బ్రహ్మ జీవ తత్వాలు
వెన్నెలలొ ఏల కోపము వేకు వగను
మనసు సెగలేల ఎగసిన మూగ వగును
పువ్వులలొ కేల నవ్వుల పువ్వు అగును
ముల్లై గుచ్చియు మమతల మల్లె యగును
కన్నులలొ ఏల కోపము కినుకు యగును
మనసు కణకణ లాడిన మౌన మగును
చూపులలొ కేల కన్నుల చిగురు యగును
చూపు గుచ్చియు నగవు చిందు లగును
నీ పలుకులన్ని భాధించె నా మనసును
నీ కులుకులన్ని వేధించె నా మనసును
నీ చదువులన్ని మార్పించు నా మనసును
నీ వలపులన్ని చంపేను నా మనసును
పైట బులిపించు చేదులు పీట లగును
అకట కలహించి కథలేలు ఆట లగును
తరుము కొచ్చేటి మనసైన తీపి యగును
మాట కరువైన వినయమ్ము మనసు యగును
* * *
శ్రేయో భూయాత్ సకల జనానాం
ఇది జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు రాసిన ‘మైత్రీం భజత’ అనే పాట చివరి పాదం. దీని అర్థం ‘ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి’ అని కాంక్షించడం.
1966లో ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి, భారతరత్న శ్రీమతి యమ్.యస్. సుబ్బులక్ష్మి గారిని కచేరి ఇవ్వమని ఆహ్వానం పంపారు. ఆమె ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిపి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు స్వామి వారు సంస్కృతం లో ఈ పాటను రాసిచ్చారు. ప్రపంచ శాంతిని, మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ పాటను అక్కడ పాడటం ప్రతి భారతీయుడికి గర్వకారాణం.
పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆ పాట దాని భావం
మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం | స్నేహము, వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత | అందరినీ నీలాగే(సమానంగా) చూడు
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత |
యుద్ధాన్ని త్యజించు, అదికారం కోసం పోటీపడడం త్యజించు
త్యజత పరేషు అక్రమఆక్రమణం ||
వేరేవారి ఆస్తులను ఆక్రమించాలనే దుర్భుద్ధి త్యజించు
జననీ పృథివీ కామదుహాస్తే | కామధేనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది
జనకో దేవః సకల దయాళుః |
భగవంతుడు: మన తండ్రియై అందరిని కరుణిస్తాడు
'దామ్యత, దత్త, దయధ్వం' జనతా |
నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో; నీ ఆస్తి పదుగురికి పంచు;
వేరేవారిపట్ల దయతో ఉండు; ప్రపంచ జనులారా!
శ్రేయో భూయాత్ సకల జనానాం ||
ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి
శ్రేయో భూయాత్ సకల జనానాం ||
ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి
శ్రేయో భూయాత్ సకల జనానాం ||
ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి
సర్వ మానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామి వారి లక్ష్యం. ఈ పాటను, ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది. “దామ్యత”, “దత్త”, “దయధ్వం” లోని మూడు “ద”లను మనిషి ఎన్నటికి మరువరాదు.
ప్రపంచ దేశాల ప్రతినిధులందరికి దీన్ని అనువదించి ఇవ్వడం జరిగింది. యమ్.యస్. అమ్మ, ఐక్యరాజ్య సమితిలో ఈ పాట పాడగానే దాని భావానికి అందరి మనస్సులు కరిగిపోయాయి. వారి గాత్ర మాధుర్యానికి తన్యత్వానికి లోనై, సారాన్ని అర్థం చేసుకున్న ఎంతోమంది ప్రతిధులు కళ్ళనీళ్ళు కారుస్తూ ఉండిపోయారు.
అరోజు ఆవిడకి గొంతు బాగాలేక సరిగ్గా ఊపిరి కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. కచేరి ఎలా చేయడమొ అని భయపడుతూ పరమాచార్య స్వామిని ప్రార్థించగా, పాడడం ప్రారంభించగానే గొంతు సరిపోయి అత్యంత మాధుర్యంగా కచేరి చేసారు
--(())--
స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు. వీటన్నిటిలోనూ ‘మిత్రుని సహాయమే’ ఎక్కువగా వెల కట్టలేనిది. ‘స్నేహం’ అనేది బాల్యం నుంచే మనిషి జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అందుకే, ‘మంచి స్నేహితుడు’ లభించడమనేది ఒక వరం వంటిది. స్నేహితుణ్ని ఎంచుకోవడానికి విధిగా పాటించవలసిన జాగ్రత్తలను ‘మహాభారతమే’ మనకు ప్రబోధించింది. ‘మంచి మిత్రుని అండ దొరికిన వారు సమాజంలో గౌరవ సంపదలతో వర్ధిల్లుతుంటారు’ అన్నది ఆర్యోక్తి. అయితే, ‘దరిద్రునికి ధనవంతునితో, విజ్ఞానికి మూర్ఖునితో, నెమ్మదస్తునికి క్రూరునితో, ఉత్తమునికి దుర్మార్గునితో స్నేహమనేది ఎప్పుడూ పొసగదు’ .
