Saturday, 25 June 2022

 [


పాదసేవ


జ్ఞాన భండారం మనిషి మస్తిష్కం కరుణ కురిపించేవి కళ్లు, మంచి బోధనలు చేసేది నోరు, సేవలు చేసేవి చేతులు, రక్షణ కల్పించేవి బాహువులు, అక్కున చేర్చుకునేది హృదయం శక్తిని, యుక్తిని, అనురక్తిని ఇచ్చేవి ఇతర అవయవాలు, వీటన్నింటి మూలాలు పాదాల్లో కేంద్రీకృతమై ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రం చెబుతోంది. ఆ పాదాలు ఎల్లవేళలా భూమితో అనుసంధానమై ఉంటాయి. అన్ని శక్తులకు ఆలవాలమైన భూమి నుంచి నిత్యం వెలువడే సానుకూల తరంగాలు పాదాల్లోనే నిబిడీకృతమై ఉంటాయి. అంటే పాదాలు మనిషిలోని అన్ని శక్తులకూ ఆలంబనలు అందుకే పాదాలకు నమస్కరిస్తే మూర్తీభవించిన అన్ని లక్షణాలకూ ఏకకాలంలో నమస్కారం చేసినట్టే. అధర్వణ వేదంలో పాద నమస్కార విధులు, ప్రయోజనాల వివరణ ఉందన్నది వేదవేత్తలు చెబుతున్న మాట.


పెద్దలు మనకంటే ఎక్కువ కాలం ఈ భూమిపై జీవించారు. ఎక్కువ జ్ఞానాన్ని, అనుభవాన్ని గడించారు. అనేక శక్తులను కూడగట్టుకున్నారు. కాబట్టి, వారి పాదాలకు గౌరవసూచకంగా నమస్కరిస్తే వారి మార్గాన్ని అనుసరిస్తున్నామనే సంకేతాన్ని వారికి ఇచ్చినట్లు అవుతుంది. అది నిరహంకార తత్వానికి నిదర్శనం. అదీకాక ముఖం ఎదురుగా ముఖం ఉంచి మాట్లాడటం ఆహంకారం. కళ్లకెదురుగా కళ్లు పెట్టి చూస్తే ఆ తీక్షణత తట్టుకోవడం కష్టం. మిగిలిన అవయవాల వైపు చూడటం సంస్కారరాహిత్యం.. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం పాద నమస్కారం. సీతమ్మవారి నగలను గుర్తించే సమయంలో లక్ష్మణుడు సీతాదేవి. పాద మంజీరాలు తప్ప మరి వేటినీ గుర్తు పట్టలేదు!. అంతేకాకుండా మన జ్ఞాన భాండా గారమైన శిరస్సును ఆ అనుభవజ్ఞుల పాదాలకు తాకించడం మన జ్ఞానాన్ని వారి అనుభవాలతో అనుసంధానం చేయ కోరుతున్నాను అనే భావానికి సంకేతం

అవుతుంది. అది శరణాగతి తత్వానికి సూచన పెద్దల పాదాలకు నమస్కరించడంలో శాస్త్రీయమైన కారణం మరొకటి ఉంది. మానవ శరీరంలోని నరాలు, మెదడు నుంచి మొదలై, శరీరమంతా వ్యాపించి, చేతులు/కాళ్ల వేళ్ల చివర్లలో ముగుస్తాయి. పాదాలకు నమస్కరించే వారి చేతివేళ్ళ ఆ శక్తి గ్రాహకాలుగా మారతాయి. అప్పుడు పెద్దవారి పాదాలు శక్తిదాయకాలుగా మారతాయి. పెద్దవారి హృదయం నుంచి సానుకూల శక్తితో నిండిన తరంగాల పరంపర ఆ పాదాల కొనల నుంచి చేతుల ద్వారా నమస్కరించే వారి శరీరంలోకి చేరతాయి. అవి మనసు మీద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.


పాదాలకు నమస్కరించడం వల్ల మానసిక శారీరక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం, పాదాలను తాకడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ముందుకు వంగి పాదాలను తాకడం, మోకాళ్లపై కూర్చుని అవతలి వ్యక్తి పాదాలను తాకడం, నుదురు నేలను తాకించి చేసే సాష్టాంగ ప్రణామం. ఈ ప్రక్రియల ద్వారా పాదాలను తాకడానికి ముందుకు వంగిన కారణంగా వెన్ను, నడుము, మోకాళ్లు వంగి శరీరంలోని కీళ్లన్నీ సాగుతాయి. దీనివల్ల శరీరంలోని నరాలు, మెదడులోని నాడులు అన్నీ ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. పెద్దల పాదాలకు నమస్కరించే పద్ధతి భారతదేశంలో వేదకాలంలోనే

ప్రారంభమైంది.


