Monday, 20 June 2022


 మృదు భాషణం


నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.

గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. మృదుభాషణం మనుషులందరిలో  కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి. వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణ మన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.

ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే.

మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి. వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి.
భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.
 

వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!

* శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి.

శ్రీమాత్రే నమః

*420. గాయత్రీ!!*

గాయత్రీ = గానము చేసిన వారిని రక్షించునది.

‘న గాయత్రియా  పరమ్ మంత్రం, నమాతుః పరదైవతమ్' అన్నారు. ' గాయత్రిని మించిన మంత్రం - తల్లిని మించిన దైవం లేరని' ఈ శ్లోకార్థం.

'మననాత్ త్రాయతే ఇతి - మంత్రః' - అంటే మననము చేసిన కొలదీ రక్షించునది మంత్రము' అని అర్థము. ' గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ' అంటే గానము చేయు వారిని రక్షించునది ' గాయత్రీ' అని అర్థం. ఈ రెండు వ్యుత్పత్తి అర్థాలను బట్టి 'మంత్రము' అన్న పదానికి ఏది అర్ధమో గాయత్ర' అన్న పదానికి కూడా అదే అర్థం అని తెలుస్తుంది.

కాబట్టి గాయత్రి నూటికి నూరుపాళ్ళు 'మంత్రము' ఔతుంది. మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి, అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి.

కాబట్టి, గాయత్రి అన్ని విధాలా మానవులకు అత్యంత అవసరమైన, అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది. ఇటువంటి 'గాయత్రి' పదం గూడా అమ్మవారి నామంగా చెప్పబడిందంటే - అమ్మవారే గాయత్రి అని అర్థం గదా !

అమ్మవారి కళ్ళు - సూర్య, చంద్ర, అనలాత్మకమైనవి. వీటికి ప్రతీకలుగానే సావిత్రి, గాయత్రి, సరస్వతీ అనే ముగ్గుఱు దేవతలు చెప్పబడ్డారు.

వీరిలో గాయత్రికి - చంద్రునికి సంబంధం వుంది. శ్రీవిద్య అంతా ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు - గాయత్రీ ఒక్కరే అనుకోవాలి. ఇద్దరికీ అభేదాన్ని గ్రహించాలి. వేదమాత గాను, వేదత్రయ సారంగాను ధ్యానించే గాయత్రికి, 'వేద జననీ' అయిన అమ్మవారికీ - అభేదమే అని చెప్పడానికి వేరొక నిదర్శనం అక్కరలేదు. గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తుంటే, మనం - మనలో కాక, వివేక లోకంలో ఉంటాం. తత్ఫలితంగా పాత్రత, అర్హత, పవిత్రత పెరుగుతాయి.

' గానము చేయు వారిని రక్షించునది' అని ఈ నామానికి అర్థం.

గాయత్రీ మంత్రము అని సాధారణంగా వాడేస్తుంటాము. కాని గాయత్రి అనేది ఒక ఛందస్సు. అందులో 24 అక్షరాలుంటాయి. ఈ మంత్రంలో ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున మూడుపాదాలలోనూ 24 అక్షరాలుంటాయి.

ఓం భూర్భువ స్సువః

తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి |

ధియో యోనః ప్రచోదయాత్ ||

ఇదే గాయత్రీ మంత్రం. ఉపనయన కాలంలో బ్రాహ్మణులకు ఉపదేశం చేసేది. ఈ మంత్రోపదేశం చేసిన తరువాత వటువు సంస్కారవంతుడవుతాడు. మంత్రం సిద్ధించిన తరువాత బ్రహ్మవిద్య పొందటానికి అర్హుడవుతాడు. ఓంకారమనేది పరబ్రహ్మ స్వరూపం. వాహృతులు దాని అంగాలు. ఈ మంత్రంలో

మొత్తం ఏడు వ్యాహృతులున్నాయి. వీటిని సప్తవ్యాహృతులు అంటారు. అవి.

1. ఓం భూః  

2.ఓం భువః  

3.ఓం సువః

4. ఓం మహః

5. ఓం జనః 

6. ఓం తపః. 

7. ఓం సత్యం..

ప్రస్తుతము ఉపాసనలో ఉన్న గాయత్రీమంత్రానికి విశ్వామిత్రుడు ఋషి. అయితే ఇది 28వ మహాయుగం. వాటిలో గతంలో కూడా ఈ మంత్రం ఉపాసన చేయబడింది. ఆ గాయత్రీ మంత్రానికి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఋషి, ఛందస్సు విడివిడిగా ఉన్నాయి.

ఇప్పుడు 420 నుంచి 468వ నామం వరకూ గాయత్రీ మంత్రం వివరించబడింది.

ఈ మంత్రాన్ని త్రిసంధ్యలయందు ఉపాసించాలి.

ఇక మంత్రానికి అధిదేవత పరమేశ్వరి. ఆమె తత్వాసనా. పంచకోశాల యందు ఉంటుంది. నిత్యయవ్వన. 431వ నామం దగ్గరనుండి గాయత్రి స్థూలరూపం వర్ణించ బడింది. అలాగే 437వ నామం దగ్గర నుండి గాయత్రి సూక్ష్మరూపం వర్ణించబడింది.

గాయత్రియే కరుకుళ్ళాదేవి. కులమార్గంలో సంచరించే కౌళిని. ఆమెను గనక ఆరాధించినట్లైతే తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, కాంతి లభిస్తాయి. ఆమె తేజోరాశి, త్రినయనా, కామరూపి. మాతృకావర్ణరూపిణి. ప్రాణాయామంచేసి పరమేశ్వరిని ఆరాధించే

యోగీశ్వరుల హృదయాలలో ఉంటుంది. ఈ రకంగా గాయత్రీదేవిని ఉపాసనచేసే వారికి సకల కార్య సిద్ధి జరుగుతుంది.

గయాన్ ప్రాణాన్ త్రాయత ఇతి గాయత్రీ!!

ప్రాణములను రక్షించునది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం.

త ద్యత్రాణా వ్రాయతే తద్గాయత్రీ ప్రాణరక్షణ చేయునది గాయత్రి అని బృహదారణ్యకోపనిషత్తు వివరించింది. తస్మాద్దాయంతం త్రాయతే యతః గానము చేయువానిని రక్షించునది. గీయతే తత్త్వమనయా గాయత్రీతి అని శంకర భాష్యం. ఈ

మంత్రంలో దైవత్వం గానం చెయ్యబడింది. అందుచేత గాయత్రి అనబడుతుంది.


గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉన్నది.

 బ్రాహ్మణులకు ఉపనయనకాలంలో ఉపదేశించేది. వేదాలలో నిగూఢమైనది. ఇదే పంచదశి మహామంత్రము.