‘చదువు, సంపద, నడవడికలలో సమానులకు మాత్రమే మైత్రి పొసగుతుంది’ ‘ఒకే స్వభా వాన్ని కలిగి, అన్యోన్యంగా ఉండే మిత్రులకు ఒకవేళ ఆస్తిపాస్తులు, డబ్బు వంటి విషయాల్లో ఏమైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినా, వాటన్నిటినీ పక్కనపెట్టి విలువైన స్నేహం వైపే మొగ్గు చూపుతుండాలి’అన్న ప్రామాణికతను మరిచిపోరాదు. ‘మిత్రునికి అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే తన తెలివితేటలను ఉపయోగించి అయినా అతణ్ని ఆ విపత్తు నుంచి గట్టెక్కించాలి’ ఇదే ‘మిత్రధర్మం’. ‘ఎంతో మేలు చేసి సంపాదించుకున్న మంచి మిత్రుని వల్ల సిద్ధించే ప్రయోజనాలను కాదని అతనిని దూరం చేసుకోవడం ఇరువురికీ క్షేమం కాదు. ఈ ‘మిత్ర సంపద’ మిగతా సంపదలన్నిటి కంటేకూడా ఎంతో గొప్పది’ అలాగే, ‘సమస్యలలో ఉన్నప్పుడు మిత్రుడు తనకు చేసిన మేలును మరిచిపోకుండా, అవసరం వచ్చినప్పుడు తిరిగి అతనికి మేలు చేస్తుండాలి. తమకు సహాయం చేసిన వాళ్ల ఋణాన్ని తీర్చుకోవడానికి తిరిగి సహాయం చేసేవాడే ‘కృతజ్ఞుడు’.
‘మిత్రద్రోహాన్ని’ మించిన పాపం మరొకటి ఉండదు. మిత్రద్రోహులనూ, కృతఘ్నులనూ, గుర్తుపట్టి వారిని ఎప్పుడూ నమ్మకుండా దూరం పెడుతుండాలి’ చేసిన మేలును మరచిపోయి నవారిని, ఆ మేలు చేసిన వారికి కీడు చేసేవారినీ ‘కృతఘ్నులు’ అంటారు. తనకు అంతటి స్థాయి రావడానికి, సంపదలన్నిటినీ సమకూర్చుకోవడానికి, సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించడానికి, జీవితాం తం తనకోసం పాటుపడిన దాతకు అవసరాలన్నీ తీరిన పిమ్మట కీడు చేసే కృతఘ్నుని శవాన్ని తాకడానికి కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి’ అందుకే, ‘కృతఘ్నత’ అనేది పనికి రాదనీ, ఇది అనేక అనర్థాలకు దారితీస్తుందనీ మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ‘మంచివాళ్లతో స్నేహం చేస్తే మంచి జరిగినట్లే, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఫలితాలే అనుభవంలోకి వస్తాయి’
ఆరు నెలలు కలిసి ఉంటే వాడు వీడూ, వీడు వాడూ అవుతాడనే నానుడిలోనూ వాస్తవం లేకపోలేదు. అసత్యవాది సాంగత్యంలో ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. ఎంతో మహిమతో ఉండే విష్ణు సహస్ర నామావళిని బోధించిన భీష్ముడంతటి వాడు కూడా దుర్యోధనుని సాంగత్యం వల్ల గోవులను దొంగిలించడానికి సిద్ధపడ్డాడు. అందుకే ‘దుష్టులతో స్నేహం’ ఎన్నటికీ పనికిరాదని మన సనాతన ధర్మం నొక్కి చెప్తున్నది. స్నేహం చేయడానికి ముందే ఆ వ్యక్తి గుణగణాలనూ, నడవడికనూ చక్కగా బేరీజు వేసుకోవాలి. తమ అవసరాలు తీర్చుకోగానే కీడు చేసేవారిని ఏ మాత్రం దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడుతుండాలి. అప్పుడే, జీవితానికి మేలు, మిత్ర ధర్మానికి సార్థకత చేకూరుతాయి.
--(())--
భాష -ఉచ్చారణ
మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట.నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి?సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే.
సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి
వారిని గురించి ఆరా తీస్తాడు.ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని ఆంజనేయుడిని గురించి అనుకున్నాడు.ఎదుటి వ్యక్తికి
మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.
ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతె ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు పడుతున్నారు కదా!స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకుతున్నాము.కదా!. ఉదాహరణకి సైకాలేజీ స్పెల్లింగ్ ఏమిటి?మనం ఎలా పలుకుతున్నాము? ఆలోచించండి.మరి.వూరికే భాషాదినోత్సవాలు జరుపుకుంటే సరిపోదు కదా!
తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా!వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం' అని పలుకుతున్నారు.మరి ఎలా ఒప్పుకుంటున్నారు?యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు.హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు.వినడానికి సొంపుగా
వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.
పాఠశాలలో చదివే టప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి.ఇప్పుడు ఆంగ్లము లో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇది చాలా బాధాకరమైన విషయం.
ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠా లను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి.అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా వుండాలో ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)
వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక చిత్తుడై
యనుపమ భక్తి తో చదువునాతని వాచకుండండ్రు సద్బుధుల చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు,ఆ,ఈ వూ అని అనకూడదు.విసుగు చెందకూడదు.ఒక ప్రవాహం లాగా ఆవిరళం గా సాగాలి.అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందే మిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా.ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తీ శ్రద్ధ లతో చదివేవాడిని,మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు
ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది..ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా
తెలియదు.చెప్పేవారు కూడా లేరు.ఉపాధ్యాయులు అలాగే వున్నారు,విద్యార్థులూ అలాగే వున్నారు.
. 'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు,యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.అన్ని భాషలకూ వర్తిస్తుంది -(())--
కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలచుకుంటారు. ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగిపోతారు. భగవంతుడి గురించి ఆలోచించరు. మరికొందరు సుఖాలు కలిగినప్పుడు దేవుణ్ణి స్మరిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తారు. కష్టాలనూ, సుఖాలనూ దేవుడు ఇచ్చిన బహుమతులుగా స్వీకరించేవారు కోటానుకోట్లమందిలో ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి సూఫీ గురువు కథ ఇది.
ఆ గురువు ప్రతిరోజూ ప్రార్థన చేసేటప్పుడు ‘‘ఓ భగవంతుడా! ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావో ఏమో! ఎంతో కరుణతో నాకు కావలసినవన్నీ ఈ రోజు సమకూర్చి పెట్టావు. నా తల్లికన్నా ఎక్కువ శ్రద్ధతో, జాగ్రత్తతో నన్ను కనిపెట్టి ఉన్నావు. నా కృతజ్ఞతలు ఎలా తెలపాలో, ఏ మాటలు అందుకు సరిపోతాయో నాకు తెలియడం లేదు ప్రభూ’’ అంటూ కన్నీరు కార్చేవాడు.
ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి పొరుగు ఊరుకు వెళ్ళాడు. ఆ ఊరివారెవరూ వాళ్ళను పట్టించుకోలేదు. ఆహారం పెట్టలేదు. దీంతో వాళ్ళందరూ నిరాహారంగానే పడుకున్నారు. ఆ రోజు కూడా సూఫీ గురువు రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ చేసే ప్రార్థనే చేశాడు. శిష్యులు ఈ సంగతి గమనించారు. వారంతా ఆ రాత్రంతా ఖాళీ కడుపులతోనే ఉండాల్సి వచ్చింది. రెండో రోజు, మూడో రోజు కూడా ఇలాగే జరిగింది. తినడానికి ఏదీ లేక, ఆకలితో కడుపులు కాలుతూ ఉంటే నిద్ర రాక... ఆ శిష్యులంతా తమ గురువు పక్కనే అసహనంగా దొర్లుతున్నారు.
గురువు ఎప్పటిలానే ‘‘ఓ నా తండ్రీ! కరుణామయుడా! నా మీద నీకు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ! లోకంలోని ఇన్ని కోటానుకోట్లమందిలో నన్ను గుర్తు పెట్టుకొని, నా మీద అపారమైన నీ దయావృష్టిని కురిపించి కాపాడుతున్నావు. నాకు ఏది అవసరమో కనిపెట్టి, సమయానికి సరిగ్గా సమకూరుస్తున్నావు. తండ్రీ! నీ ఋణాన్ని నేను ఎలా తీర్చుకోగలను’’ అంటూ ఏడ్చాడు.