అయ్యగారి శ్రీనివాసరావు

[


*తపనగా... తపస్సుగా* !


'మహాభారత సంగ్రామం ముగిసింది. కృష్ణుడు, ధర్మజుడు రాజ్య పాలనకు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారు. కృష్ణుడు అన్యమనస్కంగా ఉండటాన్ని ధర్మరాజు గమనించాడు. కారణం అడిగాడు. భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు. మనిషిని ఇక్కడే ఉన్నా, మనసంతా అక్కడుంది' అని కృష్ణుడు బదులిచ్చాడు. అలా ఒక భీష్ముడి తపన, కుంతి ప్రార్ధన, వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది వేదన ... పరమాత్మ చైతన్యాన్ని బలంగా ఆకర్షించాయని భారతం చెబుతోంది.


వైమానిక దళంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అబ్దుల్ కలామ్ కు నిరాశ ఎదురైంది. ఆయన సరాసరి రిషికేశ్ చేరి స్వామి శివానందను కలిశారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. కలామ్ ను ఓదారుస్తూ శివానంద కోరిక అనేది హృదయం నుంచి, ఆత్మ నుంచి ఉప్పొంగినప్పుడు, అది పవిత్రమైనది. తీవ్రమైనది అయినప్పుడు దానికి ఒకానొక బలమైన విద్యుదయస్కాంత శక్తి ఏర్పడుతుంది. మనసు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రీ ఈ శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. బయట విశ్వంలోని శక్తి ప్రవాహాల అమోఘ బలాన్ని పంచుకొని, పుంజుకొని, వేకువలో అది మన వ్యక్తస్థితిలో చేరవస్తుంది. నీవేది ఆకాంక్షించావో అది తప్పక సిద్ధిస్తుంది. ఈ కాలాతీత వాగ్దానాన్ని నమ్ము... విజేతవు కా' అని ఆశీర్వదించినట్లు ఆయన తన ఆత్మకథలో వెల్లడించారు. శివానంద హితవచనాన్ని జీవితమంతా అనుష్టించిన అబ్దుల్ కలామ్ తన జీవిత చరిత్రకు 'వింగ్స్ ఆఫ్ పైర్ అని పేరు పెడుతూ, 'మనమంతా మనలోని ఒక   దివ్యాగ్నితో     జన్మించాం.  మన ప్రయత్నా లెప్పుడూ ఆ అగ్నికి రెక్కలు అమర్చేలా ఉండాలి' అంటూ 

జాతికి సందేశం ఇచ్చారు. 'నిన్ను నిద్రపోనివ్వని కలలు కను అని కలామ్ నేటి యువతకు చెప్పడంలో ఆంతర్యం ఏమంటే- మనిషి భవిష్యత్తు కోసం కలలు కంటే సరిపోదు. అవి మంచివి అయి ఉండాలి. ఆత్మలోంచి ఆవిర్భవించాలి. గుండెను చీల్చుకుంటూ రావాలి. తపనగా పరిణమించాలి. తపస్సుగా మారిపోవాలి. తపస్సు చాలా శక్తిమంతమైనది. మనిషిలోని అంతర్గత శక్తిని పోగేసి, దాన్ని ప్రకృతి శక్తులతో జత కలిపి మనిషి వాంఛితాలను నెరవేర్చే స్థాయి దానిధి స్వామి శివానంద కలామ్ కు వివరించింది ఆ ఆధ్యాత్మిక పరిణామ క్రమం గురించే భక్తి రూపంలో భగవంతుణ్ణ్ని ఆకట్టుకునేది. మనిషి తపస్సే మనిషి చేతనకు ఆలోచన, తపన అనే రెండు రెక్కలను అమర్చి విశ్వంలో విడిచిపెట్టడమే తపస్సు ఏకాగ్ర చిత్తంతో గాఢంగా భావన చేయడమే తపస్సు

