Thursday, 30 June 2022

*Pranjali Prbha stories in telugu*




తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ



అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.



అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు.



ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.



స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ,  వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.



సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి, తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.



“తర్వాతెప్పుడో కొద్ది కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ!” అన్నాడా భిక్షువు.



“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు బుద్ధ భగవానుడు

         *తారకాసురుడి కొడుకులు*

తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యక, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. 

అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.

"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.

"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.

"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. 

తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. 

మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.

"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. 

తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. 

అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.

"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.

"మీ ఇష్టం" అన్నారు దేవతలు.

"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.

"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. 

ఆశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. 

అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.

.........

*పాప పుణ్యాలు* 

నువ్వు చూస్తున్న విశాల భూభాగమంతా నేను సంపాదించినదే. ఇదికాక నావద్ద అపారమైన ధనరాసులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి' అన్నాడు ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో. వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటీ లేదు కదా? ' అన్నాడు మిత్రుడు.

 'వెంట తీసుకుపోగలవి ఏముంటాయి?' ఆశ్చర్యంగా అడిగాడు. 'పుణ్యరాసులు!' అన్నాడు మిత్రుడు. చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాటిపట్ల శ్రద్ధచూపరు. పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడు పనులు ఆ చెయ్యలేరు. కానీ, ఇతరులకు మేలు కలిగించేది మంచి, కీడు వాటిల్లజే నేది చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు.

 కొందరు గొప్పగొప్ప ఆధ్యాత్మిక విష యాలు మధురంగా బోధిస్తారు. 'అహం' ఆధ్యాత్మిక శత్రువు అన్నవాళ్లే, తమంత వారు తామే అనే ధోరణి కన బరుస్తారు. అసలైన ఆధ్యాత్మికత భగ వాన్ రమణులలో గోచరిస్తుంది. కౌపీనం ధరించిన ఆయనలో

కొండంత వినయం కొలువుండేది. సముద్రమంత సహనం ఆచ్చాదనగా ఉండేది. క్యాన్సరు వ్యాధి బాధను వ్యక్తం చేసే వారే కాదు. అన్నింటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు. ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందే శాలు. ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసులోని ఆలోచనలు, అలజడులన్నీ ఒక్కోటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ వేదికను పరిశుభ్రం చేసుకోవడం.

 అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది. అంత ర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్ష మవుతాడు. కళ్లు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు ధ్యానంలో స్థిరపడుతుంది. ధ్యానం 

 ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక సాధనం .

 తిరస్కరిస్తుంది.వలంటే అష్టసిద్ధులు లేని అనుబంటూ సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకొన్నదే.

 ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి.

 సాధనలన్నీ ఇష్టంగా ఉండు చెయ్యాలి. కష్టంగా చేస్తే ఫలితాలు దక్కవు.

 శరీరసుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. నాలుక రుచిని, శరీరం సౌఖ్యాన్ని, బుద్ధి గౌరవాన్ని అపేక్షిస్తాయి. ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది.

 ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు. సద్బుద్ధి, సద్భక్తి, అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే! అసలు అంతర్యామితో అనుబంధమంటూ ఏర్పడాలేగాని, ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచకన్నా హీనమనిపిస్తుంది.

 మన ఆకాంక్షలన్నీ 'అంతర్యామి'తో అనుబంధానికి అంకి తమై ఉండాలి. మన ఆచరణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి. అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం. ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే. ఏమి చేసినా భగవంతుడి సేవే

 - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్




విదురుడు చెప్పిన…

           *ఆణిముత్యాలు*

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! 

యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని ఋషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు.

విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు.

మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.

 వి. లక్ష్మి శేఖర్.

