[
*🌸సహజ కవచం*🌸
ప్రాణరక్షణకు కవచాలు ధరిస్తారు. అవి ఆయుధాల నుంచి కాపాడతాయి. అస్త్రాలకు వరకవచాలు ఉండాలి. పురాణాల్లో రాక్షసులు ఘోర తపస్సులు చేసి వరకవచాలు పొందేవారు. అవి కంటికి కనిపించవు. కానీ, అమోఘ శక్తితో అస్త్రాలనుంచి రక్షిస్తాయి.
సహస్ర కవచుడు బ్రహ్మనుంచి వెయ్యి వరకవచాలు పొందాడు. వరగర్వంతో విర్రవీగి, లోకాలను పీడించడం ప్రారంభించాడు. దుష్టశిక్షకుడైన శ్రీహరి నర, నారాయణ రూపాల్లో తీవ్ర తపస్సు చేసి, ఆ శక్తితో ఒక్కటితప్ప మిగిలిన అన్ని కవచాలూ భేదించగా- ఆ ఒక్క కవచంతో పారిపోయి సూర్యుడి శరణు పొందుతాడు. కుంతి మంత్రానికి వశుడైన ఆదిత్యుడు తన వద్ద ఏకకవచంతో ఉన్న శరణార్థి ఆత్మను దైవలీలగా కుంతికి ప్రసాదిస్తాడు. అలా పుట్టినవాడే కర్ణుడు. సహజ కవచకుండలాలతో జన్మించిన కారణజన్ముడు.
మనందరికీ అదృశ్య సహజ కవచాలున్నాయి! మనిషికి జ్ఞానం వికసిస్తున్నకొద్దీ, నీడలాగా అజ్ఞానమూ వెంట ఉంటుంది. మహాపండితుడికి అహంకారం అనే నీడ, మహా ధనికుడికి గర్వం అనే దుర్లక్షణం, అధికారికి పొగరుబోతుతనం అనే చెడ్డగుణం- ఇలా ఆధిక్యత గలవారందరికీ ఏదో ఒక అవలక్షణం ఉప కవచంగా ఉంటుంది. ఆధిక్యతలన్నీ ప్రధాన కవచాలు.
స్థితప్రజ్ఞులకు, శుద్ధ సత్త్వస్వరూపులకు మానావమానాలు పట్టవు. మహావిష్ణువు మహా సత్త్వస్వరూపుడు. హృదయం మీద భృగువు కాలితో తన్నినా మందహాసంతో మన్నించాడు. ఆయన సత్త్వగుణంతో భృగువు అహంకారాన్ని పశ్చాత్తాపంగా మార్చివేశాడు. అందుకే ‘క్షమాగుణం’ మహాశక్తిమంతమైనదని పెద్దలు చెబుతారు.
రజో, తమో గుణాలుగలవారికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే కవచాలు. ఆ కవచాలే వారికి అన్ని సమస్యలూ సృష్టిస్తాయి. శత్రువుల్ని పెంచుతాయి. శ్రేయోభిలాషుల్ని దూరం చేస్తాయి.
భగవంతుడు ఎవరికీ సుఖదుఃఖాలను ఇవ్వడు. జీవుడు తన కర్మల ద్వారా సుఖదుఃఖాలను ఆర్జించుకుంటాడు. సుఖం కలిగినప్పుడు భగవంతుణ్ని ప్రశంసించని మనిషి, దుఃఖంలో ఆయనను బాధ్యుడిగా చేసి పలువిధాలుగా నిందిస్తాడు. అన్నింటికంటే ఎక్కువ పాపం- దైవనింద!
దోషాలన్నీ తనలో ఉంచుకుని దైవాన్ని తిట్టడం సబబు కాదు. శస్త్ర చికిత్స చేసి రక్షించే వైద్యుడు శత్రువెలా అవుతాడు? కర్మఫలాలను అనుగ్రహించే పరమాత్మ కూడా అంతే. ఆ విధంగా చూస్తే ధర్మదేవత యముడు కూడా తాను విధించే నరక శిక్షలకు నింద్యుడు కాడు. స్వర్గ సుఖాలను ప్రసాదించే ఇంద్రుడు కూడా గొప్పవాడు కాడు. ఇవి రెండూ జీవుడి కర్మఫలాలే!
