భంలో అక్కడి మునుల కోరికపై అదే సూతమహర్షి భార తాన్ని వినిపించాడు. ఆ సమయంలో శ్రోతలకు కలిగిన సందేహాలకు, లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ సూతుడు- వ్యాస హృదయాన్ని మరింత స్పష్టంగా ఆవిష్కరిం చేందుకై కొన్ని వివరణలు జోడించాడు. ఇలా ఒకరితో ఒకరు అనగా అనగా.... విస్తరించిన బృహత్ గ్రంథమే ఇప్పుడు మనముందున్న మహాభారతం. చిన్నప్పుడు మనం విన్నకథలన్నీ 'అనగనగా...' అంటూ

ఆరంభమయ్యే అద్భుతమైన సంప్రదాయంలోని అసలు రహస్యం ఇదే ఆద్యంతం కొనసాగే ఆసలైన కథకు ఆఖ్యానం అని పేరు. దాన్ని మరింతగా తేటతెల్లం చేసేందుకు అనుబంధంగా అల్లుకొనే కథలను 'ఉపాఖ్యానాలు' అంటారు. ఉపాఖ్యానాలు హుందాగా ఔచిత్యభరితంగా ఉండాలన్నాడు. జగన్నాథ పండితరాయలు. అందమైన విషయాన్ని చెబుతూ, మద్యలో అసలు కథకు పరిపోషకంగా వేరే సంగతులను ఎంతో నైపుణ్యంగా పొదిగి శ్రోత దృష్టిని ఆకట్టుకొనే క్రమాన్ని ఆయన గుణీభూత వ్యంగ్య కావ్యప్రకారం' అంటూ నిర్వచించాడు. అలాంటి ఉటంకింపులు ఉదాహరణలు అనుచరుల ఇంట శుభకార్యానికి తరలివచ్చిన రాజువలె దరాగా ఉండాలని ఆ ముంగండ పండితుడి తీర్మానం. అవి పాలు, పంచదారలా కలగలిసిపోవాలని తాత్పర్యం.


వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు పురాణాలు... వంటి వేదధర్మాన్ని విఫలీకరించే సాహితీశాఖలు- జయకావ్యానికి ఎంతో ముందువే. వాటి సారాంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకొంటున్న 'పాఠకమిత్ర' వ్యాఖ్యాన రూపంలో, ఒక ఇతిహాసంగా రూపొందించే కర్తవ్యాన్ని వ్యాసమహర్షి చేపట్టారు. అది జయకావ్యం. దాన్ని ఆయా కాలాల్లోని ప్రజలకు చేరువ చేసే విధంగా, ధార్మిక జీవనసూత్రాలను అనుసందానిస్తూ, మనుగడను మంగళకరంగా మలచే దిశగా వ్యాసశిష్యులు జయకావ్యాన్ని భారతంగా, మహాభారతంగా తీర్చిదిద్దారు. అది ఆనాటి యుగధర్మం. కాలానుగుణమైన ధర్మ సమన్వయాలు- యుగావసరాలు. విశ్వశ్రేయస్సు పరమలక్ష్యంగా వేదాల సారాంశం ఇలా క్రమంగా ధార్మిక విశ్వరూపాన్ని సంతరించుకొన్న ఇతిహాసం కాబట్టి- మహాభారతానికి 'పంచమవేదం' అనే ఖ్యాతి వచ్చింది. ఇంతకాలంగా జ్ఞానదీపమై వికాసాన్ని పంచుతూ వస్తోంది. పంచుతూనే ఉంటుంది!


- ఎర్రాప్రగడ రామకృష్ణ

.......


                 *ద్రౌపది ఔదార్యం*

                    ➖➖➖

మహాభారత యుద్ధం చివరన భీముడు దుర్యోధనుడి తొడలు  విరగగొడతాడు.

అప్పుడు దుర్యోధనుడు కొన ఊపిరితో వున్నప్పుడు అక్కడికి ఆశ్వత్టామ, కృపాచార్యుడు వస్తారు.


అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామతో ‘పాండవులను ఎలాగైనా చంపి అపాండవం చేయ’మంటాడు.

