🙏 ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐 " *భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు* " 💐💐💐
ప్రస్తుత విద్యావ్యవస్థలో మనం మార్పు తీసుకు రాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి. వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది.
పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువుండే వాడు. ఆయన దగ్గర పదిమంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకుమించి చేరనిచ్చేవాడు కాదు. ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు.
పదిమంది విద్యార్థులను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్లి, అక్కడున్న అన్ని చెట్లకు ఉన్న అన్ని రకాల, జాతుల ఆకులనూ పరిశీలించండి. ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. విద్యార్థులకు ఆనందమైంది. ఎందుకంటే పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టంగానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్టమేముంది? వెంటనే బయలుదేరి వెళ్లారు.
సరదాగా చెప్పుకోవాలంటే.. పనికిరాని ఆకులు తేవడానికి ఒక విద్యార్థి రెండు జేబులున్న వస్త్రం ధరించి వెళ్లాడు. మరొక విద్యార్థి కాస్త పెద్ద సంచి తీసుకెళ్లాడు. మరో విద్యార్థి యూరియా సంచే పట్టుకెళితే, ఇంకొక విద్యార్థి ఏకంగా రెండెడ్ల బండే తీసుకెళ్లాడు. అప్పటికీ ఆ విద్యార్థిని గురువుగారు అడిగారు ‘రెండెడ్ల బండెందుకురా!’ అని. ‘పనికిరాని ఆకులు తెమ్మన్నారు కదా మీరే!’ అంటే, ‘సరే అవి పనికిరావో, నువ్వు పనికిరావో తర్వాత తేలుద్దాంలే, ముందు నువ్వు వెళ్లిరా!’ అన్నారు. ఇలా పదిమందీ వెళ్లారు.
వెళ్లినవారిలో రెండెడ్ల బండి తీసుకెళ్లిన విద్యార్థే ముందు వచ్చాడు. మట్టి తవ్వి ట్రాక్టరులో వేసినట్లుగా గుత్తగా ఆకులన్నీ తీసి బండి నింపేసి తెచ్చాడు. ‘ఇవన్నీ పనికిరానివే’ అని చెప్పాడు గురువుగారితో. ఆయన నవ్వుకున్నారు. తరువాత సంచి తీసుకెళ్లిన విద్యార్థి, రెండు జేబుల వస్త్రం విద్యార్థి.. ఇలా తొమ్మిదిమందీ వచ్చారు. ఒక్కొక్కళ్లు వాళ్లకి తోచినన్ని పనికిరాని ఆకులు తెచ్చి గురువుగారికి చూపించారు. చివరికి పదవ విద్యార్థికూడా వచ్చాడు. అతని పేరు జీవకుడు.
అతని ముఖం చిన్నబోయి ఉంది. గురువుగారు ‘ఏం నాయనా అలా ఉన్నావు! నువ్వేమీ తేలేదా ?’ అని అడిగారు. విద్యార్థి ‘గురువుగారూ నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటీ నాకు కనపడలేదు’ అన్నాడు. ‘అదేమిటీ! నువ్వు వీళ్లందరికంటే తెలివైనవాడివా?’ అని గురువు అంటే, ‘అలా కాదండీ ! మీరు నాకు వైద్యవిద్య నేర్పడం ప్రారంభించినప్పుడే ఒక శ్లోకం నేర్పారు. దాని ప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిదేదీ లేదు అని చెప్పారు!’ అన్నాడు.
‘ఏమిటా శ్లోకం?’ అని అడిగారు.
*అమంత్రమక్షరం నాస్తి*
*నాస్తి మూలం అనౌషధం*
*అయోగ్యః పురుషో నాస్తి*
*ప్రయోగః తత్ర దుర్లభః*
అని జీవకుడు శ్లోకం చెప్పాడు.