అందుచేతనే గాయత్రి మంత్రం బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశి మహామంత్రం అన్ని వర్ణాలవారి కోసం ఏర్పడింది అన్నాడు అగస్త్యమహర్షి ఇంకా చెప్పాలి అంటే

గాయత్రీ మంత్రము, పంచదశి మహామంత్రము రెండూ ఒక్కటే.

ఈ రెండింటి అర్ధం కూడా ఒక్కటే. శరీరాదులను రక్షించటంచేత గాయత్రి అని, తేజస్వరూపమవటంచేత సావిత్రి

అని, వాగ్రూపం కావటంచేత సరస్వతి అని చెప్పబడుతోంది.

సవితృద్యోతనా స్సైవ సావిత్రీ పరికీర్తితా

ప్రపంచాన్ని సృజించి ప్రకాశింప చేస్తుంది. కాబట్టి సావిత్రి అనబడుతుంది.


జాతః ప్రసవితృత్వాన్ వాగ్రూపత్వా త్సరస్వతీ

వాగ్రూపము గలది కాబట్టి సరస్వతి. ఇరవైనాలుగు అక్షరాలతో ఏర్పడ్డ ఛందస్సే గాయత్రి. ఛందస్సులు అనేకరకాలున్నాయి. కాని బ్రహ్మజ్ఞానానికి ద్వారం గాయత్రి ఛందస్సు, ఆ గాయత్రియే సోమరసాన్ని తెచ్చి దేవతల కిచ్చింది. ఛాందోగ్యోపనిషత్తులో

ఒకసారి దేవతలంతా గాయత్రి, త్రిష్టప్, జగతి ఛందస్సులను సోమాన్ని తీసుకురమ్మని పంపారు. వీటిలో త్రిష్టప్, జగతి ఛందస్సులు సోమాన్ని తేలేక తిరిగి వచ్చేశాయి.

          అంతేకాకుండా తిరిగివస్తూ త్రోవలో అలసట కారణంగా తమలోని కొన్ని అక్షరాలను

వదలివేశాయి. గాయత్రి మంత్రం సోమం దగ్గరకు వెళ్ళి, దాన్ని రక్షించే వారందరినీ ఓడించి సోమాన్ని తెచ్చి దేవతలకిచ్చింది.

 తిరిగివచ్చేటప్పుడు త్రోవలో త్రిష్టప్ జగతి ఛందస్సులు వదలివేసిన అక్షరాలను కూడా తీసుకువచ్చింది. ఆ కారణంగా గాయత్రి

ఛందస్సు అన్నింటికన్నా గొప్పది అయింది. అంతే కాకుండా ఉదయము మధ్యాహ్నము

సాయంకాలము మూడింటిలోనూ వ్యాప్తమై ఉన్నది. బ్రాహ్మణునికి అత్యంతావశ్యకమవటం చేత దాని గౌరవము ఇనుమడించింది. అందుచేతనే గాయత్రిని ఉపేక్షించిన వాడు దేన్నీ పొందలేడు. గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఒక్కొక్క పాదానికి ఆరు చొప్పున నాలుగు పాదాలుగా ఉన్నాయి. ఇతర ఛందస్సులలో ఇంకా ఎక్కువ అక్షరాలున్నాయి.

కాని

వాటన్నింటిలోకి గాయత్రియే శ్రేష్టమైనది. స్థావర జంగమాత్మకమైన ప్రాణి సమూహమంతా

గాయత్రియే. వాక్కు - గాయత్రి, సమస్త ప్రాణాలు - గాయత్రి, వాగ్రూపమైన గాయత్రి అందరి పేర్లనూ ఉచ్చరిస్తోంది. కాబట్టి గాయత్రి అందరి పేర్లలోనూ ఉన్నది. ఈరకంగా ప్రాణి జాతి అంతా గాయత్రియే. గాయత్రి అంటే ప్రాణులను రక్షించేది అని అర్ధం.

ఈ లక్షణాలు గల గాయత్రి ఈ పృథివే తప్ప వేరేకాదు. చరాచరాలన్నీ ఈ భూమిలోనే ఉన్నాయి.

అందుచేతనే చరాచరజగత్తునంతటనూ గానంచేస్తూ, పాడుతూ, త్రాణం చేస్తూ - కాపాడుతూ

ఉండే గాయత్రియే ఈ భూమి. పృథివీ రూపమైన గాయత్రి శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియాల సమూహము ఒక్కటే. పురుషుని శరీరరూపమైన గాయత్రి, పురుషుని హృదయకమలంలో ఉండే పురుషుడు ఇద్దరూ ఒకటే. ఆ పురుషునిలోనే అంటే గాయత్రిలోనే ప్రాణాలు ప్రతిష్టితమై ఉన్నాయి అని చెప్పబడింది.

 బృహదారణ్యకోపనిషత్తులో గాయత్ర్యోపాసన వివరిస్తూ “ఉపనిషత్తులో చెప్పిన

'భూమి, అంతరిక్ష్యం, ద్యౌః' ఈ మూడు పదాల్లోనూ మొత్తం ఎనిమిది అక్షరాలున్నాయి. ద్యౌః అనే పదంలో దకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఇవి మూడులోకాల పేర్లు. గాయత్రి మంత్రానికి పాదానికి ఎనిమిది అక్షరాలున్నాయి.మూడు పాదాలున్నాయి. కాబట్టి మూడు లోకాలు మొదటి పాదం. ఈ రకంగా మూడులోకాలను గురించి తెలుసుకున్నవాడు ముల్లోకాలను జయిస్తాడు.

ఉపనిషత్తులో చెప్పిన 'ఋచ యజాంసి సామాని' అనే మూడుపదాల్లోనూ ఎనిమిది

అక్షరాలున్నాయి. ఇవి గాయత్రికి రెండోపాదం. అంటే వేదాలు రెండవ పాదమన్నమాట. ఈ విషయం తెలుసుకున్నవాడు త్రయీవిద్య అనగా వేదవిద్య వల్ల వచ్చే ఫలితాన్ని

పొందుతాడు. మంత్రంలో చెప్పిన 'ప్రాణ అపాన వ్యానం' అనే దాంట్లోని ఎనిమిది అక్షరాలు

గాయత్రికి మూడవపాదం.

 ఇక్కడ వ్యా అనే అక్షరంలో వకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఈ విషయం తెలుసుకున్నవాడు సమస్తాన్ని పొందుతాడు. ఉపనిషత్ మంత్రంలో 'తురీయదర్శి తంపదం' అనేది నాల్గవపాదము. 'దర్శితపదం' అనే పదానికి ఆదిత్యమండలాంతర్గతుడైన పురుషుడు కనిపిస్తున్నాడని అర్ధం. అంటే అన్ని లోకాలకు పైన ఆధిపత్యం స్థాపించి ప్రకాశిస్తున్నాడు.