తాము ఆకలి మంటల్లో కాలిపోతూ ఉంటే గురువు ఈ విధంగా ప్రార్థించడం విన్న శిష్యులకు ఆగ్రహం వచ్చింది. వారిలో ఒకరు కోపం ఆపుకోలేక -
‘‘మహాశయా! అర్థం పర్థం లేని ఆ మాటల్ని ఆపండి. మూడు రోజులుగా తినడానికి తిండీ, నిద్రపోవడానికి వసతీ లేక... ఈ నిర్జన ప్రదేశంలో చెట్లకింద, ఇన్ని నీళ్ళు తాగి పడుకుంటున్నాం. మీరేమో దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా పిచ్చి, వెర్రి, అవివేకం ఇంకేం ఉంటుంది?’’ అని ఆవేశంగా అన్నాడు.
ఆ గురువు ప్రశాంత వదనంతో, ‘‘నాయనా! ఎన్నో ఏళ్ళుగా నేను తెలుసుకోలేని ఆ ప్రభువు ఘనతనూ, మహిమనూ ఈ మూడురోజుల ఆకలి, అవమానం, ఆపదల ద్వారా గ్రహించగలిగాను. అవి నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాబట్టే ఆ దయామయుడు వాటిని నాకు సమకూర్చాడు. తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, ఎన్నెన్నో ఆపదలు చుట్టు ముట్టినా... ఆ భగవంతుడి దయ ఉంటే బతికి ఉండగలమనే పాఠాన్ని గ్రహించాం కదా! నా భగవంతుడు కరుణాసముద్రుడనడానికి ఇంతకన్నా మంచి నిరూపణ ఉంటుందా’’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చాడు.
లోకంలో అందరూ భగవంతుడు తమకు ఎంత ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా... అవి సరిపోలేదనీ, ఇంకా కావాలనీ ఏడ్చేవాళ్ళే! ‘జీవించడానికి అత్యవసరమైన ఆహారం ఇవ్వకపోయినా... అంతకన్నా విలువైన జీవితాన్ని ఇచ్చావు’ అంటూ, భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేవారు ఎందరుంటారు?
.
ఆధ్యాత్మిక తాకు..6స్థానాలు..356
నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప్రాప్తియే ప్రేయస్సు. ఆధ్యాత్మికత సగుణం నుంచి నిర్గుణం వైపు, అంటే నామరూపాల పరిమితి నుంచి పరిమితిలేని సచ్చిదానంద పరబ్రహ్మం వైపు సాగే సాధన. ఏ అడ్డూ, ఆపూలేని విశృంఖలమైన సహజాతాలను సమయబద్ధమైన, సందర్భబద్ధమైన విధి నిషేధాల ద్వారా లోకహితకర సంస్కారంగా, సామాజిక సంప్రదాయంగా ప్రవహింపజేయడమే సంస్కృతి. ఆ సంస్కృతి ద్వారా నిరపేక్షానందాన్ని పండించుకునే విశిష్టమైన నిష్ఠ ఆధ్యాత్మికత.
వీరశైవం ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఆరు స్థానాలను పేర్కొన్నారు. వీటిని స్థాయులు, తలాలుగా భావిస్తారు. ఈ ఆరింటినీ కలిపి షట్ స్థలాలు అన్నారు. అవి భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య స్థలాలు. ఇందులో ప్రారంభ స్థాయి భక్త స్థలం. ఇది మొదటి మెట్టు. నిష్ఠను బలపరచుకునే దృష్టికి, ఆచరణకు సంబంధించింది. నిర్గుణ సచ్చిదానంద సదాశివం పట్ల, దానికి సంకేతంగా ధరించిన ఇష్టలింగం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, వాటి మధ్య అభేద దృష్టిని కలిగి ఉండటం. అంతేకాదు శివలింగానికి, శివభక్తుడికి అంటే జంగమునికి మధ్య అభేద భావాన్ని అచంచలంగా కలిగి ఉండటం. వారితో ఒక సేవకునిగా, దాసునిగా, భృత్యుడిగా పరమ నిరహంకారంతో వ్యవహరించడమే భక్త స్థలం. రెండో స్థాయి మహేశ స్థలం. సత్యం, అహింస, శుచి, అస్తేయం పాటించడం. పరధనం పట్ల, పరస్త్రీ పట్ల ఎలాంటి కాముకత లేకపోవడం. పరనింద వీడి పరమ శివనిష్ఠతో జీవించడం మహేశ స్థలం.