పాశుపతాస్త్రం కోరి అర్జునుడు పరమ శివుడి కోసం తపస్సు చేశాడు. 'అర్జునుడి తపస్సు అనే అగ్నిలోంచి పుట్టిన సెగలు లోకానికి తాపం పుట్టిస్తున్నాయి. ఆ అగ్ని నుంచి కమ్మిన పొగలు అంతటా ఆవరిస్తున్నాయి. సర్వప్రాణులకు ఆయన తపస్సు భీతిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది' అని ఆ ప్రాంత మునులు శివుడికి మొరపెట్టుకున్నట్లు భారతం అరణ్యపర్వం చెబుతోంది. విశ్వామిత్రుడి తపస్సు జగద్విఖ్యాతమైనది. దాని తీవ్రతకు లోకాలు కనిపించాయి. సముద్రాలు పొంగాయి. పర్వతాలు చలించాయి. దేవతలంతా బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నారని రామాయణం వివరించింది. తపస్సు ఎంతోమహిమాన్వితమైనదని చెప్పే ఘట్టాలివి. మనిషి తాను దివ్యాగ్ని స్వరూపుడినని గ్రహించాలి. కోరికలతో రగిలిపోవడం

కాదు- తపస్సుతో ప్రజ్వలించాలి. తపస్సు వల్ల సాధ్యమయ్యేది ఏది... అనే ప్రశ్నకు కానిది ఏది అనేది జవాబని గ్రహించాలి.


-✍🏻ఎర్రాప్రగడ రామకృష్ణ

[


నేను ఎవరు?

ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు?

నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా?

ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..!

నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..!

అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..?

నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..!

ఎవరా నేను..?

మనిషినెవరు సృష్టించారు? భగవంతుడు... అని భగవంతుడు చెప్పాడా? మనం అనుకుంటున్నాం. అంటేఎవరూ సృష్టించలేదు. ప్రతిమనిషీ'నేను' అనుకుంటూ తనకొక ప్రత్యేక గుర్తింపును,ఉనికిని తనకు తాను సృష్టించుకుంటున్నాడు.

నిజానికి మనిషికి, అంటే మనకు తెలీదు. నిజానికి చాలామందికి తెలుసు. ఏమిటీ భిన్న వ్యక్తీకరణ? నిజమే అయితే రెండూ నిజమే. తెలీని అమాయక స్థితిలో చాలామంది తెలిసీ చెప్పలేని ఆత్మస్థితిలో మరెంతోమంది ఉంటున్నారు.

నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను.

అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి.

నేను' అంటే దేహస్థితి కాదు. బాహ్యస్థితి కాదు. ఆది లేని, అంతం లేని ఆత్మ ధృతి. నివురుగప్పిన నిప్పులా లోలోన ప్రజ్వరిల్లుతున్న ఎప్పుడూ 'శాంతికాని' మహాకాంతి దీపం. ఎన్నడూ వాడని అనంత శాంతి పుష్పం. దేహం అంటే సప్త ధాతువులు, పంచ కోశాలు, వాయువులు, నాడులు. ఆత్మను కప్పిఉంచిన ఆధారాలు. ఔను... బంగారు పళ్లానికి కూడా గోడ చేర్పు కావాలి. వజ్రానికీ బంగారు ఆభరణపు ఆధారం కావాలి. జీవాత్మకు దాన్ని నిలిపి ఉంచగల ఉపాధి కావాలి. అదే దేహం. పంచకోశ నిర్మిత దేహం.

ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది  అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం..

ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి.

 రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే  జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన.

సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా  తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి.

అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు  మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.


జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా?

నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా.

చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన.

శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు.

జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.


అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును.  నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..?  ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే.