 ఈ రకంగా గాయత్రిలో నాల్గవపాదం తెలుసుకున్నవాడు కీర్తితో ప్రకాశిస్తాడు. తురీయపదం సత్యంలో ప్రతిష్టితమై ఉన్నది. నేత్రమే సత్యం. ఏదైనా ఒక విషయాన్ని

నేను చూశాను. నేను విన్నాను అని చెప్పినప్పుడు చూసినదాన్నే నమ్మటం జరుగుతుంది.

అందుచేతనే నేత్రం సత్యం.

 తురీయపాదానికి ఆశ్రయమైన సత్యం బలంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అందుకనే సత్యంకన్న బలం ప్రకాశమైనది. ప్రాణమే ఆ బలం. త్రిపదా గాయత్రి ప్రాణాలను రక్షిస్తుంది. గాయత్రి ప్రాణంలో ప్రతిష్టితమై ఉన్నది. వాగాది ప్రాణాలను రక్షించేది గాయత్రి. గానము చేసే వాడిని రక్షించేది గాయత్రి. ఉపాసనచేసే వాణ్ణి రక్షించేది గాయత్రి. ఉపనయన సమయంలో వటువుకు త్రిపదగాయత్రి ఉపదేశిస్తారు.


మంత్రము :-

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం || భర్గోదేవస్య ధీమహి |

ధియోయోనః ప్రచోదయాత్ ||

ఇది త్రిపదగాయత్రి. అయితే కొన్ని శాఖలవారు అనుష్టుప్ ఛందస్సులో ఉండే

గాయత్రిని ఉపాసిస్తారు.


తత్సవితు ర్వృణీ మహే ౹ వయం దేవస్య భోజనం | శ్రేష్ఠం వై సర్వధాతమమ్ |

తురంగ భగస్య ధీమహి

వాక్కే అనుష్టుప్. వాక్కే శరీరంలో ఉండే సరస్వతి. కాబట్టి వాక్స్వరూపమైన సరస్వతిని

వీరికి ఉపదేశిస్తున్నామని వీరికి నమ్మకం.


గాయత్రి ఉపాసకుడు ఆవులు, గుర్రాలు, భూమి దానంగా తీసుకున్నా దానివల్ల కలిగే దోషం మొదటి పాదాన్ని జపిస్తే పోతుంది. వేదవిద్యతో సమానంగా దానం తీసుకున్నా ఆ దానం వల్లవచ్చే పాపం మంత్రంలోని రెండవపాదాన్ని జపం చేస్తే పోతుంది.

“లోకంలో ఉన్న ప్రాణాలన్నీ దానం తీసుకున్నా, ఆ పాపం మూడవపాదం జపం చేస్తే పోతుంది. అంటే గాయత్రిమహిమ చాలా గొప్పది” అని చెప్పబడింది.

శుద్ధ గాయత్రీ ప్రత్యక్షరం బ్రహ్మైక్య బోధితా

శుద్ధగాయత్రిలోని ప్రతి అక్షరము పరబ్రహ్మను గురించే బోధిస్తున్నది. అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని వివరిస్తుంది.

మహా మంత్రస్య చాపస్య స్థానే స్థానే పదే పదే

గూడో రహస్య గర్భేన | న్తో ప దేశ సముచ్ఛయః ||

గాయత్రీ మహామంత్రంలోని ప్రతి అక్షరంలోనూ, ప్రతిస్థానమందు మహా రహస్యమున్నది.

గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేవారికి ఇహపరసుఖాలు పూర్తిగా లభిస్తాయి.

హృదయపద్మమందు అధిష్టించి ఉన్న గాయత్రిని ఉపాసన చేసేవారు ధర్మాధర్మవిముక్తులై ముక్తిని పొందుతారు. గాయత్రీమంత్రానికి 24 అక్షరాలున్నాయి. ప్రజాపతి సంవత్సర స్వరూపుడు. అతడే కాలస్వరూపుడు. సంవత్సరానికి 12 మాసాలు. మాసానికి రెండు పక్షాలు. ఈ రకంగా  24 పక్షాలుంటాయి. ఆ 24 పక్షాలే గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. సంవత్సరానికి

మూడుకాలాలు.


1. వేసవి కాలము

2. వర్షాకాలము

3. శీతాకాలము. వీటి స్వరూపంగానే గాయత్రీ మంత్రము మూడు పాదాలుగా ఉన్నది. మంత్రంలోని మూడుపాదాలు

1. భూలోకం

2. భువర్లోక

3. సువర్లోకాలకు ప్రతీక. అందుచేతనే ఆ పాదాలను లోకాలకు అన్వయించి

ధ్యానించాలి.


1. మొదటిపాదము :- భూలోక సమన్వయము. భౌతికమైన సృష్టిరూపంలో ధ్యానం చెయ్యాలి.


2. రెండవ పాదము :- భువర్లోక సమన్వయము.

అంటే శక్తి మయాత్మకరూపంలో ధ్యానం చెయ్యాలి.


3. మూడవ పాదము :- సువర్లోక సమన్వయము. అంటే ప్రజ్ఞామయాత్మక దృష్టితో ధ్యానం చెయ్యాలి.


ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ముందు ద్రవ్యాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన అష్టవసువులు అనుగ్రహం కలుగుతుంది. ఆ తరువాత శక్తి మయాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన ఏకాదశరుద్రుల అనుగ్రహం కలుగుతుంది. అటుపైన ప్రజ్ఞామయాత్మకలోకానికి అధిష్టానదేవతలయిన ద్వాదశాదిత్యుల అనుగ్రహం

కలుగుతుంది. గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన అర్ధం ఉన్నది. ఇప్పుడా అర్ధాన్ని

వివరిస్తున్నాము.


ఓమ్ - బ్రహ్మ

భూః - ప్రణవస్వరూపము

భువః -దుఃఖనాశనము

స్వః- సుఖస్వరూపము

తత్ - ఆ 

సవితుః -  తేజస్సుచే ప్రకాశించు

దేవస్య - దేవుని యొక్క 

వరేణ్యం - శ్రేష్ఠమైన

భర్గః - పాపనాశనమైన తేజమును

ధీమహి - ధ్యానింతును

యః - ఏదైతే

నః - మా యొక్క

ధియః - బుద్ధులను

ప్రచోదయాత్ - ప్రేరేపించునో, ఆ తేజస్సును ధ్యానింతును.


పంచదశీ మహామంత్రము గాయత్రీమంత్రము రెండూ ఒక్కటే అని చెబుతూ భాస్కరరాయలవారు తమ వరివశ్యా రహస్యంలోని 60, 61, 63 శ్లోకాలలో పంచదశీ మహామంత్రానికి గాయత్రి మంత్రార్థం నిరూపించారు.


          పంచదశీ మహామంత్రంలోని కకారానికి సర్వజగత్తునూ సృష్టించాలనే కోరిక గల

బ్రహ్మ అని అర్ధం. గాయత్రీ మంత్రంలోని మొదటి మూడుపదాలకు బ్రహ్మ అని అర్ధం. పంచదశిలో రెండవ అక్షరమైన ఏ కారానికి గాయత్రీ మంత్రంలోని సవితుః - - శ్రేష్టమైన అని అర్ధం. మూడువ అక్షరమైన ఈ కారము గాయత్రి మంత్రంలోని భర్గోదేవస్యధీ అయిన పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది.

