Monday, 18 January 2021

20--01-2021

 


🙏 ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


సమ్మోహనాలు " కరోనా టీకాలు " (1171-1180)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
:
అద్భుతం టీకాలు
టీకాలు కావాలి 
కావాలి కరోనా కే మందు ఈశ్వరా 
 
ప్రాణానికి రక్షణ 
రక్షణ నిరీక్షణ 
నిరీక్షణకు ముందు టీకాలు ఈశ్వరా 

విజయమే పరీక్షలు 
పరీక్ష ప్రయోగాలు 
ప్రయోగాలు అవసరాలు ఉండె ఈశ్వరా 
  
శాస్త్రవేక్తల కృషికి
కృషియే సిద్ధించుటకి   
సిద్ధించు ప్రయోజన౦ ప్రజలకు ఈశ్వరా  
  
సందేహాలు నివృత్తి 
నివృత్తే సంతృప్తి 
సంతృప్తి స్వచ్ఛందంగా కలుగు ఈశ్వరా 

ఎవరికి వారు వచ్చి 
వచ్చి ధైర్యాన్ని ఇచ్చి 
ఇచ్చి భయము తొలగే టీకాలు ఈశ్వరా 
  
జన్యు పరం టీకా  
టీకా ఫలిత టీకా
టీకా ఇక ఆరోగ్యం మనకు ఈశ్వరా 

మనుషుల లో  సఖ్యత 
సఖ్యత తో విజేత 
విజేతగా భారతదేశమే ఈశ్వరా

ప్రజా రక్షణ దీక్ష 
దీక్ష సఫలిత రక్ష 
రక్షతో ప్రజలకుభయము తగ్గె ఈశ్వరా 

పుకారు నమ్మకండి 
నమ్మకం ఉంచండి  
ఉంచి మందు  టీకాలు వేసెను ఈశ్వరా   

--(())--



నాకు77 ఏండ్లు. కధ 

నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.
చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.
చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.
'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

దారి మధ్యలో ఇలా అంది.
'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'

పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.

అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.
కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...
' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'
'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.
అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.
కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!
ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం

పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి
అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!
పెద్దవారు మనకు మార్గదర్శనం.....

--(())--

* మౌఢ్యమి అంటే ఏమిటి

నేటి  నుండి శుక్రమూఢమి ప్రారంభమై 10-6-2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును.

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.

మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి" గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు , పోటులలో మార్పులు వస్తాయి.

శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:-

పెళ్ళిచూపులు , వివాహం , ఉపనయనం , గృహారంభం , గృహప్రవేశం , యజ్ఞాలు చేయుట , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు, నూతన వధువు ప్రవేశం , నూతన వాహనము కొనుట , బావులు , బోరింగులు , చెరువులు తవ్వటం , పుట్టువెంట్రుకలకు , వేదా"విధ్యా"ఆరంభం , చెవులు కుట్టించుట , నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

*మౌఢ్యమిలో చేయదగిన పనులు :-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

--(())--

*ఏది విజయం*
        
        ఒకానొక చిన్న గ్రామంలో ఒక ధనవంతుడు మరియు ఒక పేద రైతు ఉండేవారు. ఆ చిన్న గ్రామం పట్టణాలకి అత్యంత దూరంలో ఉండటం వలన ధనవంతుడు తన కుమారుడిని అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్పించాడు. అదే పాఠశాలలో పేద రైతు కుమారుడు కూడా చదువుతున్నాడు. అలా ధనవంతుని కుమారుడు పేద రైతు కుమారుడు ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.

           ధనవంతుని కుమారుడు తన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలుతో పాటు అందరికంటే చదువులో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. రైతు కుమారుడు చదువులో అంతగా రానించలేకపోయినా క్రమ శిక్షణలో ముందు ఉండేవాడు. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరూ స్కూలు విడిచిపెట్టే సమయం వచ్చింది. 