పుట్టుకతో అందరూ మంచివారే. జ్ఞానం కలిగేవరకు అమాయకులే. అటు తరవాత స్వయంకృషి మొదలవుతుంది. అదే తపస్సు. మనకు కవచాలను ప్రసాదించేది కృషి అనే తపస్సు. మనం ఎంపిక చేసుకునే రంగంలో మన కృషి, తపస్సు ఎంత తీవ్రంగా ఉంటే అంత ఘనంగా ఫలాలు లభిస్తాయి. అవే కవచాలవుతాయి.
విద్యాకవచం శాశ్వతం. దానికి కాలపరిమితి ఉండదు. లక్ష్మీ కవచం అశాశ్వతం. ఎప్పుడైనా తొలగిపోవచ్చు. అధికార కవచం పదవీ విరమణతో తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కవచమన్నది జారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సాధకుడిదే. జ్ఞాన కవచం- అహంకారం రానంతకాలం భద్రమే! శీల కవచం- దీన్ని కాపాడుకుంటే, ఇదే అన్ని కవచాలను కాపాడుతుంది. ధర్మశీలత్వం సత్త్వగుణం గలవారిని వదలదు. కాబట్టి, సత్త్వగుణాన్నే సహజ కవచంగా చేసుకోవాలి.
మనలోని అరిషడ్వర్గాలు, రజో తమో గుణ సంబంధమైనవిగా గ్రహించి, వాటిని ప్రయత్న పూర్వకంగా విసర్జించాలి. కల్మషాన్ని కడిగివేస్తుంటే, పరిశుభ్రత నెలకొన్నట్లు- ఆత్మకు ఖేదాన్ని కలిగించే దుష్ట కవచాలు తొలగిపోతుంటే, సహజ కవచంగా శుద్ధసత్త్వం మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. అది దివ్య కవచం. అది లభించిన క్షణంలో ‘అంతర్యామి’ దర్శనం అయాచితంగా లభిస్తుంది. మన ఆధ్యాత్మిక కృషికి అంతిమఫలం అదే!
- కె.విజయలక్ష్మి
[🚩*ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?*🚩
--------------------------------------------
‘ధర్మో రక్షతి రక్షితః’ అను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ఆ ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం. రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి.
‘సత్యమునే పలుకుము...అసత్యము పలుకరాదు’ అనే సూక్తి మనకు తెలిసిందే.
ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు.
అయితే...‘ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యునిచేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాలలోనే అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటివాడు, వ్యాసభగవానుని బాటలో నడిచి అలా పలికాడు?
‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను.
దండకారణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఋషి ధర్మనిష్ఠాగరిష్ఠుడు...సత్యవాది. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణ భయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందునుంచి పరుగెత్తుకుని వెళ్లింది. అది చూసాడు ఆ ఋషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు. వేటగాడు వచ్చి ‘ఇలా ఆవు వెళ్ళిందా’ అని అడిగితే ‘అబద్ధం ఆడరాదు’ అనే దర్మానికి కట్టుబడి ‘వెళ్ళింది’ అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీదనుంచి లేచి, ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోదన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి ‘అయ్యా...ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్లిందా?’ అని ఆ ఋషిని అడిగాడు. గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి వేటగాని వంకచూసి ‘నాయనా.. ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్తున్నప్పటినుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు’ అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తిచెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుననప్పుడు ఆవు వెళ్లింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్లలేదు. అదీ సత్యమే. అదే చెప్పాడు ఆఋషి. ఋషి అసత్యము ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇదీ కథ.
మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితని పాటించాలి. చెడు పని చేసే విషయంలో ‘నిదానమే ప్రదానం’ అనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.
"సర్వే జనాః సుఖినోభవంతు.
[
" బాటసారి- కల్పవృక్షం. "
ఒక బాటసారి ప్రయాణమై పోవుచు దారిలో ఒక మైదానము చేరుకొనెను. బయట ఎండలో నడిచిఅలసిసొలసి ఒక చెట్టునీడలో కూర్చుండెను. అతడీవిధముగా తలపోసెను.
