Saturday, 25 June 2022

 [




దైవాత్మకంగా మనిషి దేనినైనా విశ్వసించవచ్చు. విశ్వాస కేంద్రం ఏదైనా సంపూర్ణమైనదే అయితే అది ఆశించిన ఫలితాల వైపు మన బుద్ధిని, వైఖరిని నడుపుతుంది. ఒకవేళ భిన్నమైన ఫలితాలు వచ్చినా భక్తుడు వాటిని తన విశ్వాసం తనకు మరొక రూపంలో చేసిన మేలుగానే స్వీకరిస్తాడు. విశ్వాసం ప్రజ్ఞానానుభవంతో నడిచేది కాదు. అలాగే నాస్తికుడి అవిశ్వాసం కూడా! ఆస్తికమైనా, నాస్తికమైనా ప్రత్యక్షానుభవంపై ఆధారపడకుండా ఒక ‘సంభావిత’ సత్యంగా సాగవలసిందే. అయితే, మనిషి తన జీవితాన్ని తరచి చూస్తే, తన ప్రత్యక్షానుభవాన్ని తెరిచిచూస్తే.. ప్రకృతి, సమాజం అందించే లెక్కకందని అనుకూలత రూపంలో ‘భగవద్విభూతి’ అనుభూతికి స్పష్టంగానే సాక్షాత్కరిస్తుంది.

విశ్వాసాల మాట ఎలా ఉన్నా మనిషి ఉనికి అనేకానేక భౌతిక, జీవశక్తుల గతిశీలనాత్మక అల్లిక. దీనంతటికీ ఆధారం నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశమనే పంచభూతాలే. వీటిలో మిగతా నాలుగు భూతాలను తనలో కలుపుకొని, నిలుపుకొన్నది నేల. మనిషితోపాటు అన్ని వృక్ష, జంతుజాతులకు, సూక్ష్మజీవి ప్రపంచానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారం నేలే. మట్టిని నిర్జీవ పదార్థంగా భావించవద్దు. అది అసంఖ్యాకమైన జీవరాశిని, ఖనిజ లవణాలను, తేమను కలిగిన ఒక మహా జీవావరణ వ్యవస్థ. ఒక పిడికెడు మట్టిలో కొన్ని కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులే మరణించిన దేహాలను విచ్ఛేదనం చేసి వృక్షజాతికి, పంటలకు పోషణను అందిస్తాయి.

భూగోళంపై ఉన్న మట్టి లాంటి జీవావరణ వ్యవస్థ మనకు తెలిసినంతవరకు విశ్వంలో మరెక్కడా లేదు. అంతటి విశిష్టమైంది మట్టి. అది విత్తనంలోని ‘జీవిని’ ఆవిష్కరించే చైతన్యశక్తి. ఎండిపోయిన గింజను కూడా మహావృక్షంగా మార్చేస్తుంది. అనంత ఖనిజాలతో పాటు అఖండ జలభాండాన్ని నేలతల్లి తన గర్భంలో నిక్షిప్తం చేసుకుంది. భూమిపై పారుతున్న నదుల నీటి కన్నా 800 రెట్ల నీరు భూమి పొరల్లో ప్రవహిస్తున్నదంటే ఆశ్చర్యం కలగకమానదు. భూ ఉపరితలంపై 70 శాతం సముద్రమే ఆక్రమించి ఉన్నా.. భూతలజీవులకు కావలసిన మంచినీరు ప్రసాదించేది నేల తల్లే. భూదేవిని కాపాడుకోకపోతే నేల బీడుగా, ఎడారిగా మారిపోతుంది. అభివృద్ధి పేరిట మనం ఆచరిస్తున్న విధానాలు నేల సారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే నేలపై జీవవైవిధ్యం నశించి, వ్యవసాయం వీలుపడక, ఆహార కొరత ఏర్పడి క్షామానికి, అశాంతికి దారితీస్తుంది. మన అత్యాశే మానవ వినాశనానికి కారణం అవుతుంది.