****

 *కాళీకి కొంతసేపు కలిగిన భక్తి భావం:* 

ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరులను గురించి మాతృదేవి ఒకసారి, "వీరందరవి ఎలాంటి జన్మలు? సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూంటారు. కాని *భక్తి కావాలి. జ్ఞానం కావాలి* అనే ఆలోచన కూడా వారికి రాదు!" అంటూ ఎంతో కలవరపడ్డారు. 

అప్పుడు శిష్యుడొకడు, "అమ్మా! గురుదేవులను ప్రార్థించి వారికి కావలసిన డబ్బు లభించేలా చేయవచ్చు కదా!" అన్నాడు. అందుకు మాతృదేవి, *"నాయనా! వారి కోర్కెలు తీరేవేనా? ఇస్తూ వుంటే అడుగుతూనే వుంటారు. వారి కోర్కెలకు అంతు లేదు. ప్రాపంచికలకు తృప్తి అనేది ఉందా ఏమిటి?"* అన్నారు.

కానీ ఒకసారి ఎలాగో పొరపాటున *భక్తి, జ్ఞానం* కావాలనే ఆకాంక్ష కాళీకి రానే వచ్చింది. కానీ వచ్చిన వేగంతోనే అది ఎగిరిపోయింది. ఆ సంఘటన ఇలా జరిగింది: 

మాతృదేవిని దర్శించుకోవడానికి *గిరీశ్* జయరాంబాటికి వచ్చాడు. ఆయన *కాళీతో* , "ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహారాజ్ఞి అయిన మాతృదేవిని సోదరిగా పొందిన తర్వాత కూడా డబ్బు డబ్బు అంటూ ప్రాకులాడడం ఎంతో శోచ నీయం" అన్నారు. కాళీకి కూడా వెంటనే ఏదో స్ఫురించింది. వెంటనే వెళ్లి రెండు చేతులూ జోడించి అత్యంత భక్తిభావంతో మాతృదేవికి ప్రణమిల్లాడు. మాతృదేవికి ఆతడి మనోస్థితి బాగా తెలుసు కాబట్టి, “కాళీ! ఏమిటి ఇదంతా? నేను గురువునూ కాను, దేవిని కూడా కాను; నీ అక్కయ్యను, అక్కయ్యనే, లే!" అన్నారు. కాళీకి ఈ మాటలు బాగా తృప్తి నిచ్చాయి. ఆ సంఘటనకు తర్వాత ఆతడెప్పుడూ ఆధ్యాత్మికత అదీ ఇదీ అంటూ ఆలోచించిన పాపాన పోలేదు.

ఒక రోజు ఉదయం దాదాపు పది గంటలు. మాతృదేవి వసారాలో కూర్చొని ఉన్నారు. కాళీ (3వ తమ్ముడు) వేసిన ఒక కంచె గురించి వరదునికి (4వ తమ్ముడు), ఆతనికి మధ్య పోట్లాట వచ్చింది. ఇద్దరూ కొట్టుకోసాగారు. మాతృదేవి లేచి వెళ్లి వారిని విడదీశారు. కానీ వాళ్లు ఆగలేదు. మాతృదేవి కోపంతో ఇద్దరినీ చీవాట్లు పెట్టారు. కాని వారు దానిని పెడచెవిని పెట్టి తీవ్రంగా పోట్లాడసాగారు. మాతృదేవి శిష్యుడు ఒకరు, మరికొందరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఆ తరువాత ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లి అక్కడ నుండే పరస్పరం తిట్టుకోసాగారు. 

మాతృదేవి కూడా ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్లి కూర్చొని బిగ్గరగా నవ్వసాగారు. నవ్వుకుంటూనే, "ఆహా! మహామాయ విచిత్రాన్ని ఏమనాలి? *మరణం వచ్చేటప్పుడు ఒక వ్యక్తి దీన్లో నుండి ఒక్క అణువు కూడా తనతో తీసుకెళ్లలేడు.* ఈ సామాన్య సత్యాన్ని కూడా తెలుసుకోకుండా పోట్లాడుకొంటున్నారే! ఏం వింత ఇది!" అంటూ చాలాసేపు పగలబడి నవ్వుతూనే ఉన్నారు. ఆమె నవ్వును ఆపుకోలేకపోయారు.