          ఈ రకంగా శ్రీవిద్యలోని ప్రధమకూటమిలోని అక్షరాలు గాయత్రీమంత్రంలోని ప్రధమపాదంచే తెలియబడు జగత్కారణభూతులైన కామేశ్వరీ కామేశ్వరులను చెబుతోంది. వారిద్దరి సామరస్యమే పరమశివుడు. అతని పరిణామమే ఈ జగత్తు. అతడే సమస్త బుద్ధులకు ప్రేరకుడు. త్రిగుణాతీతుడు. ప్రణవస్వరూపుడు.

             గాయత్రీ మంత్రంలోని మహి అనే శబ్దము శ్రీవిద్యలోని ల కారాన్ని సూచిస్తున్నది. ల కారమనేది పృథివీ బీజం. కాబట్టి దాని నుంచి పంచభూతాత్మకమైన జగత్తు తెలుస్తుంది. ఈ జగత్తంతా పరమేశ్వరునివల్ల సృష్టించబడింది. ఆ పరమేశ్వరుని ప్రతిబింబమే మహాత్రిపురసుందరి.

గాయత్రీమంత్రంలోని చివరి రెండు పాదాల అర్ధం శ్రీవిద్యలోని హ్రీం కారము ఒక్కటే. 

ఈ రకంగా గాయత్రి, పంచదశి మహామంత్రాల అర్ధం ఒక్కటే. దేవీ భాగవతంలోని 12వ స్కంధంలో గాయత్రీమంత్రాన్ని వివరించారు. ఈ

మంత్రానికి

24 మంది ఋషులు, 24 ఛందస్సులు,

24 మంది దేవతలు, 24 శక్తులు,

24 రంగులు,

24 వర్ణతత్త్వాలు

24 వర్ణముద్రలు చెప్పబడ్డాయి. 

గాయత్రీ మంత్రానికి 24 మంది ఋషులున్నారు. వారు

1. వామదేవుడు

2. అత్రి.

3. వశిష్ఠుడు

4. శుక్రుడు

5. కణ్వుడు

6. పరాశరుడు

7. విశ్వామిత్రుడు

8. కపిలుడు

9. శౌనకుడు

10. యాజ్ఞవల్క్యుడు

11. భరద్వాజుడు

12. జమదగ్ని

13. గౌతముడు

14  అగస్త్యుడు

15 కౌశికుడు

16  వ్యాసుడు

17. వత్సుడు

18 పులత్స్యుడు

19 మాండూకుడు

20 ముద్గలుడు

21 దుర్వాసుడు 22నారదుడు

23 లోమశుడు

24. కశ్యపుడు.


గాయత్రీ మంత్రానికి 24 ఛందస్సులున్నాయి. అవి

1. గాయత్రి

2. శక్వరి

3 ఆకృతి

4 ఉష్ఠిక్

5. అతిశక్వరి

6. అనుష్టుప్

7. ధృతి

8. సంకృతి

9.బృహతీ 

10 అతిధృతి

11. అక్షరపంక్తి

12. త్రిష్టుభము

13. విరాట్

14. భూః

15 పంక్తి

16 ప్రసారపంక్తి

17 ర్భువః

18 జగతి

19 స్వః

20 అతిజగతి

21 ప్రకృతి

22 . జ్యోతిష్మతి

23 వికృతి

24. కృతి.


గాయత్రీ మంత్రానికి దేవతలు 24 మంది ఉన్నారు. వారు

1భగుడు

2 మైత్రావరుణుడు

3. ప్రజాపతి

4 యముడు

5. వైశ్వదేవుడు

6. చంద్రుడు

7. గణేశుడు

8. మాతృకలు

9. ఈశానుడు

10. త్వష్ట

11. విష్ణువు

12. సవిత

13. పూష

14 వసువు

15. ఆదిత్యుడు

16. ఇంద్రాగ్ని

17 రుద్రుడు

18. బృహస్పతి

19. వాయువు

20. కుబేరుడు

21 మైత్రావరుణుడు

22. వామదేవుడు

23. అశ్వనీకుమారులు

24.అగ్ని.


ఈ దేవతలలో మైత్రావరుణుడు పేరున్నవారు ఇద్దరున్నారు. అంతేకాని పొరపాటుకాదు.


గాయత్రీమంత్రానికి 24 శక్తులున్నాయి. అవి

1. వామదేవి

2. కాంతా

3. సూక్ష్మా

4. ప్రియా

5. విశ్వయోని

6. సరస్వతీ

7. విజయా

8. విశ్వభద్ర

9. విద్రుమా

10. వశా

11. విలాసినీ

12. విశాలేశా

13. పద్మాలయా

14. ప్రభావతి

15. వ్యాపినీ

16. పరాశోభా

17 జయా

18. విమలా

19. భద్రా

20 శాంతా

21 తమోపహారిణీ

22. త్రిపదా

23. దుర్గా

24. సత్యా.


గాయత్రీ మంత్రానికి వర్ణాలు (రంగులు) 24 అవి.

1. సంపంగి

2. పద్మరాగము 

3. పసుపు

4. అవిసె

5. ఇంద్రనీలమణి 

6. పాలమిశ్రణము

7. పగడము

8. ముత్యము 

9. సూర్యకాంతి

10. స్పటికము

11. కుంకుమ

12. చిలుకతోకరంగు

13. పద్మపుష్పము

14. కాటుక

15. శతపత్రకాంతి

16. బాలాదిత్యుడు

17 రక్తము

18. కౌతకీపుష్పము

19. శంఖకుందేలు

20. వైడూర్యము

21. మల్లికాకుసుమము

22. పగడము

23. కరవీరపుష్పకాంతి

24. తేనె

గాయత్రీ మంత్రానికి 24 వర్ణతత్త్వములున్నాయి. అవి

1. నేల

2 చక్షువు

3. నీరు

4. చర్మము

5. కాంతి

6 వాక్కు

7. శోత్రము

8 గాలి

9. పాణి, పాదము 

10. ప్రాణము

11. ఆకాశము

12. పాయు

13. అపానము

14.గంధము

15.వ్యానము

16. రసము

17. ఘ్రాణము

18.ఉదానము

19. రూపము

20.జిహ్వా

21.సమానము

22. స్పర్శ

23. శబ్దము

24. ఉపస్థ.


గాయత్రీ మంత్రానికి 24 రకాల ముద్రలున్నాయి. అవి.