అశ్వత్టామ అతనికి ఆ పని చేస్తాననిమాట యిస్తాడు।

అతను ఆ రోజు రాత్రికి పాండవుల శిబిరానికి వెళ్లి పాండవులు పడుకునే స్థానంలో పడుకున్న ఉపపాండవుల ఐదుగురి (ద్రౌపది కొడుకులు)తలలు అమానుషంగా నరికి వెళ్లి పోతుండగా అర్జునుడు, కృష్ణుడు అతనిని వెంబడించి, యుద్ధం చేస్తాడు అర్జునుడు.


అశ్వత్టామ ఉపసంహారం ఎలా చెయ్యాలో తెలియని బ్రహ్మశిరోనామక అస్త్రాన్నిఅర్జునుడి మీదికి వదులుతాడు.


అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రముతో దాన్ని ఎదుర్కొంటాడు.

ఆ రెండు అస్త్రాలూ ఆకాశం లో పోరాడుతుంటే అన్ని లోకాలూ కంపించి పోతాయి.


ఆశ్వత్థమ కు ఉపసంహారం తెలీదు.. బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకుంటే అర్జునుడు ఆశ్వత్థామ అస్త్రానికి బలై పోతాడు.


అప్పుడు కృష్ణుడు ఆశ్వత్థామ ను   ఆ అస్త్రము యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భము లోని బిడ్డకు తగిలేలా చేయ మంటాడు.


అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగానే అశ్వత్థామ వేసిన అస్త్రము ఉత్తర గర్భము లో వున్న బిడ్డకు తగిలి ఉత్తరకు మృతశిశువు పుడతాడు.


ఏడుస్తున్న ఉత్తరను ఓదార్చి కృష్ణుడు ఆ బిడ్డను తన చేతితో నిమిరి బ్రతికిస్తాడు. అతడే పరీక్షిత్తు..అది తర్వాత కథ..

 అర్జునుడు అశ్వత్థామను చంప బోతుంటే కృష్ణుడు అతన్ని వారించి ద్రౌపది దగ్గరకుతీసుకొని పోదామని తీసుకొని పోతారు. అప్పుడు ద్రౌపది పుత్రశోకం తో చెప్పిన ఈ పద్యము చాలా ప్రసిద్ధ మైనది…


ఉద్రేకంబున రారు శస్త్ర ధరులై,యుద్ధావనిన్ లేరు,కిం 

చిద్ద్రోహంబును నీకు జేయరు

బలోత్సేకంబుతో చీకటిన్

భద్రాకారుల చిన్న పాపల రణ ప్రౌఢ  క్రియా హీనులన్

నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో 

 

అర్థము:-- వారు ఉద్రేకముతో ఆయుధాలు ధరించి నీ మీదకు రాలేదు, యుద్ధ రంగములో లేరు,     నీకే అపకారమూ చేయలేదు ఇంకా పసివాళ్ళు     ఆదమరిచి నిద్ర పోతున్న పసిపాపలను చంపేందుకు నీకు చేతులెలా వచ్చాయి? నీవూ ఒక వీరుడవేనా అని నిందిస్తుంది, ఏడుస్తుంది.


అర్జునుడు ‘వీడిని వధిస్తాను అని అంటే…*

*వద్దని వారిస్తుంది.

”గురుపుత్రుడు, బ్రాహ్మణుడు అతన్ని చంపుట మహాపాపము.  పైగా అతని తల్లికి పుత్ర శోకం కలిగించటం నాకిష్టము లేదు. ఆ శోకం ఎంత భయంకర మైనదో నాకు తెలుసు. అతని శిరస్సు పైనున్న రత్నాన్ని తీసి నాకివ్వు, అతని సర్వ శక్తులూ నశిస్తాయి. నిర్వీర్యుడై పోతాడు. అదే అతనికి తగిన శిక్ష!” అంటుంది.

“అప్పుడు అర్జునుడు తన బాణము తో అతని తల పై వున్న మణిని పెకలించి  ద్రౌపదికి యిస్తాడు ఐదుగురు కొడుకులను ఘాతుకంగా చంపిన అతనిని వదిలి వేస్తుంది.

No comments:

Post a Comment