****

*నేను… నాది…!*

నేను – నాది అనే భావన నుంచి భయటపడాలి.

నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు.

నేను మొదలవుతుంటే నాది అనేది. దాని వెనక తోకల్లాగవస్తుంది. స్వార్థానికి నేను-నాది’రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని ” ఆ రెక్కలు వదులుకోఅని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే.

నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు.అప్పుడులోకం కూడా ఉండదు. ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది.

అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మికవాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి.

ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు.

ప్రార్ధన చేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది.

ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది.

అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం.

దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.

 చాలామందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకుతింటూ ఉంటాయి.

అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచం బాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే.  నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది. నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను.

ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు.

సమబుద్దికలవాడి కంటే మించినవాడు ఈ లోకంలోలేడు. ఈ సమత్వమే యోగం.

****

ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అని ఆర్షవాక్కు. ధర్మబద్ధమైన జీవితం సాధించాలంటే ముందు శరీరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కట్టు, బొట్టు, స్నానం, ధ్యానం ఇవన్నీ మనల్ని శారీరకంగా శుచిగా ఉండటానికి దోహదం చేస్తాయి.

మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధానం. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని పాటించడం మనిషి తన సహజ లక్షణాలుగా చేసుకోవాలి. సత్య, ధర్మాలను పట్టుకున్నవాడిని విజయం తప్పకుండా వరిస్తుంది. శ్రీరాముడు, ధర్మరాజు వంటి పురాణ పురుషులు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడలేదు. అందుకే వాళ్లు భావితరాలకు ఆదర్శమూర్తులయ్యారు. ధర్మరాజు ఒకసారి భీష్ముడిని ‘ధర్మం అంటే ఏమిటి?’ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘ఆచారం నుంచి ధర్మం అలవడుతుంది’ అని సమాధానమిస్తాడు. అవి సదాచారాలు అయి ఉండాలి. ఈ ఆచార, సంప్రదాయాలను పాటించడమే క్రమశిక్షణ. అటువంటి జీవన విధానం అలవర్చుకున్నప్పుడు మనసు కూడా నిష్కల్మషంగా మారుతుంది.

ఆచార, సంప్రదాయాలను పాటించడం ఎలా? మంచి నడవడిక నేర్పేది ముందుగా కుటుంబమే. అమ్మ, నాన్న, తోబుట్టువుల ప్రవర్తన మనిషిపై ప్రభావం చూపుతుంది. సమాజంలో మంచివ్యక్తిగా నిలబడాలంటే అందుకు ఇంట్లోనే చక్కటి పునాది నిర్మాణం కావాల్సి ఉంటుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ జీవన విధానానికి, నేటి వ్యష్టి కుటుంబ జీవన విధానానికి చాలా తేడా ఉంది. గతంలో పిల్లలకు బామ్మలు, తాతయ్యలు రామాయణ, మహాభారత కథలు చెబుతూ బాల్యంలోనే సత్యం, ధర్మం తదితర విషయాలను బోధించేవారు. నైతిక విలువలు నేర్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం రానున్న తరాల వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

భారతావని అదృష్టం అద్భుతమైన పురాణ వాఙ్మయం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి మనకు కుటుంబ జీవన విధానాన్ని, సంప్రదాయాలను, సామాజిక కట్టుబాట్లను, ఆధ్యాత్మికత అవసరాన్ని తెలియజేస్తాయి. రాముడి చరిత్ర సత్యవాక్కు విశిష్ఠతను తెలియజేస్తుంది. సహనం ప్రాధాన్యాన్ని ధర్మరాజు జీవనం తెలుపుతుంది. దానగుణం గొప్పదనాన్ని శిబి కథ చెబుతుంది, సంకల్పబలం ఎంత గొప్పదో ఏకలవ్యుడి జీవితం చెబుతుంది. ఇలా మన పురాణాల్లోని అనేక గాథలు సామాజికంగా ఎలా మసలుకోవాలో చెబుతాయి. వాటిని తెలుసుకోగలిగితే విలువలతో కూడిన సమాజం తయారవుతుంది.