దీని అర్థం ఇది. ‘అమంత్రమక్షరం నాస్తి’ – అంటే ఏ భాషలోనూ మంత్రం కాని అక్షరం లేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరం లేదు. ఏ అక్షరం దేనికి బీజాక్షరం అనేదాన్లో తేడాలుంటాయి గాని, అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే ‘నాస్తి మూలం అనౌషధం’ – అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే ‘అయోగ్యః పురుషో నాస్తి’. అంటే పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు (ఇక్కడ పురుషః అంటే మగ అని కాదు, మనిషి అని అర్థం. అంటే మగ లేదా ఆడ అని). ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటంటే ప్రతి విద్యార్థి దేనికి పనికొస్తాడో చెప్పడం. ‘నువ్వు దేనికీ పనికిరావు’ అని చెప్పకూడదు. అందరూ విద్యకే పనికిరారు. ‘నీకు చదువు రాదు కానీ నువ్వు పలానా పని చేసుకుంటే సుఖపడతావు’ అని చెప్పాలి. అంతేకాని ‘నీకు చదువు రాదురా అబ్బాయి! గొడ్లు కాసుకో’ అని తిట్టకూడదు. గొడ్లు కాయడం అంత తేలికైన పనేమీ కాదు. ఒకప్పుడు సాక్షాత్తూ పరమాత్ముడే మనిషి అవతారమెత్తి ఆ పని చేశాడు. కాబట్టి అది తక్కువ పనేమీ కాదు. మనం దానిని తక్కువగా చూడటంతో అదొక తిట్టు పదం అయింది. దాంతో ఆ పని చేసేవాళ్లు అవమానం చెందు తున్నారు. మన కులవృత్తులన్నీ ఇలాగే అయ్యాయి. మన సంస్కృతిలో ప్రతి పనికీ గౌరవం ఉంది. ఇక చివరి వాక్యం ‘ప్రయోగః తత్ర దుర్లభః’ – అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగం చేసి చూడాలి. అంటే పరిశీలించాలి. అంతేకాని ‘అది బాగోదు’ అని వెంటనే తీర్మానించకూడదు.
‘ఈ శ్లోకాన్ని మీరు ముందే నాకు చెప్పారు గురువుగారూ..! అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగా నాకు పనికిరాని ఆకు దొరకలేదు’ అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి వ్యతిరేక పరీక్ష పెట్టారు (క్రాస్ ఎగ్జామినేషన్). ‘మిగతా విద్యార్థులు పనికిరావంటూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు!’ అన్నారు. వెంటనే జీవకుడు ‘ఇదిగో ఇవి మారేడు ఆకులు, తేమ (నీటి తడి) ఉన్నచోట ఈ ఆకులు వేస్తే తేమను లాగేస్తాయి. అలాగే ఇది ఉత్తరేణి ఆకు. పళ్లు తోముకోడానికి పనికి వస్తుంది, ఇది ఫలానా ఆకు, అతిసారం తగ్గిస్తుంది’ అంటూ అన్ని ఆకుల గురించి, అవి దేనికి పనికొస్తాయనేది వివరంగా చెప్పాడు. గురువు బ్రహ్మమిత్రుడు ఆనందభరితు డయ్యాడు. వెంటనే
జీవకుడిని మెచ్చుకుని ‘నువ్వు ఒక్కడివే యోగ్యత గల శిష్యుడివి. నీకొక్కడికే నేను యోగ్యతా పత్రం ఇస్తున్నాను’ అని చెప్పి మిగిలిన విద్యార్థులను మరో ఏడాది చదవమని చెప్పారు. ఈ జీవకుడు తరువాత ఆయుర్వేద ఔషధాల తయారీలో ప్రసిద్ధి పొందాడు.
ఇలా ‘ప్రతి మనిషి ఏదో ఒకదానికి పనికొస్తాడు, పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో లేడు’ అని తీర్మానించుకుని ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాలి. కొందరు ఆటలకు, కొందరు పాటలకు, మరికొందరు రచయితగాను, కార్యకర్తగాను లేదా కావ్యకర్తగాను ఏదో రంగంలో పనికొస్తారు. విద్యార్థికి చదువు చెబుతూనే అతను ఏ రంగంలో ఎదగగలడో గుర్తించి, ఆ విషయం విద్యార్థికి చెప్పి, ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఉపాధ్యాయుని విధి.
ఇవాళ్టి పరిస్థితి ఇలా లేక, మూసపోసినట్లుగా ఒకేలా ఉంది. అందరూ ఇంగ్లీషు మీడియం చదవాలి; అందరూ ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వాలి; అందరూ అమెరికా ప్రయాణం చెయ్యాలి. దాంతో మిగతా రంగాలలో మనుషులు దొరక్క, కొన్ని రంగాలలోనే డిమాండు ఎక్కువై, అందరి అవకాశాలు దెబ్బతిన్నాయి.