మట్టి నుంచే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల వికాసం జరుగుతుంది. మట్టి ప్రాశస్త్యాన్ని ఇంతగా గ్రహించింది కాబట్టే, భారతీయ ఆర్ష సంప్రదాయం నేలను భూ మాతగా, భూ దేవిగా, పృథ్వీలింగంగా సంభావించి ఆరాధిస్తున్నది. మహాకాలపురుషుడితో కలిసి ప్రకృతిమాత ఏ తారతమ్యమూ లేక ఆహార ఔషధాలను అందరికీ సమానంగా కరుణిస్తున్నది. అయినా మానవజాతి మందబుద్ధితో, మలినబుద్ధితో, అహంకారంతో నేల ఔన్నత్యాన్ని విస్మరించి జీవితాలను నిరర్థకం చేసుకుంటున్నది. అయితే ప్రజ్ఞాన ప్రకాశంతో మనిషి ఒక్కసారి మట్టితో మమేకమైతే సకల జీవరాశిలో తనను తానే దర్శించుకోగలుగుతాడు. ఆ విశాలమైన అవగాహన, అనుభూతి మానవజాతిలో భేదాలను తుంచి, ప్రాణికోటితో ప్రేమను పెంచి, సంక్షేమంతో, సంతోషంతో ఆత్మోన్నతిని పోషిస్తుంది. మోక్షశివ కవాటాలను తెరుస్తుంది. అందుకే మన ఉనికి అయిన మట్టిని ప్రేమిద్దాం. నేలసారాన్ని పెంచుతూ కృతజ్ఞతతో ఆరాధిద్దాం. మన పూర్వికులు మనకు ప్రసాదించిన బంగారు భూమిని భావితరాలకు అంతే భద్రంగా అప్పగిద్దాం.

[


ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు...!

మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు..!

సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు..!


అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు...!

తాను దారి తప్పి పోయాడని..!


అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి..!

ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు..!


ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది...!

నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు..!


అతనికి ఏం చేయాలో పాలుపోలేదు..!

ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని,తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు..!


పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు...!

తనకు తెలియకుండానే 'భగవంతుడా...!నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు...!


వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??'   అని అనుకున్నాడు...!


అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని  కాపాడమని కోరుకోవాలనుకున్నాడు..!


వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి,తన మనసులో 'శివయ్య..!నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు...!' అని మొక్కాడు..!

మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది...!

ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు...!

ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు...!


అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది!మీరేమైనా చూసారా?" అని అడిగాడు..!

అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కల  కూర్చున్నా..!ఈ వైపు ఏ కుందేలు రాలేదు..!" అన్నాడు..!


ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది!ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు..!ఈ రోజు వేట వృథా అయినట్టే...." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు...!


వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు..!నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్న..!నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా...!" అంటూ కొంచం ధీనంగా అడిగాడు...!

అందుకు,ఆ వేటగాడు-ఆ నాస్తికున్ని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు...!


నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా...!ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు..!మనిషే కాపాడాడు..!నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి...!" అన్నాడు..!


ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి "ఏందయ్యా సామి??దేవుడు లేడంటావా?మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు..!అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు,ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది..!ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను..!అలాంటిది,ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను..!అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు..!నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని,పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది..!అంతా శివ లీల" అన్నాడు...!


దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా??ఇదంతా ఆ శివుడు చేయించే బదులు,శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా...?" అని నవ్వుతూ ప్రశ్నించాడు..!


అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా...!" అంటూ......


ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి,తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు...!


ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి,కొంత డబ్బు తీసి,ఆ వేటగానికి ఇవ్వబోయాడు...!


అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు...!

అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు...!


ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి!

కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని,నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయట పడేసావు..!నీవు శివుడివో?శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య....!ఇదంతా నిజంగా నీ లీలనే...!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు..!

ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదు...!

అతని పేరు "శివ కేశవ"....

[శ్రీ శ్రీ కవిత్వం - సమీక్షా విమర్శ*                     


               *ప్రతికవి తాను రాసేది*

               *తోటివారు మెచ్చుకోవాలనీ ఆశిస్తాడు*

               *ఆత్మవిశ్వాసం గల కవి మాత్రం*

               *తన  గీతం జాతి జనులు*

               *పాడుకొనే మంత్రం*

               *కావాలనీ కోరుకుంటాడు*


                                     కానీ అదీ అందరి కీ సాధ్యం కాదు ఎవరో ఒక మహా కవికీ మాత్రమే ఆ కోరిక తీరుతుంది. అలాంటి కవి యే శ్రీరంగం శ్రీనివాస రావు.