మనిషికి నిజంగా ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? భోగభాగ్యాలు, కీర్తిప్రతిష్ఠలు, విలాసవంతమైన జీవితం ఎన్ని ఉన్నా ఇవన్నీ మనిషిని సంతోషపెడతాయా అంటే చెప్పలేం. కానీ, ఆత్మసంతృప్తిని మించిన సంతోషం మరొకటి లేదు. ఆ సంతృప్తి మన నడవడికతోనే లభిస్తుంది. విలాసాలు, సంపదే ఆనందానికి మూలం అనుకుంటే.. మనకంటే తక్కువ సౌకర్యాలు, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ముందుతరాల మనకంటే ఎందుకు ఎక్కువ ఆనందంగా జీవించారో సమీక్షించుకుంటే సమాధానం తెలిసిపోతుంది. సదాచారాలు, సంప్రదాయాలు వారి జీవన విధానంలో భాగంగా ఉండేవి. అందుకే వాళ్లు సంతృప్తిగా బతకగలిగారు. మన ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు. వాటిలో పారమార్థిక భక్తి, ఆరోగ్య, వైద్య, వైజ్ఞానిక అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గుర్తించి, ఆచరించగలిగితే మనిషి మంచి పౌరుడిగా మారుతాడు.

***

*నరుడి జన్మవృత్తాతం సమ్మోహనం*

    *హిందూ పురాణాలలో ఎందరో దైవాంశ రూపులు ఉన్నారు. వారిలో ‘నరుడు’ కూడా ఒకడు. ఇతను దైవిక శక్తి గల ఓ ఋషి.*

*ఇతని జన్మవృత్తాతం…*

*బ్రహ్మ శరీర భాగం నుండి ’ధర్మదేవుడు జన్మించాడు. ఇతడు దక్షుని  10 మంది పుత్రిక లను వివాహమాడగా చాల మంది సంతానం జన్మించారు. అందులో ముఖ్యమైనవారు హరి, కృష్ణ, నర, నారాయణ.*

*హరి, కృష్ణులు గొప్ప యోగులు కాగా నరనారాయణులు గొప్ప ఋషులయ్యారు. హిమాలయాలలోని బదరికాశ్రమంలో వేల సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. వీరు ఊర్వశికి జన్మనిచ్చారు. నరుడు పురాణాలలో వివిధ సందర్భాలలో ప్రముఖపాత్ర  పోషించాడు.*

*దేవదానవులు క్షీర సాగర మదనం చేసినపుడు అమృతం వెలువడగా మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు దానవుల్ని మోసగించి అమృతాన్ని ఇంద్రునికి అప్పగిస్తాడు. దానవులు ఇంద్రునిపై దండెత్తినపుడు నరనారాయణులు ఇంద్రుని పక్షాన నిలబడి పోరాటం చేసి, దానవులను ఓడించి తరిమికొడతారు. అప్పుడు నరుడికి అమృతాన్ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు ఇంద్రుడు. అలా దేవతలకు ఎంతో గొప్ప శక్తులను ఇచ్చిన అమృతం నరుడి వల్ల సురక్షితంగా ఉంది.*