          పాఠశాల చివరి రోజు అందరి పిల్లలూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నేను డాక్టర్ అవుతాను అంటే నేను లాయర్ అవుతాను అంటూ పోటీ పడుతున్నారు. ధనవంతుని కుమారుడ్ని అడిగారు. తను కూడా అందరి లాగానే నేను ఒక పెద్ద బిజినెస్ మాన్ అవుతాను అని చెప్పాడు. అందరూ కలసి రైతు కుమారుని వైపు చూసి నువ్వు ఏమి అవుతావు అని అడిగారు. దానికి ఆ రైతు కుమారుడు చెప్పిన సమాధానం విని అందరూ అతనిని హేళన చేసారు. 

           అయితే ఇప్పుడు మనం మాటలతో పోటీ పడి లాభం లేదు. 40 ఏళ్ల తర్వాత అందరం ఒక చోట కలుద్దాం. అప్పుడు ఎవరు అందరికంటే గొప్ప వాళ్ళు అవుతారో వాళ్ళని అందరం కలసి సన్మానం చేద్దాం అన్న ధనవంతుని కుమారుని తీర్మానానికి అందరూ ఆమోదం తెల్పి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.

        తర్వాత కొందరు ఉన్నత చదువుల బాట పట్టి ఊరు విడిచి పట్టణాలకి వెళ్ళిపోయారు. కొందరు పక్క గ్రామాల్లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల బాట పట్టారు. కాలం "ఝరీ వేగతుల్యం" అన్నారు. నలభై ఏళ్ళు గడిచాయి. అనుకున్నట్టుగానే ధనవంతుని కుమారుడు ఒకరోజు అందరి వివరాలు కష్టపడి సేకరించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ, దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉన్న బాల్య మిత్రులందరకీ అక్కడికి హాజరవ్వాలని ఆహ్వానాలు పంపాడు. అందరి లాగానే రైతు కుమారుడికి కూడా ఆహ్వానం అందింది.

అనుకున్నట్టుగానే అందరూ ఆ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నందువలన ఒకరికొకరు ఆళింగనం చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. భోజనం అయ్యాక సభ ప్రారంభం అయ్యింది. ఆ గొప్ప వ్యక్తి నేనే అంటే నేనే అనుకుంటూ వేదిక మీదకి వెళ్లి ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించిన విజయాలు, సంపాదించిన ఆస్తులు, హోదాలు గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించారు. చివరిగా రైతు కుమారుని వంతు వచ్చింది. సభకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి అతన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. కానీ ఆ రైతు కుమారుడు "ఇంత గొప్ప వాళ్ళ మధ్య నేను ఏమి మాట్లాడతాను, నేను సాధించినది ఏదీ లేదుగా" అనుకుంటూ, సంకోచిస్తూ వేదిక మీదకి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. అంతలో అతని గురించి తెలిసిన మరో ముగ్గురు స్నేహితులు తను అంతగా చెప్పుకోవడానికి ఏమీలేదు, అతన్ని ఇబ్బంది పెట్టొద్దు, అందరూ అయిపోయారు ఇక సన్మానం ఎవరికి చెయ్యాలో నిర్ణయించండి అని అన్నారు.

      ఇక వ్యాఖ్యాత మాట్లాడుతూ "అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నుకోదగిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో అని నేను చెప్పనవసరంలేదు. దేశ విదేశాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా నిలిచి, తన వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వ్యాపార దిగ్గజం మన స్నేహితుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వించదగ్గ విషయం" అని వ్యాఖ్యాత ధనవంతుని కుమారుని కోసం చెప్తూ ఉండగా వేదిక అంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగిపోయింది. అప్పుడు వ్యాఖ్యాత అతన్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడాలని కోరగా ధనవంతుని కుమారుడు వేదిక మీదకి వచ్చి ఇలా మాట్లాడటం ప్రారంభించాడు.  