ఈ సమస్యకు పెద్ద పరిష్కారం, మన శాస్త్రాలు సూచించినది ఈ బ్రహ్మమిత్రుడి కథ ‘అమంత్ర మక్షరం నాస్తి’. ఉపాధ్యాయులు దీనిని అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి. ‘ఇది రాకపోతే పోయిందిలే.. ఇలాంటివి మరిన్ని పనులున్నాయి, కంగారు పడకు’ అని ధైర్యం చెప్పాలి. వెంటనే అతడికి ఉత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి ఫెయిలయిన మరుక్షణం ఆత్మ హత్యకు పాల్పడుతున్నాడు. అందుకే విద్యా రంగంలో మార్పు ప్రారంభం కావాలి.( ప్రపంచంలో ఏది నిత్యం కాదు ఒక్క మార్పు తప్ప!
--(() ) --
*కృష్ణుని లీలలు
కంసుడు పంపిన పూతన అనే రాక్షసి శ్రీమహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు ఆకాశమార్గాన వచ్చింది. మారురూపంలో, అందమైన యువతి వేషాన్ని ధరించి, ఇల్లిల్లూ పసివారిని వెతుక్కుంటూ, బాలకృష్ణుడు వున్న నందగోపుడి ఇంటికి సమ్మోహనంగా బయల్దేరి వచ్చింది పూతన. ఆమెను చూసిన గోపికలు, ఆమె అందానికి ఆశ్చర్యపోయి, శృంగార వేషంలో వచ్చిన లక్ష్మీదేవేమో ఈమె అని భావించారు. ఇంట్లో పడుకున్న పరాత్పరుడిని చూసింది. ఆమె బాలింత వేషంతో చనులకు విషం పూసుకుని తనను చేరడానికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు చిన్ని కృష్ణుడు. గురకపెట్టుతూ నిద్రిస్తున్నవాడిలాగా నటించసాగాడు. పూతన బాలుడిని ఎత్తుకుని ముద్దాడుతూ రొమ్ముకు అదుముకుని పాలివ్వడానికి సిద్ధపడింది. యశోదారోహిణులు వారిస్తున్నా, వారి మాటలు లక్ష్యం చేయలేదు. తన చన్ను బాలుడి నోట్లో పెట్టింది.
బాలకృష్ణుడు మెల్లగా కన్నులు విప్పి, ఓరకంటితో చూశాడు. బద్దకంగా ఆవులించాడు. పూతన చంనును పట్టుకుని గుటుకు-గుటుకుమంటూ, రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా పీల్చేశాడు. భయంకరమైన ధ్వనితో పూతన నేలమీద పడిపోయింది. దాని పర్వతాకృతి దేహాన్ని చూసి గొల్లలంతా భయపడుతూ దూరదూరంగా వుండిపోయారు. ఆ మాయలాడి పొట్టమీద ఆడుకుంటున్న చిన్నవాడిని రోహిణీ, యశోదలు ఎత్తుకున్నారు. అతడి అవయవాలకు గోమయాన్ని పట్టించారు. గోపకాంతలు బాలుడికి రక్షకట్టుతూ, విష్ణునామస్మరణం చదువుతూ దీవించారు. యశోదాదేవి చన్ను ఇస్తూ జోలపాడి నిదురపుచ్చింది. ఆ తరువాత నందుడు, మొదలైన గోపకులు వచ్చి, పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో నరికి దూరంగా దహనం చేశారు.
చిన్ని కృష్ణుడు ఒత్తిగిలి బోర్లాపడుతున్నాడని, వేడుకతో, అతడి పుట్టిన నక్షత్రం రోజున పొరుగునున్న గోపికలను పేరంటానికి పిలిచింది యశోద. వేడుక అయిన తరువాత బాలుడిని పానుపు మీద పడుకోబెట్టి నిదురపుచ్చింది. నిద్రలేవగానే బాలుడికి ఆకలేసి, మృదువైన తన పాదంతో, పక్కనున్న ఒకానొక బండిని తన్నాడు. అలా తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకి ఎగిరి నేలమీద పడింది. ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. బండి అమాంతంగా గాలిలోకి లేచిందని పక్కనే ఆడుకుంటున్న బాలురన్నారు. బాలుడి ఏడుపు విని, యశోద పరుగెత్తుకుంటూ వచ్చి, పిల్లవాడికి చన్ను కుడిపింది.