               తెలుగు సాహిత్యానికి దశ దిశ నిర్దేశించిన శ్రీశ్రీ  పట్ల, అతని బంధువు, సమగ్రాంధ్ర సాహిత్య నిర్మాత, విమర్శకుడు, పరిశోధకుడు, కవి అయిన ఆరుద్ర  ప్రతిస్పంcదించారో గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆరుద్ర, శ్రీశ్రీ బంధువులు. ఇద్దరూ కొన్నాళ్లు మద్రాసులో కలిసి బతికినవారు. మార్క్సిస్టు జెండాల్ని మోసి ఎత్తుకు తిరిగిన వారే. అయితే ఆరుద్ర కు శ్రీశ్రీ కీ అభిప్రాయ భేధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆరుద్ర గారు శ్రీశ్రీ రచనల పట్ల కొన్నీ అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిని చూస్తే


                    1920 లో ప్రచురితమైన భారతి పత్రిక యొక్క ప్రాచుర్యం ఎంత గొప్పదంటే ఆరుద్ర గారి మాటలలో చెప్పాలంటే " *భారతి లో పద్యం అచ్చు అయ్యిందంటే కవిగా జాగా దొరికిందనీ అర్ధం. కథ పడిందంటే లోకం నిన్నూ గుర్తించిందనీ అర్దం. విమర్శ వ్యాసం అచ్చు అయ్యిందంటే నీ అభిప్రాయాలు విలువైనవి అన్నమాట. అదే ఆ పత్రిక నిన్ను మెచ్చుకోందంటే ఆ రచయిత గొప్పవాడనీ అర్దం*"


                     అలాంటి మంచి పత్రిక లో శ్రీశ్రీ తొలి రచన " *సమరాహ్వనము* అచ్చయినది. కానీ ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే భారతి లో అచ్చయిన ఫేలవయిన రచన ఇది. ఎందుకంటె ఇది తిరుపతి వెంకట కవుల సుప్రసిద్ధ నాటకం " *పాండవ విజయం* " లోని 7 వ అంకం కు అనుసరణం అనీ ఆరుద్ర అంటారు.


                   శ్రీశ్రీ 1925-28 వరకు రాసిన 16 ఖండికలను ఒకచోట చేర్చి అదే సంవత్సర తెలుగు నామం పేరుతో " *ప్రభవ* గా పుస్తకం విడుదల చేసారు. ఇది భావకవిత్వమే అయినా ప్రేయసి పరంగా కాకుండా పరమేశ్వరుని పరంగా రాసిన కవితలు .నాస్తికుడైన కవి ఇలాంటివి రాయడం ఆస్తకీకరం. ఆ కాలంలోనే కొంపెల్లి జనార్దన్ రావు తో పరిచయం ఏర్పడింది. ఇతని ద్వారానే శ్రీశ్రీ ఎంతో మంది కవులను పరిచయం చేసుకున్నారు. మంచి మిత్రులు గా పేరు తెచ్చుకున్నారు. కానీ జనార్దన్ గారు తమ స్నేహన్నికీ విమర్శ కు అడ్డు రానివ్వలేదు. అందుకు ఉదాహరణ ప్రభవ రచన ను సమీక్షిస్తు " *ప్రభవ శైలి బాగున్నా తెలుగు వాడకం తక్కువ వుంది. పైగా కృష్ణశాస్త్రి ; విశ్వనాథ ల ప్రభావం తో రాసినట్టు వుంటూ సొంత గొంతుక లేదనీ* శ్రీశ్రీ ని జనార్దన్ రావు గారు విమర్శించారు. 


                  ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య 13వ సంపుటిలో శ్రీశ్రీ కవిత్వం పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. అలాగే  'గురజాడ గురుపీఠం'లో  " సంకల్పం " శీర్షికతో ముందు మాట రాసుకొంటూ శ్రీశ్రీ ని దృష్టి లో వుంచుకొని *జాఢ్యం ముదిరినవాడు తానే ఆద్యుడనుకొంటాడు* అనీ రాసారు. 