       “మై డియర్ ప్రెండ్స్.. ఈరోజు కోసం మనం ఒకరికొకరం పోటీ పడుతూ జీవితంలోఎన్నోసమస్యలను దాటుకుంటూ రాత్రి పగలు    నిద్రాహారాలు సైతం త్యాగం చేసి సమాజం గర్వించ తగ్గ స్థానంలో మనందరం ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరందరూ నాకీ స్థానం కల్పించి గౌరవాన్ని ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక గంట క్రితం నాకు తెలిసింది. ఈ నలభై సంవత్సరాల కాలంలో నేను గెలుపు అనే ఓటమితో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ సన్మానానికి నేను అర్హుడను కాను. ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను” అనేసరికి అందరిలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఒక గంట ముందు జరిగిన సంభాషణని ఇలా గుర్తు చేసుకున్నాడు.

   పూర్వ విద్యార్ధులంతా మాట్లాడుకుంటూ ఆ ప్రాంగణం మొత్తం హడావిడగా ఉంది. అందరూ డిన్నర్‌కు సిద్ధం అవుతున్నారు.  అందులో ఒక వ్యక్తి తన బాల్య ఆప్త మిత్రుడ్ని చూసి అతని వేషధారణ బట్టి అతను సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నాడని భావించి గర్వంతో కూడుకున్న దయతో అతన్ని పరామర్శించి వేరుగా ఉన్న ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. అందులో ఒక వ్యక్తి ధనవంతుని కుమారుడు. ఇంకో వ్యక్తి రైతు కుమారుడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరిగింది.

మొదటి వ్యక్తి :  నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు చాలా బాధ గానూ ఉంది.

రెండవ వ్యక్తి :  బాధ ఎందుకు?
      
మొదటి వ్యక్తి : నా ఆప్త మిత్రుడువు అయిన నిన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషమునూ, నిన్ను    ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు మరింత భాధగానూ.
     
రెండవ వ్యక్తి  : నాపై నీకు ఉన్న అభిమానానికి కృతజ్ఞుడను. కానీ నేను ఇప్పుడు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను . నేను ఈ జీవితం పట్ల ఎంతో సంతృప్తితో ఉన్నాను.
       
మొదటి వ్యక్తి : కానీ అది ఎలా సాధ్యం. నవ్వు నా దగ్గర చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావు.

రెండవ వ్యక్తి : సాధ్యమే.



 (చిరునవ్వు నవ్వి)  ఇప్పుడు చెప్పడానికి కూడా నీరసించి ఉన్నాను. బాగా ఆకలేస్తుంది.

మొదటి వ్యక్తి : ఓహ్, క్షమించు మర్చిపోయాను. 
( పక్కకి తిరిగి రెండు చప్పట్లు చరిచాడు)
     
 (క్షణాల్లో టేబుల్ రకరకాల వంటకాలతో నిండిపోయింది).

      
 రెండవ వ్యక్తి :  (హాయిగా అన్నీ తినడం ప్రారంభించాడు). చాలా బాగున్నాయి. వంటలు చాలా అద్భుతంగా చేసారు.  ఈ స్వీట్ చాలా బాగుంది కాస్త రుచి చూడు.

మొదటి వ్యక్తి : క్షమించరా నాకు షుగర్ ఉంది. తినలేను.

రెండవ వ్యక్తి : అవునా, పోనీ ఈ స్నాక్స్  అయినా తిను.

మొదటి వ్యక్తి : సారీ రా, నాకు బీపీ కూడా ఉంది, తినలేను.

రెండవ వ్యక్తి : పోనీ నువ్వు తినేది ఏదైనా కాస్త తిను.

మొదటి వ్యక్తి : సారీ రా . నాకు అజీర్తి వ్యాధి కూడా ఉంది. రోజూ ఒక్క పూట మాత్రమే తింటాను.

రెండవ వ్యక్తి : అంటే నాకు తోడుగా ఏమీ తినలేవా.

మొదటి వ్యక్తి : (నవ్వుతూ) ఎందుకు తినలేను, చాలా టాబ్లెట్స్ తినాలి.

రెండవ వ్యక్తి: నిన్ను చూస్తే నాక్కూడా సంతోషంగానూ, బాధగానూ ఉంది.