ఆ మహోన్నతమైన ఆత్మస్థితిని, స్థాయిని ధరించగల ఒక వజ్రకవచం, ఒక అమృత కలశం కావాలి. కాబట్టే రక్త మాంస సంతులితమైన దేహాన్ని డెబ్భైరెండు వేల నాడులతో, పంచకోశాలతో, వాయువులతో, ఇరవైతొమ్మిది తత్వాలతో, ఆధ్యాత్మిక హృదయంతో (కుడివైపున ఉంటుంది), మేరు దండంతో, దానిలోని షట్ చక్రాలతో, ఇడా పింగళ సుషుమ్ననాడులతో, సహస్రార కమలంతో అత్యున్నతంగా, పరమోత్కృష్టంగా అలంకరించాడు భగవంతుడు. వాటన్నింటినీ కాపాడేందుకు, సమన్వయం చేసేందుకు రుధిరం, మజ్జ, అస్థులు, నేత్రాలు, చక్రాలు,జిహ్వ... ఒకటేమిటి అంగుళమంగుళాన ఒక అధిష్ఠానదేవత. అంటే ఆత్మ శాశ్వతం అయినప్పుడు, ఎవరూ సృజించనిదైనప్పుడు దాని ఉపాధి అయిన శరీరాన్నిమాత్రం మరెవరో సృష్టించారా? ఆలోచిద్దాం... సాలెపురుగు తన చుట్టూ తన రక్షణ కోసం తానే అందమైన, భద్రమైన గూడు అల్లుకుంటుంది. అవసరం తీరిపోయాక ఆ గూడును మళ్ళీ తనలోకే లయం చేసుకుంటుంది. ఆత్మ అవధానమూ అంతే. అమృతాత్మ స్వరూపుడైన మానవుడు ఒక్కసారి కుబుసంలా తన దేహకోశాన్ని విస్మరిస్తే, విదిలిస్తే, వదిలేస్తే ఆత్మ కుండలిని తేజో విరాజమానం అవుతుంది. దేహం రక్షక పత్ర సమానం. సుందర సుకుమార సుమాన్ని ధరించినంత మాత్రాన అదే పుష్పమై పోదు. రక్షక పత్రాలు వాలిపోవలసిందే. రాలిపోవలసిందే. పుష్పం జగజ్జేయమానంగా వికసించి వెలిగిపోవలసిందే. మనిషి 'నేను'ను శరీరమే అనుకున్నప్పుడు, ఆ దేహభావంతో తాదాత్మ్యం చెందినప్పుడు... ఆదేహాన్ని సృజించినవాడు... అనుమానమేల... ఆభగవంతుడే. 'నేను' ఆత్మే అనుకున్నప్పుడు ఆత్మకు జనన మరణాలు లేవు. సృజన సంహారాలు లేవు. ఆత్మ శాశ్వతుడే. స్వయంభువే. ఈ సృష్టిలో ఒక శాశ్వత నియమం ఉంది. ఏ పదార్థాన్నీ ఎవరూ సృష్టించలేదు. నాశమూ చేయలేరు. ఆ శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది. ఎవరైనా దేన్నైనా సృష్టించారంటే మరో చోటునుంచి తెచ్చుకోవటమే. నాశనం చేశారంటే మరో రూపంలోకి మార్పు చెందటమే. వాయువు నీరవుతుంది. నీరు మంచు అవుతుంది, మళ్ళీ మంచు నీరవుతుంది. నీరు వాయువవుతుంది. కేవలం మార్పు అంతే. ఉన్నదేదో ఉంది. అది పోదు.లేనిదేదీ రాదు. మనిషి కృత్రిమ 'నేను'లోంచి బయటపడాలి. స్వయంభువు జాగృతం కావాలి. మహితాత్మకం కావాలి. దానికి... ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన మనిషి సాధన (ధ్యానసాధన ) తో కొంత- దేహభావంలోంచి తొలుచుకుని ఆత్మభావంలోకి చేరుకోవాలి. నేను అసలు నేనులోకి తాదాత్మ్యం చెందితే ఇక నేను, నీవు, దేహం, సృజన, మరోటీ మరోటీ... ఏదీ లేని శుద్ధాత్మ. అంతా...

[


మంత్రిగారి ప్రవర్తన    (కథ )  

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు


విదర్భ   దేశపు మంత్రి ముకుందుడు వృద్ధుడు కావడంతో,  బాధ్యతల నుండి తప్పుకుంటానని, తన కొడుకు  శోభితుడుకి ఆ పదవినిమ్మని  మహారాజుని కోరాడు. 

అలా కాకుండా  పోటీలు నిర్వహిద్దామని,  ప్రతిభ ఆధారంగా ఎంపిక చేద్దామన్నాడు రాజు. శోభితుడిని కూడా పోటీల్లో పాల్గొనమన్నాడు.   


 మంత్రి పదవికి జరిపిన ఎంపిక పరీక్షల్లో శోభితుడు, సైన్యాధిపతి కుమారుడు వరుణుడు  సహా యువకులెందరో  పాల్గొన్నారు. వాళ్లందరిలో   రైతు కుమారుడు  విజయుడు అసాధారణ ప్రతిభ చూపించి పదవికి ఎంపికయ్యాడు. 


ఆరుమాసాల శిక్షణ తరువాతనే విజయుడికి  పదవీ బాధ్యతలనిద్దామని, అంతవరకు శిక్షణనిమ్మని ముకుందుడికి  చెప్పాడు రాజు. మంత్రిగారి నివాసం ప్రక్కనే ఉన్న వసతిగృహాన్ని విజయుడికిమన్నాడు రాజు. ‘అవన్నీ నేను చూసుకుంటానని’ రాజుగారితో చెప్పాడు మంత్రి.   


 భటుల నివాస గృహాల మధ్యన ఉన్న పాడుబడిన  ఇంటిని విజయుడికి కేటాయించాడు మంత్రి.  ఒక చాప, బొంత, పరిమితమైన వంట సామగ్రి మాత్రమే  ఉన్నాయక్కడ. రాజుగారు చెప్పింది పెడచెవిన పెట్టేసి అలంటి ఇంటిలో ఉండమన్నందుకు  బాధపడ్డాడు విజయుడు.    


ఆ రాత్రి పడుకోబోయే ముందు ఒక భటుడు  ‘ఉదయాన్నే పదిహేను క్రోసుల  దూరంలోని రాజవరం గ్రామానికి తనిఖీల కోసం వెళ్లాలని, మంత్రిగారు బయల్దేర మన్నారని’ విజయుడితో చెప్పాడు.  తొందరగా లేచి మంత్రిగారి నివాసానికి వెళ్ళాడు విజయుడు. అప్పటికే ఆయన వెళ్ళిపోయినట్టు, రెండు రోజుల తరువాత తిరిగొస్తారని వాళ్ళింట్లో చెప్పారు. 


“కాబోయే మంత్రిని తనతో బాటు గుర్రపు బగ్గీలో తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకిలా చేసాడు? ఇప్పుడెలా వెళ్ళాలని” బాధపడ్డాడు విజయుడు.  


కొంత దూరం కాలినడకన , ఇంకొంత  దూరం ఎడ్లబండి మీద ప్రయాణించి ఎలాగో వూరు చేరుకున్నాడు.  విజయుడిని చూసి కూడా చూడనట్టే ప్రవర్తించాడు మంత్రి.  పరిచయమేదీ  చెయ్యకుండా సాధారణ పౌరుడిలాగా నిలబెట్టాడు.  అదంతా అవమానంగా భావించాడు విజయుడు.  


పదిరోజుల తరువాత ఆనకట్ట నిర్మాణపు పనులు పర్యవేక్షణకు వెళదామని చెప్పాడు మంత్రి. విజయుడు వెళ్ళేసరికే  వెళ్ళిపోయాడాయన. ఎంతో కష్టపడి ఆయన  చెప్పిన చోటుకి వెళ్ళాడు విజయుడు. అక్కడా విజయుడెవరో తెలియనట్టే ప్రవర్తించాడు మంత్రి. 

మధ్యాహ్న భోజన ఏర్పాట్లప్పుడు కూడా తనకొక్కడికే  చెయ్యమన్నాడు మంత్రి.  పూటకూళ్ళ ఇల్లు వెతుక్కుని భోంచేసి వచ్చాడు  విజయుడు.  

ఇంకొన్ని రోజుల  తరువాత మరో గ్రామంలో కొట్లాటలవుతున్నాయని, వాటిని   పరిష్కరించి రమ్మని విజయుడితో చెప్పాడు మంత్రి. భటుల సాయం కావాలని  అడిగిన   విజయుడితో  “నువ్వెళుతున్నది యుద్ధానికి కాదు. కొట్లాట పరిష్కారానికి..  భటులెందుకని ’ అన్నాడాయన.  ఆ వూళ్ళోకెళ్లి తనని పరిచయం చేసుకుని సమస్యను పరిష్కరించాడు విజయుడు. ’ ప్రక్కన ఓ భటుడున్నా బాగుండేది. తనని  పరిచయం చేసేవాడు’    అనుకున్నాడు మనసులో. 


మొత్తానికి విజయుడి ఆరునెలల శిక్షణ కష్టంగా పూర్తయింది. ఆయన  కొడుక్కివ్వాల్సిన పదవిలోకి వచ్చినందుకు  కోపంతోనే మంత్రిగారు అలా ప్రవర్తించారని అనుకున్నాడు విజయుడు. 


పదిరోజుల్లో  మంత్రి బాధ్యతలు  అప్పగిస్తారనగా విజయుడి పట్ల  మంత్రి గారిలో మార్పు వచ్చింది. కాబోయే మంత్రి అని పరిచయాలు చేయడం, తన ప్రక్కనే ఆసనం వేయించి  గౌరవించడం, గుర్రపు బగ్గీలో ప్రక్కనే స్థానమివ్వడం,  విందు భోజనాల్లో సమాన స్థాయి కల్పించడం.. వగైరా చాలా చేసాడు. తనలోని  కోపాన్ని తగ్గించి మంచి చేసుకోడానికే ఇదంతా చేస్తున్నాడని అనుకున్నాడు విజయుడు. 


విజయుడికి బాధ్యతలు అప్పగించే రోజు ఉదయం విజయుడితో ఏకాంతంగా మాట్లాడాడు మంత్రి ముకుందుడు.

 “ శిక్షణా కాలంలో  నిన్ను కావాలనే  దూరంగా వుంచాను. అందుకు ఎంతో బాధ పడేవాణ్ణి.  కానీ తప్పలేదు. నువ్వు పని నేర్చుకోవాలంటే కష్టాలు తప్పవు. నా ప్రక్కనే   గుర్రపు బగ్గీలో నిన్ను త్రిప్పుతుంటే  నిన్ను కూడా మంత్రి లాగానే చూస్తారు పౌరులు.  మనస్సు విప్పి ఏమీ చెప్పుకోలేరు. అందుకే మంత్రిగా కాకుండా సామాన్యుడులాగానే వారితో  తిరిగేలా చేశాను. ప్రజలతో  కలవాలని, జరుగుతున్నవన్నీ తెలుసుకోవాలని, క్రింది వాళ్ళ  మంచి చెడులు, కష్టసుఖాలు స్వయంగా చూసి , అనుభవించి విషయాలను  నువ్వర్ధం చేసుకోవాలనే ఇదంతా చేశాను. భటుల నివాసగృహంలో ఉంచడానికి కారణమూ  అదే.  ఇప్పుడు నీకొచ్చిన అనుభవం పదవిలో ఉండగా  పదేళ్లకు కూడా రాదు. అందువల్ల ఇబ్బందులు  వచ్చేవి కూడా. చేద్దామనుకున్నది చేయలేకపోయేవాడివి. ఇప్పుడు  ఎంతో  నేర్చుకున్నావు.  అందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యమైన మాట చెబుతాను.విను.   రాజసేవ  పూలపాన్పు కాదు. పదవి అనేది ముళ్ళ కిరీటం. చాలా జాగ్రత్తగా ధరించాలి. కష్టాన్ని కూడా సులువుగా తీసుకునే ఓర్పు ఇప్పుడు నీకుంది. కాబట్టి అంతా మంచి జరుగుతుంది” అని దీవించాడు.   


అనుభవజ్ఞుడైన మంత్రిగారు  ముందుచూపుతో వ్యవహరించాడని, ఆయన   ప్రవర్తనను అపార్ధం చేసుకున్నానని గ్రహించాడు  విజయుడు.  ఆయనకు  కృతజ్ఞతలు చెప్పుకుని పాదాభివందనడం చేసాడు. 

  ---***----

[


పూర్వం ప్రజ్ఞాపురం లో కుందముడు అనే పదేళ్ళ కుర్రాడు వుండేవాడు.వాడి తల్లి 

జబ్బుతో మరణించింది.తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.పిన్ని వచ్చింది.ఆవిడకు 

కుందముడంటే యిష్టముండేది కాదు.వాడిని ఎలాగైనా యింటినుండి గెంటేస్తే తనూ 

మొగుడూ చిలకాగోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది.

ఒకరోజు కుందముడు గుడికి వెళ్లి పూజారి చెప్తున్నహరికథ విన్నాడు. అందులో ఒక 

కుర్రాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన వరాలన్నీ యిచ్చేశాడని 

పూజారిగారు చెప్పినది వాడికి చాలా నచ్చింది.యింటికి వచ్చి పిన్నిని 

అడిగాడు.పూజారిగారు చెప్పారు 

తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలిస్తారని నిజమేనా?అని అడిగాడు.ఆవిడకు 

వీడిని

ఎలాగైనా వదిలించుకోవాలని వుంది కదా! అందుకని నిజమే వూరికి ఉత్తరాన వున్న

చింత చెట్టు క్రింద కూచుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్ష మవుతాడు.వెళ్ళు 

పోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది.ఆ మాటను కుందముడు గట్టిగా నమ్మాడు.

వెళ్లి ఆ చింతచెట్టు క్రింద కూచుని తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.అలా కొన్నేళ్ళు 

గడిచాయి.కుందముడి తండ్రీ,పిన్నీ గతించారు. కొన్నేళ్ళు గడిచాయి. హరి ప్రత్యక్షం 

కాలేదు.కుందమునికి.ఒక రోజు నారదుడు ఆకాశంలో వెడుతూ క్రిందకు చూశాడు.చింత 

చెట్టు క్రింద ఏకాగ్రతతో .తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు.చిక్కి శల్యమైన 

.వాడిని చూస్తే వాడి మీద జాలేసింది క్రిందికి దిగివచ్చాడు. హరి ప్రత్యక్ష మయ్యాడా? 

అని అడిగాడు. లేదు అన్నాడు కుందముడు.మీరు వైకుంఠా నికి వెళ్ళినప్పుడు ఆ 

శ్రీహరిని కలిసి నాసంగతి చెప్పి .

ఎప్పుడు ప్రత్యక్ష మవుతాడో కాస్త కనుక్కోండి. అన్నాడు.

నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు.శ్రీదేవితో సరసాలాడుతున్నాడు తున్న శ్రీహరిని 

చూశాడు.అన్ని లోకాల సంగతులూ చెప్పాడు చివరన భూలోకం సంగతి చెప్తూ పాపం 

ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు.నిన్నే నమ్ముకున్నాడు వాడికి 

ఎప్పుడు దర్సనమిస్తావు?ఎన్నాళ్ళీనిరీక్షణ? అని అడిగాడు.అప్పుడేనా?యింకా చాలా 

ఏళ్ళు తపస్సు చెయ్యాలి వాడు.అన్నాడు.చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామీ?

ఏ చింతచెట్టుకింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో 

అన్నేళ్ళు చెయ్యాలి.అన్నాడు శ్రీహరి.నవ్వుతూ.హతోస్మి అనుకుంటూ భూలోకానికి 

బయల్దేరాడు.నారదుడిని అల్లంత దూరం లోనే చూసి స్వామీ! శ్రీహరిని కనుక్కున్నారా?

ఏమన్నారు ఆయన ?అని ఆత్రుతగా అడిగాడు.చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లిగా 

ఆయన ఏమన్నదీ చెప్పాడు.ఆ మాటవిని కుందముడు చాలా విచారిస్తాడనీ,దుఃఖ 

పడతాడనీ అనుకున్నాడు నారదుడు.కానీ వాడు ఆనందముతో గంతులేయ్యడం చూసి 

ఆశ్చర్యం తో ఈ చెట్టుకు ఎన్ని ఆకులు వున్నాయో అన్నేళ్ళు తపస్సు 

చేయ్యాలన్నాడు అన్నాడు రెట్టిస్తూ.యిన్నాళ్ళు స్పష్టత లేదు.యిప్పుడు తెలిసింది 

కదా అని తపస్సు చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు కుందముడు.సరిగ్గా అప్పుడే 

ప్రత్యక్ష మయ్యాడు శ్రీహరి.శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ వుంటే నారదుడు 

ఆశ్చర్యంతో నోరు 

తెరిచాడు.యింకా చాలా ఏళ్ళు తపస్సు చెయ్యాలని చెప్పారు కదా స్వామీ! మరి 

అప్పుడే ప్రత్యక్షమయ్యారేమి ?అన్నాడు నారదుడు. 

కుందముడికి నా మీద వున్న భక్తికీ,పట్టుదలకూ కరిగి పోయానయ్యా!అందుకే యిక 

ఆలస్యం చేయకూడదనుకున్నాను.అందుకే ప్రత్య్సక్ష మయ్యాను.అన్నాడు 

కుందముడిని అనుగ్రహించాడు.

ఏదో మాజిక్ జరిగి కలలన్నీ నిజమౌతాయని అనుకోకోవడం పొరబాటు. అవి నిజం 

కావడానికి పట్టుదల,వుండాలి కష్టపడి పని చెయ్యాలి.లక్ష్యం చేరుకోవాలంటే చిత్త శుద్ధి,

నిజాయితీ, చేసేపనిమీద నిబద్ధత వుండాలి.యివన్నీ వుంటేనే లక్ష్యాన్ని చేరుకో 

గలుగుతారు.

No comments:

Post a Comment