మూడోమెట్టు ప్రసాది స్థలం. తాను ఇంద్రియాల ద్వారా పొందే ప్రతి విషయాన్నీ, ఏ మినహాయింపూ లేకుండా సమస్తం శివార్పణం చేసి, దానిని శివప్రసాదంగా మాత్రమే స్వీకరించడం. అంటే ఒకరకంగా తన అనుభవాన్నంతా ఈశ్వర ప్రసాద ధారగా చేసుకోవడమే ప్రసాది స్థలం. నాలుగోది ప్రాణలింగి స్థలం. లింగమే తన ప్రాణంగా, తన ప్రాణమే లింగంగా భావించి, అన్ని పరస్పర విరుద్ధ పరిస్థితులలో సమశాంత చిత్తంతో జీవించడం. సుఖమైనా, దుఃఖమైనా శివానుభవంగా మలచుకోవడం. పక్షపాతాలను భ్రాంతిగా విడిచి బతకడమే ప్రాణలింగి స్థలం. ఈ స్థాయిలో జీవితం ఒక శుద్ధ శివప్రవాహం అవుతుంది.
ఐదో మెట్టు శరణ స్థలం. శివలింగాన్నే పతిగా భావించి, దానికి అధీనమైన సతిగా పాతివ్రత్యంతో జీవితం సాగించడం. అంటే తన ఎరుకను పూర్తిగా శివమయంగా చేసుకొని, జీవితాన్ని సంపూర్ణ శివశిల్పంగా మలచుకోవడమే శరణ స్థలం. చివరిది, అత్యున్నమైన ఆరోస్థాయి ఐక్య స్థలం. లౌకికమైన అన్ని కోరికలను పెరికివేసి, అన్ని బంధనాలు రాల్చేసి, అర్చనాది కర్మలనూ వదిలేసి పరమ నిష్కామంతో, నిర్భీతితో జీవన్ముక్తుడిగా ప్రగాఢమైన శివాద్వయస్థితిలో మనడమే శిఖరస్థాయి సమానమైన ఐక్య స్థలం.
ఈ విధంగా సాధకుడు మొదటి స్థాయిలో భక్త స్థలంలో విశ్వాసనిష్ఠను, వినయాన్ని సుస్థాపనం చేసుకుంటాడు. రెండో స్థాయిలో మహేశ స్థలంలో పరిశుద్ధతను, త్యాగనిరతిని ప్రోది చేసుకుంటాడు. మూడోదైన ప్రసాది స్థలంలో కృతజ్ఞతను, శివప్రసాద మాధుర్యతను సొంతం చేసుకుంటాడు. నాలుగో స్థాయి ప్రాణలింగి స్థలంలో సమత్వాన్ని, సమున్నతత్వాన్ని పెంపొందించుకుంటాడు. ఐదోదైన శరణ స్థలంలో శివాత్మీయతతో జీవితాన్నే మహాశివ శిల్పంగా మలచుకుంటాడు. ఆరోస్థాయి అయిన ఐక్య స్థలంలో శివాద్వయానుభూతితో జీవన్ముక్త స్థితిని సిద్ధింపజేసుకుంటాడు.
...........
..జూన్ మూడవ ఆదివారం..357
52దేశాలలో ఫాదర్స్ డే జరుపుతారు.🙏🙏
మనదేశంలో పురాణ కాలం నుండినాన్నకు (తల్లిదండ్రులకు) సముచిత స్ధానం ఇవ్వబడింది. కానీ నేడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో, స్వార్ధపరత్వం వల్ల మనం కూడా ఫాదర్స్ డే జరుపుకోవలసిన పరిస్ధితులలోకి వెళ్లిపోతున్నాం.
🌷ఈరోజు ఒక్కరోజే ఊరికే ఫాదర్స్ డే అని గొప్పగా చెప్పుకొని కానుకలు యిచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంకాదు... తల్లిదండ్రులు దైవసమానులని మనం మనపిల్లలముందు ప్రవర్తిస్తే భవిష్యత్ లో మనపట్ల మన పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు.మనం వృధ్ధాశ్రామాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మన పిల్లలు చూస్తారు
🌷పిల్లలకోసం సర్వం త్యాగం చేయగల త్యాగమూర్తి..నాన్న.
అటువంటి తండ్రిని పిల్లలు మరచి పోక నాన్న స్ధానాన్ని గౌరవించ గలిగితే నాన్నకు ప్రతీరోజూ ఫాదర్స్ డేనే. ప్రత్యేకంగా సంవత్సరానికోసారి ఫాదర్స్ డే అవసరం ఉండదు.
🌷పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించి నపుడే పుట్టదు మరి జనులా
పుత్రుని గని పొగడగ నాడు
పుత్రోత్సాహము పొందుర సుమతీ
అని సుమతి శతక కర్త బద్దెన అంటాడు.
🌷సి నా రె ఒక సినిమా పాటలో ఓ!నాన్నా నీ మనసే వెన్నా అమృతము కన్నా నీ మనసే మిన్నా .... అని చెప్పారు.