మొదటి వ్యక్తి: (తన ధన గర్వానికి సిగ్గుపడుతూ) నువ్వు టాబ్లెట్స్ ఏమీ వేసుకోవా ?

రెండవ వ్యక్తి : (నవ్వుతూ)  నాకు డబ్బులు (జబ్బులు) లేవుగా ....

(ప్రస్తుతం) ధనవంతుని కుమారుడు ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకి వచ్చాడు. అందరూ అతని చెప్పే సమాధానం కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..
        

   "ఆ వ్యక్తి ఎవరో కాదు నలభై ఏళ్ల క్రితం మనందరం మన భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏమవుతావురా అని అడిగితే మన ఊరిలోనే యోగా వ్యాయామ శాల ఏర్పాటు చేసుకుని మా అమ్మా   నాన్నలతో ఉంటూ మన ఊరికి సేవలు చేస్తాను అని చెప్తే మనందరం అతన్ని చూసి నవ్వుకున్నాం కానీ ఈరోజు అతను మనందరికంటే    ధనవంతుడు. ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది ఆరోగ్యం. అటువంటి  ఆరోగ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారో వాడే కోటీశ్వరుడు". 

     "నేను కోట్లు సంపాదించాను కానీ అంతకంటే విలువైన ఆరోగ్య సంపాదనలో ఓడిపోయాను. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఎదిగిన వాడు అంటే తన నీడలో పది మందికీ ఆశ్రయం కల్పించేవాడు, పదిమందికి  పంచే ఆస్తిని సంపాదించేవాడు. మనకి ఆస్తి ఉన్నా పంచలేము. వాడికి ఉన్న ఆస్తి ఆరోగ్య విద్య, తన చుట్టూ ఉన్న వాళ్లకి ఎంత పంచినా తరగని ఆస్తి కలిగి ఉన్నవాడే ధనవంతుడు. మన సంపద పంచితే తరిగేది, వాడి సంపద పంచితే పెరిగేది. దానంలో కెల్లా గొప్పది విద్యా దానం. విద్యల్లో కెల్లా గొప్పది ఆరోగ్య విద్య. వాడు ఆరోగ్య దాత. మన సంపద ఇప్పుడు మనకి సంతృప్తిగా ఒక ముద్ద కూడా పెట్టలేకపోతుంది. వాడి సంపద ఉన్నదాంట్లో సంతృప్తిగా తినిపిస్తోంది. విద్యను పంచితే మనలాంటి వాళ్ళని తయారు చేయగలం, ఆరోగ్య విద్యను పంచితే ఒక సంపూర్ణత కలిగిన సమాజాన్ని చూడగలం". అంటూ అందరూ సంతోషంతో ఆ సన్మానాన్ని రైతు కుమారుడుకి చేసి సభ ముగించారు......

🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


💐💐💐 " *భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు* " 💐💐💐

ప్రస్తుత విద్యావ్యవస్థలో మనం మార్పు తీసుకు రాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి. వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది.

పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువుండే వాడు. ఆయన దగ్గర పదిమంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకుమించి చేరనిచ్చేవాడు కాదు. ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు.

పదిమంది విద్యార్థులను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్లి, అక్కడున్న అన్ని చెట్లకు ఉన్న అన్ని రకాల, జాతుల ఆకులనూ పరిశీలించండి. ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. విద్యార్థులకు ఆనందమైంది. ఎందుకంటే పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టంగానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్టమేముంది? వెంటనే బయలుదేరి వెళ్లారు.