1. సుముఖము 

2. షణ్ముఖము 

3 ముష్టికము

4. సంపుటము

5. అధోముఖము

6. మత్స్యము

7. వితతము

8. వ్యాపకాంజలికము

9. కూర్మము

10.విస్తృతము

11. శకటము

12. వరాహము

13. ద్విముఖము

14. యమపాశము 

15. సింహక్రాంతము

16. త్రిముఖము 

17. గ్రధితము

18. మహక్రాంతము

19. చతుర్ముఖము 

20. షణ్ముఖోన్ముఖము

21. ముద్గరము

22.. పంచముఖము 

23. ప్రలంబము

24. పల్లవము.


అయితే ముఫైరెండు అక్షరాలు గల గాయత్రీ మంత్రానికి ముద్రలు ఈ విధంగా ఉంటాయి.

1. త్రిశూలము

2. లింగము

3. యోని

4. సురభి

5. అక్షమాలా

6. అంబుజము

ఈ రకంగా ఉన్న గాయత్రి మంత్రం బ్రహ్మ క్షత్రియ, వైశ్యులందరిచేత జపించబడుతుంది. అయితే

ఓంకారవ్యాహృతి పూర్వాం గాయత్రీం బ్రాహ్మణో జపేత్

త్రిష్టుభం చైవ రాజన్యో జగతీం వైశ్య ఏవ చ!!

ఓం కారవ్యాహృతి పూర్వకమైన గాయత్రిని - బ్రాహ్మణులు

త్రిష్టుప్ ఛందస్సులో - క్షత్రియులు

జగతీ ఛందస్సులో - వైశ్యులు ఈ మంత్రాన్ని జపిస్తారు.


అంతే కాకుండా మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి గాయత్రి ఉంటుంది.

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిిః ప్రచోదయాత్ |

మహాదేవ్యై చ విద్మహే | విష్ణుపత్యైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||

గాయత్రీమంత్రం అత్యంత మహిమోపేతమైనది


పూర్వకాలంలో ఒకసారి అనావృష్టి వచ్చింది. దాదాపుగా పదిహేను సంవత్సరాలు వర్షపు చుక్కైనా కురవలేదు. పాడిపంటలు లేవు. చెట్లు చేమలు కూడా అంతరించి పోయాయి. భరించలేని కరువు. పశువులు గడ్డిలేక చచ్చిపోతున్నాయి. పసిపిల్లలకు పాలులేవు. ఆకలికి తాళలేక కొందరైతే మృతకళేబరాలను పీక్కుతినే స్థితికి వచ్చారు.

ఇంతదాకా ఎందుకు పిల్లలకు పాలు ఇవ్వలేక, వారిని పెంచలేక గొంతు పిసికి చంపేసిన వారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఘోరకలి విలయతాండవం చేస్తోంది. ఆ రోజుల్లో కొంతమంది పండితులు ఒకచోట చేరి ఈదుర్భర స్థితి నుంచి

తప్పించుకోవటానికి మార్గం లేదా ? అని ఆలోచించసాగారు. చివరకు వారికి గౌతముడు

గుర్తు వచ్చాడు. గౌతముడు ఒక మహర్షి. మహాతపస్సంపన్నుడు. పరదేవతను ఆరాధిస్తూ ఉండేవాడు. ఆవిడ యొక్క కరుణవల్ల విత్తనాలు చల్లగానే అవి మొలకెత్తి ఫలితాన్ని ఇచ్చేటట్లుగా వరం పొందాడు.



 కాబట్టి ఇప్పుడు మనమంతా గౌతముడిని శరణువేడితే ఆ మహర్షి మనలను

కరుణిస్తాడు అని ఆలోచించి గౌతముడి ఆశ్రమానికి ప్రయాణమయ్యారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఇంతమంది పండితులను చూసి, వారికేదో ఆపద

వచ్చిందని గ్రహించి, వారిని ఆహ్వానించి ఆతిధ్యమిచ్చాడు గౌతముడు. ఆ తరువాత

జరిగిన విషయం తెలుసుకుని, ప్రజలు ఆకలిదప్పులకు అల్లాడుతున్నారన్నమాట విని

విచారించి ఆపరదేవతను ప్రార్ధించాడు.



నమో దేవి ! మహావిద్యే ! వేదమాతః ! పరాత్పరే !

వ్యాహృత్యాది మహామంత్రరూపే ! ప్రణవరూపిణి !

సామ్యావస్థాత్మికే ! మాతః ! నమో హ్రీంకార రూపిణి

స్వాహా స్వధా స్వరూపే ! త్వాం నమామి సకలార్ధదామ్

భక్తకల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం

కుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం

సర్వవేదాంత సంవేద్యాం సూర్యమండల వాసినీం

ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరాం

సాయాహ్నే కృష్ణవర్ణాం తాం వృద్ధాం నిత్యం నమా మ్యహమ్ ||


ఆదేవత మహిమ వల్ల వచ్చిన వారందరికీ నివాసం ఏర్పాటుచేసి, గతంలో దేవత తనకిచ్చిన వరమహిమ వల్ల వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇంతకాలం అన్న పానాదులు లేక, అవి ఎలా ఉంటాయో కూడా మరచిపోయిన వాళ్ళకి

ఆపరదేవత దయవల్ల పంచభక్ష్యాలతో సమృద్ధిగా ఆహారం దొరికింది. ఆ ఆనందానికి తట్టుకోలేక అన్నదానం చేసి తమ ప్రాణాలని నిలబెట్టిన గౌతముణ్ణి వేనోళ్ళ కొనియాడారు. ఆ పరమేశ్వరిని పరిపరివిధాల స్తుతించారు. పండితులంతా యజ్ఞయాగాలు చెయ్యనారం భించారు. ఆశ్రమానికి ఎటు చూసినా నూరు యోజనాల వరకు ఆశ్రితులున్నారు. అందర్నీ సంరక్షిస్తున్నాడు గౌతముడు.



కొంతకాలానికి నారదుడు వచ్చి గౌతముడు చేస్తున్న పనికి మెచ్చుకుని “మహర్షీ ! ఆపదకాలంలో వీళ్ళని ఆదుకున్నావు. వారికోసం ఆ పరాశక్తి ఇచ్చిన వరప్రభావం ఉపయోగించటం వల్ల నీశక్తి మరింతగా పెరిగింది. తనకున్న శక్తితో పదిమందికీ ఎవరైతే

ఉపకారం చేస్తారో వారి శక్తి ద్విగుణీకృత మౌతుందని చెప్పబడింది. ఇప్పుడు నీకూ అంతే జరిగింది. ఇంద్రాది దేవతలంతా నువు చేస్తున్న పనిని వేనోళ్ళ కొనియాడుతున్నారు” అన్నాడు. ఈ మాటలు విన్న పండితులకు ఈర్ష్య కలిగింది. గౌతముడికి ఇంత పేరు రావటం వాళ్ళు సహించలేక పోయారు. ఎలాగైనా సరే గౌతముడి ప్రతిష్ఠకు మచ్చ

కలిగించాలి అనుకున్నారు.