మనం అటువంటి తండ్రిని భగవంతుడి కంటే మిన్నగా చూసుకోవాలి.
తమ కుటుంబాన్ని ఫిజికల్గా, ఆర్ధికంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కష్టపడే తండ్రులు తమ పిల్లలకు నిజమైన హీరోలు. తండ్రి పిల్లలకు తొలి హీరో ...
🌷ఫాదర్స్ డే అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్రకు సింబల్గా నిలుస్తుంది. తమను కని పెంచి..బాధ్యతగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా, గౌరవంగా కాస్సేపైనా తండ్రితో పిల్లలు ఆనందంగా గడపడమే ఈ రోజు ముఖ్యోద్దేశం.
🌷ఫాదర్స్ డే అనేది ప్రపంచానికి అమెరికా ద్వారా పరిచయమైంది. అమెరికాలో సోనోరా స్మార్ట్ డోడ్ తొలిసారిగా ఫాదర్స్ డేను జరిపి ప్రపంచానికి పరిచయం చేశారని చెబుతారు. సోనోరా తండ్రి విలియమ్ జాక్సన్ స్మార్ట్. అర్కాన్సాస్ నుంచి వచ్చిన అతను ఆరుగురు పిల్లలకు సింగిల్ పేరెంట్. అన్నా జార్విస్ తన తల్లికి గౌరవంగా మదర్స్ డే క్రియేట్ చేసినట్టే తండ్రుల్ని గౌరవించేందుకు ఏదైనా కొత్తగా చేయాల్సి ఉందని చర్చ్ ఫాదర్తో సోనోరా చెబుతుంది.
🌷 తన తండ్రి కష్టాన్ని గుర్తించేందుకు, తగిన రీతిలో గౌరవం ఇచ్చందుకు, తండ్రులందరికీ ఒక రోజు ఉండాలని విలియమ్స్ పుట్టినరోజైన జూన్ 5న ఫాదర్స్ డే జరపాలని ఆలోచించింది. దీనికోసం చర్చ్ ప్రతినిధుల్ని ఒప్పించింది. అయితే ఆ ప్రయత్నంలో ఫాదర్స్ డే జరిపే తేదీ మారింది. అదే నెలలో మూడవ ఆదివారం జరపాలని నిర్ణయించారు. సోనోరా చెప్పిన తేదీలోగా ఏర్పాట్లు చేయడం కష్టమని భావించి అలా చేశారు. అప్పట్నించి జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే నిర్వహిస్తున్నారు.
🌷. ఫాధర్స్ డే సందర్భంగా పితృదేవుల్లందరికీ శుభాకాంక్షలు...,
* సంతోషమే ఐశ్వర్యం..కధ.358
*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
జీవితం కూడా అంతే...
*ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.
• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*
సంతోషానికి మించిన ఐశ్వర్యం
🙏శ్రేయోభిలాషి మల్లాప్రగడ రామకృష్ణ
ధన్యవాదాలు.....🙏🙏
.........
అచ్చుతుని అభయం కధ....359
శ్రీమద్భాగవతంలో భాసిస్తూ ఉన్న అన్ని కథల కన్నా ఎన్నగ పన్నగశాయి అనన్య భక్తుడైన ప్రహ్లాదుని కథను ఎంతో మిన్నగా విన్నవించాడు తెలుగునాట భక్తకవిగా పేరెన్నికగన్న పోతన్న. బాలప్రహ్లాదుని పాత్రలో భక్తి రసాన్ని పరవళ్లు తొక్కించి భావుక భాగవత భక్త చిత్తాలను మత్తెక్కించి మైమరపింప చేశాడు. సర్వవ్యాపకమైన- అంతటా పరచుకొని ఉన్న నిర్గుణ నిరాకార బ్రహ్మము వలె సగుణ సాకార భగవంతుడు కూడా అణువణువున విస్తరించి భక్తితో పిలిస్తే పలికి వెలికి వచ్చి వరాలు వర్షిస్తాడన్న వాస్తవాన్ని ఇంత సరళంగా, సరసంగా, ముగ్ధమనోహరంగా, స్నిగ్ధ శాస్త్రీయంగా ప్రస్తావించి విస్తారంగా వర్ణించి నిరూపించిన కథ ఇందు తప్ప మరెందునా కనిపించదు.