సరదాగా చెప్పుకోవాలంటే.. పనికిరాని ఆకులు తేవడానికి ఒక విద్యార్థి రెండు జేబులున్న వస్త్రం  ధరించి వెళ్లాడు. మరొక విద్యార్థి కాస్త పెద్ద సంచి తీసుకెళ్లాడు. మరో విద్యార్థి యూరియా సంచే పట్టుకెళితే, ఇంకొక విద్యార్థి ఏకంగా రెండెడ్ల బండే తీసుకెళ్లాడు. అప్పటికీ ఆ విద్యార్థిని గురువుగారు అడిగారు ‘రెండెడ్ల బండెందుకురా!’ అని. ‘పనికిరాని ఆకులు తెమ్మన్నారు కదా మీరే!’ అంటే, ‘సరే అవి పనికిరావో, నువ్వు పనికిరావో తర్వాత తేలుద్దాంలే, ముందు నువ్వు వెళ్లిరా!’ అన్నారు. ఇలా పదిమందీ వెళ్లారు.

వెళ్లినవారిలో రెండెడ్ల బండి తీసుకెళ్లిన విద్యార్థే ముందు వచ్చాడు. మట్టి తవ్వి ట్రాక్టరులో వేసినట్లుగా గుత్తగా ఆకులన్నీ తీసి బండి నింపేసి తెచ్చాడు. ‘ఇవన్నీ పనికిరానివే’ అని చెప్పాడు గురువుగారితో. ఆయన నవ్వుకున్నారు. తరువాత సంచి తీసుకెళ్లిన విద్యార్థి, రెండు జేబుల వస్త్రం విద్యార్థి.. ఇలా తొమ్మిదిమందీ వచ్చారు. ఒక్కొక్కళ్లు వాళ్లకి తోచినన్ని పనికిరాని ఆకులు తెచ్చి గురువుగారికి చూపించారు. చివరికి పదవ విద్యార్థికూడా వచ్చాడు. అతని పేరు జీవకుడు.

అతని ముఖం చిన్నబోయి ఉంది. గురువుగారు ‘ఏం నాయనా అలా ఉన్నావు! నువ్వేమీ తేలేదా ?’ అని అడిగారు. విద్యార్థి ‘గురువుగారూ నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటీ నాకు కనపడలేదు’ అన్నాడు. ‘అదేమిటీ! నువ్వు వీళ్లందరికంటే తెలివైనవాడివా?’ అని గురువు అంటే, ‘అలా కాదండీ ! మీరు నాకు వైద్యవిద్య నేర్పడం ప్రారంభించినప్పుడే ఒక శ్లోకం నేర్పారు. దాని ప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిదేదీ లేదు అని చెప్పారు!’ అన్నాడు.

‘ఏమిటా శ్లోకం?’ అని అడిగారు.

*అమంత్రమక్షరం నాస్తి*
*నాస్తి మూలం అనౌషధం*
*అయోగ్యః పురుషో నాస్తి*
*ప్రయోగః తత్ర దుర్లభః*

అని జీవకుడు శ్లోకం చెప్పాడు.

దీని అర్థం ఇది. ‘అమంత్రమక్షరం నాస్తి’ – అంటే ఏ భాషలోనూ మంత్రం కాని అక్షరం లేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరం లేదు. ఏ అక్షరం దేనికి బీజాక్షరం అనేదాన్లో తేడాలుంటాయి గాని, అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే ‘నాస్తి మూలం అనౌషధం’ – అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే ‘అయోగ్యః పురుషో నాస్తి’. అంటే పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు (ఇక్కడ పురుషః అంటే మగ అని కాదు, మనిషి అని అర్థం. అంటే మగ లేదా ఆడ అని). ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటంటే ప్రతి విద్యార్థి దేనికి పనికొస్తాడో చెప్పడం. ‘నువ్వు దేనికీ పనికిరావు’ అని చెప్పకూడదు. అందరూ విద్యకే పనికిరారు. ‘నీకు చదువు రాదు కానీ నువ్వు పలానా పని చేసుకుంటే సుఖపడతావు’ అని చెప్పాలి. అంతేకాని ‘నీకు చదువు రాదురా అబ్బాయి! గొడ్లు కాసుకో’ అని తిట్టకూడదు. గొడ్లు కాయడం అంత తేలికైన పనేమీ కాదు. ఒకప్పుడు సాక్షాత్తూ పరమాత్ముడే మనిషి అవతారమెత్తి ఆ పని చేశాడు. కాబట్టి అది తక్కువ పనేమీ కాదు. మనం దానిని తక్కువగా చూడటంతో అదొక తిట్టు పదం అయింది. దాంతో ఆ పని చేసేవాళ్లు అవమానం చెందు తున్నారు. మన కులవృత్తులన్నీ ఇలాగే అయ్యాయి. మన సంస్కృతిలో ప్రతి పనికీ గౌరవం ఉంది. ఇక చివరి వాక్యం ‘ప్రయోగః తత్ర దుర్లభః’ – అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగం చేసి చూడాలి. అంటే పరిశీలించాలి. అంతేకాని ‘అది బాగోదు’ అని వెంటనే తీర్మానించకూడదు.