" ఇక్కడ నిద్రించుటకు ఒక పాన్పు లభించిన ఎంత సుఖముగా ఉండునో! "
ఆ చెట్టు కల్పవృక్షం అయిన కారణంచేత వెంటనే ఆయన కోరిక ప్రకారము అక్కడ చక్కని పానుపు ప్రత్యక్షముకాగా ఆబాటసారి అమితాశ్చర్యము చెంది ఆపాన్పుపై పరుండెను. ఆయన ఆలోచనలు అంతటితో ఆగలేదు. "ఒక సుందరి వచ్చి నెమ్మదిగా పాదము లొత్తిన ఇంకెంత బాగుండునో కదా? అనుకున్న వెంటనే ఆ కల్పవృక్ష మహిమ వలన ఒక సుందరి ప్రత్యక్షమై ఆయన పాదములు ఒత్తసాగెను. అమందానందభరితుడైన ఆయనకు ఒక్కసారిగా ఆకలి పుట్టినది. వెంటనే ఊహించ సాగాడు.
"కోరినదంతయు లభించుచున్నది. మధుర పదార్థాలు లభించకుండునా?" తక్షణమే నానావిధ రుచికర పదార్థాలు ప్రత్యక్షమైనవి. తృప్తిగా తిని పడుకుంటూ జరిగిన సంఘటనలతో మైమరచి "ఇపుడు హఠాత్తుగా ఏదేని పెద్దపులి వచ్చి నన్ను గుటుక్కున మింగదు కదా?" ఇలా అనుకొనగానే నిజముగానే పులి ప్రత్యక్షమై వానిపై ఉరికి మెడ కొరికి ఆబాటసారిని చంపివేసెను.
సాధారణంగా లోకులు ఇదేవిధముగా ఆలోచించెదరు. కీర్తి గౌరవములను వాంఛించి దేవుని ప్రార్థించినపక్షమున ఆ కోరికలు కొంతవరకు ఫలించును. కాని వాటివెనుకనే రోగములు, శోకములుధనహాని, మానహాని లాంటి పెద్దపులులు సజీవమైన పులులకన్న వేెయి రెట్లు భయంకరమని కావున జాఖరూకతగా ఉండవలెనని శ్రీరామకృష్ణ పరమహంస బోధించుచున్నారు.
[
అంతశ్శత్రువులు
ప్రకృతిలోని కాలాలు, రుతువులతో పాటు మనిషి జీవితంలోని వివిధ దశలూ మార్పునకు లోనవుతుంటాయి. ఇది ప్రకృతి సహజం, మన ప్రయత్నం లేకుండానే జరిగే ప్రక్రియ బాల్యంలో నిష్కల్మషంగా ఉండే మనిషి- వయసు పెరిగే కొద్దీ రాగద్వేషాలు, అరిషడ్వర్గాలకు బానిస అవుతాడు. కాలమాన పరిస్థితులు, సమాజ పోకడలు, ఆశాపాశాలు లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. అవి తనలో ఉన్నట్లు గమనించ లేనంతగా మనసును ఆవరించుకుని పెనవేసుకు పోతాయి. తనలో ఉన్న ఈ శత్రువులను గుర్తెరిగి, వాటి నుంచి దూరంగా రాగలిగితేనే మనిషి మనిషిగా ఎదుగుతాడు. అందుకుగాను తమలో రావలసిన మార్పుల గురించి ఎవరికి వారుగా తెలుసుకోగలగాలి. వాటినుంచి దూరం కావడానికి ప్రయత్నించాలి.
అందుకోసం ముందుగా తన జ్ఞాన రాహిత్యాన్ని నిజాయతీగా ఒప్పుకోవాలి. కోరుకున్న మార్పును పొందేందుకు ఆహరహం శ్రమించాలి. లక్ష్యం చేరుకోవడానికి దగ్గరి దారులు ఉండవు. గురువు చెప్పిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా వినాలి. ఆకళింపు చేసుకోవాలి. ఆపై నియమ బద్ధంగా అనుష్టానంలో పెట్టు కోవాలి. ఇందులో ఏ దశను అనుసరించక పోయినా ప్రయోజనం ఉండదు. తమలో తిష్ట వేసుకున్న శత్రువులను బయటకు తరమలేరు.
ఈశ్వరుడు ఇచ్చిన బుద్ధిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్లనే యౌవనం, ధనం, అధికారం, అవివేకం అనే నాలుగు మనిషి పతనానికి కారణాలవుతున్నాయని మహా భారతం చెబుతోంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి అంతశత్రువులు ఆవరించు కున్న దుర్యోధనుడు పాండవులను ఎన్నో కడగండ్లపాలు చేశాడు. రాజ్యాధికారం, ధనగర్వం, చెడు సహవాసం, స్వతంత్ర ఆలోచనా లేమి, సరైన సలహాలు ఇచ్చేవారు. కొరవడి- అంతశ్శత్రువులు ప్రబలడానికి, ఫలితంగా చివరికి అతడి పతనానికి కారణమయ్యాయి.