సత్యవస్తువు- బ్రహ్మము కేవలం నిర్గుణ నిరాకారము కాదు, కేవలం సగుణ సాకారమూ కాదు. నిజానికి అది ఉభయాకారం. ఇలా అనుభవం పొందడమే పూర్ణజ్ఞానం. నిర్గుణ నిరాకార బ్రహ్మము అరణి (కట్టె)లో అవ్యక్తం (అప్రకటితం)గా ఉన్న అగ్ని వంటిది. కళ్లకు కనిపించే వ్యక్తమైన (ప్రకటమైన) కృశానుడు (అగ్ని) సగుణ సాకార బ్రహ్మము. ఈ రెండూ అనిర్వచనీయాలే, అగాధాలే- గూఢములు, గంభీరములే. నిర్గుణ సగుణ బ్రహ్మల కన్నా భగవంతుని నామం మిక్కిలి మహిమోపేతం. నామ జపం వలన ఈ రెండూ సుగమాలు, సులభాలు అవుతాయి. సర్వజీవుల హృదయాలలో సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ కచ్చితంగా కొలువై ఉన్నా జీవులు అతి దీనులుగాను, మతి హీనులుగాను దుఃఖ తతి (పరంపరల)చే సతమతమవుతున్నారుగా!
నామ మహిమను గుర్తించి త్రికరణ శుద్ధిగా జపించడం వలన ఆ పరబ్రహ్మ వ్యక్తం అవుతాడు. రూపుదాల్చిన బ్రహ్మానందమే భక్తలోకానికి అపురూప ఆదర్శమైన ప్రహ్లాదుడు. నవధా- తొమ్మిది విధాలుగా ఉన్న భక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన పరమ భాగవత శిఖామణి బాల ప్రహ్లాదుడు. ‘శ్రవణం, కీర్తణం విష్ణోః స్మరణం..’ ఈ క్రమంలో స్మరణ భక్తి మూడవది. ‘మామనుస్మర యుధ్య చ’- సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరిస్తూ కర్తవ్య నిర్వహణ గావిస్తూ ఉండమని గీతలో భగవానుని ఆదేశం. ‘ప్రహ్లాదః స్మరణే’-
ప్రహ్లాదుడు స్మరణ భక్తికి ప్రతీకం, దృష్టాంతం. ‘హరినామమే నరహరి అనగా నరసింహస్వామి! సమస్త పాప తాపాలకు నిలయమైన కలియుగమే కనక (హిరణ్య) కశిపుడు. హరినామ జపపరులే ప్రహ్లాదులు. నృసింహదేవుడు హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని వరించినట్లు హరినామం కలి కలుషా (పాపా)లను హరించి భక్తులను పరిపరి విధాల పరిపాలిస్తుంది’ అని భక్తకవి వతంసుడు తులసీదాసు తన ‘మానస రామాయణం’లో భవ్యంగా వర్ణించాడు.
రాజసూయ యాగ సందర్భంలో పాండుపుత్రుడైన ధర్మరాజుకు భక్తి విశారుదుడైన నారదుడు ప్రహ్లాద చరిత్రను సభాముఖంగా ఇలా ప్రవచించాడు.
మహారాజా! విరించి (బ్రహ్మదేవుడు) తను వరించిన వరాలన్నీ మారెంచక ప్రసాదించాడనే గౌరవం ఇంచుక కూడా లేకుండా, తన తమ్ముడైన హిరణ్యాక్షుని వధించినందుకు హిరణ్యకశిపుడు మదించి హరిపై అదను చూసి పగ సాధించాలని నిర్ణయించుకున్నాడు. విష్ణువుపై విరోధం పెంచుకున్నాడు. బ్రహ్మదేవుని వరం అసురునికి అమోఘమైన బ్రహ్మాస్త్రమై అలరారింది. ఆ దైత్యవిభుని దురాగతాలు దేవతలకు దుర్భరమైపోయాయి. వరగర్వం వలన కళ్లకు పొరలు కమ్మగా దితి పుత్రుడు దిమ్మదిరిగే పరాక్రమంతో ప్రాణికోటిని పీడించసాగాడు. ఆ దుష్టుని నిరంకుశ నికృష్ట శాసనానికి సృష్టి అంతా భ్రష్టు పట్టింది.