            ఇంకా చెప్పాలంటే  శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో 

" *1939 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాననీ*"  చెప్పుకున్నారు. ఆ విషయం పై ఆరుద్ర 1972 లో " పాతికేళ్ళ సాహిత్యం " అనే వ్యాసం లో 

 " *బండిచక్రం మీదనున్న ఈగ ఆ బండిని తానే కదిలిస్తాననుకొంటుంది* " అంటూ ఘాటైన విమర్శ ను చెసారు. 


*కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తో శ్రీశ్రీ స్పర్థ*


శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు. 

                  విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు.

           విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ.

                 తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా,శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.

                    ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు.

         ఇలా కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.


                శ్రీశ్రీ రచించిన రచనలు అన్నీ ఒక ఎత్తు అయితే ఆతని *మహా ప్రస్థానం* కవితా సంపుటి ఒక యెత్తు. శ్రీశ్రీ గురించి సరిగ్గా తెలియని వారు సైతం మహాప్రస్థానం లోని గీతాలు పాడేవారు అదీ దాని ప్రభావం. 1933-47 దాకా రాసిన మహా ప్రస్థాన గీతాలు శ్రీశ్రీ తన జీవిత కాలం లో కూడా రాయలేనంత గొప్ప రచనలు.అలాంటి మహా ప్రస్థానం గీతాలపై ఆరుద్ర గారి విమర్శ ను చూద్దాం...


                       శ్రీశ్రీ గారు రాసిన  "మహాప్రస్థానం"  గీతానికి నజ్రల్‌ ఇస్లామ్‌ కవితా, హరీన్‌ రాసిన ' *షురూ హువా హై జంగ్‌* అనే పాటా, మరియు శిష్ట్లా రచించిన ' *మారో - మారో - మారో*' అనే పాటా ప్రోద్బలాలనీ  ఆరుద్ర అన్నారు.కానీ శ్రీశ్రీ వాటిని ఎక్కడ చెప్పలేదని విమర్శించారు.

              *దేశభక్తి* అనే గీతం గురజాడ గారికి ఎంత పేరు తెచ్చిందో  శ్రీశ్రీ కీ " *దేశచరిత్రలు*" అనే కవిత అంతే పేరు తెచ్చింది.కానీ గురజాడ గీతం పై ఎలాంటి ఆరోపణలు లేవు కానీ శ్రీశ్రీ పై నార్ల వేంకటేశ్వర్లు లాంటి వారు కొన్నీ ఆరోపణలు చేసారు. శ్రీశ్రీ గారి దేశచరిత్రలు ఇలా ఉంటుంది. *తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళేత్తిన కూలీలేవ్వరు..??* ఈ పంక్తులపై జర్మన్ కవి బెర్తోన్ బ్రేహ్ట్ రాసిన *ఎ వర్కర్ హు రీడ్స్ హిస్టరీ* అనే గేయం ప్రభావం వుంది. ఆ గేయం చూస్తే


         *ఎవరు కట్టారు నైలు గట్టున*

          *ఏడు గేటుల ధిబిస్ నగరం*

           *పుడమి నేలిన వాళ్ళ పేర్లు*

           *పుస్తకాలల్లో మీరు చూస్తారు*

            *రాజులే ఆ రాళ్ళు మూపున*

             *మోసుకెళ్ళారా*


                     ఈ  కవిత ప్రభావం శ్రీశ్రీ దేశచరిత్రలు కవిత పై ఉందనీ కానీ ఈ విషయం శ్రీశ్రీ గారు పేర్కొనలేదనీ నార్ల గారి ఆరోపణ.


               శ్రీశ్రీ మరో కవిత " కళారవి "ని చూస్తే...


               *పోనీ పోనీ*

               *పోతేపోనీ*

               *సుతుల్ సుతుల్ హితుల్ పోనీ*

              *పోతే పోనీ*

              *రానీ ....రానీ*

               *వస్తే రానీ*

               *కష్టాల్ నష్టాల్*

               *కోపాల్ తాపాల్ శాపాల్ రానీ*

                 *వస్తే రానీ*


                    ఇదీ అన్నమాచార్యుల సంకీర్తన ప్రభావం ఉందనీ ఆరుద్ర గారు అంటారు. ఆ కీర్తన చూస్తే...