అంతర్యామి
సుఖదుఃఖాల సమన్వయం ఈ జీవితం. ఈ రెండింటినీ సమానంగా ఒకే దృక్కోణంలో చూడాలంటే మనలోనే తిష్ట వేసుకుని కూర్చున్న శత్రువులను పారదోలాలి. వాటిని గుర్తించడం చాలా కష్టం. నాది నాది అనుకునే ఈ మాయే అన్ని బందనాలకీ గుర్తు, మనలోని శత్రువుల నుంచి విముక్తికి, నీలో నువ్వే ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. రాగ ద్వేషాలతో సతమతమయ్యే మనసు అశాంతికి లోనవుతుంది.
'మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానందమొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడనై మోసపోతిని' అని త్యాగరాజు తన పంచరత్నాల్లో ఒకటైన 'దుడుకుగలనన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో కడు దుర్విషయాకృష్ణుడై గడియ గడియకు నిండారు... అనే కీర్తనలో చింతించాడు. విశ్వామిత్రుడు, పరశురాముడు, దూర్వాసుడు మొదలైన వారు మొదట అంతశ్శత్రువులైన కామక్రోధాదులకు లోబడినవారే అనంతర కాలంలో వాటిని
దూరం చేసుకుని మహర్షులుగా మారగలిగారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. తద్వారా ప్రసన్నమైన, నిర్మలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మానసిక స్థితి ద్వారా ఆవేశకావేషాలను నియంత్రించుకోవచ్చు. మనం ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణమూ మారుతుంది. అప్పుడే మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు.
-గంటి ఉషాబాల
***
["కుక్క కాటుకు చెప్పుదెబ్బ"
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.స్నేహితులంతా ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు.నీవేమీ ఘనకార్యం చెయ్యలేవా?అని ఎగతాళిగా అడిగారు. అప్పుడు వనమయ్య నేనేదయినా చేయగలను.ఏమి చేయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను. అన్నాడు.
అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి వుండాలి.ఏ విధంగానూ వేడి తగలరాదు.పొద్దు పొడిచేవరకూ అలాగే నిలబడి వుండాలి.అని హెచ్చరించారు. సరే అలాగే నిలబడతాను.నేను ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను.అదీ పందెం.అన్నాడు వనమయ్య.
ఇంట్లో కుంపటి,దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు.అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభ మైంది.పళ్ళు గిత్త కరుచుకుని పోయాయి. అటూ యిటూ పచారు చేయటం మొదులు పెట్టాడు..యింతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లని పించింది.ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది. స్నేహితులు వచ్చి మొత్తానికి గెలిచావయ్యా అని అభినందించారు.నీ కడుపు బంగారం గానూ!ఎలా ఓర్చుకున్నావయ్యా? అని అడిగారు.అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాని వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను.అన్నాడు వనమయ్య.
ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు వోడిపోయినట్టే.నీవు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టు బట్టారు.
ఎక్కడో దూరంగా వుండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది?యిది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు.విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టు బట్టారు.వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమి చెయ్యాలో దిక్కుతోచక న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని వేడుకున్నాడు.ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని చెప్పి పంపించాడు.
సరే నని యింటికి వెళ్లి మరుదినం ఒక కుండ లో బియ్యము నీళ్ళు పోసి చూరుకు వ్రేలాడ దీసి కింద చిన్నదీపం వెలిగించి పెట్టాడు.మధ్య మధ్యలో ఒక చిన్నబల్ల మీద ఎక్కి వుడి కిందా లేదా అని చూస్తున్నాడు.మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు వంట అయిందా వనమయ్యా?అని అడిగారు.యిదిగో యింకా ఉడుకు పట్టలేదు. పొద్దుననగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలి వచ్చి చూసి యిలా పెడితే ఎలావుడుకుతుంది? నీకేమైనా పిచ్చా? అన్నారు.స్నేహితులు.దీపం చిన్నదైనా,ఎంతదూరంగా వున్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా మరి యిదీ అంతే.అన్నాడు వనమయ్య.వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ యింటి కి వెళ్లి వనమయ్యకు ఘనంగా విందు యిప్పించారు..
"కుక్క కాటుకు చెప్పుదెబ్బ"
No comments:
Post a Comment