వానలు పడటం మొదలు పెట్టాయి. క్రమంగా నేల చల్లబడింది. ఏరులు పారాయి. నదులు పొంగాయి. విత్తనాలు మొలకెత్తుతున్నాయి. పండితులు కూడా వెళ్ళిపోవటానికి సన్నద్ధమౌతూ మాయాగోవును ఒకదాన్ని సృష్టించారు. అది వచ్చి ఆశ్రమ ప్రాంగణంలోని పంటను, ఆహారాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టింది. అది చూసిన గౌతముడికి కోపం వచ్చింది. ఆవును కొట్టటం ఇష్టం లేక అదిలించాడు. అంతే ఆ అదిలింపుకు

మాయాగోవు కింద పడి చచ్చిపోయింది. ఇదంతా చాటునుంచి చూస్తున్న పండితులు

“గౌతముడు గోవును చంపాడు. గోహత్య మహాపాతకం. ఇంక ఇతడి ఇంట భోజనం

చెయ్యటం కూడా పాపం. మేం వెళ్ళిపోతున్నాం” అని బయలుదేరారు. మాయ తెలియని గౌతముడు వారిని బ్రతిమాలాడు. ఈ పాపం పోయే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడు వారు గౌతముడికి అసాధ్యమయ్యేపని ఏదా ? అని ఆలోచించి చివరకు గంగను తెచ్చి గోవుమీద ప్రవహింపచేస్తే ఈ పాపం పోతుందన్నారు.



గౌతముడు చాలా సంవత్సరాలు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై

గౌతముడి కోర్కె ప్రకారం తన జటాజూటం నుంచి రెండు బొట్లు విదిల్చాడు. అంతే చచ్చిన గోవు లేచి నుంచుంది. ఈరకంగా గౌతముని చేత తేబడింది కాబట్టి గౌతమి అనీ, గోవును బ్రతికించటానికి వచ్చింది కాబట్టి గోదావరి అనీ ఆనదికి పేరు వచ్చింది. ఆవు లేచి నుంచోగానే 'గౌతముడు మాయాగోవును బ్రతికించాడు' అని గెలిచేశారు

పండితులు.



దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్న మహర్షి వారి మీద కోపించి

“ఇక నుంచీ గాయత్రీ జపం మీకు నిష్పలమవుతుంది. వేదాధ్యయనం, యజ్ఞకర్తవ్యం

మీకు ఉండవు. మీరంతా ధర్మహీనులు, నీతిదూరులు అయి భ్రష్టుపట్టిపోతారు. వావీ వరుసలు లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తారు. తరతరాలకు మీగతి ఇంతే” అని శపించాడు.

చేసిన తప్పు క్షమించమని పండితులంతా ప్రాధేయపడగా ద్వాపరయుగంలో

పరమేశ్వరి అంశతో యదువంశంలో నందగోవుని ఇంట శ్రీకృష్ణుడు పుడతాడు. అతని

జన్మతో మీకు శాపవిమోచన మవుతుంది అన్నాడు.

ఈ రకంగా పండితులు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి, పరమేశ్వరి దయవల్ల

మళ్ళీ గాయత్రీ అనుష్ఠానం చేసి బ్రహ్మతేజస్సును పొందారు. గాయత్రి జపం చేసినవాడు

బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతాడు.



   గానము చేయువారిని రక్షించునది శ్రీమాత అని అర్థం. సమస్త లోకములకు ఆధారమైన వెలుగును గానము చేయుట అనాదిగ నున్న ఆచారము. ఆ వెలుగే ఛందోబద్ధముగ అష్ట ప్రకృతులను నిర్వర్తించును.



కావున గాయత్రి ఛందస్సు అని కూడ పిలువబడు చున్నది. ఎనిమిది అక్షరముల ఛందస్సుతో భూ భువః, సువర్లోకము ఆవరించి యున్నది. 3 × 8 = 24 అక్షరములతో కూడి యున్నది సంవత్సర రూపమై పండ్రెండు పూర్ణిమలు, పండ్రెండు అమావాస్యలుగా కాలమై వర్తించుచున్నది. ఒక్కొక్క పాదమున ఎనిమిది అక్షరములతో సంవత్సరమందలి మూడు పాదములను దర్శింప వచ్చును. నాలుగు మాసములు ఒక పాదము. అందు నాలుగు అమావాస్యలు, నాలుగు పౌర్ణిమలు యుండును. అట్టివి మూడు పాదములతో సంవత్సర చక్రమగును. ఇట్టి కాలవిభజన నుండి 12 మాసముల యందు వెలు వడుచున్న సూర్య చంద్రాత్మకమైన వెలుగును అవగాహనతో కూడి ఆరాధించు విధానమును ఋషులు అందించినారు.



  ఈ వెలుగును భక్తి శ్రద్ధలతో ఆరాధించువారు ఛందో రూప మైనటువంటి సృష్టిని తెలియగలరు. నేడు వాడుకలో నున్న గాయత్రి మంత్రమును దర్శించి జాతికి అందించిన విశ్వామిత్ర మహర్షిని ఆరాధించి, గాయత్రి మాతను గానము చేయుట వలన మంత్రసిద్ధి

కలుగ గలదు. ఎంతగానము చేసిన అంత రక్షణ నిచ్చునది గాయత్రి వేదమాత యగుటచే గానము, ధ్యానము చేసిన వారికి జ్ఞాన వికాసము కలిగించునది గాయత్రి. అట్లే జీవితమును గమ్యము వైపునకు నడిపించు టకు వలసిన బుద్ధి ప్రచోదనము కలిగించునది గాయత్రి గాయత్రి వేదమాత. ఆమెయే సృష్టి సంకల్పము. ఆమె చతుర్ముఖు డగు బ్రహ్మ యందు భాసించినపుడు, చతుర్ముఖునికి సృష్టి జ్ఞానం కలుగును.



ఈ సంకల్పమే లేనపుడు సృష్టియే లేదు. సంకల్పమే లేనపుడు సృష్టికర్త కూడ లేదు. ప్రకృతి పురుషులు కూడ లేరు. తత్త్వమే యుండును. అందుండి పుట్టు మొట్టమొదటి సృష్టి స్ఫురణ సృష్టికి కారణభూతం సంకల్పమే లేనపుడు క్రియలు కూడా లేదు. ఇచ్ఛా, జ్ఞాన క్రియలు లేవు తత్త్వము యొక్క ప్రథమ వ్యక్తి రూపము గాయత్రి అని తెలియవలెను. ఆమె సంకల్పములకు తల్లి, పుట్టుచోటు. ఎవ్వరికైనను సంకల్పము కలిగిన పిదపనే అందుండి ఇచ్చా జ్ఞాన క్రియలు పుట్టును.