       *నేనెందువోయెతావెందు వోయె*

          *రానీలె రానీలె రానీలె*

          *మీనైన వంటి తన మిడు కెల్ల దిగవలె*

           *కానీలె కానీలె కానీలె*

            *మానైన నాటి మదమెల్ల దిగవలె*

             *పోనీవె పోనివె పోనీవె*


                1922 లో ఉన్నవ లక్ష్మి నారాయణ గారు " మాలపల్లి " అనే నవల రాసారు.అందులో విప్లవాన్ని జగన్నాథుని రథ చక్రాలతో పొల్చుతు కొన్నీ వాక్యాలు కలవు. అలాగే అరవిందయోగి గారు కూడా భగవంతుని వాహనంగా జగనాథ రథ చక్రాల ప్రస్తావన వచ్చింది. ఆ ప్రభావంతోనే  శ్రీశ్రీ *జగన్నాథ రథచక్రాలు* అనే కవిత రాసి ఉండవచ్చు అనీ ఆరుద్ర గారి ఊహ


         *నేను సైతం*

          *ప్రపంచాగ్నికీ*

          *సమిధనొక్కటి ఆహుతిచ్చాను*


                      క్రోపాట్కిస్ అనే ఆంగ్ల కవి విప్లవ సందేశం గురించి చెబుతూ " *ఏ దేశ చరిత్రలోనైన స్వలాభం కొసం చేసే దారుణ యుద్దాలు మరేమున్నాయి. అక్కడ ఇక్కడ అనేమి చైనాలో ఇండియా లో ఇటలీలో పీడించేవాళ్లు ప్రతి ప్రదేశంలో ఉన్నారు*" అనీ వ్యాసం రాసారు. ఇదే విషయ భావంతో శ్రీశ్రీ గారు ఇలా రాసారు.


        " *ఏ దేశ చరిత్ర చూసినా*

          *ఏమున్నది గర్వకారణం*

           ---------------------

           ---------------------

          *చైనా రిక్షా వాలా*

          *చెక్ దేశపు గని పనిమనిషి*

           *అణగారిని ఆర్తులందరు*

            *ఖండాంతర నానాజాతులు*


                  

*లండన్ ప్రొగ్రేసివ్ రైటర్స్ మెనిఫేస్టో* ను శ్రీశ్రీ చదివి యధావిధిగా ఒక కవిత    రాసారు *పోలాలన్ని హలాలదున్ని* అంటూ ప్రతిజ్ఞ అనే గేయం రాసారు.దీనిని చూసీ అబ్బూరి రామకృష్ణ రావు గారు ఆశ్చర్యపడి శ్రీశ్రీ తో *ఆ మెనిఫేస్టోను అలా దించేసావే* అంటూ శ్రీశ్రీని ప్రశ్నించారు.


       *పరస్పరం సంఘర్షించిన*

         *శక్తులలో చరిత్ర పుట్టును*           అనీ శ్రీశ్రీ గారు ప్రకటించారు.


                శ్రీశ్రీ కవిత్వం ను ఎత్తి చూపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. ఇలాంటి ఆస్తకీకరమైన చర్చలు వివాదాలు సాహిత్య విమర్శ కు కొత్త కోణంను హేతుబద్ధతను చూపెట్టాయి అనీ చెప్పడం. మరియు ఏ కవి అయిన ఎవ్వరి ప్రభావం లేకుండా కవి గా రాణించ లేరనేది సత్యం. అలాగే ఆ ప్రభావం నుండి బయటపడి మహా కవులు గా మారడం ఇక్కడ గొప్ప విషయం....                                                                                           ఐ.చిదానందం

[


మహాభారత యుద్ధం చివరన భీముడు దుర్యోధనుడి తొడలు  విరగగొడతాడు. అప్పుడు 

దుర్యోధనుడు కొన ఊపిరితో వున్నప్పుడు అక్కడికి ఆశ్వత్టామ,కృపాచార్యుడు వస్తారు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్టామ తో పాండవులను ఎలాగైనా చంపి అపాండవం చేయ మంటాడు. అశ్వత్టామ అతనికి ఆ పని చేస్తాననిమాట యిస్తాడు . అతను ఆ రోజు రాత్రికి పాండవుల శిబిరానికి వెళ్లి పాండవులు పడుకునే స్థానంలో పడుకున్న ఉపపాండవుల ఐదుగురి (ద్రౌపది కొడుకులు)తలలు అమానుషంగా నరికి వెళ్లి పోతుండగా అర్జునుడు, కృష్ణుడు అతనిని వెంబడించి యుద్ధం చేస్తాడు అర్జునుడు. 