‘ఈ శ్లోకాన్ని మీరు ముందే నాకు చెప్పారు గురువుగారూ..! అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగా నాకు పనికిరాని ఆకు దొరకలేదు’ అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి వ్యతిరేక పరీక్ష పెట్టారు (క్రాస్‌ ఎగ్జామినేషన్‌). ‘మిగతా విద్యార్థులు పనికిరావంటూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు!’ అన్నారు. వెంటనే జీవకుడు ‘ఇదిగో ఇవి మారేడు ఆకులు, తేమ (నీటి తడి) ఉన్నచోట ఈ ఆకులు వేస్తే తేమను లాగేస్తాయి. అలాగే ఇది ఉత్తరేణి ఆకు. పళ్లు తోముకోడానికి పనికి వస్తుంది, ఇది ఫలానా ఆకు, అతిసారం తగ్గిస్తుంది’ అంటూ అన్ని ఆకుల గురించి, అవి దేనికి పనికొస్తాయనేది వివరంగా చెప్పాడు. గురువు బ్రహ్మమిత్రుడు ఆనందభరితు డయ్యాడు. వెంటనే

జీవకుడిని మెచ్చుకుని ‘నువ్వు ఒక్కడివే యోగ్యత గల శిష్యుడివి. నీకొక్కడికే నేను యోగ్యతా పత్రం ఇస్తున్నాను’ అని చెప్పి మిగిలిన విద్యార్థులను మరో ఏడాది చదవమని చెప్పారు. ఈ జీవకుడు తరువాత ఆయుర్వేద ఔషధాల తయారీలో ప్రసిద్ధి పొందాడు.

ఇలా ‘ప్రతి మనిషి ఏదో ఒకదానికి పనికొస్తాడు, పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో లేడు’ అని తీర్మానించుకుని ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాలి. కొందరు ఆటలకు, కొందరు పాటలకు, మరికొందరు రచయితగాను, కార్యకర్తగాను లేదా కావ్యకర్తగాను ఏదో రంగంలో పనికొస్తారు. విద్యార్థికి చదువు చెబుతూనే అతను ఏ రంగంలో ఎదగగలడో గుర్తించి, ఆ విషయం విద్యార్థికి చెప్పి, ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఉపాధ్యాయుని విధి.

ఇవాళ్టి పరిస్థితి ఇలా లేక, మూసపోసినట్లుగా ఒకేలా ఉంది. అందరూ ఇంగ్లీషు మీడియం చదవాలి; అందరూ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అవ్వాలి; అందరూ అమెరికా ప్రయాణం చెయ్యాలి. దాంతో మిగతా రంగాలలో మనుషులు దొరక్క, కొన్ని రంగాలలోనే డిమాండు ఎక్కువై, అందరి అవకాశాలు దెబ్బతిన్నాయి.

ఈ సమస్యకు పెద్ద పరిష్కారం, మన శాస్త్రాలు సూచించినది ఈ బ్రహ్మమిత్రుడి కథ ‘అమంత్ర మక్షరం నాస్తి’. ఉపాధ్యాయులు దీనిని అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి. ‘ఇది రాకపోతే పోయిందిలే.. ఇలాంటివి మరిన్ని పనులున్నాయి, కంగారు పడకు’ అని ధైర్యం చెప్పాలి. వెంటనే అతడికి ఉత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి ఫెయిలయిన మరుక్షణం ఆత్మ హత్యకు పాల్పడుతున్నాడు. అందుకే విద్యా రంగంలో మార్పు ప్రారంభం కావాలి.( ప్రపంచంలో ఏది నిత్యం కాదు ఒక్క మార్పు తప్ప!