 *శివునితో పోరాటం చేసిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. దక్ష యజ్ఞానికి ఆహ్వానించనందుకు శివుడు కోపించి తన శక్తిని దక్షునిపైకి పంపితే ఆ యజ్ఞాన్ని భగ్నం చేసి గాలిలో విహరిస్తూ బదరికాశ్రమాన్ని చేరి తపస్సు చేస్తున్న నారాయణుడి హృదయాన్ని ఆ శక్తి తాకుతుంది. అప్పుడు నారాయణుని 'హమ్' అను శబ్దం వెలువడి ఆ శక్తికి చోటులేక వెనక్కు వెళ్లి శివుడ్ని చేరింది. అప్పుడు శివుడు నరనారాయణులపైకి దండెత్తి వచ్చాడు. నరుడు మంత్రించి ఓ గడ్డి పరకను విసరగా అది గొడ్డలిగా మారి శివుని పైకి రాగా దాన్ని శివుడు విరగ్గొట్టాడు. అందువల్ల శివుడ్ని ‘ఖండ పరశుడు’ అంటారు. అప్పుడే నారాయణుడి నుండి వెడలిన శక్తి వేడికి శివుడి తల వెంట్రుకలు నల్లబడి ఎండిన గడ్డిలా మారాయి. - మహాభారతం నుండి సేకరించిన విషయం.*

*ప్రహ్లాదునితో యుద్ధం జరిగిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. ఒకసారి చ్యవన మహర్షి తప్పనిసరై పాతాళానికి వెళ్లగా ప్రహ్లాదుడు ప్రపంచంలోని గొప్ప పుణ్యక్షేత్రాలను చెప్పమని కోరతాడు.*

*చ్యవనుడు "భూమిమీద నైమిశారణ్యం, ఆకాశంలో పుష్కరం, పాతాళంలో చక్రతీర్థం" అని చెబుతాడు చ్యవన మహర్షి.*

*అప్పుడు ప్రహ్లాదుడు నైమిశారణ్యం వస్తాడు. ప్రహ్లాదుడు నైమిశ తీర్థంలో స్నానం చేసి వేటకు వెళ్లగా అక్కడో వృక్షం దాని క్రింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు ఋషులు కన్పించారు. ఆ చెట్టు కొమ్మలకు, ఆకులకు ఆయుధాలు వుండటం చూసి వీరిని గురించి ప్రశ్నించగా వాగ్వాదం జరిగి బలాబలాలు తేల్చుకో దల్చుకుంటారు. నరుడు అజగవమనే వింటితో ప్రహ్లాదుని పైకి బాణాలు సంధిస్తాడు. ప్రహ్లాదుడు వాటిని త్రుంచివేస్తాడు. అప్పుడు నరుడు మరిన్ని బాణాలు సంధించినా ప్రహ్లాదుడు వాటిని ఎదుర్కోగా నారాయణుడు ముందుకు వచ్చి ప్రహ్లాదుడితో ఘోరయుద్ధం చేస్తాడు. అప్పుడే ప్రహ్లాదుడు పడిపోతాడు. ఆ బాణాలు గుచ్చుకొని ప్రహ్లాదుడి హృదయం చీలుతుంది. ప్రహ్లాదుడు ఇతడ్ని శ్రీమహావిష్ణువుగా గుర్తించి అతడ్ని ప్రార్థిస్తాడు.*

*నరనారాయణులు ఇద్దరూ సహస్ర కవచుడి 999 కవచాలు బద్దలు కొడతారు. ఆ సహస్ర కవచుడు తిరిగి కర్ణుడిగా జన్మించగా 1000వ కవచాన్ని ఛేదించడానికి కృష్ణార్జునులుగా జన్మిస్తారు. ఇదీ నరుడి వివరణ వృత్తాంతం.*

*కొసమెరుపులో విషయం ఏమిటంటే పాంచాలి వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది స్మరించుకున్నది నవనారాయణులనే.*

*శ్రీకృష్ణార్జునులు నరనారాయణుల పునర్జన్మలు.*

*భృగుని శాపం వల్ల వీరు కృష్ణార్జునులుగా జన్మించారు. అందుకే నవనారాయణులను ద్రౌపతి ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు కాపాడతాడు.*✍️

No comments:

Post a Comment