ఆశ్వత్టామ ఉపసంహారం 

ఎలా చెయ్యాలో తెలియని బ్రహ్మశిరోనామక అస్త్రాన్నిఅర్జునుడి మీదికి వదులుతాడు.

 అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రముతొ దాన్ని ఎదుర్కొంటాడు. ఆ రెండు అస్త్రాలూ ఆకాశం లో పోరాడుతుంటే అన్ని లోకాలూ కంపించి పోతాయి. ఆశ్వత్టామ కు ఉపసంహారం తెలీదు.. బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకుంటే అర్జునుడు ఆశ్వత్టామ అస్త్రానికి బలై పోతాడు. అప్పుడు కృష్ణుడు ఆశ్వత్టామ ను ఆ అస్త్రము యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భము లోని బిడ్డకు తగిలేలా చేయ మంటాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగానే ఆశ్వత్టామ వేసిన అస్త్రము ఉత్తర గర్భము లో వున్న బిడ్డకు తగిలి ఉత్తరకు మృతశిశువు పుడతాడు. ఏడుస్తున్న ఉత్తరను ఓదార్చి కృష్ణుడు ఆ బిడ్డను తన చేతితో నిమిరి బ్రతికిస్తాడు. అతడే పరీక్షిత్తు..అది తర్వాత కథ..

 

అర్జునుడు అశ్వత్టామను చంప బోతుంటే కృష్ణుడు అతన్ని వారించి ద్రౌపది దగ్గరకు 

తీసుకొని పోదామని తీసుకొని పోతారు. అప్పుడు ద్రౌపది పుత్రశోకం తో చెప్పిన ఈ 

పద్యము చాలా ప్రసిద్ధ మైనది

.. 

ఉద్రేకంబున రారు శస్త్ర ధరులై,యుద్ధావనిన్ లేరు,కిం 

చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్ 

భద్రాకారుల చిన్న పాపల రణ ప్రౌఢ  క్రియా హీనులన్ 

నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో  

 అర్థము:-- వారు ఉద్రేకముతో ఆయుధాలు ధరించి నీ మీదకు రాలేదు, యుద్ధ 

రంగములో లేరు, నీకే అపకారమూ చేయలేదు ఇంకా పసివాళ్ళు ఆదమరిచి నిద్ర 

పోతున్న పసిపాపలను చంపేందుకు నీకు చేతు లెలా వచ్చాయి?నీవూ ఒక 

వీరుడవేనా అని నిందిస్తుంది ఏడుస్తుంది. అర్జునుడు వీడిని వధిస్తాను అని అంటే 

వద్దని వారిస్తుంది. గురుపుత్రుడు,బ్రాహ్మణుడు అతన్ని చంపుట మహా పాపము. . 

పైగా అతని తల్లికి పుత్ర శోకం కలిగించటం నాకిష్టము లేదు. ఆ శోకం ఎంత భయంకర 

మైనదో నాకు తెలుసు. అతని శిరస్సు పైనున్న రత్నాన్ని తీసి నాకివ్వు,అతని 

సర్వ శక్తులూ నశిస్తాయి. నిర్వీర్యుడై పోతాడు. అదే అతనికి తగిన శిక్ష అంటుంది 

. అప్పుడు అర్జునుడు తన బాణము తో అతని తల పై వున్న మణిని పెకలించి  ద్రౌపదికి యిస్తాడు. ఐదుగురు కొడుకులను ఘాతుకంగా చంపిన అతనిని వదిలి వేస్తుంది. అదీ ద్రౌపది ఔదార్యం. .

No comments:

Post a Comment