లోకమంతా ఏకాధిపత్యం సాధించి అసురరాజు సురలోకం (స్వర్గం) ఆక్రమించాడు. విధి, విష్ణు, విశ్వేశ్వరులు తప్ప తక్కిన విబుధు (దేవత)లంతా తలలు వంచి అమర విరోధి (అసురుని)కి వశమై అడుగులకు మడుగులొత్తారు. కరుణించమని శరణుకోరారు. భూలోకంలోని ఏ భాగంలో యాగాలు జరిగినా హవిర్భాగాలను హిరణ్యకశిపుడే వచ్చి బలాత్కారంగా హరించుకుపోయేవాడు. యథేచ్ఛగా ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ తృప్తిపడక దృప్తుడై- మదగర్వంతో ధర్మమర్యాద (హద్దు)లను అతిక్రమించాడు. ‘శరాబ్ (మద్యం) తాగనివాని దిమాగ్ ఖరాబ్’ అన్న విధంగా మధువును సేవించి మదించి విందుపొందులతో వినోదించేవాడు. వాని ధాటికి ధరణి- భూమి కూడా దున్నకనే అన్ని పంటలు పండేది. దైత్యరాజు రాజదండానికి భయపడిన దేవతలు దిక్కులన్నిటికీ దిక్కయిన దివ్యమూర్తి దేవదేవునికి రక్షించమని మొక్కుకున్నారు. కంటికి కనిపించకుండా కమలనాభుడు- విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు- ‘అమరులారా! అరమరిక లేక వినండి. మీకు అభయం ఇస్తున్నా. అసుర నాయకుడు చేస్తున్న అశాస్త్రీయ ఆగడాలు నాకు తెలుసు. వాడి పాపం పండి కాలం మూడినప్పుడు వాణ్ని సంహరిస్తా. సాధువులను బాధించేవాడు, విబుధు (దేవత)లను వేధించేవాడు, నిగమా (వేదా)లను నిందించేవాడు, విప్రులకు అప్రియం ఆచరించేవాడు, గోవులను హింసించేవాడు, ధర్మపదవి (మార్గం) తప్పి నాపై పగబూనిన వాడు పెక్కురోజులు నిలువక పతనమైపోతాడు-
నిర్జరులారా! ఈ దుర్జనుడు తన కన్నకొడుకైన ప్రహ్లాదుని, మిగుల సజ్జనుడనీ, శమ దమాది సద్గుణ సంపన్నుడనీ, అజాత శత్రువనీ ఏ మాత్రం ప్రేమ అభిమానాలు లేక ఎప్పుడు బాధిస్తాడో అప్పుడే వాణ్ని వధిస్తా. నేను అన్య (ఇతర)మైనది ఏదైనా సహిస్తాను కానీ, అనన్య భక్తునికి చేసిన ద్రోహాన్ని భరిస్తూ మాత్రం మిన్నకుండలేను. మీకు శుభం కలుగుతుంది. సందేహించక వెళ్లిరండి.’ అచ్యుతుని నుంచి ఇలా అభయం పొంది అమరులు ఆనందిస్తూ తమ ఆవాసాలకు వెళ్లారు.
🔆ఒక అమ్మ కథ🔆360
""""'''''''''''''''''''''"""""""
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది
మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు
ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది
ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది
ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది
ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే
అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది
ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”
కోపంగా అరిచేసే వాణ్ణి
ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు
నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది
అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది
ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను
మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది
నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను
అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది
మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు
నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?
మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను
పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను
మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను
బాగా డబ్బు సంపాదించాను
మంచి ఇల్లు కొనుక్కున్నాను
మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను
నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది
ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి
ఇంకెవరు?
మా అమ్మ
ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నువ్వెవరో నాకు తెలియదు
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”
సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”
ఆమె అదృశ్యమై పోయింది
“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”
భారంగా ఊపిరి పీల్చుకున్నాను
ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు
వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను
స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను
ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి
మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది
ఆమె చేతిలో ఒక లేఖ
నా కోసమే రాసిపెట్టి ఉంది
దాని సారాంశం
ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను
నేనింక నీవుండే దగ్గరికి రాను
కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!
ఏం చేయమంటావు?
నిన్ను చూడకుండా ఉండలేకున్నాను
కన్నపేగురా
తట్టుకోలేక పోతోంది
నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు
కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే
వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను
ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు
చిన్నా!
నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది
నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా
అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను
నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?
నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు
ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”
అని సరిపెట్టుకున్నాను
చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు
ఉత్తరం తడిసి ముద్దయింది
నాకు ప్రపంచం కనిపించడం లేదు
నవనాడులూ కుంగి పోయాయి
భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను
తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?
మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?
ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?
నాస్తి మాతృ సమం దైవం
నాస్తి మాతృ సమః పూజ్యో
నాస్తి మాతృ సమో బంధు
నాస్తిమాతృ సమో గురుః
అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు
తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు
ఆకలేసినా..
ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ
తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ
అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి
కనుపాప లా కాపాడండి
బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం
తల్లి ఋణం ఈ జన్మకి తీరదు
కంట నీరు పెట్టించిన కధ
*చదివినవారికి ధన్యవాదాలు*
సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment