Monday, 20 June 2022

నేటి కధలు..351--355



*ఘనమైన (4)నాలుగు*..351

నలుగురి నాలుగు చేతులూ వెయ్యండి.
నలుగురితో నారాయణ.
నలుగురు పోయే దారిలో నడవాలి.
నలుగురూ నవ్వుతారు...
ఇవీ నిత్యం మనం వినే మాటలు.
అనే కార్థంలో
*‘నలుగురు’*.
మాటను వాడుతుంటాం.
ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.
మనకు సంఖ్యా శాస్త్రం ఉంది.
అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి.
కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు.

కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు.
ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి.

నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమ మైనదిగా పరిగణించరు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖు డన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు.

వారే సనక,
సనందన,
సనత్కుమార,
సనత్సుజాతులు.

వేదాలు నాలుగు.
ధర్మార్థ కామమోక్షాలు నాలుగు.

పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు.
అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం.

చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది.
యుగాలు నాలుగు - కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు.
మానవ జీవిత దశలనూ బాల్య,
యౌవన,
కౌమార,
వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది.
సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది.

దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వ మంత్రాలకు స్వాభావిక మైనవని,
ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి.
ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు.
స్వప్నానుభవ కర్త సూక్ష్మ శరీరధారి అయిన జీవుడు.
వాడిని స్వప్నంలో ప్రేరేపించే వాడు తైజసుడు.
గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు.
ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ.
పై మూడు స్థితులకు అతీతమైన స్థితి
‘తుర్య’.
ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష -
నాలుగు వాసనలు.

ఇవి మనసు,
బుద్ధి,
చిత్తం,
అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి.

స్నేహితులతో మైత్రి మనసు లక్షణం.
ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం.
పుణ్య కర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం.
సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం.

వాక్కుకు నాలుగు రూపాలు.
పరా,
పశ్యంతి,
మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు;
బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది.
అవి సూర్యుడు,
వాయువు,
అగ్ని,
చంద్రుడు.
సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ,
మృత్యువుకు కారణమవుతాడు.

వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరి తిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశా లెక్కువ.

శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలి దప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది.
చంద్రుడు పంటలకు కారకుడు.
పంటలు పండక పోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం,
మెరుపు,
పిడుగు,
వృష్టి (వాన)-
నీటికి నాలుగు రూపాలు.

రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు -
రథ,
గజ,
తురగ,
పదాతి దళాలు.

సాలోక్య,
సామీప్య,
సారూప్య,
సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.
సామ,
దాన,
భేద,
దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు.

ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో...
అందుకే నాలుగంకె (4) ఘనమైనదే!

🌹👏🏾🌷
----------


🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు..,352

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋

దాహం....353

ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు.  అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు.  వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది.   పిల్లలు  దాహంతో అలమటిస్తున్నారు,  అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  లేకపోయింది.  చివరి ప్రత్యామ్నాయంగా  దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ!  దయచేసి  ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ",  అని వేడుకున్నాడు.

వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు.  ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు.  ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.

ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే  స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు,  దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు.  అతను తిరిగి వస్తున్నప్పుడు,  మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

అతను మూడవసారి నీరు తీసుకుని  కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై,  అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.  వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు.  అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి  సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను.  దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."

ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."

ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.

దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది.  ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు."   అని   ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి  తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత  బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

 మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి  మార్గదర్శనం చేయాలి 

ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.

నేటి జీవిత సత్యం. 354

 *ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.*  

 *తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.*   

 *అప్పుడా వ్యక్తి "నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని" బాధపడ్డాడు. ఆ తర్వాత "తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని" మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు.* 

 *ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు.* 

 *గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది.* 

 *ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశనిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు.* 

 *అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది.* 

 *పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో  ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు.* 

 *అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని ఆ భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు.* 

 *ఈ కథలోని నీతి* 

 *“సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని.* 

 *కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం*

                       *త్రి వక్రం*       ...355            

త్రివక్రం అంటే.

మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి.

ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం.

అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు.

అంతరంగం, ఆలోచన, ప్రవర్తనల్లో ఏదో ఒకదానిలో మనుషులు ఎప్పుడూ పొట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషీ ఉండడు. అలాంటి మరుగుజ్జుతనాన్ని ‘కుబ్జత్వం’ అంటారు.

ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవదనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రముడవుతాడు.

వాటిలో ఏది కావాలన్నా…. తపన, తాదాత్మ్యత, నిర్మల భక్తి, నిబద్ధత కలిగిఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని ‘కుబ్జ’ కథ.

కపటబుద్ధితో ధనుర్యాగానికి బలరామ కృష్ణులను ఆహ్వానించాడు కంసుడు. మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది. ఆమెకు కృష్ణుణ్ని నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులొలికే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది, ఆ మోహనరూపాన్ని చూడాలని కోరిక. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదీకాక ఆమె కంసుడికి దాసి. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చే దారిలో కనీ కనిపించకుండా తచ్చాడుతోంది.

గమనించిన కృష్ణుడు ఆమెమీద జాలిపడ్డాడు. కరుణాసముద్రుడయ్యాడు. ‘సుందరీ’ అని సంబోధించాడు. ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ల వెంట అశ్రుధారలు కారుతుండగా- గద్గద స్వరంతో ‘స్వామీ! నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా?’ అని అడిగింది.

నేను గంధపు చెక్కలమీద గంధం తీసి, పరిమళ ద్రవ్యాలు అద్ది కంసమహారాజుకు ఇస్తూ ఉంటాను. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అందం వస్తుంది. ఈశ్వరా, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను’ అంది.

ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు. ప్రతిగా ఆమె పాదాలను తన కుడిపాదంతో తొక్కి, తనచేతి రెండు వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్యరాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో ‘నాకు ఇంత సౌందర్యాన్నిచ్చావు. నేను నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపజెయ్యి. అందుకోసం నీవు ఒకసారి మా ఇంటికి రా’ అని అడుగుతూ ఆయన ఉత్తరీయం పట్టుకొని లాగింది.

అప్పుడు కృష్ణపరమాత్మ ‘నేను పాంథుడిని. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలను. కాబట్టి తప్పకుండా నేను    మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారం అయిన తరవాత’ అన్నాడు.

త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. త్రివక్రకు తన వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం (సేవ) చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటోంది.

పరమాత్మ కంసవధ అయిన తరవాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. ‘ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలిఉంటే అది సమసిపోవాలి’ అని ఆ మాటకు అర్థం.

ఆయన ‘నేను పాంథుడిని’ అనడంలోనూ అంతరార్థముంది. పాంథుడు (బాటసారి) అంటే ఇల్లులేని వాడని అర్థం. దాని భావం ‘ఆత్మ స్వరూపుణ్ని’ అని. ఆత్మకు ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోకి (శరీరంలోకి) వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని భావం.

ఆ ఆత్మ స్వరూపుడితో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారడం అంటే, పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందడమేనని ఇందులోని అంతరార్థం.

No comments:

Post a Comment