 --(() ) --

*కృష్ణుని లీలలు

కంసుడు పంపిన పూతన అనే రాక్షసి శ్రీమహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు ఆకాశమార్గాన వచ్చింది. మారురూపంలో, అందమైన యువతి వేషాన్ని ధరించి, ఇల్లిల్లూ పసివారిని వెతుక్కుంటూ, బాలకృష్ణుడు వున్న నందగోపుడి ఇంటికి సమ్మోహనంగా బయల్దేరి వచ్చింది పూతన. ఆమెను చూసిన గోపికలు, ఆమె అందానికి ఆశ్చర్యపోయి, శృంగార వేషంలో వచ్చిన లక్ష్మీదేవేమో ఈమె అని భావించారు. ఇంట్లో పడుకున్న పరాత్పరుడిని చూసింది. ఆమె బాలింత వేషంతో చనులకు విషం పూసుకుని తనను చేరడానికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు చిన్ని కృష్ణుడు. గురకపెట్టుతూ నిద్రిస్తున్నవాడిలాగా నటించసాగాడు. పూతన బాలుడిని ఎత్తుకుని ముద్దాడుతూ రొమ్ముకు అదుముకుని పాలివ్వడానికి సిద్ధపడింది. యశోదారోహిణులు వారిస్తున్నా, వారి మాటలు లక్ష్యం చేయలేదు. తన చన్ను బాలుడి నోట్లో పెట్టింది.

బాలకృష్ణుడు మెల్లగా కన్నులు విప్పి, ఓరకంటితో చూశాడు. బద్దకంగా ఆవులించాడు. పూతన చంనును పట్టుకుని గుటుకు-గుటుకుమంటూ, రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా పీల్చేశాడు. భయంకరమైన ధ్వనితో పూతన నేలమీద పడిపోయింది. దాని పర్వతాకృతి దేహాన్ని చూసి గొల్లలంతా భయపడుతూ దూరదూరంగా వుండిపోయారు. ఆ మాయలాడి పొట్టమీద ఆడుకుంటున్న చిన్నవాడిని రోహిణీ, యశోదలు ఎత్తుకున్నారు. అతడి అవయవాలకు గోమయాన్ని పట్టించారు. గోపకాంతలు బాలుడికి రక్షకట్టుతూ, విష్ణునామస్మరణం చదువుతూ దీవించారు. యశోదాదేవి చన్ను ఇస్తూ జోలపాడి నిదురపుచ్చింది. ఆ తరువాత నందుడు, మొదలైన గోపకులు వచ్చి, పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో నరికి దూరంగా దహనం చేశారు.

చిన్ని కృష్ణుడు ఒత్తిగిలి బోర్లాపడుతున్నాడని, వేడుకతో, అతడి పుట్టిన నక్షత్రం రోజున పొరుగునున్న గోపికలను పేరంటానికి పిలిచింది యశోద. వేడుక అయిన తరువాత బాలుడిని పానుపు మీద పడుకోబెట్టి నిదురపుచ్చింది. నిద్రలేవగానే బాలుడికి ఆకలేసి, మృదువైన తన పాదంతో, పక్కనున్న ఒకానొక బండిని తన్నాడు. అలా తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకి ఎగిరి నేలమీద పడింది. ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. బండి అమాంతంగా గాలిలోకి లేచిందని పక్కనే ఆడుకుంటున్న బాలురన్నారు. బాలుడి ఏడుపు విని, యశోద పరుగెత్తుకుంటూ వచ్చి, పిల్లవాడికి చన్ను కుడిపింది.