ఒకనాడు యశోద బాలకృష్ణుడిని తన తొడమీద పెట్టుకుని ముద్దాడుతుంటే, ఆ శిశువు చాలా బరువుగా అనిపించాడు. అప్పుడామె ఒడి నుండి నేలమీదకు దించింది. ఇంతలోనే, తృణావర్తుడు అనే రాక్షసుడు, కంసుడు పంపగా, చల్లటి సుడిగాలి రూపంలో, వింతగొల్పుతూ అక్కడికి వచ్చి, శిశువును ఎగరేసుకుని పోయింది. ఆ సుడిగాలి వేగానికి, భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. యశోదాదేవి ఇది చూసి, కన్నీరు మున్నేరుగా ఏడ్వసాగింది. ఆమెతో పాటే గోపస్త్రీలు కూడా విలపించసాగారు. గాలిరూపంలో వచ్చిన రాక్షసుడు బాలకృష్ణుడిని ఆకాశమార్గంలో చాలా దూరం తీసుకుపోయాడు. క్రమక్రమంగా బాలుడు బరువెక్కసాగాడు. ఆ బరువు మోయలేకపోయాడు రాక్షసుడు. వాడి మెడను పట్టుకుని కొండంత బరువుతో కిందకు వేల్లాడాడు చిన్ని కృష్ణుడు. రాక్షసుడు గిలగిలలాడసాగాడు. చివరకు కంసుడి అనుచరుడు తృణావర్తుడు నేలకూలాడు. ఇది చూసి గోపకాంతలు పరుగెత్తారు అక్కడికి. వాడి రొమ్ముమీద ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకున్నారు.
ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుడిని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకుని, ముద్దాడి పాలు తాగించి, ప్రేమతో ముఖాన్ని నిమిరింది. అప్పుడు బాలుడు నిద్ర వస్తున్నట్లుగా ఆవులించాడు. అప్పుడా నోరు గుహద్వారం లాగా అగుపించి, అందులో సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలూ, లోకాలు, సమస్త ప్రాణికోటి సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా నివ్వెరపోయింది.
ఇదిలా వుండగా ఒకనాడు యాదవ పురోహితుడైన గర్గుడు, వాసుదేవుడు పంపగా వ్రేపల్లెకు వచ్చాడు. ఆయన్ను ఉచితరీతిన సత్కరించాడు నందుడు. ఆయన రాకకు కారణం అడిగాడు. కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాలతో నామకరణం చేయమని గర్గుడిని కోరాడు నందుడు. ఇలా చెప్పి తన కుమారుడిని, రోహిణి కుమారుడిని గర్గ మహర్షికి చూపించాడు. కంసుడికి ఇక్కడి విషయాలు తెలిసే ప్రమాదమున్నందున పసివారి సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిదని అన్నాడు గర్గుడు. తరువాత ముందుగా రోహిణీదేవి కుమారుడికి నామకరణం చేశాడు. అతడి పేరు రాముడని, బలరాముడుగా ప్రసిద్ధికెక్కుతాడని చెప్పాడు. సంకర్షణుడుగా కూడా పిలవబడుటాడని అన్నాడు.
ఆ తరువాత కృష్ణుడిని చూసి, నల్లటి వర్ణం కలవాడు కాబట్టి అతడిని కృష్ణుడని పిలవమని, వసుదేవుడికి పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా అంటారని అన్నాడు గర్గుడు.
🌻 *సూర్యాంజనేయం ?* 🌻
శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.
బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.
🌻 *సూర్యశిష్యరికం :* 🌻
బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు.
కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు
(గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు.
మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🌻 *సూర్యుపుత్రునికి స్నేహితుడు :* 🌻
సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.
అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.
సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.
సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.
సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు.
అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే.
సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.-
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 67* 🕉
*రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో*
*నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం* *దాఁకి యుగ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల*
*స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచి వేయుచుండును.
🌹మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్.
🌹ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు.
🌹కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరిపై దయవహించి రక్షించుమా....
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃
Fine and enlightens various matters at a glance,very use ful to readers
ReplyDelete