పరిశీలనే పాఠం(కథ ) ✍️ నారంశెట్టి ఉమామహేశ్వరరావు
సైన్సు మాష్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన తరువాత సమయం మిగలడంతో పిల్లల్తో మాట్లాడారు. “సృష్టిలో ప్రతి జీవికీ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోడానికి మంచి లక్షణాలు కనిపిస్తాయి” అన్నారు.
నరేంద్ర అనే పిల్లవాడు “మాష్టారూ! నిజంగానా?”అన్నాడు సందేహంగా.
“సందేహమెందుకురా? రేపెలాగూ ఆదివారమే. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది” అన్నారు నవ్వుతూ మాష్టారు.
సోమవారంనాడు పాఠశాలలో తొమ్మిదో తరగతికి వచ్చినప్పుడు సైన్సు మాష్టారు నరేంద్రని నిలబెట్టి “నువ్వడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా?” అనడిగారు.
“ఇంటికి వెళ్ళగానే ఆ విషయం మరచిపోయాను” అన్నాడు తల ఒంచుకుని నరేంద్ర.
వాడి ప్రక్కనే కూర్చున్న కార్తీక్ చెయ్యెత్తాడు. వాడిని చెప్పమన్నారు మాష్టారు.
“ మా ఇంట్లో పంచదార క్రింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి పంచదార పలుకుని తీసుకుపోయింది. మరికొంతసేపయ్యేసరికి చీమల దండు వచ్చింది అక్కడకి. ఒక్కో పలుకు చొప్పున దాదాపు మొత్తం పంచదారని తీసుకుపోయాయవి. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు వరుస పాటించాయి చీమలు. అవెళ్లే దారిలో గిన్నె అడ్డుపెట్టాను. ప్రక్కనుండి వెళ్లిపోయాయి తప్ప ఆగలేదు చీమలు” అన్నాడు కార్తీక్ .
“నీకేం అర్థమైంది?” అనడిగారు మాష్టారు.
పిల్లలంతా కార్తీక్ వైపు ఆసక్తిగా చూసారు.
“ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తుపడతాయని, వరుస పధ్ధతిని పాటిస్తాయని, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవని, ఐకమత్యంగా ఉంటాయని తెలిసింద”న్నాడు వాడు.
“బాగా చెప్పావు” అని మెచ్చుకున్నారు మాష్టారు.
“ఇంకెవరైనా?” అని మాష్టారు అడగ్గానే రాము నిలబడి “మా దొడ్లో జామచెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్లేసరికి ఒక సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో అది జారి క్రింద పడిపోతుండేది. ఒకసారి పెద్దగా గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి చిన్న కొమ్మ విరిగడంతో దారం తెగి క్రిందపడింది. అలా ఆటంకాలు వచ్చినా పట్టు వదల్లేదది. చాలా సార్లు క్రిందపడినా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించి చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో ఇమిడిపోయింది సాలీడు ” అన్నాడు.
“ నీకేం అర్ధమైందో చెప్పు?” అనడిగారు మాష్టారు.
“ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదని, ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే పని పూర్తి చెయ్యాలని” అన్నాడు రాము.
బాగా చెప్పావని రాముని మెచ్చుకున్నారు మాష్టారు.
ఈసారి మాష్టారు అడగక ముందే రవి నిలబడ్డాడు. ‘నేనూ ఒకటి చెబుతానంటూ’ మొదలుపెట్టాడు.
“ మా పెరట్లో పూలమొక్కలే కాకుండా జామ, దానిమ్మ , వేపచెట్లున్నాయి. వేపచెట్టు కొమ్మల్లో తేనెటీగలు తేనెపట్టుని పెట్టాయి. అక్కడ నుండి తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలాయి. ఒక్కో పువ్వునుండి మకరందాన్ని నోటిలోకి తీసుకొని ఝమ్మని ఎగురుతూ తేనెపట్టులో దాచేసి మళ్ళీ వచ్చేవి. ఇంకో పువ్వు మీద వాలేవి. అలా రోజంతా ఎగురుతూనే ఉన్నాయి. మకరందం తీసుకెళ్తూనే ఉన్నాయి” అన్నాడు.
“నీకేం అర్ధమైందని“ వాడిని అడిగారు మాష్టారు.
“తేనెటీగలకి బద్ధకం లేదని తెలిసింది. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే కలిగే ఫలితం తేనెలాగా తియ్యగా ఉంటుందని బోధపడింది” అన్నాడు రవి.
మాష్టారు “పిల్లలూ! నరేంద్ర అడగబట్టే కదా వీళ్ళ ముగ్గురూ తెలుసుకున్న విషయాలను మనతో చెప్పారు. దీన్ని బట్టి ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని తెలిసింది కదా. వాళ్ళ ముగ్గురూ చెప్పినట్టు మనుషులు కూడా ‘చీమల్లా ఐకమత్యంగా ఉండాలి. కష్టపడి పని చెయ్యాలి. తలో దారిలో వెళ్లకుండా ఒకే మాట, ఒకే బాటన్నట్టు ఉండాలి. పనిలో అడ్డంకులు వచ్చినా వదిలేయకుండా మరో ప్రయత్నం చెయ్యాలని, పూర్తయ్యేవరకు సాలీడులా పట్టు విడువకూడదని తెలిసింది. తేనెటీగల విషయానికి వస్తే అవి కష్టపడి తేనె పట్టు పెట్టినా తేనెను త్రాగలేవు. మనుషులే వాడుకుంటారు. మనం కూడా ప్రక్కవారికి ఉపయోగపడే పనులు చేస్తుండాలని గ్రహించాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే మిగతా జీవుల్లో కూడా మంచి లక్షణాలెన్నో కనిపిస్తాయి” అన్నారు.
పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టి “అర్ధమైంది మాస్టారు. మేము కూడా మాలో మంచి లక్షణాలు పెంచుకుంటాము” అన్నారు ఏకకంఠంతో.
***
*ధృతరాష్ట్రుని చింత:*
భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది అన్నాడు . సంజయుడు సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారధ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును అని పరితపించాడు. ధరమరాజు కామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను ,అర్జునిని ఎదిరించే వారు లేరు అన్నాడు. అందుకు ధర్మరాజు భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను అన్నాడు ధర్మరాజు.
[
మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు.
ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం.
సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది.
‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది.
సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు.
క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం.
‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే.
మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది.
కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు.
మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది.
మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు.
[
జీవన యోగం
ఆధ్యాత్మిక పరిభాషలో యోగం జీవాత్మ పరమాత్మల సంయోగం. వ్యక్తిచైతన్యం విశ్వచైతన్యంతో లీనం అయినప్పుడు యోగం అవుతుంది. విశ్వచైతన్యం అంటే విష్ణుచైతన్యం విశ్వం విష్ణువు స్వరూపమే. యోగసాధన జీవితంలో సాగవలసిన నిరంతర ప్రక్రియ.
శరీరం, మనసు, ఆత్మ- త్రివేణి సంగమించిన ప్రయాగ క్షేత్రం మనమేనని తెలుసుకోవడమే ఎరుక లేదా జ్ఞానం. మూడూ ఒకదానితో ఒకటి లంకె వేసుకున్నందువల్ల ఒక నియతిప్రకారం పురోగమించి జీవితాన్ని పండించుకోవాలి. మనం శరీరానికి, ఆత్మకు మధ్యన ఉన్న మనసు సంధానకర్తలాంటిది. ఇటు భౌతిక బంధానికి అటు ఆత్మోన్నతికి మనసే కారణం మనసును మెల్లగా ఆదుపు చేయడాన్నే అభ్యాసయోగం అంటారు. అభ్యాస యోగి సత్కర్మలు చేస్తూ లోకకల్యాణం సాధిస్తాడు. కుండలినీ యోగం లేక హరయోగం గురించి పతంజలి మహర్షి యోగ శాస్త్రం, ప్రముఖంగా రాజయోగం గురించి గీతా గ్రంథం చక్కగా చెబుతున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానమనే ఏడంచెలు సాధించాలి. సమాధి అనే యోగసిద్ధిని పొందాలి. మొదటి నాలుగు అంచెల ద్వారా శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. అనంతరం అంతర్ముఖం కావడం. ఏకాగ్రత పొందడం. ఒకే వస్తువుపైన బుద్ధినిలపడం అన్న మూడు సంబంధించినవి. చిత్తవృత్తులు మనసుకు ముఖ్యంగా నిరోధించమని, సమతౌల్యం సాధించమని పతంజలి యోగం చెబుతున్నది.
అంతర్యామి
దేశ, కాల, పాత్రలను బట్టి యోగాభ్యాసం పలుమార్పులకు, చేర్పులకు లోనయింది. శారీరకంగా ఆరోగ్యం సాధించడానికి బోలెడు వ్యాయామాలున్నాయి. అంతరంగంపై నియంత్రణ సాధించడమే అసలైన యోగ సాధన పామరులకు కూడా పనికి వచ్చే అష్టాంగమార్గం చెప్పాడు బుద్ధుడు.
భౌతిక జీవితంలో వేగం పెరుగుతున్నకొద్దీ అంతరంగిక యోగ సాధనకు అంతరాయం కలుగుతున్నది. ఉన్నంతలో యోగ బలం పుంజుకోవడానికి సులభమైన, సరళీకృతమైన, యోగ విద్యకు రూపుదిద్దవలసిన అవసరం ఉన్నది.. మనం చేయవలసిన పనులు యంత్రాలు చేయలేవు. శరీరం కర్మక్షేత్రం. ఆది కర్మాగారంగా మారితేనే ప్రమాదం. యాంత్రికజీవనం మనిషిని మరమనిషిగా మార్చివేస్తుంది. కర్మచేయడంలో నేర్పరితనమే యోగం అంటున్నాడు కృష్ణుడు.
కర్మాగారంలో వేగంగా, ఒకే నమూనాలో వేల సంఖ్యలో వస్తువుల్ని తయారుచేయవచ్చు. ఈ శరీరాన్ని ధర్మసాధన చేయడానికి ఉపయోగించాలి. 'శరీరమాద్యంఖలు ధర్మసాధనమ్ అన్న ఆప్తవాక్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆశ్రమ ధర్మాల ద్వారా పురుషార్ధం సాధించాలని అర్జునుడికి బోధించాడు. గీతాచార్యుడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం, చతుర్విధ పురుషార్థాలు, ధర్మంగా అర్ధ కామాలు
అనుభవిస్తూ చివరి పురుషార్ధమైన మోక్షం సాధించడమే జీవన యోగం. సాధన వల్ల సమకూరనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదంటారు. జీవితమే ఒక యోగమై సాగితే భవ్య జీవితం దివ్య జీవనంగా మారుతుంది. మానవుడు. దివ్య మానవుడవుతాడు. నిండు నూరేళ్లు జీవించి పండులా రాలిపోవడమే. మోక్షం. అదే జీవనయోగం. - ఉప్పు రాఘవేంద్రరావు
[
No comments:
Post a Comment