ఒకనాడు యశోద బాలకృష్ణుడిని తన తొడమీద పెట్టుకుని ముద్దాడుతుంటే, ఆ శిశువు చాలా బరువుగా అనిపించాడు. అప్పుడామె ఒడి నుండి నేలమీదకు దించింది. ఇంతలోనే, తృణావర్తుడు అనే రాక్షసుడు, కంసుడు పంపగా, చల్లటి సుడిగాలి రూపంలో, వింతగొల్పుతూ అక్కడికి వచ్చి, శిశువును ఎగరేసుకుని పోయింది. ఆ సుడిగాలి వేగానికి, భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. యశోదాదేవి ఇది చూసి, కన్నీరు మున్నేరుగా ఏడ్వసాగింది. ఆమెతో పాటే గోపస్త్రీలు కూడా విలపించసాగారు. గాలిరూపంలో వచ్చిన రాక్షసుడు బాలకృష్ణుడిని ఆకాశమార్గంలో చాలా దూరం తీసుకుపోయాడు. క్రమక్రమంగా బాలుడు బరువెక్కసాగాడు. ఆ బరువు మోయలేకపోయాడు రాక్షసుడు. వాడి మెడను పట్టుకుని కొండంత బరువుతో కిందకు వేల్లాడాడు చిన్ని కృష్ణుడు. రాక్షసుడు గిలగిలలాడసాగాడు. చివరకు కంసుడి అనుచరుడు తృణావర్తుడు నేలకూలాడు. ఇది చూసి గోపకాంతలు పరుగెత్తారు అక్కడికి. వాడి రొమ్ముమీద ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకున్నారు.

ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుడిని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకుని, ముద్దాడి పాలు తాగించి, ప్రేమతో ముఖాన్ని నిమిరింది. అప్పుడు బాలుడు నిద్ర వస్తున్నట్లుగా ఆవులించాడు. అప్పుడా నోరు గుహద్వారం లాగా అగుపించి, అందులో సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలూ, లోకాలు, సమస్త ప్రాణికోటి సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా నివ్వెరపోయింది.

ఇదిలా వుండగా ఒకనాడు యాదవ పురోహితుడైన గర్గుడు, వాసుదేవుడు పంపగా వ్రేపల్లెకు వచ్చాడు. ఆయన్ను ఉచితరీతిన సత్కరించాడు నందుడు. ఆయన రాకకు కారణం అడిగాడు. కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాలతో నామకరణం చేయమని గర్గుడిని కోరాడు నందుడు. ఇలా చెప్పి తన కుమారుడిని, రోహిణి కుమారుడిని గర్గ మహర్షికి చూపించాడు. కంసుడికి ఇక్కడి విషయాలు తెలిసే ప్రమాదమున్నందున పసివారి సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిదని అన్నాడు గర్గుడు. తరువాత ముందుగా రోహిణీదేవి కుమారుడికి నామకరణం చేశాడు. అతడి పేరు రాముడని, బలరాముడుగా ప్రసిద్ధికెక్కుతాడని చెప్పాడు. సంకర్షణుడుగా కూడా పిలవబడుటాడని అన్నాడు.

ఆ తరువాత కృష్ణుడిని చూసి, నల్లటి వర్ణం కలవాడు కాబట్టి అతడిని కృష్ణుడని పిలవమని, వసుదేవుడికి పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా అంటారని అన్నాడు గర్గుడు.        

 🌻 *సూర్యాంజనేయం ?* 🌻

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

🌻 *సూర్యశిష్యరికం :* 🌻

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. 

కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు 

(గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. 

మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

🌻 *సూర్యుపుత్రునికి స్నేహితుడు :* 🌻

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. 

అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. 

అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. 

సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.-

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 67* 🕉

*రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో*

*నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం* *దాఁకి యుగ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల*

*స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచి వేయుచుండును. 

🌹మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. 

🌹ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. 

🌹కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరిపై దయవహించి రక్షించుమా....

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃

1 comment:

  1. Fine and enlightens various matters at a glance,very use ful to readers

    ReplyDelete