సంకల్పమే కలుగనిచో స్థబ్దుగా నుందురు. స్తబ్దత రెండు రకములు. ఒకటి సమాధి రెండు జడము. ఇందు మొదటివారు సంకల్పమును దాటి తత్త్వమున నిలచినవారు. రెండవ వారు అతి మంద్రస్థాయిలో మాత్రమే సంకల్పము పనిచేయు స్థబ్దులు. సమాధి యందుండు యోగేశ్వరులు మొదలుగ స్థబ్దుగా వరకు అందరిని, అన్నింటిని నడిపించునది సంకల్పమే. కోటాను కోట్ల జీవులు కోటానుకోట్ల విధములుగ లేచినది మొదలు నిద్రపోవు వరకు తీరుబడి లేక తిరుగాడు చుందురు. వారియందు సంకల్పముకలుగ గలదు. ఎంతగానము చేసిన అంత రక్షణ నిచ్చునది గాయత్రి వేదమాత యగుటచే గానము, ధ్యానము చేసిన వారికి జ్ఞాన వికాసము కలిగించునది గాయత్రి. అట్లే జీవితమును గమ్యము వైపునకు నడిపించు టకు వలసిన బుద్ధి ప్రచోదనము కలిగించునది గాయత్రి.



గాయత్రి వేదమాత. ఆమెయే సృష్టి సంకల్పము. ఆమె చతుర్ముఖు డగు బ్రహ్మ యందు భాసించినపుడు, చతుర్ముఖునికి సృష్టి జ్ఞానం కలుగును. ఈ సంకల్పమే లేనపుడు సృష్టియే లేదు. సంకల్పమే లేనపుడు సృష్టికర్త కూడ లేదు. ప్రకృతి పురుషులు కూడ లేరు. తత్త్వమే యుండును.



 అందుండి పుట్టు మొట్టమొదటి సృష్టి స్ఫురణ సృష్టికి కారణభూతం సంకల్పమే లేనపుడు క్రియలు కూడా లేదు. ఇచ్ఛా, జ్ఞాన క్రియలు లేవు తత్త్వము యొక్క ప్రథమ వ్యక్తి రూపము గాయత్రి అని తెలియవలెను. ఆమె సంకల్పములకు తల్లి, పుట్టుచోటు. ఎవ్వరికైనను సంకల్పము కలిగిన పిదపనే అందుండి ఇచ్చా జ్ఞాన క్రియలు పుట్టును. సంకల్పమే కలుగనిచో స్థబ్దుగా నుందురు. స్తబ్దత రెండు రకములు. ఒకటి సమాధి రెండు జడము. ఇందు మొదటివారు సంకల్పమును దాటి తత్త్వమున నిలచినవారు. రెండవ వారు అతి మంద్రస్థాయిలో మాత్రమే సంకల్పము పనిచేయు స్థబ్దులు. సమాధి యందుండు యోగేశ్వరులు మొదలుగా స్థబ్దుగా వరకు అందరిని, అన్నింటిని నడిపించునది సంకల్పమే. కోటాను కోట్ల జీవులు కోటానుకోట్ల విధములుగా లేచినది మొదలు నిద్రపోవు వరకు తీరుబడి లేక తిరుగాడు చుందురు. వారియందు సంకల్పము.లట్లు పుట్టుచునే యుండును.



 సంకల్పము పుట్టిన వెనుక దాని ననుసరించి పరుగిడుటయే యుండును గాని సంకల్పములు

పుట్టు చోటును గమనించువారు బహు కొద్ది. అట్లు గమనించు ప్రయత్నమే గాయత్రి మాతను దర్శించు ప్రయత్నం. ఆ ప్రయత్నం ధీశక్తి పెరుగును. తత్కారణముగనే గాయత్రి గానము, ధ్యానము, జపము ధీశక్తిని పెంచునని పెద్దలు తెలుపుదురు.

సృష్టికర్తకు నాలుగు వేదముల సారముగ సృష్టి జ్ఞానము కలిగించినది గాయత్రి. ఆమెయే వేదమాత



త్రిమాతను గూర్చిన వ్యాఖ్యానములు అనేకానేకములు గలవు. ఆమె రూప వర్ణము కూడ తత్త్వమే. విశేష వివరణములకు గాయత్రి మంత్రము - అవగాహన” వ్యాఖ్యానము పరిశీలించుకొన వచ్చును.



గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.


ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.


భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).


భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).


స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).


తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.


సవితుః = ఈ సృష్టి కర్త.


వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.


భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).


దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.


ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

యః = ఆ పరమేశ్వరుడు.


నః ద్యః = మా బుద్ధులను.

ప్రచోదయాత్ = సత్కర్మల యందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.



గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.



యిరువది నాలుగు దేవతా మూర్తులు:- దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి.


1 తత్- విఘ్నేశ్వరుడు

2 స- నరసింహస్వామి

3 వి- మహావిష్ణువు

4 తుః- శివుడు

5 వ- శ్రీకృష్ణుడు

6 రే- రాధాదేవి

7 ణ్యం- శ్రీ మహాలక్ష్మి

8 భ- అగ్ని దేవుడు

9 ర్గోః- ఇంద్రుడు

10 దే- సరస్వతీ దేవి

11 వ- దుర్గాదేవి

12 స్య-

ఆంజనేయస్వామి

13 ధీ- భూదేవి

14 మ- సూర్య భగవానుడు

15 హీ- శ్రీరాముడు

16 ధి- సీతాదేవి

17 యో- చంద్రుడు

18 యో- యముడు

19 నః- బ్రహ్మ

20 ప్ర- వరుణుడు 

21 చో- శ్రీమన్నారాయణుడు

22 ద- హయగ్రీవుడు

23 యా- హంసదేవత

24 త్- తులసీమాత...

ఈ ఇరవై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.



ఋషి పుంగవుల ప్రశంస:-


గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి,


ముక్తి పొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి,


గాయత్రి మంత్రం జన్మ మరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి,


గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. —యాజ్ఞ వల్క్యుడు,


గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు,


గాయత్రి మంత్ర ఉపాసన దీర్ఘాయువు కలిగించును. —చరకుడు,


గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. —వశిష్ట మహర్షి,


గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు,


గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి,


మహాపురుషుల ప్రశంస

గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. —రవీంద్రనాధ్ ఠాగూర్,


గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును. —బాలగంగాధర తిలక్,


గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. —మదన మోహన మాలవ్య,


గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును. —రామకృష్ణ పరమహంస,


గాయత్రి మంత్రం సధ్బుద్ధిని ఇచ్చు గొప్ప మంత్రం. —వివేకానంద,


గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. —రామతీర్ధ,


గాయత్రి ప్రార్థన సార్వభౌమిక (అందరూ చేయతగిన) ప్రార్థన. —డా.సర్వేపల్లి రాధాకృష్ణ,


గాయత్రి మంత్రము లోని శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా హంసరాజ్,


వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మరహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగగ్రస్థుడు కాజాలడు.



 పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన నియమము యథార్థముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము. ఇంతేకాక గాయత్రి మంత్ర జపమును విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు. —గాంధీ మహాత్ముడు.


🕉🌞🌏🌙🌟🚩

*హనుమంతుని వాహనం - ఒంటె*

     

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


*హనుమంతుని వాహనమును గురించి చాలామందికి తెలియని విషయ సేకరణ.*


పంపా తీరమందు శ్రీరాముని దర్శనం పొందిన హనుమంతుడు రోజూ సేతు ప్రదక్షిణ చేసినట్లుగా, పంపాతీరమందలి ఇసుకయందు కూడా విహారము చేయుచుండెడివాడు. 


ఇసుక తిన్నెలమీద వారి, కష్టమైన విహారం చూచి మైందుడు మొదలయిన వీరులు స్వామివారికి ఒక వాహనమును వారి ఆశయముతో కల్పించాలని ఆలోచించారు. హనుమంతుడు స్వజనులయిన వానర, భల్లూకాదులను వాహనంగా స్వీకరించటానికి అంగీకరించలేదు.


అప్పుడు హనుమత్పరివారము విభిన్న జంతువులను, పక్షులను పిలిపించారు. ఏనుగులు, గుఱ్ఱాలు, పులులు, సింహాలు, గాడిదలు, ఒంటెలు మొదలయిన జంతువులు; హంసలు, భేరుండపక్షులు, గరుడపక్షులు, చిలుకలు, నెమళ్ళు మొదలయిన పక్షిజాతులు సర్వాలంకార శోభితులై హనుమంతుని ముందు నిలిచి వివిధరీతుల అటునడిచి, ఇటునడిచి విన్యాసాలు చేశాయి.


హనుమంతుడు ఆప్రదర్శనను తిలకించి *ఒంటె* ను పిలిచి దానిని స్పృశిస్తూ, ఈ ఒంటె నాకు ఇష్టుడు. నేను శివునిగా ఉన్నప్పుడు నాకు నందిరూపంలో నిత్యము వాహనంగా ఉండేవాడు. నేను ఎప్పుడు వానరరూపాన్ని ధరించటానికి నిశ్చయించుకొన్నానో, అప్పుడు *'మీ అంశావతారంలో కూడా మీ వాహనంగా ఉండి సేవించే భాగ్యం అనుగ్రహించండి'* అని ప్రార్థించగా నేను ఆతని కోరికను అంగీకరించాను. ఆ నందియే తన అంశతో ఈ ఒంటెగా వచ్చాడు. ఇతని పేరు *పులినజవుడు.* నేను లోకంలో ఉష్ట్రవాహనుడనియు, ఉష్ట్రధ్వజుడనియు కీర్తిపొందెదను అని అన్నాడు. ఈమాట విని వానరులందరూ జయజయధ్వానాలు చేశారు.


అప్పుడు వానరులు ఒంటెను ఒంగునట్లు చేసి దానిపై పరుపును పరిచి సుఖకరమయిన ఆసనమును ఏర్పాటు చేశారు. సువర్చలా సమేతుడై హనుమంతుడు ఆ ఉష్ట్రాన్ని అధిరోహించగా వానరులందరూ వాహనోత్సవము జరిపారు.


కాబట్టి శివాలయములో శివునిముందు నందిని ప్రతిష్టించినట్లుగా హనుమంతుని ఆలయాలలో స్వామివారి ముందు ఒంటెను ప్రతిష్ఠించాలి. తాడుబందు వీరాంజనేయస్వామి ఆలయం, సికింద్రాబాదు, సింగరకొండ, వినుకొండ, ఒంగోలు నవావతారక్షేత్రంవంటి ప్రసిద్ధ అనేక దేవాలయాలలో దర్శింపవచ్చును. హనుమద్భక్తులు అలా ప్రతి దేవాలయములో ఒంటె వాహనం పెట్టించే ప్రయత్నం చేయాలి.



జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩



         *తారకాసురుడి కొడుకులు*

తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యక, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. 

అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.

"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.

"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.

"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. 

తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. 

మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.

"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. 

తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. 

అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.

"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.

"మీ ఇష్టం" అన్నారు దేవతలు.

"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.

"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. 

ఆశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. 

అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.

.........

*పాప పుణ్యాలు* 

నువ్వు చూస్తున్న విశాల భూభాగమంతా నేను సంపాదించినదే. ఇదికాక నావద్ద అపారమైన ధనరాసులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి' అన్నాడు ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో. వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటీ లేదు కదా? ' అన్నాడు మిత్రుడు.

 'వెంట తీసుకుపోగలవి ఏముంటాయి?' ఆశ్చర్యంగా అడిగాడు. 'పుణ్యరాసులు!' అన్నాడు మిత్రుడు. చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాటిపట్ల శ్రద్ధచూపరు. పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడు పనులు ఆ చెయ్యలేరు. కానీ, ఇతరులకు మేలు కలిగించేది మంచి, కీడు వాటిల్లజే నేది చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు.

 కొందరు గొప్పగొప్ప ఆధ్యాత్మిక విష యాలు మధురంగా బోధిస్తారు. 'అహం' ఆధ్యాత్మిక శత్రువు అన్నవాళ్లే, తమంత వారు తామే అనే ధోరణి కన బరుస్తారు. అసలైన ఆధ్యాత్మికత భగ వాన్ రమణులలో గోచరిస్తుంది. కౌపీనం ధరించిన ఆయనలో

కొండంత వినయం కొలువుండేది. సముద్రమంత సహనం ఆచ్చాదనగా ఉండేది. క్యాన్సరు వ్యాధి బాధను వ్యక్తం చేసే వారే కాదు. అన్నింటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు. ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందే శాలు. ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసులోని ఆలోచనలు, అలజడులన్నీ ఒక్కోటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ వేదికను పరిశుభ్రం చేసుకోవడం.

 అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది. అంత ర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్ష మవుతాడు. కళ్లు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు ధ్యానంలో స్థిరపడుతుంది. ధ్యానం 

 ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక సాధనం .

 తిరస్కరిస్తుంది.వలంటే అష్టసిద్ధులు లేని అనుబంటూ సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకొన్నదే.

 ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి.

 సాధనలన్నీ ఇష్టంగా ఉండు చెయ్యాలి. కష్టంగా చేస్తే ఫలితాలు దక్కవు.

 శరీరసుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. నాలుక రుచిని, శరీరం సౌఖ్యాన్ని, బుద్ధి గౌరవాన్ని అపేక్షిస్తాయి. ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది.

 ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు. సద్బుద్ధి, సద్భక్తి, అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే! అసలు అంతర్యామితో అనుబంధమంటూ ఏర్పడాలేగాని, ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచకన్నా హీనమనిపిస్తుంది.

 మన ఆకాంక్షలన్నీ 'అంతర్యామి'తో అనుబంధానికి అంకి తమై ఉండాలి. మన ఆచరణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి. అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం. ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే. ఏమి చేసినా భగవంతుడి సేవే

 - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్





No comments:

Post a Comment